
ఈడీ విచారణకు సమయం కోరిన మహేష్ బాబు
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని నటుడు మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోరారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం షూటింగ్లకు హాజరుకావాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ నెల 22న ఈడీ ఇచ్చిన సమన్ల ప్రకారం సోమవారం బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది.
కాగా, సాయి సూర్య డెవలపర్స్ వెంచర్స్ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం మహేశ్బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత లోతుగా విచారించేందుకు మహేశ్బాబుకు సమన్లు జారీ చేశారు. సురానా గ్రూప్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో మహేశ్బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు లభించాయి.