
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
కొరాపుట్: పంచాయతీరాజ్ దినోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని సాయి కల్యాణ మండపంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనారిటీ, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులు చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో నబరంగ్పూర్ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శుభంకర్ మహాపాత్రో, నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉత్తమ బ్లాక్గా జయపూర్ను ప్రకటించారు. జయపూర్ బీడీఓ శక్తి మహాపాత్రోకు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, తదితరులు పాల్గొన్నారు.
మల్కన్గిరిలో..
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో సమితి కార్యాలయ మైదానంలో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కర్యక్రమాన్ని జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర శభరో ప్రారంభించారు. సీఎం మోహన్ చరణ్ మాఝి పూరీ జిల్లాలో ముందుగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 6 లక్షలు మంది అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్కన్గిరి సమితిలో 64 మందికి, పురపాలకలోని 49 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. జిల్లా ఉన్న 7 సమితుల్లో బలిమెలలో 16 మందికి, మత్తిలిలో 36 మందికి, కలిమెలలో 161 మందికి, ఖోయిర్పూట్ 25 మందికి, కోరుకొండా 58 మందికి, పోడియా 34 మందికి, చిత్రకొండ 26 మందికి రేషన్ కార్డులు అందజేశారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జిల్లా అధికార యంత్రాంగం గజపతి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. డీఆర్డీఏ. ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, అదనపు అధికారి పృథ్వీరాజ్ మండల్, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, బ్లాక్ ఫైనాన్స్ అధికారి గజేంద్ర బెహరా, ఈఓ జిల్లా పంచాయతీ అధికారి అశోక్కుమార్ పట్నాయక్, గుమ్మా జెడ్పీటీసీ రేణుకా పాత్రో తదితరులు విచ్చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడిలో మరణించిన 26 మంది ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి పనిచేస్తే పంచాయతీ, గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. 234 మందికి కొత్త రేషన్ కార్డులను అందజేశారు. సామాజిక సురక్షా, అంగవికలాంగులు నలుగురికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పీఎం ఆవాస్ యోజనా పథకం కింద మూడు గ్రామ పంచాయతీలకు రివార్డులను అందజేశారు. జిల్లా పరిషత్తు అసిస్టెంట ఇంజినీర్ వెంకటరావు ఆచారి, ఓ.ఎల్.ఎం.డి.పి.ఎం టెమోన్ బోరా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, తదితరులు పాల్గొన్నారు.
కొరాపుట్: వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిత్యానంద గొండో, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ శుభంకర్ మహాపాత్రో

ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం