Yarn
-
అందని దారం.. వ్రస్తోత్పత్తి ఆగం
సిరిసిల్ల: సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులు, చేనేత, జౌళిశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపం.. వ్రస్తోత్పత్తికి శాపంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే వ్రస్తోత్పత్తి ఆర్డర్లకు నూలు (దారం) సరఫరా చేస్తామని ముందుగా అధికారులు ప్రకటించి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశారు. కానీ, సిరిసిల్లలో వ్రస్తోత్పత్తికి అవసరమైన నూలును సకాలంలో అందించడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈనెల 15 నాటికి అందించాల్సిన ఆర్వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వ్రస్తాల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది. సిరిసిల్లలోని పాతికవేల మరమగ్గాల (పవర్లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వ్రస్తాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. దానికి అవసరమైన నూలు అందించలేదు. దీంతో గడువులోగా వ్రస్తాల తయారీ కష్టంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి గండి స్కూళ్లు తెరిచే నాటికి (జూన్ మొదటి వారంలో) అన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లోని పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు డిసెంబర్లో సిరిసిల్ల నేతన్నలకు కోటి ఐదు లక్షల మీటర్ల వ్రస్తాల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి అవసరమైన నూలును డిపో ద్వారా అందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయి.. సిరిసిల్లలోని నేతన్నలకు వేములవాడలోని నూలు డిపో ద్వారా నూలు సరఫరా అయ్యే సరికి ఫిబ్రవరి అయింది. వచ్చిన నూలుకు ఆసాములు పది శాతం మేరకు డీడీలు చెల్లించి, నూలు తీసుకుని వచ్చి భీములుగా పోసి సాంచాలపైకి ఎక్కించారు. ప్రస్తుతం పది లక్షల మీటర్ల వస్త్రాలు సిద్ధంగా ఉండగా.. భీములపై మరో పది లక్షల మీటర్ల వస్త్రం రెడీ అవుతోంది. మొత్తంగా 20 లక్షల మీటర్లు మరో వారంలోగా సిద్ధమైనా.. ఈ నెలాఖరులోగా 50 శాతం వ్రస్తోత్పత్తి లక్ష్యం అసాధ్యమే. ఈ లెక్కన వ్రస్తాల సేకరణ పూర్తయి, యూనిఫామ్స్ కుట్టి, బడి తెరిచే నాటికి రెండు జతల డ్రెస్సులు అందించాలనే లక్ష్యం సాధించడం కష్టంగానే ఉంది.సమస్య ఏంటంటే..!ప్రభుత్వం టెస్కో ద్వారా సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ (మ్యాక్స్)లకు వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం, ఇక్కడ మాస్టర్ వీవర్స్ (యజమానులు) నూలును కొనుగోలు చేసి ఆసాముల (పవర్లూమ్స్ యజమానులు)కు ఇవ్వడం, వారు సాంచాలు నడుపుతూ, కార్మికులతో పని చేయిస్తూ.. బట్ట నేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా నాణ్యమైన నూలు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు సకాలంలో అందించలేదు. ఇప్పుడు ప్రైవేటుగా కొనుగోలు చేసి స్కూల్ యూనిఫామ్స్ బట్టను నేయాలని యజమానులను జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఆలస్యంగా నూలు ఆర్డర్లు ఇవ్వడంతో వ్రస్తోత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇటీవల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సిరిసిల్ల కలెక్టరేట్లో వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఈనెల 15లోగా 50 శాతం బట్ట ఇవ్వాలని కోరారు. కానీ ఆ మేరకు సిరిసిల్లలో వ్రస్తాల నిల్వలు లేవు.మహిళాశక్తి చీరల ఊసేది?సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 8న ఇందిరా మహిళా శక్తి పేరిట స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75 కోట్లు ఉంటుంది. కానీ, దానికి సంబంధించిన నూలును ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. మొదటి విడతకే మోక్షం లేక వ్రస్తోత్పత్తిదారులు రెండో విడత ఆర్డర్లు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగుల), వెప్ట్ (అడ్డం కోముల పోగుల) నూలు అందుబాటులో ఉండటం లేదు. వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను మగ్గంపై నేసే అవకాశం ఉంది. ఒకటి ఉండి ఒకటి లేక వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతుండగా, ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి మరింత ఆలస్యం కానుంది.ఆలస్యమైనా లక్ష్యం సాధిస్తాంకొంత ఆలస్యమైనా వ్రస్తోత్పత్తిలో లక్ష్యం సాధిస్తాం. ఈ మేరకు సిరిసిల్లలోని వ్రస్తోత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా నూలు డిపో ఏర్పాటు చేసి నూలు సరఫరా చేస్తున్నాం. ప్రైవేటుగా కూడా నూలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పాం. డిపో ద్వారా అందరికీ నూలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటాం. – వులిశె అశోక్రావు, టెస్కో జీఎం, హైదరాబాద్ -
నూకల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: నూకల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది. ప్రభుత్వ గోడౌన్లలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు రిటైల్ ధరలూ అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిల్వలు భారీగా పెరగడంతో ఎగుమతులకు ఆమోదం ఇవ్వాలంటూ ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని గతంలో కోరారు. కాగా 2022 సెప్టెంబర్లో నూకల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. గత ఏడాది బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతుల కోసం నిర్దేశించిన టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) ప్రభుత్వం తొలగించింది. అలాగే ఈ రకం ఎగుమతులపై ఉన్న పూర్తి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో గాంబియా, బెనిన్, సెనెగల్, ఇండోనేషియా తదితర దేశాలకు 194 మిలియన్ డాలర్ల విలువైన నూకలు ఎగుమతి చేసింది. 2022–23లో 983 మిలియన్ డాలర్లు, 2021–22లో 1.13 బిలియన్ డాలర్ల విలువ చేసే నూకలు భారత్ నుంచి విదేశాలకు చేరాయి. -
దేవుడికో నూలుపోగు
‘నా వల్ల ఎక్కడ అవుతుంది’ అనుకుంటే పరిష్కారం, విజయం ఎప్పుడూ కనిపించవు. ‘నా వల్ల ఎందుకు కాదు’ అనే ఆత్మవిశ్వాసం ఏ కొంచెం ఉన్నా పరిష్కారాలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆలయాల్లో దేవతా మూర్తుల పూజలకు అవసరమైన నూలు పోగులతో తయారైన మాలలు హైదరాబాద్, విజయవాడలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరకడం లేదనే మాట విన్న రేఖ ఆ లోటును భర్తీ చేసేలా పవిత్ర మాలల తయారీకి పూనుకుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూజారులు ఒకరోజు సిరిసిల్లకు వచ్చారు. తమిళనాడులో తయారైన ఒక పవిత్ర మాలను శాంపిల్గా తీసుకొచ్చి ‘ఇలాంటి మాలలు మాకు కావాలి. తయారు చేసి ఇవ్వగలరా’ అంటూ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెల్ది రేఖ, హరిప్రసాద్ దంపతులను అడిగారు ఆ మాలలను పరిశీలించి, తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు రేఖ, హరిప్రసాద్ దంపతులు. నాలుగు వైపులా మేకులు కొట్టి వాటికి నూలు పోగులను చుడుతూ, వేలాది పోగులతో ఒక రూపం వచ్చాక దాన్ని అందమైన దండగా తీర్చిదిద్దాలి. ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. పవిత్ర మాలలు హైదరాబాద్, విజయవాడలో ఎక్కడా దొరకడం లేదని, పూజాసామాగ్రి అమ్మే దుకాణాల్లో ఈ పవిత్ర మాలల కొరత ఉందని పూజారులు చెప్పారు. హరిప్రసాద్కు సాంచాలు (పవర్లూమ్స్) ఉన్నాయి. వాటిపై వినూత్నమైన వస్త్రాలను తయారు చేస్తాడు. అయితే పవిత్ర మాలలను తయారు చేసే బాధ్యతను భార్య రేఖకు అప్పగించాడు. ‘నేను చేయలేనేమో’ అని రేఖ అనుకొని ఉంటే మంచి అవకాశం చేజారి పోయి ఉండేది.కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అంటే... మొదటి నుంచి ఆసక్తి ఉన్న రేఖ ‘నేను తయారు చేయగలను’ అంటూ పనిలోకి దిగింది. నాలుగు వైపులా మేకులు కొట్టడం, దాని చుట్టూరా నూలు పోగులను ఒక్కొక్కటి చుట్టడం కష్టమైన పని కావడంతో తమ దగ్గర ఉండే నూలు బింగిరిలను, సైకిల్ హబ్ను, నాలుగు పట్టీలను వెల్డింగ్ చేయించి, చిన్న మోటారు సాయంతో నేరుగా నూలు పోగులు ఆ నాలుగు పట్టీలకు చుట్టుకునే విధంగా ప్రత్యేక మిషన్ ను తయారు చేయించారు రేఖ, హరిప్రసాద్.వినూత్న ఆలోచనతో మిషన్ రూపుదిద్దుకోవడంతో పని సులభమైంది. ధర్మవరం నుంచి హార్ట్ సిల్క్, పట్టు పోగుల నూలు దిగుమతి చేసుకుని ఆ మిషన్ పై దండలను తయారు చేయడం మొదలు పెట్టింది రేఖ. క్రమంగా వీటికి డిమాండ్ పెరగడం మొదలైంది. మాలల తయారీ ద్వారా ఇతర మహిళలకు కూడా ఉపాధి చూపుతోంది రేఖ. ఇప్పుడు రేఖ, ఆమె బృందం తయారు చేస్తున్న పవిత్ర మాలలు సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్... మొదలైన పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘మరింత కష్టపడితే వ్యాపారాన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లవచ్చు అనిపిస్తుంది’ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది రేఖ. ఎన్నో పెద్ద విజయాలు చిన్న విజయాలతోనే మొదలయ్యాయి. రేఖ ఎంటర్ప్రెన్యూర్గా మరిన్ని విజయం సాధించాలని ఆశిద్దాం.నూలు పోగులే ఆశాదీపాలై...సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగం ప్రభుత్వ ఆర్డర్లు లేక, రాక సంక్షోభంలో ఉంది. ‘టెక్స్టైల్ పార్క్’లాంటి ఆధునిక మగ్గాల సముదాయం మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేఖ సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ‘కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే... కొత్త దారి కనిపిస్తుంది’ అనే భరోసాను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పవిత్ర మాలల కోసం సిరిసిల్లకు వస్తున్నారు. ఇక్కడ తయారైన మాలలు ఎక్కడెక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఇది చిన్న విజయమే కావచ్చు. సంక్షోభ సమయంలో స్వయంశక్తిని గుర్తుకు తెచ్చి ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. మన్ కీ బాత్లో మా ఆయన గురించికొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్త హరిప్రసాద్ నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఉంగరంలో దూరిపోయే పట్టు చీరలను ఆవిష్కరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను మగ్గంపై వస్త్రంపై నేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. చేనేత వస్త్రంపై జీ 20 లోగోను చూసిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో హరిప్రసాద్ను అభినందించారు. వస్త్రాలపై చిత్రాలను ఆవిష్కరించే నైపుణ్యాన్ని అభినందిస్తూ నన్ను, మా ఆయనను అప్పటి గవర్నర్ తమిళిసై రాజ్భవన్ కు ఆహ్వానించి సన్మానించారు.– వెల్ది రేఖ– వూరడి మల్లికార్జున్సాక్షి, సిరిసిల్లఫోటోలు: వంకాయల శ్రీకాంత్ -
టెక్స్టైల్పై ‘మహా’దెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర టెక్స్టైల్ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే యార్న్ను వినియోగించుకునే మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో యార్న్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మన రాష్ట్రంలో మొత్తం 120 టెక్స్టైల్ మిల్స్ ఉండగా వీటిద్వారా ఏటా 6.87 లక్షల టన్నుల యార్న్ ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది నవంబర్ నుంచి ఊపందుకున్న వ్యాపారం పదిరోజుల నుంచి ఒక్కసారిగా ఆగిపోయిందని టెక్స్టైల్ కంపెనీల యజమానులు వాపోతున్నారు. గత పదిరోజుల్లో సుమారు రూ.900 కోట్ల విలువైన ఎగుమతులు ఆగిపోయాయని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా రఘురామిరెడ్డి చెప్పారు. ఒక్కో మిల్లు వద్ద కనీసం రూ.6 కోట్ల విలువైన యార్న్ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయినట్లు తెలిపారు. మహారాష్ట్ర, బెంగాల్లకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోగా, తమిళనాడు మార్కెట్కు కొద్దిగా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. దీంతో పెద్ద మిల్లులు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటుంటే, చిన్న మిల్లులు షిఫ్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. చిన్న మిల్లులు రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి పనిచేస్తున్నట్లు తెలిపారు. చాలా మిల్లులు మూడునెలల నుంచి ఉత్పత్తి సామర్థ్యంలో 90 శాతానికి చేరుకున్నాయని, ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో ఉత్పత్తిని 60 శాతానికి తగ్గించాయని పేర్కొన్నారు. కూలీలను నిలబెట్టుకునేందుకు.. రాష్ట్రంలోని టెక్స్టైల్ మిల్లులపై ప్రత్యక్షంగా లక్షమంది, పరోక్షంగా నాలుగు లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో రెండులక్షల మందికిపైగా ఇతర రాష్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. లాక్డౌన్ మొదటి దెబ్బకి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన కూలీలను వెనక్కి రప్పించుకోవడానికి కంపెనీలు చాలా వ్యయప్రయాసలు పడ్డాయి. ఇప్పుడు తిరిగి కరోనా ఉధృతి పెరుగుతుండటంతో కూలీలను కాపాడుకోవడం కోసం ఉత్పత్తిని కొనసాగించాల్సి వస్తోందని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దండా ప్రసాద్ తెలిపారు. ఉత్పత్తి లేకపోయినా పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని, ఇది ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి మరో 3 వారాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. -
హీరో స్వెటర్.. బెటర్!
సాక్షి, సిటీబ్యూరో: ఆలస్యంగా వచ్చిన చలిపులి సిటీజనుల్నివణికిస్తోంది. శీతల గాలులు మేనిని తాకడంతో వెచ్చదనం ఇచ్చే దుస్తుల కోసం పరుగులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. చలినితట్టుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నోవైవిధ్యభరితమైన నూలు దుస్తులు లభ్యమవుతున్నాయి. స్వెటర్లతో పాటు టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజ్లు తదితర వస్త్రాలు కొలువుదీరాయి. ఇదంతా మామూలు విషయమే.. కానీ ప్రస్తుతం స్వెటర్ ధరించే యువతలో మార్పు కనిపిస్తోంది. సినీ హీరో, హీరోయిన్లు ధరించిన స్వెటర్ మోడళ్లపై మోజు పెంచుకొంటున్నారు. అలాంటి బ్రాండ్లేకావాలని దుకాణా యజమానులనుఅడుగుతుండటం యువత నయా అభిరుచికి అద్దం పడుతోంది. చలిని తట్టుకోవడంతో పాటు హుందాగా కనిపించేందుకు విభిన్న రకాల స్టైల్స్లో స్వెటర్లు లభ్యమవుతున్నాయని మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకుడు మహ్మద్ ఇల్యాస్ బుఖారీ తెలిపారు. దిలీప్కుమార్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి తదితర సినీ హీరోలు పలు సినిమాల్లో ధరించిన స్టైలిష్ స్వెటర్లపై ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువగా మక్కువ చూపేవారు. వాస్తవానికి స్వెటర్ల వాడకం సినీ నటుల అనుసరణ నుంచే ప్రారంభంమైందని చెప్పవచ్చు. ప్రస్తుత సినీ హీరోలు రాంచరణ్ తేజ్, నానీ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, దేవరకొండ విజయ్, సుమంత్లు ధరించిన స్టైలిష్ స్వెటర్లు సైతం తమ పాపులో అందుబాటులో ఉన్నాయని ఇల్యాస్ బుఖారీ పేర్కొన్నారు. కొందరు యువతీ యువకులు ఫలానా హీరో, హీరోయిన్ ఫలానా సినిమాల్లో ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వండని ఆర్డర్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో స్వెటర్లు కేవలం చలి నుంచి తట్టుకోవడానికి ధరించే వారు. ప్రస్తుతం చలి నుంచి తట్టుకొవడంతో పాటు స్టైలిష్గా కనిపించేందుకు ధరిస్తున్నారని అన్నారు. యువత అభిరుచికి అనుగుణంగా విదేశాల నుంచి స్వెటర్లను దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. స్టైలిష్ వింటర్ వేర్కు డిమాండ్ గతంలో నూలుతో తయారైన మందమైన స్వెటర్లను కస్టమర్లు ఎక్కువగా ఇష్టవాడేవారు. ప్రస్తుతం తేలికపాటి, క్యాష్ మిలన్ దారంతో తయారైన వింటర్ వేర్కు ప్రాధాన్యమిస్తున్నారు. తేలికగా ఉండి చలిని తట్టుకునే స్వెటర్లు, హ్యాండ్ గ్లౌజ్తో పాటు సాక్స్లను ఎక్కువగా వాడుతున్నారు. యువతరం హీరో, హీరోయిన్లు ధరించిన స్టైలిష్ వింటర్ వేర్ మోడళ్లపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. – మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, క్యాప్ మార్ట్ నిర్వాహకుడు -
నూలుపై 40 శాతం సబ్సిడీ
జనగామ: చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ నూలు పథకంలో 20 శాతం సబ్సిడీని 40 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నేత కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి బోడకుంటి వెంకటేశ్వర్లు ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూలు సబ్సిడీ పథకంలో తీసుకొచ్చిన మార్పులు సహకార సంఘం సభ్యులతోపాటు సహకారేతర కార్మికులకు కూడా వర్తిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఐడీసీ ద్వారా అందిస్తున్న పది శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీ జియో ట్యాగింగ్ చేసిన మగ్గాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 657 మంది లబ్ధిదారులకు రూ.24,94,720 నిధులను మంజూరు చేసేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సిఫారసు చేశారని చెప్పారు. సబ్సిడీ నిధులను విడతల వారీగా లబ్ధిదారులకు డీబీటీ ద్వారా అందిస్తారని చెప్పారు. ముఖ్యంగా చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు భద్రతా పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. 18 ఏళ్ల వయస్సు పైబడి, చేనేత వృత్తిపై 50 శాతం వచ్చే నేత కార్మికులు, అనుబంధ రంగాలైన డిజైనింగ్, డ్రైయింగ్, వార్పింగ్, సైజింగ్ కార్మికులు దీని పరిధిలోకి వస్తారని చెప్పారు. చేనేత కార్మికులు తమ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడంతోపాటు 8« శాతాన్ని ఆర్డీ–1 ఖాతాలో వేస్తే.. ఇందులో 16 శాతం ఆర్డీ ఖాతాలో ప్రభుత్వ వాటా కలుపుతుందన్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 1,443 మంది చేరినట్లు స్పష్టం చేశారు. రూ.2.30 కోట్ల రుణమాఫీ:కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి చేనేత కార్మికులకు ప్రభుత్వం రూ.2.30 కోట్ల రుణాలను మాఫీ చేసిందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ.. వృత్తి కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని సూచించారు. మగ్గంపై పట్టు వస్త్రాల తయారీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకుతోపాటు ప్రభుత్వం నుంచి రుణ సదుపాయాన్ని కల్పించేందుకు లీడ్ బ్యాంకు మేనేజర్తో మాట్లాడుతానని చెప్పారు. చేనేత కార్మికుల భద్రతను ప్రభుత్వం బాధ్యతగా చూస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో నేత కార్మికులను సెక్టార్ల వారీగా విభజించి, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా చూస్తామన్నారు. కడు పేదరికంతో ఉన్న వారికి మాత్రమే అంత్యోదయ కార్డులను ఇవ్వనున్నుట్ల తెలిపారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ మాట్లాడతూ ప్రభుత్వం అందిస్తున్న 16 శాతం వాటా ద్వారా 877 మందికి రూ.11.79 లక్షలు, 40 శాతం వాటాలో 276 మందికి రూ.24.76 లక్షలు అందించామని వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి, మునిసిపల్ కమిషనర్ ఈశ్వరయ్య, సొసైటీ చైర్మన్ వేముల బాలరాజు, గుర్రం నాగరాజు పాల్గొన్నారు. -
ఊరెళ్తున్నారా..?
ఇంటిల్లిపాదీ ఎక్కువ రోజులు ఊరెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. ప్రీతిపాత్రమైన ఇంటిపంటలను, పూలమొక్కలను, ఔషధమొక్కలను బతికించుకోవడం ఎలా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సమస్యకు ‘ఇంటిపంట’ బృంద సభ్యురాలు కాట్రగడ్డ వరూధిని సృజనాత్మకతను జోడించి.. ఖర్చులేని చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించారు. ఆమె 4 పొడవాటి కుండీల్లో ఆకుకూరలు పెంచుతున్నారు. వీటికన్నా ఎత్తులో ఒక స్టూల్పైన బక్కెట్ ఉంచి.. అందులో నీటిని నింపారు. ఒక నూలు తాడును తీసుకొని.. ఒక చివరను బక్కెట్లో వేసి.. రెండో చివరను కుండీలోని మట్టిలో పెట్టారు. కదిలిపోకుండా చిన్న రాయిని కట్టారు. 4 కుండీలకూ ఇలాగే చేశారు. ఆ తాళ్ళ ద్వారా మొక్కల వేళ్లకు అవసరం మేరకు నీటి తేమ అందింది. 12 రోజుల తర్వాత ఆమె ఊరు నుంచి వచ్చి చూస్తే.. బక్కెట్లో చాలా నీరు ఖర్చయింది. ఆకుకూరలు ఏపుగా పెరుగుతూ పలకరించడంతో పట్టలేని సంతోషం కలిగింది! ఆ సంతోషాన్ని ఆమె ‘ఇంటిపంట’ ఫేస్బుక్ గ్రూప్ సభ్యులతో పంచుకున్నారు... ఇంకేముంది లైకుల పంట పండింది!