
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
● వాస్తవాలు తెలుసుకోకుండా మెసేజ్లు వద్దు ● ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు ● జగిత్యాల డీఎస్పీ రఘుచందర్
జగిత్యాలక్రైం: సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మెసేజ్లు పెట్టే వారిపై.. వాస్తవాలు తెలుసుకోకుండా వాటిని ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ రఘుచందర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజనిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్వర్డ్ చేయకూడదని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టును నిశితంగా పరిశీ లిస్తోందన్నారు. కొందరు విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేసి పాస్పోర్టులు, వీసాలు రద్దు చేయించే అవకాశం ఉందని పేర్కొన్నా రు. ఇలాంటి పోస్టులు వాట్సాప్, ఫేస్బుక్లో చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై అనుమానాలు, సందేహాలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజాభద్రత, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతియుత జీవనం గడిపేల చూడడం పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు.