
మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదికగా సిట్ కనికట్టు
అబద్ధపు వాంగ్మూలాలు, అభూత కల్పనలతోనే కుట్ర
దోపిడీ జరిగినట్టు రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం
ఇచ్చారన్న సిట్.. కానీ వాంగ్మూలంపై రాజ్ కేసిరెడ్డి
సంతకం చేయటానికి నిరాకరించారని సిట్ నివేదిక
అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు వెల్లడి
చంద్రబాబు హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలు.. నాలుగు డిస్టిలరీల నుంచి 53.21 శాతం కొనుగోళ్లని వెల్లడించిన సిట్
కానీ వైఎస్సార్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు అభియోగం
నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేసి ఇచ్చారని ఒకచోట.. వాటిని వివిధ రకాలుగా పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా ఆరోపణలు
టీడీపీ అసత్య ఆరోపణలనే నివేదికగా సమర్పించిన సిట్
రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడైన కుట్ర..
అంతా కారుకూతలు, కాకి లెక్కలే
వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై పెట్టింది అక్రమ కేసేనన్నది సుస్పష్టం
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది.
కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది.
ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది.
ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది.
అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...
డిస్టిలరీలూ బాబు దందానే
బట్టబయలు చేసిన సిట్ నివేదిక
వైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది.
అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!
రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..
సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట.
సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..
న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం.
నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదిక
చంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..
అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదిక
సిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది.
కారు కూతలు... కాకి లెక్కలు
లేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్ర
టీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.
మద్యం మాఫియా దోపిడీదారు బాబే
సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!
అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు.
అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు.
ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది.
అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..
⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా?
⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?
⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?
⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?
⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?
వైఎస్సార్సీపీ హయాంలో..
⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది.
⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది.
⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది.
⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది.
⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది.
⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.