
చిట్టగాంగ్: వానొచ్చి... రెండు సెషన్లను తుడిచేసింది. మరో సెషన్నూ చాలాసేపు వెంటాడింది. ఇక మిగిలింది 18 ఓవర్ల ఆటే. ఈ కాసింత సమయంలోనే కొండంత విజయాన్ని సాధించింది క్రికెట్ కూన అఫ్గానిస్తాన్. ఏకైక టెస్టులో అఫ్గాన్ 224 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై చారిత్రక విజయం సాధించింది. గతేడాది టెస్టు హోదా పొందిన అఫ్గానిస్తాన్ రెండోసారి టెస్టు విజయం రుచి చూసింది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన అఫ్గాన్ బౌలర్, కెప్టెన్ రషీద్ ఖాన్ (6/49) రెండో ఇన్నింగ్స్లోనూ ఆతిథ్య బంగ్లాను చుట్టేశాడు. కనీస ఓవర్లను ఆడుకొని... బంగ్లా డ్రాతోనైనా గట్టెక్కలేకపోవడానికి రషీద్ స్పిన్ ఉచ్చే ప్రధాన కారణం. సోమవారం ఈ టెస్టుకు ఆఖరి రోజు. ముందు రోజే 398 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 44.2 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. చివరి రోజు అఫ్గాన్ గెలిచేందుకు 4వికెట్లు కావాలి. దీంతో గెలుపు లాంఛనమే అనిపించింది.
వర్షంతో బంగ్లా శిబిరంలో హర్షం...
వర్షంతో సోమవారం ఆట ఓ పట్టాన మొదలే కాలేదు. తొలి సెషన్ పూర్తిగా తుడిచి పెట్టింది. కేవలం 2.1 ఓవర్ల ఆటే జరిగాక మళ్లీ వర్షం ముంచెత్తడంతో రెండో సెషన్ కూడా నిండా మునిగింది. ఈ దశలో ఆతిథ్య బంగ్లా శిబిరం సంబరంగా ఉంది. ఇక డ్రా తప్పదేమో అనుకున్న దశలో ఆఖరి సెషన్ మొదలైంది. కేవలం 18.3 ఓవర్ల ఆటే మిగిలింది. ఈ మాత్రం ఓవర్లను ఆడేయలేమా అన్న ధీమాతో బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. అయితే అఫ్గాన్ బౌలర్లు 17.2 ఓవర్ల వ్యవధిలో నాలుగు వికెట్లు తీశారు. 61.4 ఓవర్లలో 173 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను ముగించి విజయాన్ని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment