
భద్రతకు భరోసా ఏదీ!
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో భద్రతకు భరోసాపై సంశయం కలుగుతోంది. స్టేషన్లో రైల్వే పోలీసులు, ఇతర భద్రత సిబ్బంది చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదు. విజయవాడ స్టేషన్కు సుమారు 250 రైళ్లు రోజూ వస్తుంటాయి. ఇక్కడ 10 ప్లాట్ఫాంలు ఉన్నాయి. 1.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
పూర్తిస్థాయిలో నిఘా ఏదీ..
నగరంలోని రైల్వేస్టేషన్లో నిఘా వ్యవస్థ పూర్తిస్థాయిలో కానరావడం లేదు. ప్రయాణికుల లగేజీల్లో అనుమానాస్పద వస్తువులు ఉంటున్నాయా లేదో కూడా గుర్తించే నిఘా వ్యవస్థ ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులతో పాటుగా సంఘ విద్రోహులు, దొంగలు, అక్రమ రవాణాదారులు యథేచ్ఛగా స్టేషన్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మాత్రం అప్పుడప్పుడు స్టేషన్లోని ప్లాట్ఫాంలను తనిఖీలు చేసి సంతృప్తి చెందుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు వెళ్లే రైల్వేస్టేషన్, బస్స్టేషన్, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఎక్కడ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనధికారికంగా..
ప్రధాన ప్రవేశ మార్గాలతో పాటుగా రైల్వే స్టేషన్లోకి వచ్చి వెళ్లడానికి అనధికారిక మార్గాలను కొంతమంది వినియోగించుకుంటున్నారు. రైల్వేపార్సిల్ కార్యాలయం, నైజాంగేటు, కంసాలీపేట, తారాపేట, కాళేశ్వరరావు మార్కెట్, ఖుద్దూస్నగర్, రైల్వేకోర్టు తదితర ప్రాంతాల నుంచి కూడాస్టేషన్లోకి రాకపోకలు జరుగుతున్నాయి. రైలులో గంజాయి, మద్యం అక్రమ రవాణదారులు ఈ మార్గాల నుంచి సులువుగా తప్పించుకుని వెళుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
కరోనా సమయంలో టిక్కెట్ ఉన్న ప్రయాణికులను తప్ప ఇతరులను స్టేషన్లోకి ప్రవేశించకుండా రైల్వే అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. అదే తరహాలో అనధికారిక మార్గాలతో పాటు స్టేషన్లోకి ప్రవేశ ద్వారాల వద్ద ఆర్పీఎఫ్ భద్రత సిబ్బంది నిఘా పెంచాలి. అనుమానితులను ముందుగానే గుర్తించి ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్లో కనిపించని ‘నిఘా’ ప్రవేశద్వారాల వద్ద కానరాని ఆర్పీఎఫ్ సెక్యూరిటీ!
పెరుగుతున్న నేరాలు
రైల్వే స్టేషన్లో నిఘా లోపించడంతో ప్రయాణికులతో పాటు దొంగలు, పాత నేరస్తులు, గంజాయి బ్యాచ్ యథేచ్ఛగా స్టేషన్లో తిరుగుతున్నారు. ప్లాట్ఫాంలు, వెయిటింగ్ హాల్స్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల లగేజీలు, సెల్ఫోన్లను చోరీ చేస్తున్న సంఘటలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రవేశ ద్వారాల వద్ద కానరాని భద్రత
నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
విజయవాడతో పాటు డివిజన్లోని అన్ని స్టేషన్లలో ఆర్పీఎఫ్ భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్ నుంచి తమ సిబ్బంది స్టేషన్లోని పది ప్లాట్ఫాంలతో పాటు స్టేషన్ పరిసరాలు, ప్రవేశ ద్వారాల వద్ద రాకపోకలు సాగించే ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేస్తుంటారు. ముఖ్యంగా అనధికార ప్రవేశ మార్గాలు, అవుటర్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎక్స్ సర్వీస్మెన్లతో పర్యవేక్షణ ఏర్పాటు చేసి భద్రత చర్యలు చేపట్టాం.
– వల్వేశ్వర బి.టి,
సీనియర్ డీఎస్సీ
విజయవాడ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేందుకు ఐదు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున రెండు, దక్షిణ వైపు ఒకటి, పశ్చిమం వైపు తారాపేట, వెస్ట్ బుకింగ్ వద్ద రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు వీటి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఈ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లతో ఆర్పీఎఫ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణికుల్ని, వారి లగేజీలను క్షుణంగా తనిఖీ చేసి పంపించే వ్యవస్థ ఉండేది. ఇటీవల అటువంటి భద్రత ప్రమాణాలు స్టేషన్లో ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి నెలకుంది. ప్రవేశ ద్వారాల వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు కుర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

భద్రతకు భరోసా ఏదీ!

భద్రతకు భరోసా ఏదీ!

భద్రతకు భరోసా ఏదీ!