
బెడిసికొట్టిన కూటమి సర్కారు ప్రణాళికలు
● సర్కారు పాఠశాలలపై పర్యవేక్షణ శూన్యం ● ఉపాధ్యాయుల కొరతతో పలు సబ్జెక్టుల్లో తప్పిన విద్యార్థులు ● సీఎం సొంత జిల్లాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రభావం చూపని పది ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేల సంఖ్యల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది విద్యార్థులు ఫెయిల్ కావడం విస్మయానికి గురి చేస్తోంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు తొలి మెట్టులాంటి పదో తరగతిపై కూటమి సర్కారు అలసత్వ వైఖరి చూపడంతోనే ఈ చేదు ఫలితాలు చోటు చేసుకున్నట్లు విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 2,436, తిరుపతి జిల్లాలో 2,444 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి 20,796 మంది, తిరుపతి జిల్లా నుంచి 26,679 మంది మొత్తం 47,475 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో చిత్తూరు జిల్లాలో 13,456, తిరుపతి జిల్లాలో 21,298 మొత్తం 34,754 మంది ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన విద్యార్థులు పది పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాల్లో పది పరీక్షల్లో ఫలితాలు బోల్తా కొట్టడం పై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.
కుప్పంలోనూ అదే వెనుకబాటు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ పది ఫలితాలు వెనుకబడ్డాయి. కుప్పం మండలంలో 1,833 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 703 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలురు అధికంగా 449, బాలికలు 254 మంది పది పరీక్షల్లో తప్పారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన మండలాల్లో పరీక్షల్లో తప్పిన విద్యార్థుల సంఖ్య ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు ప్రభుత్వాలు ఇచ్చే బహుమతి ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే అని గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీచర్ల కొరతతోనే ఎక్కువ మంది విద్యార్థులు పది పరీక్షల్లో ఫెయిల్ కావాల్సిన దుస్థితి ఏర్పడింది.
కూటమి సర్కారు నిర్లక్ష్యం.. అనాలోచిత నిర్ణయాలు.. ప్రణాళిక లేమి.. విద్యాశాఖపై కొరవడిన పర్యవేక్షణ..ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థికి అందని బోధన.. అభ్యసన సామగ్రి.. వెరసి పది పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపింది. తండ్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కుమారుడు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా వారి నిర్లక్ష్యం.. ఉదాసీనత.. అసంబద్ధ నిర్ణయాలతో సొంత జిల్లాల్లోనే పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో పదింతలు వెనుకపడ్డారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పేద పిల్లలు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
గత ప్రభుత్వ పాలనలో ఇలా..
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల కొరత సర్దుబాటుచేసి బోధన
సకాలంలో సిలబస్ పూర్తి
ఉత్తమ ఫలితాల కోసం
ప్రత్యేక మెటీరీయల్ ముద్రించి సరఫరా
ప్రణాళిక ప్రకారం
రివిజన్ తరగతుల నిర్వహణ
ఉత్తమ ఫలితాలకోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం, ప్రణాళిక అమలు
కీలకమైన 77రోజుల కార్యాచరణ,
ప్రత్యేక తరగతుల నిర్వహణ
చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో గత ఏడాది
3,578 మంది విద్యార్థులు ఫెయిల్
ఈ ఏడాది కూటమి పాలనలో..
విద్యాసంవత్సరం మధ్యలో టీచర్లను
సర్దుబాటు చేయడం
జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ
సిలబస్ పూర్తి చేయని పరిస్థితి
ప్రస్తుతం అలాంటి మెటీరియల్ జాడే లేదు
ఫిబ్రవరి పూర్తి అయినా
రివిజన్ తరగతులు లేమి
ప్రత్యేక సమావేశం లేదు,
పటిష్ట ప్రణాళిక సైతం అమలు కాలేదు
కీలకమైన కార్యాచరణ లేనే లేదు.
ప్రత్యేక తరగతులు ఆలస్యంగా నిర్వహణ
ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో
12,231 మంది విద్యార్థులు ఫెయిల్
అలసత్వం తగదు
ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే పేద విద్యార్థులపై కూట మి సర్కారు ప్రదర్శిస్తున్న అలసత్వ వైఖరి తగదు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు పదో తరగతి చాలా కీలకం. అలాంటి పదో తరగతి పరీక్షలపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం. ప్రభుత్వ అలసత్వ వైఖరితోనే సీఎం సొంత జిల్లాలైన చిత్తూరు, తిరుపతి జిల్లాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి
సంఘం జిల్లా కన్వీనర్, చిత్తూరు జిల్లా
అనాలోచిన నిర్ణయాలే కారణం
కూటమి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది. విద్యాసంవత్సరం మధ్యలో సర్దుబాటు కార్యక్రమం ఎవరైనా నిర్వహిస్తారా? అనాలోచిత నిర్ణయాలతో వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్షల్లో తప్పారు. ఇందుకు గల కారణాలు విద్యాశాఖ అధికారులు నోరు మెదపకపోవడం బాధాకరం. సీఎం సొంత జిల్లాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం విస్మయానికి గురిచేస్తోంది. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్
జాతీయ కార్యదర్శి, తిరుపతి జిల్లా

బెడిసికొట్టిన కూటమి సర్కారు ప్రణాళికలు