Odisha Latest News
-
గుణుపూర్ జీఐఈటీలో అగ్ని ప్రమాదం
● రు.కోటి విలువైన కంప్యూటర్ పరికరాలు దగ్ధం ● నిలిచిపోయిన ఓజేఈఈ పరీక్షలుజీఐఈటీ భవణంలో పొగలురాయగడ: జిల్లాలోని గుణుపూర్లో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వర్సిటీ ప్రాంగణంలోని అడ్మినిస్ట్రేటివ్, కంప్యూటర్ ల్యాబ్లలో మంటలు చెలరేగడంతో సుమారు కోటి రూపాయల విలువైన కంప్యూటర్లు, ఇతర పరికరాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో అంచనా వేస్తున్నారు. శనివారం ఇదే వర్సిటీలో ఓజేఈఈ పరీక్షలు జరగాల్సి ఉంది. సరిగ్గా పరీక్షకు 20 నిమిషాలు ముందు అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎగ్జామ్ రద్దు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తొలుత కంప్యూటర్ విభాగంలో దట్టమైన పొగలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు గమనించిన సిబ్బంది వెంటనే విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎన్.వి.జె.రావుకు సమాచారం తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కంప్యూటర్ విభాగం అగ్నికి ఆహుతయ్యింది. -
త్వరగా మా ఇంటికి చేర్చండి
● శ్రీనగర్లో చిక్కుకున్న వ్యవసాయ విద్యార్థులు ● సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి ● అభయమిచ్చిన సీఎం మాఝిభువనేశ్వర్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న ఒడిశా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీరిని సమస్యాత్మక ప్రాంతాల నుంచి సురక్షితంగ తరలిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభయమిచ్చారు. ఈ మేరకు శనివారం నుంచి భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల నుంచి విద్యార్థులు రాష్ట్రానికి చేరడం ఆరంభమైంది. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యవసాయ శాస్త్ర విద్యార్థులు శ్రీనగర్లో చిక్కుకున్నారు. తమను శ్రీనగర్ నుంచి తక్షణమే ఢిల్లీకి తరలించాలని అభ్యర్థించారు. శ్రీనగర్లో పరిస్థితి క్షణక్షణం భయానకంగా మారుతుందని, తక్షణమే ఈ ప్రాంతం నుంచి సొంత రాష్ట్రానికి తరలించాలని ఢిల్లీ ఒడిశా భవన్ సంప్రదించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల విద్యార్థులు హాస్టల్ నుండి వెళ్లిపోయారని, తమను కూడా తీసుకెళ్లాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటి వరకు జమ్మూలోని 114 మంది ఒడియా విద్యార్థులను ఒడిశాకు తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఒడిశా భవన్ సంప్రదింపుల కోసం 7428135044, 011–24679201 ఫోను నంబర్లను సంప్రదించాలని సూచించారు. సొంత ఊరికి రవాణా.. ప్రభుత్వ సూచనల మేరకు జమ్మూకాశ్మీర్ నుంచి తిరిగి వస్తున్న ఒడియా విద్యార్థులకు రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శనివారం తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్లో సమస్యాత్మక జమ్మూ ప్రాంతం నుంచి బాలసోర్ రైల్వే స్టేషనుకు తిరిగొచ్చిన విద్యార్తులను వారి వారి గమ్యస్థానాలు చేరుకోవడానికి రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు చేసిందని విభాగం ప్రముఖ కార్యదర్శి ఉషా పాఢి తెలిపారు. -
హేమలతకు శాంతిదూత అవార్డు
భువనేశ్వర్: బలమైన దేశాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర అనిర్వచనీయమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కొనియాడారు. ప్రపంచ మాతృ దినోత్సవం పురస్కరించుకుని శనివారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాత్రికేయం, సామాజిక సేవ, ఆరోగ్య సంరక్షణ, మహిళా అవగాహన, విద్య, క్రీడలు తదితర రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన 10 మంది మహిళలకు శాంతిదూత అవార్డుతో సత్కరించారు. ఈ క్రమంలో మారుమూల మల్కన్గిరి ప్రాంతంలో గృహిణిగా ఉంటూనే పాత్రికేయ రంగంలో రాణిస్తున్న డబ్బీరు హేమలత శాంతిదూత అవార్డు అందుకున్నారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కొండ కోనల్లో సంక్లిష్ట వార్తల సేకరణతో సామాజిక చైతన్యానికి దోహదపడుతున్నందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహక సంస్థ మా ఘొరొ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రుతుపూర్ణ మహంతి తెలిపారు. కార్యక్రమంలో న్యాయ, అబ్కారీ శాఖ మంత్రి పృథ్విరాజ్ హరిచందన్, అడ్వకేటు జనరల్ పీతాంబర ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ సేవలపై సమీక్ష
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితిస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమవేశం శనివారం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించటంతో పాటు లబ్ధిదారులకు పథకాల ఫలితాలు ఎలా చేరుతున్నది, సబ్సిడీ పొందుతున్నారా లేదా, రుణాన్ని సకాలంలో లబ్ధిదారులు చెల్లిస్తున్నారా లేదా అనే విషయాలపై కమిటీ చర్చించింది. కొట్పాడ్ బ్లాక్ మేనేజ్మెంట్ యూనిట్ అధికారి గుప్త ప్రసాద్ మఝి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి బీడీవో బిక్రమ కుమార్ దొర, సమితి చైర్మన్ కమళ లోచన భొత్ర, కొట్పాడ్ సమితి స్థాయి బ్యాంకర్ల కమిటీ వైస్ చైర్మన్ తపన కుమార్ పాణిగ్రహి, ఐపీవో నిరంజన్ పండ, తాపస దాస్, దేవీ ప్రసాద్ త్రిపాఠీ, కొరాపుట్ లీడ్ బ్యాంక్ మీనేజర్ (ఎల్డీఎం) డి.కె.త్రిపాఠీ, జీపీవో కేధార్ నాథ్ అటక, సువర్ణ నాయిక్, బిమళావతి సమరత్, రంజిత నాయిక్, ఉజ్వళ ఆశా, నిర్మళఽ దన్ఫూల్, నమిత నాయిక్తోపాటు తొమ్మిది బ్యాంకుల పరిపాలన అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
46,449
కేసులు పరిష్కారంభువనేశ్వర్: జాతీయ లోక్ అదాలత్ను ఖుర్ధా జిల్లాలో శనివారం నిర్వహించారు. జాతీయ న్యాయ సేవల అథారిటీ, ఒడిశా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా పరిధిలోని భువనేశ్వర్, ఖుర్ధా, బొణొపూర్, జట్ని, టంగి, చిలికా, బెగుణియాలోని అన్ని జ్యుడీషియల్ డివిజనల్ కోర్టు సముదాయాలలో లోక్ అదాలత్ నిర్వహించారు. విచారణ కోసం మొత్తం 76,437 కేసులు దాఖలవ్వగా వాటిలో 46,449 కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. అలాగే జరిమానా, పరిష్కారం, ఆదాయం వర్గాల కింద రూ. 26,27,08,395 వసూలు చేయాలని నిర్ణయించారు. ఖుర్ధా జిల్లా సెషన్స్, జిల్లా న్యాయ సేవల అథారిటీ, భువనేశ్వర్ చైర్మన్ బిరంచి నారాయణ్ మహంతి, ఫ్యామిలీ కోర్టు జడ్జి మదన్లాల్ కేడియా, నరేష్ మహంతి, అదనపు జిల్లా జడ్జిలు హిమాన్షు శేఖర్ మల్లిక్, శుభంజన్ మహంతి, వందన కొరొ మరియు ఇతర సీనియర్ న్యాయ అధికారులు లోక్ అదాలత్లో పాలుపంచుకుని రికార్డు సంఖ్యలో కేసులను పరిష్కరించారు. లోక్ అదాలత్లో 7,142 కేసులు పరిష్కారం జయపురం: స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా ప్రదీకరణల సూచనల మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు నిర్వహించిన లోక్ అదాలత్లో 7,142 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ విషయాన్ని ప్రదీకరణ అధికారులు వెల్లడించారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి అధ్యక్షతన జిల్లాలోని కొరాపుట్, కొట్పాడ్, లక్ష్మీపూర్, సెమిలిగుడ, దసమంతపూర్, బొరిగుమ్మ, లమతాపుట్ కోర్టులలో కూడా లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 34 మోటార్ ప్రమాదాల కేసులు పరిష్కరించి బాధితులకు 2,05,20,000 రూపాయల పరిహారం సమకూర్చినట్లు వెల్లడించారు. అలాగే మిగతా 7,108 కేసులు పరిష్కరించి 4,58,50,538 రూపాయలను జరిమానా వసూలు చేశారు. కేసులు పరిష్కరించిన వారిలో కుటుంబ కోర్టు జడ్జి నిశిత్ నిశాంకో, లోక్అదాలత్ శాశ్వత విచారపతి సుమన్ జెన, రిజిష్టర్ -
దొంగతనం కేసులో బాలుడు అరెస్టు
జయపురం: వాహన షెడ్లో టైర్లు, ఇంజిన్ సామానులు దొంగిలించిన బాలుడిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్ర రౌత్ శనివారం వెల్లడించారు. అతడిని జువైనల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు మల్కనగిరి బాలల రక్షణ గృహానికి తరలించినట్లు పట్టణ పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడి నుంచి దొంగిలించిన టైర్లు, ఇతర సమానులు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. గాంధీ చౌక్లో గల ఒక నాలుగు చక్రాల షోరూమ్ గిడ్డంగిలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. జనవరి 21వ తేదీన గిడ్డంగిలో ఉన్న నాలుగు కొత్త టైర్లు, రిమ్ములు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం జనవరి 22వ తేదీన యజమాని తెలుసుకున్నాడు. ఆ షోరూమ్ యజమాని దొంగనంపై లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించబడిన వాటి విలువ రూ.50 వేలు ఉంటుందన్నారు. దొంగతనం సీసీ కెమారాలలో రికార్డు అయింది. పోలీసుల దర్యాప్తులో వివిధ సమయాలలో జరిగిన దొంగతనాలు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు గిడ్డంగి నుంచి ఇనుప రేంపులు, పలు రిమ్ములు, 50కి పైగా టైర్లు దొంగిలించబడ్డాయి. వాటి విలువ రూ.5 లక్షల 50 వేలకు పైనే ఉంటుందని షోరూమ్ యజమాని తెలిపారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపగా బాలుడిని వద్ద 4 టైర్లు, రిమ్ము, ఇతర వస్తువులు లభించాయని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
స్కౌట్స్, గైడ్స్కు రాష్ట్రపతి పురస్కారం
పర్లాకిమిడి: గజపతి జిల్లా భారత్ స్కౌట్స్, గైడ్స్ వింగ్కు అరుదైన గౌరవం దక్కింది. 2025 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రపతి వార్డు వరించింది. దీన్ని ఈనెల తొమ్మిదో తేదీన ఒడిశాలోని రాజభవన్లో హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిబాబు కంభంపాటి అందజేశారు. గజపతి జిల్లా స్కౌట్స్, గైడ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత్ స్కౌట్స్ ఆఫీసర్ సురేంద్రకుమార్ పాత్రో, డీఈవో డాక్టర్ మాయాధర్ సాహులు రాష్ట్రపతి ఆవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ఆవార్డు ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జయంతీ కంభంపాటితో పాటు రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్, విద్యాలయ గణశిక్షామంత్రి నిత్యానంద గోండ్, రాష్ట్ర ముఖ్యకమిషనర్ కాళీప్రసాద్ మిశ్రో, దేవీప్రసాద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాకు రాష్ట్రపతి పురస్కారం రావడం ఇది మూడోసారని డీఈవో డాక్టర్ మాయాధర్ సాహు తెలిపారు. -
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
కాశీబుగ్గ/ఇచ్ఛాపురం: పలాస జీఆర్పీ పరిధి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో బహుదా నది రైలు వంతెనపైన వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి వంతెన దాటుతున్న తరుణంలో ఒక్కసారిగా రైలు రావడంతో ఎటుపోవాలో తెలియక ఉండిపోవడం వలన ప్రమాదం చోటుచేసుకుందని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. వృద్ధుడి వయస్సు 65–70 సంవత్సరాలు మధ్య ఉంటుందని, తెల్లని రంగు షర్టు పైన నిలువుగా నల్లని గీతలు, ఎర్రని లుంగీ కట్టుకున్నారని తెలిపారు. పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపడితే 94406 27567 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
కొరాపుట్లో ఈస్ట్కోస్ట్ రైల్వే జీఎం పర్యటన
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంకువాల్ కొరాపుట్ రైల్వే లైన్లో శనివారం పర్యటించారు. కొరాపుట్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేశారు. అమృత్ భారత్ కింద నిర్మితమవుతున్న భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల టాయిలెట్లు, వెయిటింట్ హాల్, సిగ్నిల్ రూం తదితర ప్రాంతాలకు వెళ్లారు. సుక్కు వద్ద నిర్మితం అవుతున్న డబల్ లైన్ వంతెన పరిశీలించారు. డార్లి స్టేషన్ వద్ద ట్రాక్ పనితీరుపై దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. పాడువ వద్ద రైల్వే ట్రాక్ పక్క కొండల పైనుండి రాళ్లు పడినప్పుడు అడ్డుకొనే రక్షణ గోడల పట్టిష్టతపై ఆరా తీశారు. పలు చోట్ల డబ్లింగ్ లైన్ ట్రాక్ నిర్మాణ పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోరా, చీఫ్ అడ్మిస్ట్రేటివ్ (కనస్ట్రక్షన్స్) ఆఫీసర్ అంకుష్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు
● ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ నాయకుడు లక్ష్మణరావు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సీఎం చంద్రబాబుకి మహిళలంటే చిన్నచూపు అని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ నాయకుడు, వైఎస్సార్సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఏఐబీసీఎఫ్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రాష్ట్రంలో మాజీ మంత్రి స్థాయి వ్యక్తికే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగిస్తే ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ తరుపున ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. సత్తాచాటిన కంచిలి యువతి కంచిలి: మండల కేంద్రానికి చెందిన తాజుద్దీన్ ఖాన్ కుమార్తె జైనబ్ ఖానం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న ప్రతిష్టాత్మక అమెరికన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. దీంతో అదే యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా కూడా సేవలందిస్తోందని తండ్రి తాజుద్దీన్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైనబ్ ఖానం విద్యలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా స్కాలర్షిప్ అందుకున్నారు. డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డేటా అనాలిటిక్స్ వంటి అత్యాధునిక రంగాల్లో ప్రావీణ్యం సాధించారు. ఒక గ్రామీణ ప్రాంత యువతిగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి, అదే విద్యాసంస్థలో అధ్యాపకురాలిగా మారడం విశేషం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి టెక్కలి రూరల్: మండలంలోని శ్యామసుందరాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలం ఆర్జే బొడ్డపాడు గ్రామానికి చెందిన బుడ్డ దశరథ(43) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు దశరథ కోటబొమ్మాళి మండలం గంగరాం గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు శుక్రవారం వెళ్లాడు. అనంతరం తిరిగి శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై తన గ్రామానికి వెళ్తున్న క్రమంలో టెక్కలి సమీపంలోని శ్యామసుందరాపురం గ్రామ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు. అయితే మృతుడికి మొదటి భార్య మృతి చెందడంతో ఇటీవలే రెండో వివాహం జరిగింది. మృతుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో మూడో నంబర్ ప్లాట్ఫారం వద్ద శనివారం సాయంత్రం రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు వివరాలు వెల్లడించారు. రేగిడి ఆమదాలవలస మండలం పుర్లె గ్రామానికి చెందిన రేగిడి సురేష్(28) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు సురేష్ శ్రీకాకుళంలో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడని, శుక్రవారం రేగిడి ఆమదాలవలసలో ఒక వివాహానికి హాజరై వస్తానని పనిచేసే వద్ద చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఇంటికి వెళ్లి వచ్చిన సురేష్ ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సురేష్ తమ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కాగా, తండ్రి జగన్నాథం గతంలో మరణించినట్లు తెలిపారు. అటు భర్త, ఇటు కుమారుడు మృతి చెందడంతో తల్లి దిక్కులేనిది అయ్యిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సురేష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
విద్యార్థులకు అభినందన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పదో తరగతి బోర్డు పరీక్షల్లో సరస్వతి శిశు విద్యామందిర్ రెండు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినులు ప్రజ్యోతి చౌదరి (566/600), అంకితా పాడీ (553/600)ను ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్టు శుక్రవారం ఉదయం సత్కరించారు. ఈ సత్కార సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పారశెల్లి రామరాజు మాట్లాడుతూ, వచ్చే ఏడాది సరస్వతి శిశు విద్యామందిర్ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కువ మంది ఫస్ట్ ర్యాంకులు సాధించి పర్లాకిమిడి ఖ్యాతి పెంచాలని కోరారు. ముఖ్యవక్తగా ప్రధాన ఆచార్యులు సరోజ్ పండా, పాతపట్నం ప్రభుత్వ పాఠశాల ఒడియా ఉపాధ్యాయులు భీమ్ సేన్ పండా, విశ్రాంత ఉపాధ్యాయులు గేదెల సుదర్శనరావు, ప్రమోద్ కుమార్ పాడీలు అతిథులుగా విచ్చేశారు. ఉత్తమ విద్యార్థులకు మెమోంటో, వెయ్యి రూపాయల నగదు బహుమతి అందించారు. తల్లిదండ్రులను, ప్రధాన ఆచార్యులు సరోజ్ పండాను పి.రామరాజు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గురూజీ, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ హాల్టికెట్ల పంపిణీ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు కళాశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఐపీఈ మార్చి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు వివిధ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు బెటర్మెంట్ రాసుకునేందుకు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకెండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్ నుంచి కూడా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఏపీఎస్పీ కమాండెంట్గా పద్మనాభరాజు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలో ప్రారంభించిన 1వ ఏపీఎస్పీ (ఐఆర్) నూతన కమాండెంట్గా పద్మనాభరాజును నియమిస్తూ పోలీస్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు నిర్వహణ, తీవ్రవాద నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట వంటి చర్యల్లో సివిల్ పోలీసులకు సహాయం చేయటం, సలహాలు ఇచ్చేందుకు ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ప్రాంతంలో బెటాలియన్ నిర్మాణం ఏర్పాట్లు సైతం పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్ కమాండెంటెంట్ పి.సత్తిబాబు, అధికారులు అభినందనలు తెలియజేశారు. దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ 21వ బ్యాచ్కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని తెలిపారు. ఈ నెల 3వ వారంలో ప్రారంభమయ్యే శిక్షణకు 16 మందికే అవకాశం ఉందని, పూర్తి వివరాలకు 9441161051, 9390886033 నంబర్లను సంప్రదించాలని కోరారు. అనుమానితులతో జాగ్రత్త గార : సముద్రం, తీర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే సమాచారమివ్వాలని కళింగపట్నం మైరెన్ సీఐ బి.ప్రసాదరావు కోరారు. శుక్రవారం గార మండలం బందరువానిపేట, కె.మత్స్యలేశం గ్రామాల్లో భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. సముద్రంలో వేట సాగిస్తున్నప్పుడు వేరే దేశాల బోట్లు వస్తుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజాభద్రతకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై మహాలక్ష్మీ, సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి కాశీబుగ్గ: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలకు ప్రాధాన్యమిచ్చి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో పోలీసు గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విచారణ చేపట్టి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయం చేయండి ●● ప్రభుత్వానికి రైతు వేడుకోలు సంతబొమ్మాళి: తన భూమిలో పోర్టు యాజమాన్యం రెవెన్యూ, పోలీసు అధికారుల సాయంతో దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటోందని కూర్మనాథపురం గ్రామానికి చెందిన రైతు కోట రామ్మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరుతో తన గోడును వెళ్లబుచ్చాడు. పోర్టు రైల్వేలైన్ కోసం తన 58 సెంట్ల మెట్టు భూమిని ఇవ్వలేదన్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో సెంటు రూ.1.50 లక్షలు ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.25 వేల పరిహారం మాత్రమే ఇస్తోందన్నారు. తనది మెట్టుభూమి అయితే పల్లపు భూమి అని నమోదు చేశారని మండిపడ్డాడు. దీంతో పరిహారం సరిపోదని జిల్లా కలెక్టర్, టెక్కలి ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చానన్నారు. అయితే మూడు నెలలు కావస్తున్నా న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని దీనిపై కేసు నడుస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు హైకోర్టులో కేసు ఉండగా పోర్టు యాజమాన్యం రైల్వేలైన్ కోసం చదును చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన జీడి, మామిడి ఇతర మొక్కలను కూల్చివేసి రోడ్డు వేశారని మండిపడ్డారు. దీనిని తాను అడ్డుకుంటే దౌర్జన్యంగా పోలీసుస్టేషన్లో పెట్టారన్నారు. తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. -
నీలినీడలు!
సరస్వతీ పుష్కరాలపై ● ఉత్తరాఖండ్లో మే 15 నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలు ● భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భయాందోళనలో భక్తులు ● ఇప్పటికే తరలివెళ్లి బిక్కుబిక్కుమంటున్న కొరాపుట్ జిల్లాల ప్రయాణికులుకొరాపుట్: భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ప్రభావం సరస్వతీ పుష్కరాలపై పడింది. రోజురోజుకూ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సరస్వతి నది పుష్కరాలు మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సి ఉంది. సరస్వతి నది ఉత్తర్ఖాండ్ రాష్ట్రంలో బద్రీనాద్ థామ్కు సమీపంలో మన అనే గ్రామంలో కనిపించి కొంత దూరంలో అంతర్లీనంగా భూమిలోనికి వెళ్లిపోతుంది. మరలా ఉత్తర్ప్రదేశ్లో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగంలో అంతర్వాహినిగా గుర్తిస్తారు. ఈ మన గ్రామాన్ని దేశంలో చివరి గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత టిబెట్ వస్తుంది. ప్రయాగ్రాజ్ గానీ, మన గ్రామానికి గానీ పర్యాటకు వెళ్తుంటారు. పనిలోపనిగా హిమాలయాలలో 6 నెలలు మాత్రమే తెరిచే ఉండే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యయునోత్రిలను దర్శించుకుంటారు. విపరీతమైన రద్దీ.. ఎక్కువగా తెలుగు ప్రజలు మాత్రమే వెళ్లే ఈ పుష్కరాలలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఇప్పటికే దేశంలో అనేక ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు భారీ ప్యాకేజీలతో లక్షలాది మంది చేత టిక్కెట్లు కొనిపించారు. ఇప్పటికే వేలాది మంది హిమాలయాలకు చేరుకున్నారు. యుద్ధ భయం.. ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధ భయమే కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పుష్కరాలు కోసం వెవెళ్లి వచ్చేవారు అత్యధికంగా న్యూఢిల్లీ మీదుగా విమాన ప్రయాణాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కూడా యుద్ధ భయం ఏర్పడింది. విమాన సర్వీసులు రద్దయితే చిక్కుకుంటామని భయపడుతున్నారు. యుద్ధ ఆంక్షలు పెరిగితే తిరిగి ఇంటికి ఎలా రావాలో తెలియక తెలుగు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయం.. అభయం.. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది తమ బద్రీనాథ్ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే హరిద్వార్ దాటిన వారు మాత్రం ఏం జరిగితే అదే జరుగుతుందంటూ ముందుకు వెళ్తున్నారు. మరో వైపు ట్రావెల్ ఆపరేటర్లు మాత్రం ప్రయాణికులకు గట్టి భరోసా ఇస్తున్నారు. యుద్ధ ప్రభావం ఉత్తరాఖండ్పై పడదని నచ్చజెప్పుతున్నారు. ప్రతి ఒక్కరిని తాము ఇంటికి భద్రంగా చేరుస్తామని ధైర్యం ఇస్తున్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాల్లో.. అవిభక్త కొరాపుట్ జిల్లాలైన కొరాపుట్, రాయగడ, నబరంగ్పూర్, మల్కన్గిరి నుంచి సుమారు 10 వేల మంది సరస్వతి పుష్కరాల ప్రయాణాలు పెట్టుకున్నారు. ఇప్పటికే వందలాది మంది హరిద్వార్ దాటి హిమాలయాల దరికి చేరుకున్నారు. మిగిలిన వారు సందిగ్ధంలో పడ్డారు. -
అట్టడుగు వర్గాలకు సౌకర్యాలు
భువనేశ్వర్: రాష్ట్రావతరణ శతాబ్ది 2036 నాటికి సుసంపన్న ఒడిశా ఆవిష్కరణ లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అట్టడుగున ఉన్న ప్రజలకు అన్ని ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఒడిశాను 500 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం 36 కార్యక్రమాలు సిద్ధం చేశామని చెప్పారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం విజన్ ఒడిశా 2036, 2047 రూపకల్పనపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ఒడియా ప్రజల కలలకు రోడ్ మ్యాప్ లాంటి దార్శనిక పత్రం ఆవిష్కరణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. నిపుణులను సంప్రదించిన తర్వాత తుదిపత్రం ఖరారు చేయనున్నామని చెప్పారు. త్వరలో సంబల్పూర్, బాలాసోర్, జయపురం ప్రాంతాల్లో మరో మూడు ప్రాంతీయ వర్క్షాప్లు జరుగుతాయని సీఎం ప్రకటించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, హస్తకళల మంత్రి ప్రదీప్ బొలొ సామంత, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి సంపద చంద్ర స్వంయి, ఏకామ్ర నియోజకవర్గ ఎమ్మెల్యే బాబూ సింగ్, నగర మేయర్ సులోచన దాస్, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, అభివృద్ధి కమిషనర్ అను గార్గ్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారులను దోచుకుంటున్న ఇద్దరు అరెస్టు
జయపురం: రహదారులపై మోటారు వాహనాలను అడ్డుకొని డబ్బు లూటీ చేస్తున్న ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు. అరెస్టు అయినవారు జయపురం సమితి ఉమ్మిరి గ్రామం హృదానంద నాయక్ ఉరఫ్ ప్రిన్స్, అదే గ్రామానికి చెందిన సంజయ సున అని వెల్లడించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీ రాత్రి సబ్ ఇన్స్పెక్టర్ సులోచన ప్రధాన్, ఏఎస్ఐ పంకజినీ శబరలు పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేపట్టారు. అంబాగుడ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో కేవిడి రోడ్డులో దోపిడీ దొంగలు వాహనాలను అడ్డుకొని ప్రయాణీకులకు తుపాకీ చూపి డబ్బులు దోచుకుంటున్నారని సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్ టీమ్ ఘటనా ప్రాంతానికి వెళ్లారు. కెవిడి కోళ్ల ఫారం వద్ద ఇద్దరు యువకులు నిల్చోని ఉన్నారు. పోలీసులను చూసి వారు పరుగుతీశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా తూటాలు లేని ఫిస్టల్, కొంత నగదు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. -
కలిమెల బంద్ ప్రశాంతం
మల్కనగిరి: జిల్లాలో కలిమెల సమితి బీడీఓ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ సర్పంచ్లు, సమితి సభ్యులు శుక్రవారం 12 గంటల బంద్ పాటించారు. సమితి బీడీఓ ప్రదీప్కుమార్ కర్ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమితి పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బీడీఓ ప్రజా ప్రతినిధులైన జెడ్పీ సభ్యులు, సర్పంచులు, సమితి సభ్యులకు ఎటువంటి ముందస్తు సమాచారాన్ని ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం సమితి కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు సుభాషిణి సొడి, బీజేడీ సీనియర్ నాయకుడు ప్రదీప్ మాఝి, మాజీ ఎమ్మెల్యే మానస్ మాడ్కామీ, సమితి మాజీ చైర్మన్ ద్వారక మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
కోచింగ్ సెంటర్లో దారుణం ●
● విద్యార్థిని చితకబాదిన నిర్వాహకులు ● తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం నరసన్నపేట: స్థానిక ప్రశాంత్ నగర్లో కుందనా నవోదయ కోచింగ్ కేంద్రం నిర్వాహకులు విద్యార్థులను చితకబాదుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలను మంచిగా చదివిస్తామని నవోదయ ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధం చేస్తామని తల్లిదండ్రులను నమ్మించి జాయిన్ చేసుకున్నారు. తీరా అక్కడ విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతుండడంతో తల్లిదండ్రులు వీధికెక్కారు. దీంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పోలాకి మండలం ఈదులవలస గ్రామానికి చెందిన ముద్దాడ శ్రీనివాసరావు తన కుమారుడు శ్రీకర్ను కోచింగ్ కోసం కుందనా నవోదయ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. అయితే గురువారం అబ్బాయి ఇంటికి వచ్చాక స్నానం చేయిస్తున్నప్పుడు వీపు, చెవులుపై గాయాలు ఉండడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో విద్యార్థిని ప్రశ్నించగా కోచింగ్ సెంటర్లో టీచర్ కొట్టారని, చాలా అవమానకరంగా మాట్లాడారని తెలిపాడు. పోలీసుల హెచ్చరిక ఈ విషయంపై విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించగా అతడినే కొడతామని వారు సమాధానం చెప్పారు. దీంతో విషయాన్ని శుక్రవారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏఎస్ఐ సింహాచలం కోచింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇలా కొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ ప్రతినిధి మదన్కుమార్ కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బాలల హక్కులను కాలరాస్తున్న ఈ కోచింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలబాలికలకు రోజుకు 10 గంటలకు పైగా శిక్షణనిస్తున్నారని తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఘటనపై కోచింగ్ కేంద్రం నిర్వాహకుడు వైకుంఠరావు మాట్లాడుతూ.. అనుకోకుండా గట్టిగా దెబ్బ తగిలిందని, అంతేతప్ప కావాలని పిల్లలను ఇబ్బంది పెట్టలేదన్నారు. సెల్ఫోన్ చోరీకి యత్నం టెక్కలి రూరల్: స్థానిక రెడ్క్రాస్ వీధి సమీపంలో శుక్రవారం ఒక ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని ఇద్దరు యువకులు వచ్చి ఒక్కసారిగా కింద పడిపోయినట్లు నటించారు. అక్కడే ఉన్న పండిత శ్రీను అనే వ్యక్తి వారిని పైకి లేపేందుకు ప్రయత్నిస్తుండగా ఆ ద్విచక్ర వాహనం వెనుకనున్న వ్యక్తి అతని షర్ట్జేబు నుంచి సెల్ఫోన్ చోరీకి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన శ్రీను వారి చేతి నుంచి సెల్ తీసుకున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై అక్కడ నుంచి పరారయ్యారు. ఇది గుర్తించి మరో వ్యక్తి వారిని వెంబడించాడు. స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ట్రాఫిక్లో వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ తరహాలో అనేకసార్లు చోరీలు జరగడంతో ఆ చోరీలతో ఈ యువకులకు సంబంధంపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
‘మత్తు’ను చిత్తు చేద్దాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, వర్కర్లు, ఆటో డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్లు తెలిసిందని, డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు కౌన్సిలింగ్, పునరావాసం కల్పించాలన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మెడికల్ షాపులన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈగల్ టీంలు మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక నిఘా పెట్టాయని చెప్పారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 112, 1972 నంబర్లకు తెలియజేయాలని కోరారు. రిమ్స్లోని డీ–అడిక్షన్ సెంటర్ను అందుబాటులో ఉంచుతామన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. -
విమానాశ్రయంలో బ్యాగ్ కలకలం
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలు మరిచిపోయిన బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. విమానయాన ప్రయాణికులతో పాటు అధికారులు, భద్రతా దళాలను సైతం పరుగులు తీయించింది. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో స్థానిక విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంతలో విమానాశ్రయం ప్రాంగణంలో అనుమానాస్పద బ్యాగ్ ప్రయాణికుల దృష్టికి వచ్చింది. వెంటనే భద్రతా అనుబంధ వర్గాల దృష్టికి చేరింది. లగేజీ ట్రాలీలో బ్యాగ్ ఉన్నట్లు గుర్తించి నిఘా జాగిలం (స్నిఫర్ డాగ్), బాంబ్ స్క్వాడ్ బృందాల్ని రంగంలోకి దించారు. అనంతరం పోలీసులు అనుమానాస్పద బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేయగా బ్యాగు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వచ్చిన మహిళా ప్రయాణికురాలిదిగా తేలింది. ఆమె విమానాశ్రయానికి తిరిగి వచ్చి తన సామాను కోసం వెతకడంతో గందరగోళం వీడింది. అందులో కొన్ని డైపర్లు, మొబైల్ ఛార్జర్ ఉన్నాయి. అనంతరం బ్యాగ్ను మహిళకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు వితరణ
కొరాపుట్: దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల వితరణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోనిలో మండయ్ మైదానం పక్కనే ఉన్న డాల్ఫిన్ రిసార్టులో నబరంగ్పూర్ ఎంఎల్ఏ గౌరీ శంకర్ మజ్జి రిబ్బన్ కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. ప్రమాదాలలో కాలు, చేతులు కోల్పోయిన వారికి వీటిని అమరుస్తున్నారు. రాజస్ధాన్ నుంచి వచ్చిన వైద్య నిపుణులు దివ్యాంగులు కోల్పోయిన అవయవాల నమూనా ప్రకారం వాటిని అమరుస్తున్నారు. ఈ అవయవాల ఖర్చు ప్రభుత్వం భరిస్తుండగా, కార్యక్రమ నిర్వహణ, దివ్యాంగుల రవాణా, భోజనాలు, వసతిని మార్వాడి యువ మంచ్ ఉచితంగా ఏర్పాటు చేసింది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలి రోజు 83 మందికి అవయవాలు అమర్చారు. ముందస్తు సమాచారం లేకుండా ఎవరైనా ఈ మూడు రోజులలో శిబిరం వద్దకు వస్తే వారికి కూడా అవయవాలు అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. -
గురండి ఆదర్శ రైతుకు కిసాన్ అవార్డు ప్రదానం
పర్లాకిమిడి: కేంద్ర ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధన సంస్థ (కాఫ్రీ) ఝాన్సీ (ఉత్తర్ ప్రదేశ్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గజపతి జిల్లా గురండి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సంజయ్ జెన్నాకు కృషి వంశికి కిసాన్ అవార్డు–2024’ ఢిల్లీలో డైరెక్టర్ డాక్టర్ అరుణాచలం (కాఫ్రీ) గురువారం అందజేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) అనుబంధ సంస్థగా ఉన్న కేంద్ర ఆగ్రో ఫారెస్ట్రీ పరిశోధన సంస్థ, ఆదర్శ జెన్నా తన స్వగ్రామం గురండిలో కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలో రసాయన ఎరువులు ఉపయోగించకుండా పంటలు పండించారు. అటవీ మొక్కలు, పశువులు, చేపల పెంపకం, వనాలు పెంచుతూ బయా డెవర్సిటీ డెవలప్మెంట్కు కృషి చేస్తున్నందుకు ఆయనకు ఈ కిసాన్ అవార్డును కేంద్ర ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధన సంస్థ అందజేశారు. మాజీ సైనికుడు సంజయ్ జెన్నా గురండిలో రఘురాం పేరిట ఆగ్రోఫార్మ్ను కూడా ఏర్పాటు చేసి అటవీ అధికారులు, వ్యవశాయ అధికారులను ఆకర్షించడంతో వారు ఆయన పేరును కేంద్ర ఐకార్కు సిఽఫార్సు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ డాక్టర్ గురుబచన్ సింగ్, ఐకార్ అదనపు డైరెక్టర్ జనరల్ ఎ.వేల్మురుగన్, మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.పి.చదుర్వేది, మాజీ డైరక్టర్ డాక్టర్ ఎస్.కె.ధ్యానీ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ: జిల్లాలో ఒక మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కల్యాణ సింగుపూర్ నుంచి వస్తున్న దీపక్, బి.సొయిలు రివాల్ కొన గ్రామానికి సమీపంలోని ఉన్న మలుపు వద్ద ఎదురుగా మరో బైకుపై వస్తున్న గొవింద హుయికలు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీపక్ కుమార్ మహారాణ(23), కొలనార సమితి కొలటిగుడకు చెందిన గోవింద హుయిక (20)లు చనిపోయాగా.. మండుపాల బిసాయికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సమస్యలతో దేశం కొట్టుమిట్టాడుతోంది
జయపురం: భారత్ ప్రస్తుతం విపత్కర సమస్యలతో కొట్టు మిట్టాడుతోందని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి తిరుమల్లయ్ రమణ(తమిళనాడు) అన్నారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఒడిశా యూనిట్ 13వ రాష్ట్ర సమావేశం బుధ, గురువారం కొరాపుట్ పట్టణం టౌన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కొరాపుట్ జిల్లా ఆదివాసీ సంస్కృతులు ఉట్టిపడేలా అఖిల భారత యువజన సంఘం ర్యాలీ నిర్వహించారు. పలు ఆదివాసీ కళాకారులు తమ సాంప్రదాయ నృత్యాలతో అతిథులను ఆహ్వానించారు. అనంతరం టౌన్ హాలులో ఏర్పాటు చేసిన సాహిద్ లక్ష్మణ నాయిక్ వేదికపై జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన పర్యాటకులకు ప్రగాడ సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించారు. సమావేశంలో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ శెట్టి, కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి, యువజన నేత కుమార్జాని తదితరులు పాల్గొన్నారు. -
‘హీరాకుడ్’ పర్యాటకులకు ఆంక్షలు
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా సంబలపూర్ హిరాకుడ్ ఆనకట్ట వద్ద భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచి చర్యలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆనకట్ట ప్రాంగణంలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు కీలకమైన ప్రవేశ కేంద్రాల వద్ద నోటీసులు జారీ చేశారు. ఉత్తర్వుల అమలుకు ఆయా కేంద్రాల్లో పోలీసు సిబ్బందిని మోహరించారు. సంబలపూర్ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర కేంద్ర భద్రతా సంస్థల సమన్వయంతో ఉన్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్ను ప్రారంభించింది. విపత్కర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందన కోసం లైట్ మెషిన్ గన్ (ఎల్ఎంజీలు) సహా ఆధునిక సాయుధ దళాలను మోహరించారు. ఆసియాలోనే అతి పొడవైన మట్టి ఆనకట్ట, భారీ నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి , వరద నియంత్రణకు కీలకమైన నీటి నిల్వ అయిన హిరాకుడ్ ఆనకట్టపై ఆగంతకుల దృష్టి కేంద్రీకృతమై ఉండే అవకాశం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సందర్శకులను పరిమితం చేస్తున్నారు. -
రక్తపు మడుగులో మృతదేహం
భువనేశ్వర్: పొదల చాటున రక్తం మడుగుల్లో ఓ యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన బారంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం పూరీ కాలువ రోడ్డు పరిసరాల్లో కాలిపోతున్న వాహనాన్ని స్థానికులు గమనించి, గొడి సాహి పోలీస్ అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు మృతదేహం దగ్గర ఒక కర్ర చెక్క పడి ఉండటాన్ని గుర్తించారు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు యువకుడిని కర్ర చెక్కతో కొట్టి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. అనంతరం అతని వాహనాన్ని తగలబెట్టి, మృతదేహం పొదల్లో పడేసి పరారీ అయినట్లు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మంచాగాం గ్రామ సర్పంచ్ మృతి ● కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి మంచాగాం పంచాయతీ గ్రామ సర్పంచ్ సదాశివ శాంత (45) అనారోగ్యంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నబరంగ్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హుటాహుటీన ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహం తరలింపు, అంత్యక్రియల ఏర్పాట్లకు సహకరించారు. ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు కొరాపుట్: బైకులను చోరీ చేస్తున్న దొంగను నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్డీపీవో కార్యాలయం వద్ద ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని పపడాహండి సమితి దిసారి గుడ గ్రామానికి చెందిన లబో భోత్ర వాహనాలను చోరీ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో అతని ఇంటిపై నిఘా వేయగా హీరో హోండా ప్యాషన్ ప్లస్, హీరో హోండా స్పెండర్ప్లస్ బైకులు పట్టుబడ్డాయన్నారు. దీంతో అతన్ని విచారించగా తానే దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. ఘనంగా త్రివర్ణ పతాక యాత్ర భువనేశ్వర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు భవనేశ్వర్ నగరంలో జై హింద్ను యాత్ర శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో స్థానిక రామ్ మందిర్ కూడలి నుంచి మాస్టర్ కాటిన్ చౌరస్తా వరకు యాత్ర సాగింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి పరాక్రమం, అపరిమిత ధైర్యం, అపారమైన శక్తిని ప్రదర్శించిన భారత సైనికుల గౌరవార్థం త్రివర్ణ పతాక యాత్రను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళానికి కార్యకర్తలు గౌరవ వందనం సమర్పించారు. యాత్ర పురస్కరించుకుని జై హింద్, జై జవాన్ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. ఈ యాత్ర లో దేశ భక్తి సంగీతాన్ని ఆలాపించారు. -
పర్లాకిమిడిలో భానుడి భగభగలు
పర్లాకిమిడి: జిల్లాలో ఐదు రోజులుగా భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ వేడిమి అధికంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో డీహైడ్రేషన్కు గురవుతున్నారు. మరో ఐదు రోజుల పాటు వడగాలులు వీస్తాయని ఐఎండీ. అధికారులు చెబుతున్నారు. రక్తదానం.. ప్రాణదానం జయపురం: ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా జయపురం సబ్ డివిజన్ కుంద్ర సమితి అసనలో గల ప్రాథమిక వైద్య కేంద్రంలో శుక్రవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. కొరాపుట్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్, సంబాదొ అమొ ఒడిశా సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో 33 యూనిట్ల రక్తం సేకరించారు. జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్ రక్త బండార్ టెక్నీషియన్లు దాతల నుండి రక్తాన్ని సేకరించారు. కొరాపుట్ జిల్లా రక్త దాతల ఫోరం అధ్యక్షుడు సంజీవ కుమార్, అసోసియేషన్ కోశాధికారి సహేదా పరవాన్, తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణదాస్ మహాపాత్రోకు మరో నోటీసు భువనేశ్వర్ : పశ్చిమ బెంగాల్ దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వివాదానికి సంబంధించి దైతపతి సేవకుడు రామకృష్ణ దాస్ మహాపాత్రోకు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద్కుమార్ పాఽఢి మరో నోటీసు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించారు. దిఘాలోని జగన్నాథ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ‘జగన్నాథ్ ధామ్– దిఘా‘ అనే పేరును ఉపయోగించారని, దీనికి సంబంధించిన సైన్ బోర్డును ప్రదర్శించారని నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి మాతృ దినోత్సవం రద్దు భువనేశ్వర్: దేశంలోని ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11న జరగాల్సిన రాష్ట్ర స్థాయి మాతృ దినోత్సవాన్ని రద్దు చేసినట్లు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపిక చేయబడిన ఉత్తమ, అత్యంత హత్తుకునే సెల్ఫీలు, సందేశాల విజేతలకు త్వరలో జరగనున్న సుభద్ర కార్యక్రమం వేదికపై బహుమతులు అందజేయబడతాయని ఆ విభాగం స్పష్టం చేసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
మల్కన్గిరి: ఆంధ్ర –ఒడిశా సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావో అగ్రనేతలు అరుణ, ఉదయ్ తప్పించుకున్నారు. అల్లూరి జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషన్ పరిధిలోని దూముకొండ అడవిలో మావోల స్థావరం ఉందని పోలీసులు, గ్రేహౌండ్స్సిబ్బంది అడవిని జల్లెడ పడుతున్నారు. బుధవారం సరిహద్దు ప్రాంతంలో జవాన్లకు మావోలు తారసపడడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మరిగేట్ట గ్రామానికి చెందిన వాగా పడియామి అలియాస్ అలియాస్ రమేష్ నాగ్ మృతిచెందాడు. ఇతడిపై ఆంధ్రా, ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు మల్కన్గిరి: రాజస్థాన్కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను మల్కన్గిరి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మల్కన్గిరి జిల్లా కేంద్రం దుర్గాగుడి వీధికి చెందిన ఆఓక్ కుమార్ త్రిపాఠి ఐడీ కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు ఇతర కార్డులను రాజస్థాన్కు చెందిన ముగ్గురు యువకులు ఫేక్వి తయారు చేశారు. ఆశోక్ ఖాతా నుంచి 2024 అక్టోబర్ నుంచి డబ్బులు తీసేశారు. ఈ విషయాన్ని మల్కన్గిరి పోలీసులకు అశోక్ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. చివరికి ఈ ముగ్గురు నిందితులు ముకేష్ కుమార్ (22), సురేంద్రమ్ (20), నరేష్ (21) సైబర్ నేరగాళ్లు.. ముఖేష్ కుమార్ ఖాతాలో రూ.4,50,000 జమ చేసుకున్నారు. మందన్ ఖాతాలో రూ.2లక్షలు జమ చేశారు. ఈ మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ముంబైలో ఈ నెల 5న అరెస్టు చేశారు. గురువారం మల్కన్గిరి తీసుకువచ్చారు. ప్రత్యేక బృందం పోలీసులు పూర్తి విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు. ఒకే దేశం, ఒకే ఎన్నికతో ఎన్నో లాభాలు జయపురం: ఒకే దేశం, ఒకే ఎన్నికలకు కేంద్ర ప్రతిపాదనవలన దేశానికి ఎన్నో లాభాలు ఉన్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.గురువారం స్థానిక హోటల్లో భారతీయ జనతా పార్టీ ఒక దేశం, ఒకే పార్టీ అంశంపై కార్యక్రమం నిర్వహించింది. కొరాపుట్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సుమంత ప్రధాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే ఎన్నిక అమలు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్ సభకు, దేశంలో అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం, ఖర్చు తగ్గుతుందన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిపితే అధికార యంత్రాంగ సమయం, ఆర్థిక వ్యయం జరుగుతుందన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యదర్శి సౌమేంద్ర జెన, రాష్ట్ర బీజేపీ ప్రవక్త రాజేష్ పట్నాయక్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ్ సామంతరాయ్, ఇంజినీర్ కేధార్ నాఽథ్ బెహరా, పొట్టంగి విధాన సభ బీజేపీ నేత నందబలి చైతన్య, తదితరులు పాల్గొన్నారు. -
మానవతా విలువలు అవసరం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీలో అధ్యాపకుల అభివృద్ధికి విశ్వ మానవతా విలువలు (యు.హెచ్.వీ) కార్యక్రమాన్ని క్యాంపస్లో వైస్ చాన్సలర్ సుప్రియా పట్నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, డీన్ (అగ్రికల్చర్ కళాశాల) డాక్టర్ సత్యప్రకాష్ నందా హాజరయ్యారు. గురువారం ఉదయం యోగా క్లాసులతో ప్రారంభమైంది. యోగావల్ల అధ్యాపకులు, పరిశోధకులకు భౌతికంగా, మానసికంగా ఎక్కువ శక్తి కలుగుతుందని అధికారులన్నారు. సుమారు 118 మంది పాల్గొన్న ఈ ఫ్యాకల్టీ, పరిశోధకుల కార్యక్రమంలో విశ్వ విద్యాలయం కో ఆర్డినేటరు డాక్టర్ ప్రదీప్ కుమార్ సాహు, డాక్టర్ బాలాజీ పాడీ, ద్వితీసుందర్ రౌత్, ఏ.ఐ.సి.టి.ఈ ప్రాంతీయ కోఆర్డినేటరు డాక్టర్ దిలీప్ దేవానాథ్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్తో పాటు ఇథికల్, విశ్లేషణ, అధ్యాపకుల టీచింగ్లో మానవతా విలువలు గురించి ఏ.ఐ.సి.టి.ఈ అధికారులు తెలియజేస్తారు. -
యువగళం హామీలు ఏమయ్యాయి?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పేరిట విద్యార్థుల కోసం అనేక అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోర గోపి మండిపడ్డారు. ఏడాది కావస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్పై స్పందించకపోవడం దారుణమన్నారు. యువగళం హామీలు ఏమయ్యాయంటూ జిల్లా కేంద్రంలోని సూర్యమహాల్ కూడలిలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదని, ఫేక్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. విద్యా సంసవత్సం బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్రకార్యవర్గ సభ్యులు మదన్, శ్రీకాకుళం మండల కన్వీనర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారి కిడ్నాప్ గుట్టురట్టు
జయపురం: జయపురం వ్యాపారి డీసీ రాజు కిడ్నాప్ చిక్కుముడిని పోలీసులు విప్పారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కశ్యప్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. అరెస్టయిన నిందితులు బొరిగుమ్మ సమితి బిసింగపూర్ పోలీసు స్టేషన్ పరిధి రంపుడిపొదర గ్రామం కమర దిశారి(25), కమరాగుడ గ్రామం కమళ లోచన హరిజన్ ఉరప్ దుబులు(25), జయపురం సదర్ పోలీసు స్టేషన్ ఉమ్మరి పంచాయితీ మొకాపుట్ సురేంధ్ర ఖోశ్ల(25), సనముజురుముండ గ్రామం దేవేంధ్ర నాగ్(26), ఉమ్మిరీ గ్రామం ప్రతాప్ బెహర(26), ఉమ్మిరి గ్రామం కరణ నాయి(20) లు అని వెల్లడించారు. వారి నుంచి ఒక నాటు తుపాకీ మూడు పేల్చని మూడు తూటాలు, బంగారం, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన కేసు వివరాలు వెల్లడిస్తూ గత మార్చి నెల 21న వ్యాపారి రాజును కిడ్నాప్ చేశారని ఆ మేరకు అతని కుమారుడు ఎ.పవన్ కుమార్(31) ఫిర్యాదు చేశారని వెల్లడించారు. వెంటనే తాము దర్యాప్తు ప్రారంభించామని, దుండగులు డీసీ రాజుని నాలుగు చక్రాల వాహనంలో ఘాట్గుడ నుంచి బిసింగపూర్ రామపుడి పొదర్ వద్ద పర్వత శిఖరంపైకి తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ రాజు వద్ద నుంచి నగదు, బంగారం, మొబైల్ లాక్కున్నారని, బాధితుడిని మరో ప్రాంతానికి తీసుకుపోవాలనుకున్న సమయంలో అతడు తప్పించుకున్నారని తెలిపారు. పోలీసులు ఆ ప్రాంత ప్రజలను విచారించగా వివరాలు తెలిశాయన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితునితో పాటు కొంత మంది పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. -
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం
జయపురం: మున్సిపాలిటీ పరిధిలో రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం గురువారం నిర్వహించారు. మున్సిలప్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి హాజరయ్యారు. ఆహార సురక్షా పథకంలో ప్రతి వార్డు నుంచి ఒక్కొక్క లబ్ధిదారుని ఎంపిక చేసి వారికి కార్డులు అందజేశారు. పట్టణంలో ఎన్నో కుటుంబాల వారిని ఎంపిక చేసినా కేవలం కొద్ది మందికే పిలవటం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులందరినీ పిలువకుండా కేవలం వార్డుకు ఒక్కరినే ఎందుకు పిలిచారని మార్కిటింగ్ ఇన్స్పెక్టర్ను నిలదీశారు. వెంటనే కొత్త లబ్ధిదారులను రప్పించి కార్డులు అందజేయాలని ఆదేశించారు. అర్హలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. జయపురం సబ్కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సాహు, కౌన్సిలర్లు జస్పాల్ సింగ్, సింహాచల బిశాయి, మధుశ్మిత ఒరాన్, ఉషారాణి దండసేన, మమతా బిశ్వాల్, శాంతి నాయక్, దనిమా హరిజన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో విపత్తు నిరోధక రోడ్ల నిర్మాణం
భువనేశ్వర్: వరదలు, తుఫాన్లకు గురయ్యే ప్రాంతాలలో 500 కిలోమీటర్ల పొడవునా విపత్తు నిరోధక రహదారులను నిర్మించడానికి రాష్ట్ర మంత్రి వర్గం రూ.1,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాల నవీకరణలకు రూ. 426 కోట్ల వ్యయ ప్రణాళికను ఆమోదించింది. ముఖ్య మంత్రి సడక్ యోజన కింద ఈ ప్రాజెక్ట్ని 2025 – 2030 పంచ వర్ష ప్రణాళికగా పరిగణించారు. విపత్తు వంటి అత్యవసర పరిస్థితుల్లో నిరంతర రాకపోకల అనుసంధానం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పేర్కొన్నారు. వరద స్థాయిల కంటే ఎత్తుగా బలోపేతమైన రక్షణ గోడలతో పటిష్టమైన నీటి ప్రవాహ వ్యవస్థతో కోతకు గురవుతున్న ప్రాంతాల్లో విపత్తు నిరోధక రహదారులను నిర్మిస్తారు. కొండ చరియలు జారిపడే వాలు ప్రాంతాల్లో ఈ తరహా రహదారుల నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకుంది. 142 నియోజకవర్గాల్లో గ్రామీణ రోడ్ల అభివృద్ధి రానున్న మూడేళ్లలో 142 అసెంబ్లీ నియోజక వర్గాలలో గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ. 426 కోట్ల వ్యయ ప్రణాళికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లకు రహదారి అనుసంధానం మెరుగుపరచడం ఈ ప్రతిపాదన లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం 5 విభాగాల 8 ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. మంత్రి మండలి ఆమోదం పొందిన ప్రతిపాదనలు ● బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం అమలు. ● ప్రజారోగ్య సౌకర్యాలలో అనుబంధ సేవలను బలోపేతం చేసేందుకు నిర్మల్ 2వ దశను 5 సంవత్సరాల పాటు కొనసాగింపు. ● 5 సంవత్సరాల పొడిగింపుతో నిదాన్ 2వ దశ కింద ఉచిత రోగ నిర్ధారణ, డయాలసిస్ సేవలు. ● నియోజకవర్గాల వారీగా కేటాయింపు (సీడబ్ల్యూఏ) కొత్త పథకం అమలు. ● కొత్త పథకం ‘ముఖ్య మంత్రి సడక్ యోజన – విపత్తు తట్టుకునే రోడ్లు‘ అమలు. ● ఓసీఎస్ (ఫించను) నియమాలు, 1992 లో సవరణ. ● ఒడిశా వెటర్నరీ టెక్నికల్ సర్వీస్ (నియామక, సేవా నిబంధనలు) నియమాలు, 2024 అమలు. ● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి బస్ సేవ (ఎంబీఎస్) అమలు ప్రతిపాదనకు ఆమోదించింది. ఈ ఆమోదంతో ఎంబీఎస్ కింద నడిచే ఏసీ, నాన్–ఏసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, హిజ్రాలు, విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ లభిస్తుంది. రూ. 1,500 కోట్లు వ్యయ ప్రణాళిక మంత్రి మండలి ఆమోదం -
యోగాతో మానసిక ఉల్లాసం
యోగా పోటీలకు హాజరైన విద్యార్థులు జయపురం: జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం జయపురం బ్లాక్ స్థాయి యోగా ఒలింపియాడ్ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం ప్రకాశ్ చంద్ర పట్నాయక్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జయపురం బ్లాక్ విద్యాధికారి చందన నాయక్, గౌరవ అతిథిగా బ్లాక్ సహాయ విద్యాధికారి ప్రియంబద పాత్రో హాజరయ్యారు. యోగా ప్రాధాన్యత, యోగా వలన శారీరక, మానసిక వికాశానికి కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. క్రీడా ఉపాధ్యాయులు ప్రశన్న పాణిగ్రహి, శుబేందు ప్రధాన్, పి.రాజేశ్వరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహించారు. జూనియర్ల పోటీలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి శుబ్రతా సాహు, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాల విద్యార్థి మాన్యతా పాత్రో విజేతలుగా నిలిచారు. సీనియర్ల గ్రూప్ పోటీల్లో రొండాపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి వికాశ బారిక్, జయపురం మున్సిపాలిటీ బాలికోన్నత పాఠశాల విద్యార్థి ఆరతి గౌడలు విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలలో న్యాయ నిర్ణేతలుగా క్రీడా ఉపాధ్యాయురాలు రీటా సామంతరాయ్, తాపస కుమార్ మహంతి, క్రీడా ఉపాద్యాయులు శుబేందు కుమార్ ప్రధాన్ వ్యవహించారు. -
ఉపాధి వేతనదారు మృతి
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు అనపాన పార్వతి(45) గురువారం మృతిచెందింది. గ్రామ సమీపంలో ఉపాధి పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగా మృతిచెందింది. వడదెబ్బ తగలడం వల్లే మృతిచెంది ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పార్వతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ గ్రామం వద్ద అలికాం–బత్తిలి రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్లెమ్మ గ్రామానికి చెందిన బొడ్డు నానాజి, తన భార్యతో కలిసి భామిని నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా బైక్పై వస్తున్న యువకుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులు, యువకుడు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్సీలో చేర్పించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ బి.గోవిందరావు తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్గా తాతయ్య శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చైర్మన్గా కుజ్జ తాతయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈడీ డాక్టర్ బి.యోగేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థకశాఖ కార్యాలయంలో ఎన్నికల అధికారి డాక్టర్ పి.రామ్మోహన్రావు ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ ఎన్నికలో సంఘం ఉపాధ్యక్షులుగా పల్ల నరహరితో పాటు 11మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేడీ బి.రాజ్గోపాల్, పర్సన్ ఇన్చార్జి డాక్టర్ టి.పి.మనోజ్కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, సంఘంలో 123 మంది ఓటర్లు ఉన్నప్పటికీ నామమాత్రంగా హాజరై ఎన్నిక మమా అనిపించేశారు. మంత్రి సిఫార్సు చేసిన వారికే చైర్మన్, ఉపాధ్యక్ష పదవుల్ని కట్టబెట్టారని పలువురు సంఘ నాయకులు ఆరోపించడం గమనార్హం. ఆదిత్యుని సన్నిధిలో సినీ గాయకులు శ్రీకృష్ణ, యామిని అరసవల్లి: సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సినీ గాయకులు శ్రీకృష్ణ, యామినిలు గురువారం దర్శించుకున్నారు. తొలిసారిగా ఆదిత్యున్ని దర్శించుకోవడం నిజంగా తమ అదృష్టమని వారు తెలియజేశారు. వీరికి ఆలయ అధికార వర్గాలు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించిన తాత్కాలిక సీనియారిటీ జాబితా డీఈఓ అధికారిక వెబ్సైట్లో సిద్ధంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయ పనివేళల్లో తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక సీనియారిటీ జాబితాపై ఆర్జేడీ కార్యాలయంలో అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈఓ పేర్కొన్నారు. -
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
జయపురం: చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ను రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. గురువారం నిర్వహించిన జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.8.40 కోట్ల వ్యయంతో సాగర్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిరంతరం పనిచేసి నిర్ధారిత 6 నెలల సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సాగర్లోని 147 ఎకరాల్లో బురద తొలగించేందుకు అనుమతి లభించిందని కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్య రెడ్డి వెల్లడించారు. గతంలో 47 ఎకరాల్లో బురద, మట్టి తొలగించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ వి.కార్తీక వాసన్ మాట్లాడుతూ.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కంట్రాక్ట్ సంస్థకు ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, కౌన్సిలర్లు విష్ణు వర్ధన రెడ్డి, రవీంద్ర కుమార్ సాహు, మున్సిపాలిటీ ఇంజినీర్ అజయ కుమార్ జాని, ప్రతాప్ చంద్ర ఆచార్య తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి -
ఒంటరి పెద్దలకు సహాయం
భువనేశ్వర్: వయో వృద్ధులకు సకాలంలో సహాయం అందజేసేందుకు పూరీ పోలీసులు ముందుకు వచ్చారు. ప్రధానంగా వేరే పెద్ద దిక్కు లేకుండా ఒంటరిగా ఇండ్లలో ఉంటున్న వయో వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో స్థానిక వయో వృద్ధులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. వారి సమస్యల్ని పరిశీలించి నిరంతరం సత్వర సహాయం అందుబాటులో ఉంటుందని అభయం ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు ఏవైనా సమస్యలను నివేదించడానికి లేదా సహాయం కోరడానికి ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 6370972100 పని చేస్తుందన్నారు. -
పికప్ వ్యాన్ బోల్తా
● పది మందికి గాయాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మంజూరికుఫా వద్ద గురువారం ఒక పికప్ వ్యాన్ బోల్తా పడింది. ఘటనలో పది మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలకు గురైన మరి కొంతమందికి సమీపంలో గల భవాణీపట్నంకు తరలించారు. ప్రమాదానికి కారణమైన పికప్ వ్యాన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... వీధివీధుల్లో తిరిగి గాజులు,పూసలు వంటి చిరువ్యాపారాలు చేసుకునే 20 మంది గురువారం ఉదయం అంబొదల నుంచి మునిగుడ వరకు వెళ్లేందుకు అటువైపుగా వస్తున్న పికప్ వ్యాన్ ఎక్కారు. మంజూరికుఫా ప్రాంతానికి వ్యాన్ వచ్చే సరికి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికుల్లో 10 మంది గాయాలకు గురయ్యారు. వీరంతా ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన బలరాంపూర్ జిల్లా రాజ్పూర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
కొత్త రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఏర్పాటు
విపత్తు నిరోధక రోడ్లు రాష్ట్రంలో విపత్తు నిరోధక రోడ్లు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రకటించారు. –10లోuవ్యాపారి కిడ్నాప్ గుట్టురట్టు జయపురంలో వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకున్నారు. భువనేశ్వర్: ప్రయాణికుల సౌకర్యానికి భువనేశ్వర్ న్యూ రైల్వే స్టేషన్లో కొత్త రిజర్వేషన్ రిజర్వేషన్ కేంద్రం (పీఆర్ఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభం అవుతుందని ఖుర్దారోడ్ రైల్వే మండలం ప్రకటించింది. ఈ కేంద్రం సోమవారం నుంచి శనివారం వరకు 6 పని దినాలలో నిత్యం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరవధికంగా పని చేస్తుంది. దీనితో ఉత్తర భువనేశ్వర్, అఠొగొడొ, కటక్ ప్రాంతాల ప్రయాణికులకు ఈ రిజర్వేషన్ కేంద్రం లబ్ధి చేకూర్చుతుంది. ప్రస్తుతం 11 జతల ప్రయాణికుల రైళ్లు భువనేశ్వర్ న్యూ స్టేషన్లో ఆగుతున్నాయి. ఈ నెల 12 నుంచి మరో మూడు జతల ఎక్స్ప్రెస్ రైళ్లు భువనేశ్వర్, సీఎస్ఎంటీ ముంబై మధ్య నడుస్తున్న 11020/11019 కోణార్క్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య రాకపోకలు చేస్తున్న 17015/17016 విశాఖ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్, విశాఖపట్నం మధ్య రవాణా అవుతున్న 22819/22820 ఇంటర్ సిటీ సూపర్ ఫాస్టు ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రస్తుత భువనేశ్వర్ ప్రధాన స్టేషన్కు బదులుగా భువనేశ్వర్ న్యూ స్టేషన్లో ప్రారంభమై ముగుస్తాయి. పీఆర్ఎస్ మూసివేత భువనేశ్వర్ న్యూ స్టేషన్ ప్రాంగణంలో కొత్త పీఆర్ఎస్ ప్రారంభంతో బారంగ్ రైల్వే స్టేషనులో పని చేస్తున్న ప్యాసింజర్ రిజర్వేషన్ టికెట్ కౌంటర్ మూసి వేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రోల 10వ తేదీ నుంచి ఈ కేంద్రం మూసివేస్తారు. -
ఈకోర్సా ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్
భువనేశ్వర్: భారత సాంకేతిక సంస్థ (ఐఐటీ) భువనేశ్వర్ సహకారంతో తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం (ఈకోర్సా) ఖుర్దారోడ్ శాఖ ఖుర్దారోడ్ హాఫ్ మారథాన్ భువనేశ్వర్ 2025 నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం జూన్ 1, 2025 ఆదివారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐఐటీ భువనేశ్వర్ నుంచి యూ టర్న్తో రైల్వే స్టేడియం వద్ద ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వర్గాలు 15 నాటికి వివరాలు నమోదు చేసుకోవాలని ఈకోర్సా ఉపాధ్యక్షుడు పీకే బెహరా తెలిపారు. ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి (డీఆర్ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హాఫ్ మారథాన్ సంబంధిత వివరాల్ని వెల్లడించారు. పుష్కలమైన ఆరోగ్యం, సామాజిక బంధం ప్రోత్సహించే దిశలో అన్ని వర్గాల ఔత్సాహికులకు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తున్నారు. నాలుగు వర్గాల కింద మారథాన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ వర్గాల్లో విజేతలకు నగదు బహుమతులు ప్రకటించారు. 21.1 కిలో మీటర్ల హాఫ్ మారథాన్లో పురుష – సీ్త్ర విభాగాలకు వయస్సు ఆధారంగా వరుసగా రూ. 12000, రూ. 9000, రూ. 6000 నగదు బహుమతులు, 10 కిలో మీటర్ల పరుగు విభాగంలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు రూ. 10,000, 7000, రూ.5000 నగదు బహుమతులు అందజేస్తారు. -
పర్లాకిమిడిలో రథయాత్రకు సన్నాహాలు
పర్లాకిమిడి: వచ్చే నెలలో జరగనున్న శ్రీజగన్నాథ రథయాత్రకు స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో ముందస్తు సమావేశం, సమీక్ష కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి అతిథిగా మోహనా ఎమ్మెల్యే దావరథి గోమాంగో, సబ్ కలెక్టర్ అనుప్ పండా, సబ్డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, తహసీల్దారు నారాయణ బెహరా, సీనియర్ సిటిజన్ పూర్ణచంద్ర మహాపాత్రో, రథయాత్ర కమిటీ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. గత రథయాత్ర పర్లాకిమిడిలో శాంతియుతంగా జరుపుకున్నామని, అప్పటి జమాఖర్చులు సబ్కలెక్టర్ అనుప్ పండా సభకు వివరించారు. ఈ ఏడాది రథయాత్రకు రథాల నిర్మాణం, కలప ఆవశ్యకత ఉందని రథయాత్ర కమిటీ కలెక్టర్ దాస్కు వివరించారు. రథయాత్ర జరుగు గుండిచా మందిరం వద్ద మీనాబజార్, జెయింట్ వీల్స్కు టెండర్లు పిలవడం, అలాగే రథయాత్ర ప్రసాద కమిటీకి కూడా టెండర్లు పిలవాలని కలెక్టర్ ఆదేశించారు. రథయాత్రలో పారిశుద్ధ్య వ్యవస్థ, తాగునీరు, ప్రజలకు పోలీసు భధ్రత, అంబులెన్సు, అగ్నిమాపకదళం వంటివి ఏర్పాటు చేయాలని ఆయా శాఖలకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే రథయాత్ర కమిటీలో కొన్ని మార్పులు చేశారు. రథయాత్రలో ట్రాఫిక్ వేరే వైపు మళ్లింపు, శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసు అధికారులను ఆదేశించారు. -
విమాన సేవలు రద్దు
భువనేశ్వర్: జాతీయ భద్రతా వైమానిక సరిహద్దుల కారణంగా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలు ప్రభావితం అయ్యాయి. గురువారం ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన 2 విమాన సేవలు రద్దు చేశారు. ప్రభావితమైన 2 విమానాల్లో హిండన్ (ఘజియాబాద్)కు వెళ్లే విమానం, పాట్నా నుంచి భువనేశ్వర్ మీదుగా చండీగఢ్కు వెళ్లే విమానం ఉందని డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. భువనేశ్వర్ నుంచి ఘజియాబాద్ హిండన్కు వెళ్లే విమానం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రద్దు చేయబడింది. సాంకేతిక లోపాల కారణంగా పాట్నాకు వెళ్లే మరో విమానాన్ని తాత్కాలికంగా వరుసగా రెండో రోజు రద్దు చేశారని వివరించారు. ఇతర విమానాలు మరియు కార్యకలాపాలు సాధారణంగా పనిచేస్తున్నాయి. భయపడాల్సిన అవసరం లేదని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు నడిపేందుకు అనుమతివ్వండి రాయగడ: పగటిపూట ఇసుక ట్రాక్టర్లను నడిపేందుకు అనుమతినివ్వాలని కోరుతూ స్థానిక మా మజ్జిగౌరి ట్రాక్టర్ యజమానుల సంఘం జిల్లా యంత్రాంగానికి కోరింది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్కు సంఘం సభ్యులు వినతిపత్రం గురువారం అందజేశారు. రాత్రి వేళల్లో ఇసుక ట్రాక్టర్లు, భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండడంతో ట్రాక్టర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఎదురుగా వచ్చే భారీ వాహనాల లైట్ల వలన ఒక్కోసారి చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పద్మనాభ దాస్ తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు రాయగడ: స్థానిక బాలాజీ నగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో వైశాఖ మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలతో పాటు శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ, ప్రసాదాలను స్వీకరించారు. అమిత్ షా ఒడిశా పర్యటన వాయిదా భువనేశ్వర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. బీజేపీ ఎమ్మెల్యే జయ నారాయణ మిశ్రా ఈ విషయం వెల్లడించారు. లోగడ ప్రకటించిన కార్యక్రమం ప్రకారం ఈ నెల 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. అబుదాబికి విమాన సేవలు భువనేశ్వర్: భువనేశ్వర్ నుంచి అబుదాబికి ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త గమ్యస్థాన విధానం (న్యూ డెస్టినేషన్ పాలసీ) కింద భారత ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ సౌకర్యం ఈ ఏడాది జూన్ నెల నుంచి ప్రారంభం కానుందని ప్రకటించారు. వారానికి 3 రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మంగళ, గురు, శనివారాల్లో భువనేశ్వర్, అబుదాబి మధ్య విమానయాన సౌకర్యం ఉంటుంది. -
మిగులు కలప దుర్వినియోగం కాలేదు: మంత్రి
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ దిఘా జగన్నాథ ఆలయం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని తలెత్తిన ద్వంద్వ వైఖరి పరిస్థితి రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టి నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర న్యాయ శాఖ శ్రీ మందిరం అధికార వర్గానికి ఆదేశించింది. ఈ ప్రక్రియ ప్రాథమిక దశ ముగిసింది. మధ్యంతర నివేదిక న్యాయ శాఖకు చేరింది. నవ కళేబరం మిగులు కలప దుర్వినియోగం కాలేదని నివేదిక స్పష్టం చేసిందని మంత్రి వివరించారు. మధ్యంతర నివేదిక పూర్తి వివరాల్ని విభాగం మంత్రి మీడియాకు తెలియజేశారు. శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ, న్యాయ శాఖ ప్రముఖ కార్యదర్శి సంయుక్తంగా మధ్యంతర నివేదిక దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నివేదిక నిర్దిష్టమైన మార్గదర్శకాల్ని పేర్కొంది. ముఖ్యమంత్రి ఆమోదం మేరకు వీటి వాస్తవ కార్యాచరణ అమలు ఖరారు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పశ్చిమ బెంగాలు దిఘా ప్రాంతంలో ఆలయానికి జగన్నాథ్ ధామ్గా పేర్కొనడంపై సర్వత్రా విచారం వ్యక్తమైందని, ధామ్ పద ప్రయోగం ఆమోద యోగ్యం కాదని కేవలం చతుర్థామ క్షేత్రాలకు మాత్రమే పరిమితమని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తం అయిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని పశ్చిమ బెంగాలు సర్కారు విరమించుకోవాలని సంయుక్త నివేదిక సిఫారసు చేసింది. దిఘా ఆలయం నామకరణం, సముద్రానికి మహా దధి వ్యవహారంలో దిఘా పదం తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాలు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. సానుకూలంగా స్పందించకుంటే న్యాయపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రి స్పష్టం చేశారు. సేవకులకు క్రమశిక్షణ మార్గదర్శకాలు పూరీ శ్రీ మందిరంలో సేవాదుల్లో పాలుపంచుకుంటున్న సేవాయత్లు శ్రీ మందిరేతర దేవస్థానాల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంలో ప్రత్యేక మార్గదర్శకాలు తక్షణమే అమలు చేయాలి. ఈ చర్యతో సేవాయత్లో క్రమశిక్షణ తేటతెల్లమై పారదర్శకంగా వివాదరహిత ప్రవర్తనని పటిష్టపరుస్తుంది. ముక్తి మండపం పండిత్ సభ ఆధ్వర్యంలో నిర్దిష్టమైన కార్యాచరణ ఎస్ఓపీ రూపకల్పనకు నివేదిక సూచించింది. పూరీ శ్రీ జగన్నాథుని నవ కళేబరం మిగులు వేప చెక్కలు పశ్చిమ బెంగాలు దిఘా ఆలయంలో మూల విరాట్ల తయారీలో వినియోగించిన అంశం పొరపాటున ప్రసారం అయినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. మహరణ (వడ్రంగి) సేవకులతో సంప్రదించిన మేరకు ఈ విషయం స్పష్టం అయింది. వీరి వివరణ ప్రకారం నవ కళేబరం మిగులు వేప కలపతో 2.5 అడుగుల విగ్రహాల తయారీ ఎంత మాత్రం సాధ్యం కాదు. అలాగే పశ్చిమ బెంగాలు దిఘా ఆలయానికి అవసరమైన మూల విరాటుల్ని వేరొక వడ్రంగి ఆధ్వర్యంలో తయారు చేయించి తరలించారు. దీని తయారీలో పూరీ శ్రీ జగన్నాథునికి సంబంధించిన దారు ఏ మాత్రం వినియోగించడం జరగలేదని స్పష్టం చేశారు. దారు గృహంలో పదిలం పూరీ శ్రీ జగన్నాథుని మూల విరాటుల తయారీ తర్వాత మిగులు దారు (వేప కలప) భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కేటాయించిన దారు గృహంలో యథాతథంగా పదిలపరచాలని దర్యాప్తు బృందం ఉద్ఘాటించింది. సత్వ లిపి ప్రకారం స్వామి దారు విగ్రహాల మిగులు దారు (వేప కలప) సువార్ మహా సువార్ నియోగుల గృహానికి ఆనుకుని ఉన్న దారు గృహంలో పదిలపరచాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 1995– 96 సంవత్సరంలో చోటు చేసుకున్న పొరబాటు కారణంగా తాజా వివాదం తీవ్ర కలకలం రేపిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మిగులు కలపలో కొంత భాగం దైతపతి నియోగుల గృహంలో ఉంచేందుకు అనుమతించారు. దీని ఆధారంగా శ్రీ మందిరం మిగులు వేప కలప దుర్వినియోగం అయిందనే ఆరోపణ తీవ్ర దుమారం రేపింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా సత్వ లిపి ప్రకారం మిగులు వేప కలప దారు గృ హంలో యథాతథంగా పదిల పరచాలని దర్యాప్తు బృందం సిఫారసు చేసింది. ఐదుగురు సభ్యుల కమిటి పర్యవేక్షణలో మిగిలి ఉన్న వేప కలపని లెక్కించి ఒక చోట పోగు చేసి భద్రపరుస్తారు. ప్రస్తుతం దారు గృహంలో కొంత, దైతపతి గృహంలో కొంత మిగులు కలప ఉంది. ఈ రెండింటిని ఒక చోట కూడగట్టి కమిటి సభ్యుల సమక్షంలో లెక్కించి దారు గృహంలో భద్రపరచనున్నారు. నోరు జారి పొరపాటు దొర్లింది దిఘా ఆలయంలో మూల విరాటుల తయారీకి సంబంధించి నోరు జారి పొరపాటు దొర్లిందని వివాదాల్లో చిక్కుకున్న దైతపతి సేవాయత్ రామకృష్ణ దాస్మహాపాత్రొ వివరణ దాఖలు చేశారు. ఈ మేరకు లిఖితపూర్వంగా విచారణ బృందానికి విన్నవించారు. -
సరిహద్దు క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025కొరాపుట్ జిల్లాలో చీఫ్ సెక్రటరీ పర్యటన కొరాపుట్, జయపురం: ఆంధ్రా నుంచి ఒడిశాకు వస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ అసలు బండారాన్ని అధికారులు బయటపెట్టారు. కాలం చెల్లిన సరుకులు అమ్ముతున్న వైనాన్ని జనం ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జయపూర్ వస్తున్న హెరిటేజ్ పెరుగు, పాల ప్యాకెట్లే లక్ష్యంగా పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి వచ్చిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠి నేతృత్వంలో అధికారులు హెరిటేజ్ ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపులపై మెరుపు దాడులు చేశారు. ఎంజీ రోడ్డు, మెయిన్ రోడ్డు, సంగీత జంక్షన్ల వద్ద జరిపిన సోదాల్లో కాలం చెల్లిన పాడైన పెరుగు ప్యాకెట్లు పెద్ద ఎత్తున దొరికాయి. అంతా మా ఇష్టం వాస్తవానికి పాల ఉత్పత్తుల సంస్థల అవుట్ లెట్లలో విక్రయించే వారికి కొత్త ఉత్పత్తులు ఇచ్చేటప్పుడు కాలం చెల్లిన ఉత్పత్తులు తిరిగి తీసుకొని వెళ్తారు. ఇదే పద్ధతి ఒడిశా ప్రభుత్వ పాల ఉత్పత్తి సంస్థ అమలు చేస్తుంది. ప్రతి రోజూ కొత్త ఉత్పత్తులు ఇవ్వడంతో పాటు కాలం చెల్లిన ఉత్పత్తులను తమ వ్యాన్లోనే తిరిగి తీసుకొని పోతారు. కానీ హెరిటేజ్ ఈ నిబంధన పాటిండం లేదు. ఆంధ్రా నుంచి ఉత్పత్తులు తేవడమే తప్ప పాడైన వాటిని తిరిగి తీసుకువెళ్లడం లేదు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పక్క జిల్లా అధికారి రాక.. హెరిటేజ్ పై జయపూర్ ప్రజలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు రాష్ట్ర రాజధాని వరకు వెళ్లాయి. దాంతో పక్కనే ఉన్న మల్కన్ గిరి జిల్లా నుంచి ఫుడ్సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠిని ఇన్చార్జి హోదాలో పంపించి ప్రభుత్వం దాడులు చేయించింది. కొత్త ముఖాలు కావడంతో దాడుల నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. దాడుల అనంతరం ప్రబాత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్ పై వస్తున్న విమర్శలు నిజమేనని ప్రకటించారు. తానే స్వయంగా కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు పట్టుకున్నానని మీడియాకి చూపించారు. ఇంకా ఎక్కడైనా ఫిర్యాదులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం హెరిటేజ్ సంస్ధ ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడింది. కాలం చెల్లిన పాలు, పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. పట్టణంలో దాడులు జరుగుతున్నప్పటికీ ఇతర షాపులలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగించారు. అందుకే అధికారులు హెరిటేజ్ సిబ్బందిని వెంటబెట్టుకొని వెళ్లి దాడులు చేసి తాము పట్టుకున్న కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు వారికి చూపించి వారి సమక్షంలోనే మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేశారు. ఈ దాడులు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు వారి వెంట తరలి వెళ్లారు. పెద్ద మెత్తంలో పాడైన హెరిటేజ్ ఉత్పత్తులు ఉన్న షాపులను సీజ్ చేశారు. పలు షాపుల యజమానులకు ఫైన్లు విధించారు. బాధిత మహిళల ఇంటికి హెరిటేజ్ సిబ్బంది ఇటీవల జయపూర్ పట్టణంలో హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లు కొన్న మహిళలు అందులో కలుషిత పదార్థాలు చూసి సోషల్ మీడియాలో పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో హెరిటేజ్ కంపెనీ ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి అవి కాలం చెల్లినవని వివరణ ఇచ్చారు. మహిళల పోస్టింగ్స్ పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యాయి. కాలం చెల్లిన హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లని చెత్త బుట్టలలో వేస్తున్న మున్సిపల్ సిబ్బంది న్యూస్రీల్ హెరిటేజ్ వద్దు.. ఓం ఫైడ్ ముద్దు ఈ ఘటన తర్వాత ఒడిశా పాల ఉత్పత్తుల సంస్థ ఓంఫైడ్ పై ఒక సారిగా ప్రజల ఆదరణ పెరిగింది. హెరిటేజ్ బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలు ఓంఫైడ్ కొనుగోళ్లు ప్రారంంభించారు. స్థానిక ప్రజల వద్ద కొనుగోలు చేసిన పాలనే శుద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలలో ఓంఫైడ్ నడుస్తుంది. ఏనాడూ ఓంఫైడ్ పై ప్రజల నుంచి ఫిర్యాదులు లేవు. జయపూర్లో ఓంఫైడ్ ప్లాంట్ ఉంది. గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అందరి నోట ఓంఫైడ్ పేరు మారుమోగుతోంది. హెరిటేజ్ పాలు ఎన్నడూ విరగలేదని, అలా ఉండేందుకు ఏం రసాయనాలు కలిపారో అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా మార్కెట్లో కాలం చెల్లిన హెరిటేజ్ ఉత్పత్తులు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలు విక్రయిస్తున్న దుకాణాలు సీజ్ సోషల్ మీడియా పోరాటంతో బయటపడిన బాగోతం -
సైబర్ మోసగాళ్ల అరెస్టు
భువనేశ్వర్: సైబర్ మోసాలకు పాల్పడిన నిందితులు పోలీసులకు చిక్కారు. కటక్ సైబర్ ఠాణా పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి రూ. 78 లక్షల విలువైన సామగ్రితో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా బొలంగీరు ప్రాంతీయులుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరి దగ్గర నుంచి రూ. 12 లక్షల నగదు, చెక్ పుస్తకాలు, పాస్బుక్లు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇంటి పనిమనిషి, ఆమె కుమార్తైపె లైంగికదాడి భువనేశ్వర్: నగరంలోని ఓ ఇంటి పనిమనిషిపై యజమాని లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో బొడొగొడొ ఠాణా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుని విచారణలో ఆరోపణ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటిలో పనిచేస్తున్న మహిళ, ఆమె మైనర్ కుమార్తైపె అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణ. ఇంట్లో పని చేసే సమయంలో తల్లీ కూతుళ్ల వ్యక్తిగత దృశ్యాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగాడు. వీడియోలను ఆన్లైన్లో ప్రసారం చేస్తానని బెదిరించాడు. అనంతరం వీరివురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత వర్గం స్థానిక ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని సరోజ్ కుమార్ బెహరాగా గుర్తించారు. నిందితుని వ్యతిరేకంగా జాజ్పూర్ ప్రాంతంలో అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. భారీగా బయటపడిన అక్రమాస్తులు కొరాపుట్: కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి సీడీపీఓ శకుంతల దాస్ తన కిందిస్థాయి ఉద్యోగిని వద్ద రూ.10 వేలు లంచం తీసుకొని పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ ఘటన అనంతరం ఆమె ఆస్తుల వివరాలు కోసం విజిలెన్స్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి నివ్వెర పొయారు. ఆమెకు భుబనేశ్వర్లో అతి ఖరీదైన ప్రాంతం డుముడుమాలో 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల భవనం, కొరాపుట్ జిల్లా సిమిలిగుడ లో రెండస్తుల భవనం, పూరీలో నిర్మాణంలో ఉన్న భవనం, సిమిలిగుడలో జాగా, రూ.78 లక్షల విలువ గత బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. శకుంతలదాస్ని జయపూర్ విజిలెన్స్ కార్యాలయం నుంచి కోర్టుకి తరలించేటప్పుడు పోలీసుల వ్యాన్ ఎక్కేముందు తన ఆస్తులు కూడా కనుగొని విజిలెన్స్ వారు సీజ్ చేశారని తెలిసింది. దిఘా జగన్నాథ ఆలయ వివాదంపై దర్యాప్తు భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ దిఘాలో కొత్తగా నిర్మించిన జగన్నాథ ఆలయంపై రగులుతున్న వివాదాలపై బిజూ జనతా దళ్ (బీజేడీ) రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. దిఘా వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దర్యాప్తుపై బీజేడీ నాయకుడు ప్రసన్న ఆచార్య ప్రశ్నలు లేవనెత్తారు. గత ఏడాది 2024లో పూరీలో జరిగిన రథయాత్రలో బలభద్రుని విగ్రహం కూలిపోవడంతో సహా అనేక విచారకర, అశుభ సంఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఈ సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దర్యాప్తు ఫలితాలను బహిర్గతం చేయాలని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో నబకలేబార్ వేడుక నుంచి మిగులు కలప (పవిత్ర దారు)ను దిఘాలోని కొత్త మందిరం విగ్రహాల తయారీకి ఉపయోగించారనే ఆరోపణలపై బీజేడీ ఉపాధ్యక్షుడు ప్రసన్న ఆచార్య ఒడిశా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విషయాల్ని తెరపైకి తెచ్చారు. -
జిల్లా లేబర్ కార్యాలయం ఘెరావ్
జమపురం: ఆల్ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)నేతత్వంలో సోమవారం వందలాది మంది శ్రామికులు జయపురం లేబర్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్వాతంత్య్ర యోధురాలు లక్ష్మీపండ స్మృతి కూడలి నుంచి జిల్లా లేబర్ కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు ప్రమోద్ కుమార్ మహంతి, జుధిష్టర్ రౌళో లేబర్ అధికారికి మెమొరాండం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్దేశించిన మెమొరాండంలో వివిధ పథకాల్లో పని చేస్తున్న మహిళలకు, పురుషులకు కనీస నెల వేతనం రూ.26,000 ఉండాలని, సామాజిక సురక్ష కల్పించాలని, ఈపీఎఫ్ పెన్షన్ అమలు చేయాలని, ధరలు నియంత్రించాలని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పూర్తి చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశ సిబ్బందిని రెగ్యులర్ చేసి కనీస వేతనం అమలు చేయాలని కోరారు. సేవా పేపరుమిల్లు ఉద్యోగుల 8 నెలల బకాయి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ కార్మికుల హక్కులు, రక్షణ కోసం ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ నెల 20 వ తేదీన అఖిల భారత స్థాయిలో ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆందోళనలో వంట సహాయకుల సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ఉత్తమ మల్లిక్, కార్మిక నేత జుధిష్టర్ రౌళో, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, యువనేత సత్యబ్రత నందో, నిర్మాణ కార్మిక సంఘ నేత సుఖు ఖిన్భుడి, పేపరు మిల్లు కార్మిక సంఘ కార్యదర్శి కె.సత్యనారాయణ, బసంత బెహర, త్రిపతి మఝి, అజిత్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనాలు పెంచాలి
● అంగన్వాడీ, ఆశవర్కర్లు, హెల్పర్ల డిమాండ్ ● ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన పర్లాకిమిడి: కనీస వేతనాలను పెంచాలని స్కీం వర్కర్లు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నన భోజన వర్కర్లు డిమాండ్ చేశారు. 45, 46వ జాతీయ కార్మిక సమ్మేళన సిఫారసుల మేరకు కనీస వేతానాలు ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకూ ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఐదో సర్వభారతీయ ప్రతిబాద్ దివాస్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జిల్లాలోని అన్ని సమితుల నుంచి అంగన్వాడీ, ఆశవర్కర్లు, ఎండీఎం హెల్పర్లు, ప్యూన్లు పాల్గొన్నారు. ధరల పెరుగుదల, కనీస వేతానాల తలసరి ఆదాయం మేరకు ఇప్పుడున్న వేతనాలపై కనీసం 20 నుంచి 25 శాతం పెంచాలని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ రంజన్ కుమార్ మహాపాత్రో కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు తన చాంబర్లో అందజేశారు. ఏఐటీయూసీ నాయకులు ఉపేంద్రనాయక్, రాష్ట్రసంయుక్త కార్యదర్శి గీతాంజలి ఖోండో పాత్రో, మోహానా బ్లాక్ నుంచి అంగన్వాడీ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు సంగీత నాయక్, కార్యదర్శి సుజాతా నాయక్, ఆర్.ఉదయగిరి నుంచి అధ్యక్షురాలు సస్మితా మిశ్రా, కార్యదర్శి జ్యోత్సనారాణి జెన్నా, నువాగడ బ్లాక్ నుంచి జైమన్ కార్జి, కార్యదర్శి సుస్మితా బోడోరైతో, రాయగడ బ్లాక్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంటు మమతా, కార్యదర్శి నిరంజన్, గజపతి మోటారు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నర్సింగో మాలబిశోయి, కార్యదర్శి డి.జగన్నాథరావు పాల్గొన్నారు. -
రథోత్సవానికి సన్నాహాలు
భువనేశ్వర్: జగన్నాథ యాత్ర కోసం రథాల తయారీ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఇందులో భాగంగా రథాల తయారీ పనులు చురుకుగా సాగుతున్నాయి. భారీ దూలాల్ని వడ్రంగుల మార్గదర్శకంలో అనుకూలమైన కొలతల ప్రకారం కోసి సకాలంలో అందజేస్తున్నారు. వీటితో రథ చక్రాల తుంబల తయారీ ముందుకు సాగుతుంది. రథాల తయారీ నాలుగో రోజున 38 మంది మహారణ (వడ్రంగి) సేవకులు, నలుగురు రంపం కోత కార్మికులు, ఆరుగురు కమ్మరి సేవకులు, 19 మంది భోయ్ సేవకులతో నీటి పంపిణీ కోసం ఒక సహాయకునితో 68 మంది ఈ పనుల్లో సమగ్రంగా పాలుపంచుకున్నారు. నాలుగో రోజు రథ నిర్మాణం పనులు ముగిసే సరికి మూడు రథాల కోసం మొత్తం 28 తుంబల ప్రాథమిక పనులు పూర్తి చేశారు. ప్రత్యక్ష పర్యవేక్షణ స్వామి యాత్ర కార్యకలాపాలు ఆద్యంతాలు అత్యంత జాగరూకతతో నిర్వహిస్తారు. చక్రంలో కీలక భాగమైన తుంబ తయారీలో ప్రధాన మహరణ సేవకులు ప్రత్యక్షంగా కలప నాణ్యతని లోతుగా సమీక్షిస్తున్నారు. వీరి సమీక్ష ఆధారంగా ఎంపికై న దూలాల్ని మాత్రమే రంపం కోత కార్మికులు తదుపరి తయారీ కార్యకలాపాల కోసం సిద్ధం చేస్తున్నారు. పనుల్లో వండ్రంగులు నిమగ్నం భువనేశ్వర్: జగన్నాథుని యాత్రకు రథాల తయారీ పనులు అంచెలంచెలుగా పుంజుకుంటున్నాయి. అక్షయ తృతీయ పురస్కరించుకుని ప్రారంభమైన పనులు వడ్రంగి వర్గం తొలుత చేపట్టారు. ఈ వర్గం పనులు ఒక దశకు రావడంతో అనుసంధాన కార్యకలాపాల కోసం కమ్మరి వర్గం రంగ ప్రవేశం చేసింది. శ్రీమందిరం బొడొ దండొ ప్రాంగణంలో రథాల తయారీ ఛాయా శిబిరం పని చేస్తుంది. ఈ ప్రాంగణంలో వడ్రంగి పనులు కొనసాగుతున్నాయి. కమ్మరి కార్యకలాపాల కోసం శ్రీ మందిరం పరిసరాల్లో డోల వేదిక పరిసరాల్లో తాత్కాలిక కమ్మరి శాల ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి కార్మికులు కమ్మరి కార్యకలాపాలకు హాజరు అవుతున్నారు. మూడు రథాల ప్రధాన ఓఝా (కమ్మరి) సేవకుల్ని ప్రత్యేకంగా సత్కరించి ఈ పనుల్ని ప్రారంభించారు. తొలి రోజున ప్రతి చక్రానికి అవసరమైన 6/7 అంగుళాల పరిమాణంతో మేకులు తయారీ పనులు ప్రారంభించారు. -
జమిలి ఎన్నికలతో ప్రజాధనం వృథా కాదు
కొరాపుట్: జమిలి ఎన్నికలతో ప్రజా ధనం వృథా కాదని నబరంగ్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కుంజ బీహారి దాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన వన్ నేషన్–వన్ ఎలక్షన్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ విధానం అమలైతే మధ్యంతర ఎన్నికలు రావన్నారు. పదే పదే ఎన్నికల కోడ్ వలన ప్రజా పాలనకు అడ్డంకి అవుతుందని గుర్తు చేశారు. ఒకే సారి ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఐదేళ్ల పాటు రాజకీయాలు ఉండవని కుంజదాస్ పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు సౌమ్యకాంత్ జెన్నా, రాజేష్ కుమార్ పట్నాయక్, చాంబర్ ఆప్ కామర్స్ ప్రెసిడెంట్ కను దాస్, పార్టీ నాయకులు మృత్యుంజయ్ దాస్, దేవదాస్ మహాంకుడో, జగదీష్ బిసోయి ఉన్నారు. -
కొట్పాడ్ ఎమ్మెల్యే సహృదయత
కొరాపుట్: రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి కొట్పాడ్ ఎమ్మెల్యే సహృదయత చాటుకున్నారు. సోమవారం కొట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర కుంద్రా సమితి వైపు వెళ్తున్నారు. ఇదే మార్గంలో బిజ్జిగుడ–బలియాల మధ్య ఒక బైక్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు క్షతగాత్రులు రోడ్డు పక్కన పడి ఉన్నారు. ఇది చూసిన ఎమ్మెల్యే వెంటనే తన కారు దిగి అంబులెన్స్ను పిలిపించారు. క్షతగాత్రులను స్ట్రెచర్ మోసుకుంటూ వెళ్లి వాహనం ఎక్కించారు. వారు ఆస్పత్రికి చేరేంత వరకు పరిస్థితి సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలేక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 21 వినతులను స్వయంగా కలెక్టర్ స్వీకరించారు . జిల్లా కేంద్రంలో పరిసర గ్రామాలకు చెందిన పలు సమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ మాట్లాడుతూ, జిల్లా వాసుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏయే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్లి పరిశీలించి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వేలవి కాలం నీటి సమస్య ఎక్కువగా ఉందని, దీనిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎస్పీ వినోద్ కుమార్ పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదాన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర శభరో, ప్రఽభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రూ.6 కోట్లతో పపడాహండి అభివృద్ధి
కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.6 కోట్లతో నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది ఒడ్డున, జాతీయ రహదారి పక్కన సమరయోధుల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ, మైనారిటీ, ప్రాథమిక విద్యాశాఖా మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. సోమవారం పపడాహండిలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిధులతో ప్రభుత్వం చేపడుతున్న పనుల గూర్చి వివరించారు. 1942 ఆగస్టు 24న బ్రిటిష్ వారి తుపాకీ తూటాలకు 26 మంది స్వాతంత్య్ర సమరయోధులు బలైన విషయం గుర్తు చేశారు. నాటి బలిదానాకికి గుర్తుగా అక్కడ భారీ స్థూపం ఉందన్నారు. ఇప్పడు ఈ నిధులతో అక్కడ పరిశోధన కేంద్రం, పార్క్, మీటింగ్ హాల్, మ్యూజియం ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మనోహర్ రంధారి, గౌరీ శంకర్ మజ్జి, మాజీ ఎంపీ పరశురాం మజ్జి, మున్నా త్రిపాఠి, తదితరులు పాల్గొన్నారు. -
బీజేడీ రాష్ట్ర కార్యవర్గంలో ప్రముఖులకు చోటు
కొరాపుట్: బీజేడీ రాష్ట్ర కార్యవర్గంలో కొరాపుట్,న బరంగ్పూర్ జిల్లాలకు చెందిన ప్రముఖ నేతలకు చోటు దక్కింది. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ పట్నయక్ ఆదేశాల మేరకు ఈ జాబితా విడుదలైంది. కొరాపుట్ జిల్లా జయపూర్కు చెందిన మాజీ మంత్రి రబినారాయణ నందోకి అత్యున్నత రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కంది. రబి నందో వర్గం చాలా రోజులుగా కొరాపుట్ జిల్లా అధ్యక్ష పదవి కోసం లాబీ చేస్తుండగా.. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించింది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ఎంపీలు రమేష్ చంద్ర మజ్జి, ప్రదిప్ మజ్జిలకు ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా రాష్ట్ర సీనియర్ జనరల్ సెక్రటరీ పదవులు లభించడంతో ఇరు వర్గాల్లో సమన్యాయం దక్కంది. ఒకే పార్టీలో ఉంటున్న అక్కాతమ్ములు లోపముద్ర భక్షి పాత్రో, బృగు భక్షిపాత్రోలకు పదవులు లభించాయి. బృగుకి స్టేట్ సీనియర్ జనరల్ సెక్రటరి, లోపముద్రకి స్టేట్ జనరల్ సెక్రటరి పదవులు దక్కాయి. ఇక నబరంగ్పూర్ జిల్లాకు చెందిన రాజ్య సభ ఎంపీ, ఒడియా సినీ హీరో మజిబుల్లా ఖాన్ (మున్నా ఖాన్)కి రాష్ట్ర మైనారిటీ సెల్ సౌత్ జోన్ సెక్రటరీ పదవులు దక్కాయి. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రభుజానీకి రాష్ట్ర జనరల్ సెక్రటరి పదవి వరించింది. -
జగదల్పూర్లో ల్యాండ్మైన్స్ గుర్తింపు
రాయగడ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మునిగుడ సమితి అంబొదల పంచాయతీలోని జగదల్పూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్స్ను సోమవారం గుర్తించారు. డిస్టెట్ వలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), సీఆర్పీఎఫ్ నాల్గో బెటాలియన్ లకు చెందిన ప్రత్యేక దళం ఈ మేరకు మావోయిస్టులు అమర్చిన 4 ల్యాండ్మైన్స్ (బాంబులు)లను గుర్తించినట్లు ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇంటెలిజెన్స్ ఫోర్స్ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు జగదల్పూర్ అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన కుక్కర్ బాంబ్, మరో మూడు టిఫిన్ బాంబులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిని గుర్తించిన పోలీసు ప్రత్యేక దళం సురక్షిత ప్రాంతంలో నిర్వీర్యం చేసిందని తెలిపారు. -
దిఘాలో జగన్నాథ్ ధామ్ వివాదం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయం సీనియర్ర్ దైతపతి రామకృష్ణ దాస్మహాపాత్రో పశ్చిమ బెంగాల్లో చేసిన వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. దీంతో ఆదివారం వివాదాస్పద సీనియర్ దైతపతి రామకృష్ణ దాస్మహాపాత్రోని ముఖాముఖి ప్రశ్నించేందుకు ఆలయ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా దైతపతిని ప్రశ్నించిన మేరకు ఆలయ ప్రధాన నిర్వాహకుడు సీఏఓ దైతపతి రామకృష్ణ దాస్ మహాపాత్రోకు తాఖీదు జారీ చేశారు. తాఖీదు మేరకు సంతృప్తికర వివరణ దాఖలు చేయాలని ఆదేశించారు. తాఖీదు అందిన రోజు నుంచి 7 రోజుల లోపు వివరణ దాఖలు చేయాలని గడువు కల్పించారు. ఈ గడువులోపు సంతృప్తికరమైన వివరణ అందకపోతే శ్రీ జగన్నాథ ఆలయ చట్టం, 1955 ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తాఖీదులో స్పష్టం చేశారు. దిఘా ఆలయానికి జగన్నాథ్ ధామ్ అనే పదాన్ని ఉపయోగించడం పూర్తిగా తప్పని సేవాయత్ల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలని ఛొత్తీషా నియోగుల వర్గం కోరింది. ముఖ్యమంత్రి స్వరాష్ట్రానికి చేరడంతో ఈ మేరకు చర్యలు చేపడతామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ అభయం ఇచ్చారు. పూరీ జగన్నాథ ఆలయంలో మూల విరాటుల కొత్త విగ్రహాలను చెక్కడానికి నవ కళేబరం సమయంలో ఉపయోగించిన దైవిక వేప కలప – పవిత్రమైన ‘దారు‘ను అనధికారికంగా దిఘా ఆలయంలో విగ్రహాల తయారీకి వినియోగించినట్లు రామకృష్ణ దాస్ మహాపాత్రో పశ్చిమ బెంగాలు మీడియాతో ప్రతిస్పందనలో పేర్కొన్నారు. పవిత్రమైన కలపను దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని సర్వత్రా పట్టు బిగుసుకుంది. పశ్చిమ బెంగాలు నుంచి రాష్ట్రానికి చేరిన తర్వాత స్థానిక మీడియాతో స్పందించిన రామకృష్ణ దాస్మహాపాత్రో ఈ ఆరోపణల్ని ఖండించారు. వేరొక వేప చెట్టు నుంచి సేకరించిన కలపతో విగ్రహాన్ని తయారు చేసి స్వయంగా ప్రతిష్టించానని వివరించారు. ఈ ద్వంద్వ వైఖరిని తొలగించి స్పష్టమైన వైఖరితో వివరణ దాఖలు చేయాలని శ్రీ మందిరం సీఏఓ ఆది వారం తాఖీదులు జారీ చేశారు. రామకృష్ణ దాస్ మహాపాత్రో పాటు దైతపతి నియోగుల సంఘం అధ్యక్షుడు గణేష్ దాస్ మహాపాత్రో కూడా విచారణకు హాజరయ్యారు. అధికార వర్గం నుంచి శ్రీ మందిరం సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢితో ఆలయ సేవా విభాగం అధికారి జితేంద్ర కుమార్ సాహు హాజరు అయ్యారు. పోలీసు ఠాణాలో పలు ఫిర్యాదులు ఈ వివాదంలో రోజుకో ఫిర్యాదు పోలీసు ఠాణాలో దాఖలు అవుతున్నాయి. శ్రీ మందిరం సింహ ద్వారం ఠాణాలో ఈ ఫిర్యాదులు దాఖలు అవుతున్నాయి. శ్రీ మందిరంలో పదిలంగా ఉండాల్సిన పవిత్ర కలప అడ్డకోలుగా రాష్ట్రం దాటి వెళ్లిపోతుందని ఈ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ వ్యతిరేకంగా కూడ ఠాణాలో ఫిర్యాదు దాఖలు అయినట్లు అనధికారిక వర్గాల సమాచారం. శ్రీ మందిర మేఘ నాథ్ ప్రహరి లోపల భద్రంగా ఉండాల్సిన అమూల్య సామగ్రిని దైతపతి నియోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ దాస్ మహాపాత్రోపై జగన్నాథ సేన కార్యకర్తలు సింహ ద్వారం ఠాణాలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సింహ ద్వారం పోలీస్ ఠాణాలో దైతపతి నియోగుల సంఘం కార్యదర్శి పేరిట ఆన్లైన్లో ఒక ఫిర్యాదు నమోదైందని సమాచారం. పూరీలోని సత్య నగర్ ప్రాంతానికి చెందిన సమాచార హక్కు కార్యకర్త జయంత్ కుమార్ దాస్ ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పూరి శ్రీ మందిరం పాలక మండలి అనుమతి లేకుండా దైతపతి నియోగుల సంఘం కార్యదర్శి రామకష్ణ దాస్ మహాపాత్రో నవకలేబర మిగులు దారు (కలప)ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విక్రయించారని ఎఫ్ఐఆర్ జయంత్ కుమార్ ఆరోపించారు. ఈ చర్యలు ఆధారంగా రామకృష్ణ దాస్ మహాపాత్రో వ్యతిరేకంగా భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయాలని జయంత్ కుమార్ దాస్ పేర్కొన్నాడు. రామకృష్ణ దాస్ మహాపాత్రోకు తాఖీదు జారీ -
రోడ్డు నిర్మాణం చేపట్టండి
● ఖర్చబడి నుంచి గోంగరికి రోడ్డు నిర్మించాలని ప్రజల విజ్ఞప్తిపర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్ పరిధి ఖర్చబడి గ్రామ పంచాయితీ గోబిందో మామిడితోట జంక్షన్ నుంచి గోంగరి గావ్ వయా బి.రైసింగి గ్రామానికి స్వాతంత్య్ర వచ్చి 76 ఏళ్లు గడిచినా రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు బాధపడుతున్నారు. రోజూ అయిదు కిలోమీటర్లు ఖర్చబడి గ్రామపంచాయితీకు నడకదారిన చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా మోహానా బ్లాక్కు వెళ్లాల్సిందే. బి.రైసింగిలో గ్రామంలో 20 ఇళ్లు ఉన్నాయి. పాఠశాలలు, వైద్యం, రేషన్, బియ్యం నిత్యవసర సౌకర్యాలకు సైకిళ్లు, నడకదారిన ఖర్చబడి పంచాయతీకి చేరుకోవాలి. చీకటిపడితే ఖర్చబడి పంచాయతీ నుంచి భయంతో వెళ్లాళ్సిందే. కనీసం ప్రధానమంత్రి సడక్ యోజనా పథకం కింద బి.రైసింగికి మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనేకసార్లు జిల్లా కలెక్టర్కు రైసింగి గ్రామస్థులు విన్నపాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా పేరొందిన ఖర్చబడిలో ఇప్పటికీ మూఢనమ్మకాలు ప్రజల్లో ఎక్కువుగా ప్రబలుతోంది. వైద్యసౌకర్యం లేనందున పసర వైద్యం, సూది మందులు ఇచ్చే ఆర్ఎంపీ వైద్యానికి ఖర్చబడి, గోంగరి గావ్, బి.రైసింగి గ్రామస్థులు అలవాటు పడ్డారు. మోహనా బ్లాక్ అధికారులు ఖర్చబడి నుంచి బి.రైసింగికి పక్కారోడ్డు వేయాలని డిమాండు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మోహనా బ్లాక్ బీడీవో రాజీవ్ దాస్కు వినతి పత్రాన్ని అందజేస్తామని ఖర్చబడి సర్పంచ్ తెలిపారు. -
పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
కొరాపుట్: మీనాక్షి హైడ్రో పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా గిరిజనులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి రామగిరి, దండాబడి గ్రామ పంచాయతీలకు చెందిన 19 గ్రామాల గిరిజనులు దండకారణ్యం పుజారి పుట్లో ఆదివారం సమావేశమయ్యారు. ఈ ప్లాంట్ యాజమాన్యం మొదటి ప్లాంట్ నిర్మాణం తర్వాత నిబంధనలు ఉల్లఘించిందన్నారు. మీకాక్షి పవర్ ప్లాంట్ రెండు, మూడు ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ అనుమతులు లేవన్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే బదలిపొడ, అటల్గుడ, కుంబికారి, మాలిపొదర్ గ్రామాలు తీవ్రంగా నష్ట పోతాయన్నారు. హైదరాబాద్కి చెందిన మీనాక్షి సంస్థ తెంతులిగుమ్మ వద్ద 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శబరి నది నీటిని వీనియోగిస్తుంది. తర్వాత రెండో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకొని మూడవ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వెళ్తుంది. సారంగపల్లి వద్ద విద్యుత్ వైర్ల కోసం రాళ్లును పేల్చి అనేక చెట్లు నరికేశారు. ఇవేవి స్థానిక గ్రామాల ప్రజలకు తెలియదన్నారు. ఇటువంటి పనులకు గ్రామ సభ అనుమతి తప్పనిసరి ఉండాలన్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయితే తమ గ్రామాలు మునిగిపోతాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కొరాపుట్ జిల్లా కలెక్టర్, జయపూర్ సబ్ కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. తమ గోడును పాలకులు 10 రోజుల్లో వినకపోతే ప్లాంట్ లోపలకి దూసుకువెళ్తామని గిరిజనులు తీర్మానించారు. -
యువకుని దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్రమ్పూర్లో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని విక్రమ్పూర్ గ్రామానికి చెందిన చైతన్య సబర్(48)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. శనివారం నాడు సబర్ ఇంటిలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో పొరుగింటిలో నివసిస్తున్న పొండ సబర్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలకు గురైన చైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దాడి చేసిన పొండా సబర్ పద్మపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుని భార్య మేలుని సబర్ తన భర్తను పొండ సొబొరొతొ పాటు అతని కొడుకు కూడా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తి అరెస్టు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోలీసులు ఆదివారం 80 లక్షలు మోసం చేసిన దేవజీత్ త్రిపాఠి ని అరెస్టు చేశారు. దేవజీత్ త్రిపాఠి అనే వ్యక్తిపై మల్కన్గిరి జిల్లాకు చెందిన కె.జితేంద్ర పాత్రో అనే వ్యక్తి మల్కన్గిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాధు చేశారు. దేవజీత్ జిల్లాలో పండ్ల వ్యాపారం చేస్తున్న జితేంద్రతో పరిచయం చేసుకుని 2017లో అతని నుంచి కమోడిటీ ట్రేడింగ్ చేస్తే మూడు నేలల్లో 20 శాతం లాభం వస్తుందని నమ్మించి కొంత డబ్బులు కట్టించి లాభం ఇచ్చాడు. మరి కొంత ఆశ చూపి వితడల వారిగా రూ.40 లక్షలు డబ్బులు కట్టించి ఏటు వంటి లాభలు ఇవ్వలేదు. జితేంద్ర వెంటనే దేవజిత్కు ఫోన్ చేసి డబ్బులు ట్రేడింగ్ ఖాతా వివరాలు చేప్పకుండా రూ. 22లక్షలు కట్టించాడు. మారో కొత్త ఖాతా ఓపెన్ చేయాలని నమ్మించాడు. ఆదార్ కార్డ్, ఇతర కార్డులు తీసుకొని మారో ఖాతా ఓపెన్ చేయాలని, రూ.10 లక్షలు కావాలని చేప్పి మొత్తం 80 లక్షలు వరుకు తీసుకుని పారారయ్యాడు. అతను ఈ విషయం తెలుసుకున్న జితేంద్ర కొద్ది రోజుల క్రితం ఫిర్యాదుతో బార్గాడ్లో అరేస్టు చేసి మల్కన్గిరికి తరలించారు. ఇక్కడ విచరణ అనంతరం సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని మల్కన్గిరి పోలీసులు తెలిపారు. ఉద్యాన పంటలకు రాయితీ రెట్టింపు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో 44250 హెక్టార్లలో ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా 155147 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని రైతులు సాధిస్తున్నారని జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ తీరప్రాంతమున్న, వివిధ జీవవైవిధ్య పరిస్థితులు నెలకొని ఉన్న జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక విస్తరణ పథకాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి ప్రోత్సాహకాలను గణనీయంగా పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ పంటలను వేయదలుచుకునే రైతులను ఉద్యాన అధికారులు గుర్తించారని, తొలకరి వర్షాకాలానికి ముందే మిగిలిన రైతులని కూడా గుర్తించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ పథకంలో ప్రత్యేకంగా డ్రాగన్ ఫ్రూట్ పంటకు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. గతంలో హెక్టారుకు రూ.30వేలుగా ఉన్న రాయితీని ఇప్పుడు రూ.1.62లక్షలకు పెంచడం ద్వారా రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రైతు సహాయక కేంద్రంలో సంప్రదించాలని కోరారు. -
ఎనిమిదేళ్ల విద్యార్థినిపై అఘాయిత్యం
కొరాపుట్: జిల్లాలోని లమ్తాపుట్ సమితి గున్నయిపుట్ భగ్గుమంది. ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదేళ్ల విద్యార్థినిపై లైంగికదాడి జరిగినట్లు ఆలస్యంగా వెలుగు చూడడంతో రాజకీయ నాయకులు గ్రామానికి తరలివచ్చారు. ఏప్రిల్ 13న అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ఆశ్రమ పాఠశాలలోనే బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రధానోపాధ్యాయురాలు భానుప్రియ రహస్యంగా ఉంచారు. 30న స్కూల్కు సెలవులు రావడంతో బాలిక ఇంటికి వచ్చింది. రక్తం మరకలు చూసి తల్లి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్ ఇది అత్యాచారమని పోలీసులకు సమాచారం ఇస్తే గానీ వైద్యం చేయలేనని చెప్పాడు. దీంతో బాధితులు మాచ్ఖండ్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. దీంతో అధికారులు స్పందించి దారుణాన్ని దాచిపెట్టిన హెచ్ఎంను సస్పెండ్చేశారు. ఘటన జరిగిన ప్రాంతం కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం పొడాల్ స్వగ్రామం ఉన్న పంచాయతీ కావడం విశేషం. అంతేకాక ఘటన జరిగిన రోజు గ్రామంలో ఉత్సవం జరిగిందని, ఆ ఉత్సవంలో ఎమ్మెల్యే తన సహచరులతో కలసి పాల్గొన్నారని బీజేడీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్ ఆరోపించారు. తరలి వెళ్లిన రాజకీయ పక్షాలు ప్రతి పక్ష బీజేడీకి చెందిన రాజకీయ ప్రముఖులు బాధిత బాలిక ఇంటిని సందర్శించారు. 24 గంటలలో నేరస్తులను అరెస్ట్ చేయకపోతే రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మెహన్ మాఝి ప్రభుత్వం వచ్చాక 160 మందికి పైగా అత్యాచారానికి గురయ్యారని తెలిపారు. తక్షణం సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలోనే లైంగికదాడి భగ్గుమన్న రాజకీయ పార్టీలు -
ఘనంగా సిద్ధాంత సాహితీ సంస్థ రజతోత్సవం
పర్లాకిమిడి: సిద్ధాంత సాహితీ సంస్థ రజతోత్సవ వేడుకలు రాజవీధిలో విశ్వనాథ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, విశిష్ట అతిథిగా మాజీ వైస్ చాన్సలరు ప్రొఫెసర్ డాక్టర్ మన్మనాథ్ పాడీ, గౌరత అతిథిగా గుణుపురం సబ్ కలెక్టర్ కిరణ్దీప్ కౌర్ సహిత, బరంపురం విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ సిద్ధార్థ శంకర్ పాడీ, పూర్ణచంద్ర మహాపాత్రో తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా సిద్ధాంత వార్షిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పత్రికకు ఎడిటర్గా మహిళా కళాశాల ప్రొఫెసర్ కల్యాణీ మిశ్రా పత్రిక విశేషాల గురించి వివరించారు. సవరసామాజ్ రంగంలో విశేషంగా కృషిచేసిన రచియిత కవిసూర్యనగర్కు చెందిన డాక్టర్ సురేంద్రనాథ్ సాహును కలెక్టర్ సన్మానించారు. అనంతరం ‘సిద్ధాంత’ ప్రతిభా పురస్కారాలు రాయఘడ బ్లాక్ సర్పంచ్ (జలంగ్) లాబణ్య శోబర, తరిణీసేన్ దాస్ (చాందిపుట్), గుణుపురానికి చెందిన కృష్ణ శబర, ఫాల్గుణీ శోబోరో (గుణుపురం), గాయత్రీ శోబోరో (మరిచగుడ, పద్మపూర్ బ్లాక్), హారాబతీ గోమాంగో (పద్మపూర్), అమ్రిత్ పాణిగ్రాహి (పర్లాకిమిడి)లను సత్కరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో డి.ప్రియాంక, వి.హిమగిరి ఆధ్వర్యంలో ఒడిస్సీ, కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సంస్కృత విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ అన్నపూర్ణాదేవి అధ్యక్షత వహించారు. -
‘నాగావళి’కి అడ్డుకట్ట సమంజసం కాదు
● జేకే పేపర్ మిల్పై యాజమాన్యంపై ఎమ్మెల్యే కడ్రక ఆగ్రహంరాయగడ: జిల్లాలోని సదరు సమితి పరిధిలో ఉన్న జేకే పేపర్ మిల్ యాజమాన్యం చందిలి మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నదినీటిని అడ్డుకట్ట వేసి తన అవసరాలకు వినియోగిస్తున్న తరువాత వాటి వ్యర్థాలను తిరిగి నదిలోకి విడిచి పెట్టడం ఎంతవరకు సమంజసమని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక ధ్వజమెత్తారు. నాగావళి పరిసరాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగావళి నది నీటిపై దిగువన గల వందలాది గ్రామాలకు చెందిన ప్రజలు మంచినీటి కోసం ఆధారపడుతుంటారన్నారు. అయితే కొన్నాళ్లుగా జేకేపేపర్ మిల్ యాజమాన్యం తన అవసరాల కోసం నది వద్ద ఇసుక బస్తాలను వేసి నీటిని నిలిపి వేస్తుండటంతొ దిగువ ప్రాంతాల్లో గల వారికి తాగునీటి సమస్య తలెత్తుతుందని అన్నారు. కాగా కాస్త విడిచి పెడుతున్న నది నీటిలో పేపర్ తయారీకి సంబంధించి వినియోగించిన కెమికల్స్ను, వ్యర్థాలను నదిలో విడిచి పెడుతుండటంతో నదినీటిపై ఆధారపడుతున్న గ్రామస్తులు అదే నీటిని తాగా వ్యాధులబారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలొ ఇదే విషయమై ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. దీనికి సమాధానంగా సంబంధిత శాఖ మంత్రి వివరణ ప్రకారం.. ప్రవహించే నదినీటిని ఏ ప్రైవేటు పరిశ్రమలు, ఇతరులు నీటిని అడ్డగించి స్వప్రయోజనాలకు వినియోగించే అధికారం లేదని స్పష్టం చేశారని అన్నారు. కాని జేకేపేపర్ మిల్ యాజమాన్యం నాగావళి నదిలో ఇసుక బస్తాలను వేసి అత్యధిక శాతం నీటిని స్వప్రయోజనాలకు వినియోగిస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పక్షం రోజుల్లో సమస్యను పరిష్కరించకపొతే నది వద్దే బాధిత గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు నదిలో పర్యటించిన ఎమ్మెల్యే కడ్రక జేకేపేపర్ మిల్ యాజమాన్యం నాగావళి నది నీటిని ఎలా కట్టడి చేసి నిల్వ చేసుకుని స్వప్రయోజనాలకు వినియోగిస్తుందో ఆరా తీశారు. -
రంగస్థల వేదిక త్వరలో ప్రారంభిస్తాం
● కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ● పర్లాకిమిడిలో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ప్రారంభంపర్లాకిమిడి: పర్లాకిమిడిలో కళాకారులకు కొరత లేదని, నాటకాలు ప్రదర్శించేందుకు రంగస్థల వేదిక లేదని, త్వరలో బెత్తగుడ వద్ద నిర్మాణం పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక టౌన్హాల్లో 11వ రాష్ట్ర స్థాయి నాటక మహోత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఈ నాటక మహోత్సవాలకు ప్రఖ్యాత రంగస్థల నటులు అశోక్ కోరో, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, జిల్లా సాంస్కృతిక అధికారి అర్చనా మంగరాజ్, పృథ్వీరాజ్, నిర్వాహకులు క్రియేటివ్ ఆర్ట్స్ నృసింహచరణ్ పట్నాయక్, కార్యదర్శి మనోజ్ పాడీ, ఆదర్శదాస్ తదితరులు ప్రసంగించారు. తొలి రోజు ‘శేషో ఇచ్చా’ (చివరి కోరిక ) నాటకాన్ని కళాకారులు ప్రదర్శించారు. ఈ నాటకానికి దర్శకత్వం మనోజ్ కుమార్ పాడి, నాట్యకారులు ప్రభాకర్ కోరో, సంగీతం రఘనాథ పాత్రో, సహదర్శకులు ఆదర్శదాస్ వ్యవహరించారు. ఈ నాటక ప్రదర్శనలు మూడు రోజుల పాటు సాగుతాయి. -
వైద్యుని ఇంట్లో చోరీ
రాయగడ: స్థానిక కస్తూరీనగర్లో నివాసముంటున్న డాక్టర్ బి.ఎల్.ఎన్.పృష్టి ఇంట్లో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి పదివేల రూపాయల నగదు, ఒక చేతి గడియారాన్ని దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు పోలీస్ స్టేషన్ ఐఐసీ కేకేబీకే కుహోరో తెలియజేసిన వివరాల ప్రకారం.. గత కొద్ది నెలల క్రితం డాక్టర్ పృష్టి తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లో దొంగతనం చేశారు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు డాక్టర్ ఇంటి తలుపులు తెరిచిఉండటం చూసి అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ పృష్టి ఈ మేరకు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. -
క్రేన్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ
భువనేశ్వర్: కటక్ ఖాన్ నగర్ ప్రాంతం రింగ్ రోడ్ వంతెన స్లాబ్ కూలి ముగ్గురు చనిపోయిన ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషాద సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కటక్ ఖాన్ నగర్ ప్రాంతంలోని కఠొజొడి నదిపై వంతెన పనులు జరుగుతుండగా కొన్ని భారీ కాంక్రీట్ స్లాబ్లను ఎత్తుతున్న క్రేన్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. క్రేన్ కింద పని చేస్తున్న కార్మికులు స్లాబ్ల కింద నలిగిపోయారు. త్రిసభ్య కమిటీ దర్యాప్తు సంఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. కటక్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ దివ్యజ్యోతి స్మృతి రంజన్ దేవ్ ఆధ్వర్యంలో త్రిసభ్య బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ కమిటీలో డిప్యూటీ కలెక్టర్, రహదారులు, వంతెనల విభాగం (ఆర్ అండ్ బి) సూపరింటెండెంట్ ఇంజినీరు, జిల్లా కార్మిక అధికారితో కూడిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ సంఘటనపై ఆదివారం దర్యాప్తు ప్రారంభించిన బృందం 7 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. -
ఫ్లై ఓవర్ నుంచి ట్యాంకర్ బోల్తా
రాయగడ: కొరాపుట్ నుంచి వస్తున్న ఒక భారీ ట్యాంకర్ స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బ్రిడ్జి కింద చేపలు, కూరగాయాలు విక్రయించే వారుంటారు. మధ్యాహ్నం కావడంతో అంతా దుకాణాలను మూసివేసి వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. లేదంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిందిలా.. కొరాపుట్ నుండి వస్తున్న భారీ ట్యాంకర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మలుపు వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఒక స్కూటీని ఢీకొంది. అతివేగంతో వస్తున్న ట్యాంకర్ వల్ల ప్రమాదం సంభవిస్తుందని ముందుగా పసిగట్టిన స్కూటీ డ్రైవరు తను నడుపుతున్న స్కూటీని విడిచి గెంతివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. స్కూటీని సరాసరి ఢీకొన్నాక ట్యాంకర్ స్టీరింగ్ అదుపు తప్పడంతో బ్రిడ్జి మలుపు వద్ద సెక్యూరిటీ వాల్స్ను ఢీకొని సరాసరి 25 అడుగుల ఎత్తు నుంచి ట్యాంకర్ కింద పడింది. ప్రమాదం సంభవించిన వెంటనే డ్రైవరు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. సహాయక చర్యలు ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు ఆపారు. బ్రిడ్జి కింద పడి ఉన్న ట్యాంకర్ వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను చేపట్టారు. ముందుగా ట్యాంకర్ కు సంబంధించిన డీజిల్ ట్యాంక్ నుండి డీజల్ కారుతుండటంతొ ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించకుండా ట్యాంక్ నుంచి డీజిల్ను తీసివేశారు. నిబంధనలకు తిలోదకాలు నిత్యం జన సమూహంతో రద్దీగా ఉండే రాయగడ పట్టణంలో భారీ వాహనాలు లోపలకు ప్రవేశించకూడదని, బైపాస్ వైపు వాటిని మళ్లించాలని కలెక్టర్ ఫరూల్ పట్వారి గత కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఈ చర్యలు చేపట్టారు. అయితే మిట్ట మధ్యాహ్నం భారీ వాహనం పట్టణం లోపలకు ఎలా ప్రవేశించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఏర్పాటు చేసిన వందకు పైగా ఉన్న నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) పర్యవేక్షిస్తున్న పోలీసులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం కలుగుతుందని కాంగ్రెస్ నాయకుడు భూషణ మాజి ఆరోపించారు. -
జగన్నాథ రథ చక్రాల్..
వస్తున్నాయ్ వస్తున్నాయ్..జగన్నాథుని రథోత్సవానికి సన్నాహాలు ● మహంతులతో ఎస్పీ సమావేశం భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథా యాత్ర కోసం అనుబంధ యంత్రాంగం ఒక్కోటిగా సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం ముందంజలో ఉంది. యాత్ర పురస్కరించుకుని అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు విభాగం ప్రధానంగా జాగ్రత్త వహిస్తుంది. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల్లో క్రమశిక్షణ ప్రేరేపించి అవసరమైన సహాయ సహకారాలు సకాలంలో అందజేయాలని అభ్యర్థిస్తుంది. స్వామి యాత్ర నిర్వహణలో స్థానిక మఠాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మఠాల అధిపతుల ఆధ్వర్యంలో యాత్ర కార్యకలాపాలు నిర్విఘ్నంగా సకాలంలో నిర్వహించేందుకు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పూరీ పట్టణ వ్యాప్తంగా శ్రీ జగన్నాథుని సంస్కృతితో ముడి పడిన మఠాల మహంతలతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన తొలి సమన్వయ కమిటి సమావేశం తీర్మానాలపై అవగాహన కల్పించారు.భువనేశ్వర్: పూరీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ చురుగ్గా సాగుతోంది. వడదెబ్బ తాకిడి నుంచి జాగ్రత్త వహిస్తూ ఈ పనుల్లో కార్మికులు నిరవధికంగా పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచే పనులకు హాజరవుతున్నారు. కార్మికులపై ఒత్తిడి తగ్గించే దిశలో పనులు పుంజుకుంటున్న కొద్దీ కార్మికుల సంఖ్యని పెంచుతున్నారు. గడిచిన 3 రోజుల్లో రథ చక్రాల తుంబల తయారీలో వడ్రంగి (మహరణ) కార్మికులు తలమునకలై ఉన్నారు. ఈ దశ పనుల్లో రంపం కార్మికుల పాత్ర కీలకం. కోతకు వీలుగా భారీ దుంగల్ని చెక్కి తుంబల తయారీకి అనుకూలంగా మలచి ప్రధాన వడ్రంగి సేవకులకు అందజేస్తున్నారు. ఈ పనుల కోసం నియమితులైన 26 మంది వడ్రంగి (మహరణ) సేవకులు, నలుగురు రంపం కార్మికులు, ఆరుగురు కమ్మరి కార్మికులు, 14 మంది బోయి సేవకులు, ఒక సహాయకునితో మొత్తం 51 మంది కార్మికులు మూడు రథాలకు అవసరమైన 42 తుంబల తయారీ పనులు ప్రారంభించారు. -
బైక్ దొంగ అరెస్టు
రాయగడ: బైకు దొంగతనం కేసులో నిందితుడిని సదరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక న్యూ కాలనీకి చెందిన పి.సురేష్గా పోలీసులు గుర్తించారు. నిందితుడుని కోర్టుకు తరలించారు. ఐఐసీ కేకేబీకే కుహరో తెలియజేసిన వివరాల ప్రకారం .. గత ఏప్రిల్ 28వ తేదిన న్యూకాలనీలో ఓ వ్యక్తి బైకు చోరీకి గురైంది. దీంతొ బాధితుడు సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని స్థానిక నాగావళి సమీపంలో శనివారం అరెస్టు చేశారు. -
చాందీపూర్, తలసరి బీచ్లకు మహర్దశ
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా కోస్తా ప్రాంతాల పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి ప్రభాతి పరిడా బాలాసోర్ జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాల్లో అనుకూల వనరులపై వైమానిక సర్వే నిర్వహించారు. జిల్లాలో తొలొసొరా, చాందీపూర్ రెండు ప్రధాన సాగర తీరాలు. విశేష సంఖ్యలో పర్యాటకుల్ని ఈ తీరాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చక్కటి పర్యావరణ పురోగతితో సందర్శకులకు అనుకూలమైన వసతి, మనోరంజక, కాలక్షేప వసతులు సమకూర్చితే అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బాలాసోర్ జిల్లాలో బీచ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ రెండు ప్రధాన బీచ్లు తొలొసొర, చాందీపూర్ ప్రధాన పర్యాటక కేంద్రాలుగా మలిచే లక్ష్యంతో గణనీయమైన ఆర్థిక కేటాయింపులు, పర్యాటక కార్యక్రమాలను మంత్రి ప్రతిభా పరిడా ప్రకటించారు. ఆసియాలోనే అతిపెద్ద శివలింగానికి నిలయమైన భుషండేశ్వర్ పీఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంచడానికి రూ.10 కోట్ల గ్రాంట్ ప్రకటించారు. సాగర తీరాలకు రూ. 11 కోట్లు పర్యాటకులకు అనుకూలమైన ప్రసిద్ధ తీరప్రాంత గమ్యస్థానమైన చాందీపూర్ బీచ్ సమగ్ర అభివృద్ధికి మంత్రి రూ. 11 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం లక్ష్యంగా పేర్కొన్నారు. పర్యావరణ పర్యాటక రంగానికి ప్రోత్సాహకంగా, ఈ సంవత్సరం బాలసోర్ తీర ప్రాంతంలో ఎకో రిట్రీట్ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. సుస్థిర, ప్రకృతి కేంద్రీకృత అనుభవాలను కోరుకునే పర్యాటకులను ఆకర్షించడం ఈ చొరవ లక్ష్యం. జిల్లాలోని వివిధ బీచ్లలో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పురోగతి దశలో ఉన్నాయి. ఈ తీరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ల ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి మంత్రి హెలికాప్టర్ ద్వారా వైమానిక సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె పర్యాటక శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ బల్వంత్ సింగ్తో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేయడంపై ప్రాధాన్యత పెంపొందించారు. సాగర తీరాల బహుముఖ అభివృద్ధి పర్యాటక రంగం బహుముఖ అభివృద్ధితో సమాజంలో సన్నకారు, బలహీన తదితర వర్గాలకు అనేక ఉపాధి అవకాశాల్ని అందుబాటులోకి తెస్తాయని మంత్రి తెలిపారు. -
ఈస్ట్ కోస్ట్ జీఎంతో నబరంగ్పూర్ ఎంపీ భేటీ
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ జీఎం పరమేశ్వర్ ఫఖువాల్తో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి శనివారం భేటీ అయ్యారు. శనివారం జీఎం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. జయపూర్–నబరంగ్పూర్, జయపూర్–మల్కన్గిరి, మల్కన్గిరి–భద్రాచలం, నబరంగ్పూర్ –జునాఘడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి పై చర్చించారు. రాయగడ రైల్వే డివిజన్ లోని గుణుపూర్–తెరువల్లి నిర్మాణ పురోగతి సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గొర్రెలపై హైనా దాడి కొరాపుట్: గొర్రెల కావడి మీద హైనా దాడి చేయడంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. శనివారం వేకువజామున నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితి పడాల్గుడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేణుధర్ తాడి తన ఇంటి సమీపంలో గొర్రెల కావడి నుంచి గొర్రెల అరుపులు రావడంతో అక్కడికి చేరుకున్నాడు. అయితే మనుషుల అలికిడి విని ఒక అటవీ జంతువు పరారయ్యింది. లోపలికి వెళ్లి చూస్తే 4 గొర్రెలు మృతి చెందాయి. మరో రెండు తీవ్రగాయాలు పాలై ఉన్నాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. గొర్రెలకు ఉన్న గాయాలు ప్రకారం ఇది హైనా దాడిగా అనుమానించారు. అటవీ శాఖ సిబ్బంది గాయపడిన గొర్రెలకు చికిత్స అందజేస్తున్నారు. ఈనెల 7 వరకు వర్షాలు ● 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ భువనేశ్వర్: రాష్ట్రంలో కాలవైశాఖి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణం ఈనెల 7వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో 8 జిల్లాలకు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వాన సంకేతాలతో తుఫాన్ పోలిన వాతావరణం తాండవిస్తుందని వాతావరణ కేంద్రం సమాచారం. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. వీటిలో మయూర్భంజ్, సుందర్గఢ్, కెంజొహర్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, గజపతి మరియు గంజాం జిల్లాలు ఉన్నాయి. ఉపరితల గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ సూచన. కాల వైశాఖి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో మరో 22 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 7వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో సమగ్రంగా పగటిపూట ఉష్ణోగ్రత మారే అవకాశం లేదు. రానున్న రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ సమాచారం. శ్మశానంలో తేనెటీగల దాడి కొరాపుట్: శ్మశానంలో తేనెటీగలు దాడి చేయడంతో అంత్యక్రియలకు వచ్చిన వారు చెల్లాచెదురయ్యారు. శనివారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి లౌడి గ్రామానికి చెందిన సమికా ఖొరా అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామస్తులు అంత్యక్రియల కోసం శ్మశానంలో ఏర్పాట్లు చేశారు. మృతదేహంపై కర్రలు కప్పుతుండగా తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో అంతా పరుగులు తీశారు. కొందరు నదిలో దూకారు. 15 మంది గాయపడడంతో వారిని సుంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు పీతం పాఢి, రఘురాం పోడాల్, ప్రపుల్ల పంగి పరామర్శించారు. -
ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా డాబుగాం పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉమరాహండి గ్రామానికి చెందిన చంచల మజ్జి అనే మహిళ పపడాహండిలో ప్రతిరోజూ కూరగాయలు విక్రయించి తిరిగి ఇంటికి వస్తుంది. ఆమెను గత కొంతకాలంగా జొరిగాం సమితి పట్రాసిల్ గ్రామానికి చెందిన పరశురాం శాంత, ముండాగుడ గ్రామానికి చెందిన రాకేష్ శాంతలు అనుసరిస్తున్నారు. ఇటీవల బాధిత మహిళ కన్యాశ్రమం వద్ద బస్సు దిగి తన గ్రామానికి వెళ్తుండగా వీరిద్దరూ ముఖానికి ముసుగులు వేసుకొని వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుని లాక్కొనిపోయారు. దీంతో బాధితురాలు చంచల డాబుగాం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు బంగారు గొలుసుని ఉమ్మర్కోట్లో విక్రయించి ఆ డబ్బులతో డాబుగాంలో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నిలదీయడంతో నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి నగదు, నంబర్ ప్లేట్లేని బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
ప్రకృతి విపత్తులపై ప్రజలను అప్రమత్తం చేయండి
కొరాపుట్: రానున్న వర్షాకాలంలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ, ప్రాథమిక విద్య, మైనారిటీ శాఖ మంత్రి నిత్యానందో గోండో సూచించారు. శనివారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా నదులు, కాలువలు దెబ్బతిన్న గట్లు ముందస్తుగా గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. వరదలు రావడానికి ముందే జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన అనుమానిత ప్రాంతాల్లో మందులు, మిల్క్ పౌడర్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బెల్లం, అటుకులు సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణులను గ్రామాల్లో గుర్తించి కాన్పు సమయానికి ముందే ఆస్పత్రులకు చేర్చాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్, అగ్నిమాపక బృందాలకు అవసరమైన సామగ్రి ముందే సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, ఎమ్మెల్యేలు మనోహర్ రంధారి, గౌరీ శంకర్ మజ్జి, మున్సిపల్ చైర్మన్ కునునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నందపూర్పై కాల వైశాఖి ప్రభావం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితిపై కాలవైశాఖి ప్రకోపం చూపించింది. ఈదురు గాలులతో భారీ వర్షాలు పడడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. సిమిలిగుడ రహదారుల మద్య భారీ వృక్షాలు కూలడంతో రాకపోకల స్తంభించాయి.నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లమ్తాపుట్ సమితి ఉర్దిగుడ గ్రామంలో నవీన్ హంతాల్ ఇంటి పై భారీ వృక్షం పడింది. త్రుటిలో కుటుంబీకులు ప్రాణాలతో బయటపడ్డారు. తహసిల్దార్ దివాకర్ బాగ్, ఫైర్ స్టేషన్ ఒఐసీ చిత్రరంజన్ పంజియాలు సహయ సహకారాలు, పునరుద్ధరణ కార్యక్రమాల్ల్లో పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుల దారుణ హత్య
● సరిగుడ గ్రామంలో దారుణం ● ఐదుగురిపై కేసు నమోదు ● పోలీసుల అదుపులో ఒకరు రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి లికిటిపొదొరొ పంచాయతీలోని సరిగుడ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని తండ్రీకొడులను గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిపై చంద్రపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సరిగుడ గ్రామంలో నివసిస్తున్న అగాదు గొమాంగొ (32), శంభుర గొమాంగొ(62)లు తండ్రీకొడుకులు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని కొంతమంది దుండగులు గొమాంగొ ఇంటికి వెళ్లి తగువు పడ్డారు. వాగ్వాదం పెరగడంతో వారు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. కేకలు వినిపించడంతో అగాదు తండ్రి శంభుర బయటకు వచ్చి చూశాడు. దీంతో దుండగులు అతనిపై కూడా దాడికి దిగారు. అదే సమయంలో అగాదు భార్య జెనిత గొమాంగొ బయటకు వచ్చి చూడగా తన భర్త, మామలపై దుండగులు మరణాయుధాలతో దాడి చేయడం కనిపించింది. దీంతో ఆమె వెంటనే ఇరుగు పొరుగు వారిని తీసుకువచ్చింది. వారు వచ్చి చూసేసరికి ఇంటి బయట రక్తపు మడుగులో భర్త అగాదు, మామాయ్య శంభుర పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పాత కక్షల కారణంగానే దుండగులు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే తన భర్త, మామాయ్యలపై దాడి చేసి హతమార్చారంటూ బాధితురాలు జెనిత గొమాంగొ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
లైంగిక వేధింపులపై ప్రజల ఆగ్రహం
కొరాపుట్: విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ప్రజలు ఆందోళనకు దిగారు. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీసు సబ్ డివిజన్ లమ్తాపుట్ సమితిలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ స్కూల్లో ఏప్రిల్ 13వ తేదీన 8 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఈ విషయం పాఠశాల సిబ్బంది రహస్యంగా ఉంచి బాలికకు చికిత్స చేయించారు. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో గత్యంతరం లేక ఏప్రిల్ 30వ తేదీన గుణయిపొడలోని బాలిక ఇంట్లో దింపి వెళ్లిపోయారు. బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబీకులు వైద్యం కోసం తీసుకొని వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మకు విషయం తెలియజేయడంతో దర్యాప్తునకు ఆదేశించారు. లమ్తాపుట్ సమితి కేంద్రంలో ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూకుమ్మడిగా ఇళ్ల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీగా బయటకు వచ్చారు. ఆగ్రహంతో పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్డీపీవో దేవేంద్ర మాలిక్ స్పందించి కేసు దర్యాప్తు జరుగుతోందని తెలియజేశారు. సున్నితమైన కేసు కావడంతో వివరాలు ప్రకటించలేమన్నారు. మరోవైపు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిపప్పు, పైనాపిల్ ఎగుమతి చేయండి
● జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అత్యధికంగా ఉత్పాదన అవుతున్న జీడిపప్పు, పైనాపిల్, మిరియాలు, రబ్బరు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే మైక్రో, చిన్న, మీడియం పరిశ్రమలదారులకు అధికంగా లాభాలు వస్తాయని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. కలెక్టరేట్ వద్ద ఆర్శెఠి భవనంలో జిల్లా స్థాయి జీడిపప్పు వెండర్ మొబిలైజేషన్ డ్రైవ్ కర్మశాలను శనివారం ప్రారంభించారు. ఈ వర్క్షాపు డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, మార్కెటింగ్ (ఒడిశా) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇతర అతిథులుగా ఎం.ఎస్.ఎం.ఈ జాయింట్ డైరెక్టర్ కమల్జిత్ దాస్, ఎగుమతి ప్రమోషన్ డైరెక్టర్ అశోక్ కుమార్ బెహరా, చీఫ్ ఎక్స్పోర్టు డిపార్ట్మెంట్ ఫెడరేషన్ కమలకాంత సాహు, ఇకో బ్యాంకు సాధారణ పర్యవేక్షకుడు నితీష్ మహంతి, సీఈఓ సంజయ్కుమార్ ప్రధాన్, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం సునారాం సింగ్ తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో 60కి పైగా జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉన్నాయని, ఏ ఓక్క పారిశ్రామిక వేత్త ఎగుమతి చేయడం లేదని ఎం.ఎస్. ఎం.ఈ జాయింట్ డైరక్టర్ కమల్జిత్ దాస్ అన్నారు. భారత్ ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల కోట్ల ఎగుమతులు చేస్తుందని, అందులో ఒడిశా రూ.440 కోట్ల ఎగుమతి చేసి 7వ స్థానంలో ఉందన్నారు. దేశంలో ఒడిశా ఎగుమతుల్లో ఐదో స్థానంలో నిలబెట్టుకోవడానికి పారిశ్రామికవేత్తలు అడుగులు ముందుకువేయాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు పారాదీప్ ధమ్రా పోర్టు, భువనేశ్వర్ నుంచి దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్కు కార్గో ఎయిర్ ఫ్లైయిట్ నడుస్తుందని డైరెక్టర్, ఎక్స్పోర్టు ప్రమోషన్ అశోక్ కుమార్ బెహరా అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఎగుమతి చేయడానికి అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ఇకో బ్యాంకు పర్యవేక్షకుడు నితీష్ మహాంతి అన్నారు. ఈ సంధర్బంగా ‘ఒడిషా ఎక్స్పోర్టు సక్సస్’ అనే బ్రోచర్ను అతిథులు విడుదల చేశారు. కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు జ్ఞాపికతో సత్కరించారు. జిల్లాలో వివిధ పారిశ్రామిక వేత్తలు పాల్గొని వస్తు ఎగుమతిపై తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ వర్క్షాపు భువనేశ్వర్ డైరెక్టరేట్, ఎగుమతి, మార్కెటింగ్ ప్రమోషన్శాఖ ఆధ్వర్యంలో జరిగింది. -
ఎక్కడో ఊరవతల ఓ మర్రి చెట్టు.. ఎండన పడి తిరిగే వారిని కాసేపు కూర్చోండర్రా.. అని పిలుస్తూ ఉంటుంది. ఊరి మధ్యన రావి చెట్టు.. ఎర్రటి ఎండకు ఆకులతో గొడుగు పట్టి తన ఒడిలో కూర్చున్న వారికి ప్రాణ వాయువు అందిస్తూ ఉంటుంది. ఇంటివెనుక జామ చెట్టు.. తీయటి ఫలాలు అందించడంత
●విశాలమైన ప్రాంగణం మాది గండ్రేడు. శివారు గ్రామం. నాగావళి నది ఒడ్డున ఉంది. నది నుంచి వచ్చే చల్లని గాలి మర్రిచెట్టు కిందకు వచ్చి మరింత కూల్గా మారిపోతుంది. దీంతో పెద్దలు ఇక్కడే నిద్రపోయేందుకు, సేద దీరేందుకు వస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనువుగా చెట్టు నీడ ఉంది. ఈ చెట్టు మా గ్రామానికి వరం. – చింతాడ సూర్యారావు, గండ్రేడు, పొందూరు మండలం ●ఎండ నుంచి ఉపశమనం మాది మలకాం గ్రామం. చి న్న పల్లెటూరు. వేసవి కాలం వచ్చిందంటే గ్రామంలోని ప్రజలు ఈ మర్రి చెట్టుకిందకే కూర్చునేందుకు వస్తుంటారు. ఇక్కడే సేద దీరుతుంటారు. మర్రిచెట్టు వయస్సు సుమారు 200 ఏళ్లు ఉంటుంది. బయట నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ఇక్కడ కూర్చొని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. – జాడ అసిరినాయుడు, మలకాం, పొందూరు మండలం ● పచ్చని చెట్లే వేసవి విడిదులు ● పల్లెటూళ్లలో వృక్షాల కిందనే సేద దీరుతున్న ప్రజలు పొందూరు: పల్లెటూరు.. సందె వేళ.. మర్రి చెట్టు కింద మకాం.. కాసిన్ని కబుర్లు.. కావాల్సినంత చల్లని గాలి. అంతే వేసవి ఇట్టే గడిచిపోతుంది. చుట్టూ ఎండ తాండవం చేస్తున్నా చెట్టు నీడలో మాత్రం ఏసీ పెట్టినట్టే చల్లటి గాలి వీస్తుంది. అదే ఇప్పుడు పల్లెవాసులను రక్షిస్తోంది. పొందూరు మండలంలోని దళ్లవలస, కోటిపల్లి, మజ్జిలిపేట, గండ్రేడు, మలకాం, వీఆర్ గూడెం గ్రామాల్లో పెద్ద మర్రి చెట్లు వేసవి విడిదులుగా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లు సుమారు 60 ఏళ్ల నుంచి 200 ఏళ్ల వయస్సు ఉన్నవి. విశాలంగా వ్యాపించిన ఊడలతో నీడ అల్లుకుంటుంది. దీంతో ఎండకు దొరకకుండా పిల్లలు, పెద్దలు వాటి కిందనే సేద దీరుతున్నారు. ఽమధ్యాహ్న సమయాల్లో చెట్ల కిందకు వచ్చి ముచ్చటించుకునేవారు కొందరు, నిద్రపోయే వారు మరికొందరు, ఆడుకునే పిల్లలు, వలస కూలీలు అక్కడే ఉంటున్నారు. -
మోసగించిన కేసులో నలుగురు మహిళల అరెస్టు
రాయగడ: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి మోసగించి బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో కాశీపూర్ పోలీసులు నలుగురు మహిళలను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కటిని గిరి, మమిత గిరి, దుర్గా గిరి, విశ్వమణి గిరిలు ఉన్నారు. వీరి నుంచి పోలీసులు 34 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం కోర్టుకు తరలించారు. కాశీపూర్ సమితి లదాఖాన్ గ్రామంలో శుక్రవారం ఉదయం నలుగురు మహిళలు వెళ్లి బంగారు ఆభరణాలకు మెరుగుపడతామని నమ్మించారు. దీంతో గ్రామానికి చెందిన లావణ్య గౌడొ అనే మహిళ తన వద్ద గల రెండు తులాల బంగారు హారాన్ని మెరుగు పెట్టేందుకు ఇచ్చింది. అనంతరం మెరుగుపెట్టినట్లు నటించిన ఆ నలుగురు మహిళలు కొద్ది సేపటి తర్వాత ఒక కవరులో ప్యాక్ చేసి మెరుగు పెట్టినందుకు గాను కొంత మొత్తం డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత మెరుగు పెట్టేందుకు ఇచ్చిన ప్యాకెట్ను ఓపెన్ చేసి చూడగా అందులో ప్లాస్టిక్ హారం ఉండటంతో మోసపోయానని భావించిన గౌడొ లబోదిబోమంటూ వెంటనే కాశీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలొకి దిగిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ నలుగురు మహిళలను పట్టుకుని అరెస్టు చేశారు. -
మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదు
కొరాపుట్: మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు తగదని స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కొరాపుట్ జిల్లా విభాగ ప్రెసిడెంగ్ తరుణ్ కుమార్ మహాపాత్రో పేర్కొన్నారు. శనివారం జయపూర్ పట్టణంలోని నేషనల్ ఐబీలో జరిగిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ సభలో ప్రసంగించారు. కాలానుగుణంగా మీడియాలో మార్పులు జరుగుతున్నాయన్నారు. ఎంత అభివృద్ది జరిగినా మీడియాపై దాడులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పవన్ పాణీగ్రాహి, సత్యనారాయణ పట్నాయక్, సన్న చౌదరి, శిశిర్ ఆచార్య, తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.. జయపురం: మీడియా ప్రతినిధులు నిర్భయంగా విధులు నిర్వహించగలిగిన నాడే పత్రికలకు మనుగడ ఉంటుందని పలువురు పాత్రికేయులు అన్నారు. శనివారం ప్రపంచ ప్రెస్ స్వేచ్ఛా దినం సందర్భంగా స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఒడిశా, కొరాపుట్ జిల్లా శాఖ సమావేశం నిర్వహించింది. స్థానిక రోడ్లు, భవణ నిర్మాణ విభాగ అతిథి గృహంలో జిల్లా అధ్యక్షుడు తరుణ్ మహాపాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడారు. సమాజంలో పాత్రికేయులకు రక్షణ కల్పించేందుకు ప్రభత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరారు. -
అన్నదమ్ములకు 560 మార్కులు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి.79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అన్నదమ్ములు డానీ ఎల్.లెంక, డోంబుర్ లెంకకు శనివారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 560 మార్కులు వచ్చాయి. అన్నదమ్ములను ఉపాధ్యాయులు అభినందించారు. కుమారుల విజయం పట్ల తండ్రి మోహన్ లెంక ఆనందం వ్యక్తం చేశారు. టీచర్లకు ఆర్జిత సెలవులు మంజూరుచేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: ఇటీవల వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేసవి సెలవుల్లో సైతం హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి స్వచ్ఛందంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికీ ఆర్జిత సెలవులు మంజూరుచేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రవి, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞిప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. విద్యార్థుల మానసిక స్థితి, మండే ఎండలు, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లావ్యాప్తంగా నాటుసారా స్థావరాలెక్కడ ఉన్నా విస్తృతంగా దాడులు జరిపి అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) దోసకాయల శ్రీకాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి జిల్లాలో గల స్టేషన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్ట ర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో 80 అడుగుల రో డ్డు సమీప ఎకై ్సజ్ కార్యాలయంలో డీసీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 110 సారా గుర్తింపు గ్రామాలను సారా రహిత గ్రామాలుగా మార్చాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 212 ఐడీ కేసులు నమోదై 162 మందిని అరెస్టు చేసి 2231 లీటర్ల సారా, ఏడు వాహనాలను స్వాధీనపర్చుకున్నామన్నారు. 6735 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. అక్రమంగా మద్యం విక్రయించేవారిపై 874 కేసులు నమోదు చేసి అంతేమందిని అరెస్టు చేశామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, జిల్లా అధికారి తిరుపతినాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఎన్సీఈఆర్టీ అవార్డుకు ప్రాజెక్టు ఎంపిక కంచిలి: మండలంలోని చొట్రాయిపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు రూపొందించిన గణిత ప్రాజెక్టు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్సీఈఆర్టీ)వారు నిర్వహించిన అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆయనకు ఎన్సీఈఆర్టీ నుంచి సమాచారం వచ్చిందని ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ వారు జనవ రి 13న జాతీయ గణిత విద్యా సమావేశాల నిర్వహణ సందర్భంగా దేశవ్యాప్తంగా గణిత ప్రాజెక్టులను ఆహ్వానించారు. అందులో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ‘గణిత ప్రాథమిక కార్యకలాపాల సన్నాహక దశలో విద్యార్థుల పనితీరు అంచనా వేయటానికి బోర్డు గేమ్ ప్రయోగం’ అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా 105 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో మన రాష్ట్రం నుంచి 4 మాత్రమే ఉన్నాయి. అందులో తిరుపతిరావు ప్రాజెక్టు చోటు సంపాదించుకోవడం విశేషం. శ్రామికులే దేశానికి వెన్నెముక శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రామికులే దేశానికి వెన్నెముక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వివరించి, న్యాయ సహా యం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. 1886 మే 1న అమెరికాలో ఎనిమిది గంటల పనిది నం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని, షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తుచేశారు. ఈ చరిత్రను యువతకి తెలియజేసి కా ర్మికుల హక్కులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, డి ప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, తదితరులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణంలో క్రేన్ కూలి ముగ్గురు మృతి
భువనేశ్వర్: కటక్ ఖాన్ నగర్ ప్రాంతం రింగ్ రోడ్ వంతెన నిర్మాణంలో క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో కార్మికుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా కొనసాగుతోంది. కటక్ ఖాన్ నగర్ ప్రాంతంలోని ఒక వంతెన వద్ద శనివారం పనులు జరుగుతుండగా నిర్మాణ పనులకు ఉపయోగించిన క్రేన్ కూలిపోయిన ప్రమాదం జరిగింది. దీంతో కొన్ని స్లాబ్లు కుప్ప కూలాయి. కఠొజొడి నదిపై వంతెన పనులు జరుగుతుండగా కొన్ని భారీ కాంక్రీట్ స్లాబ్లను ఎత్తుతున్న క్రేన్ ప్రమాదవశాదకదే కూలిపోయింది. క్రేన్ కింద పని చేస్తున్న కార్మికులు స్లాబ్ల కింద నలిగిపోయారు. క్షతగాత్రులను కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి చేర్చారు. ముఖ్యమంత్రి సంతాపం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు వెచ్చిస్తారని పేర్కొన్నారు. ఇద్దరి పరిస్థితి విషమం -
సమ్మర్ క్రికెట్ కోచింగ్కు వేళాయె..●
● రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ కోచింగ్ క్యాంప్లు మొదలు శ్రీకాకుళం న్యూకాలనీ: సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులకు రంగం సిద్ధమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు జిల్లా క్రికెట్ సంఘం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్లకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ శిబిరాల్లో క్రికెట్పై ఆసక్తి కలిగిన బాలబాలికలు ఎవరైనా హాజరుకావచ్చని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. 5 కేంద్రాల్లో శిక్షణ.. జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కేంద్రం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలతోపాటు కళింగపట్నం, నరసన్నపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్సెంటర్లలో ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్లను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ఉద యం 6 ఉదయం 8.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 6.30 వరకు సబ్ సెంటర్లలో నిష్ణాతులైన కోచ్లు శిక్షణ ను అందించనున్నారు. శిక్షణకు హాజరయ్యే చిన్నారులు, బాలబాలికలకు ఫిట్నెస్తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తదితర విభాగాల్లో తర్ఫీదును అందిస్తారు. తల్లిదండ్రులు వారి పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలని సబ్సెంటర్ల కోచ్లకు అందజేయాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ పేర్కొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్రీడాకారులకు జూన్ ఒకటో తేదీన ఆయా సబ్సెంటర్లలో సర్టిఫికెట్లను అందజేయనున్నట్టు వారు వెల్లడించారు. -
ఇంద్రావతి నదీ తీరంలో అస్థి పంజరం
కొరాపుట్: ఇంద్రావతి నదీ తీరంలో గుర్తు తెలియని వ్యక్తి అస్థి పంజరం లభ్యమైంది. శనివారం నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి పోలీస్ స్టేషన్ పరిధిలో నందాహండి సమితి ఎకంబా–నువాగాం గ్రామాల మధ్య ప్రజలు స్నానానికి వెళ్లారు. అక్కడ ఇసుకలో అస్థి పంజరం కొంత బయటకు వచ్చి కనిపించింది. దీంతో స్థానిక సర్పంచ్ ద్వారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తవ్వకాలు ప్రారంభించగా అస్థి పంజరంతో పాటు మొబైల్ ఫోన్ కూడా దొరికింది. ఐఐసీ ప్రణవ్ తుడు, అదనపు తహసీల్దార్ పురుషోత్తమ బెనియా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. సైంటిఫిక్ టీం రంగంలోకి దిగింది. అనంతరం అస్థి పంజరాన్ని తరలించారు. -
రైతులు ధాన్యం డబ్బులు చెల్లించాలి
కొరాపుట్: రాయిఘర్ ప్రాంతంలోని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు చెల్లించాలని బీజేడీ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి డిమాండ్ చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని రాకీసాన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలోని సుమారు 144 మంది రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. మూడు నెలలు అయినా వారికి డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. అనంతరం బీజేడీ నేతలు నేరుగా సీఎస్వో ఆఫీస్కి వెళ్లి ధర్నా చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి మరో 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రందారి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజులా మజ్జి, మాజీ ఎమ్మెల్యే సుభాష్ గొండో తదితరులు పాల్గొన్నారు. -
కష్టార్జితం కాలిపోయింది..
కొత్తూరు: కష్టార్జితం కాలిపోయింది. కుమార్తె పెళ్లి కోసం దాచిపెట్టిన నగదు, బంగారం బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తూరులోని కొత్తపేట కాలనీలో శుక్రువారం కొగాన పద్మావతి శుక్రవారం ఉదయం దేవుడి పటం వద్ద దీపం వెలిగించి ఉపాధి పనికి వెళ్లిపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గమనించి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే పద్మావతి కుమార్తె వివాహం కోసం ఇనుప పెట్టెలో దాచిన రూ. 2.80 లక్షల నోట్లు కాలిబూడిదయ్యాయి. తులంన్నర బంగారం, పిల్లల విలువైన పత్రాలు, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. సర్వం కోల్పోయిన పద్మావతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొత్తూరుకు చెందిన గోగుల చిట్టిబాబు బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం కుమార్తె వివాహం కోసం దాచిన రూ.2.80 లక్షల నగదు బూడిద -
ఆవాస్ యోజనపై అవగాహన
రాయగడ: పట్టణంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–2.0 కార్యక్రమంపై శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ సమావేశం హాల్లో చైతన్య కార్యక్రమం జరిగింది. జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికా రి అక్షయ కుమార్ ఖెముండొ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, వైస్ ఛైర్మన్ శుభ్రా పండలు పాల్గొన్నా రు. రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలొ ప్రారంభమైన ఈ చైతన్య కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంలొ నివిసిస్తున్న అర్హులైన అందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలొ విలీనం చేసి వారు ఆ పథకం ద్వారా లబ్దీపొందాలన్న ఉద్దేశ్యంతొ ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అందుకు మున్సిపాలిటీ పరిధిలొ గల 24 వార్డుల్లొ గల కౌన్సిలర్లు వారి వారి ప్రాంతాల్లొ గల అర్హులైన వారిని పథకంలొ చేర్పించేందుకు సహకరించాల్సి ఉంటుందని అన్నారు. -
ఘనంగా సాహిత్య సంసద్ వార్షికోత్సవం
జయపురం: ఛండనొయి సాహిత్య సంసద జయపురం శాఖ వార్షికోత్సవం స్థానిక లోకేశ్వరి కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో శుగ్రవారం ఘనగా జరిగింది. ఉత్సవంలో ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ సురేష్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. శ్రీజగన్నాధుని చిత్రపటానికి పూల మాలలు వేసి పూజించిన తరువాత ఛిండినొయి సాహత్య సంసద్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు యుధిస్టర్ మల్లిక్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో ముఖ్యవక్తగా ఆదివాసీ భాష పరిశోధకులు డాక్టర్ రాజేంద్రపాఢీ, గౌరవ అతిథిగా అధ్యాపకులు డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ హాజరై సమాజాన్ని చైతన్య పరచటంలో సాహిత్య ప్రభావాన్ని వివరించారు. ఛిండినొయి సాహత్య సంసద్ వార్షికోత్సవం ముఖ పత్రం శుభశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహిక రచయితలు నేటి సమాజ పరివర్తనలో సాహిత్య భూమికపై చర్చించారు. చర్చలలో భైరాగి చరణ సాహు, విజయ లక్ష్మి పాణిగ్రహి, ప్రమోద్ కుమార్ రౌళొ, అశోక్ పొలాయ్, భావ చంద్రికా దేవి, అజయ మల్లిక్, డోలి నాయిక్, నారాయణ సాగర్, ఘాశీరాం మహాపాత్రో, శుభశ్రీ పట్నాయక్, రాజశ్రీస్వై, అభిలాష్ శాంత పాత్రో, శుభశ్రీ పాత్రో, సంఘమిత్ర భుక్త పాల్గొన్నారు. ప్రముఖ కవులు, కవియిత్రిలు తమ శ్వీయ రచనలను వినిపించారు. నిరంజన్ పాణిగ్రహి, సంతోష్ నాయిక్, నికుంజ రంజనీ మహంతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
పలాస : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపి వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దండకారణ్యంలో ఆదివాసీలు సుమారు 400 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమం చేపట్టడం అప్రజాస్వామ్యమన్నారు. కర్రెగుట్ట కొండలను జల్లెడ పడుతున్నారని, అన్నిరకాల భద్రతా బలగాలను ఈ ఆపరేషన్కు వినియోగించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, చాపర వేణు, కొర్రాయి నీలకంఠం, పోతనపల్లి అరుణ, లక్ష్మణరావు, పుచ్చ దుర్యోధనరావు, మద్దిల రామారావు, ఎం.వినోద్, గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, మామిడి భీమారావు, రాపాక మాధవరావు, జడ్డే అప్పయ్య, పోతనపల్లి కుసుమ, బర్ల గోపి, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
10న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన
భువనేశ్వర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 10న భువనేశ్వర్ చేరుకుంటారు. తొలి పర్యటనలో జట్నీ సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసి సాయంత్రం పూరీలో పర్యటిస్తారు. శ్రీమందిరంలో శ్రీజగన్నాథుని దర్శించుకుని పూజాదుల్లో పాల్గొంటారు. ఆ రాత్రి పూరీలో బస చేస్తారు. మరుసటి రోజు పశ్చిమ ఒడిశా సందర్శిస్తారు. సంబలపూర్ ప్రాంతంలో మా సమలేశ్వరి మాత ఆలయం సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భువనేశ్వర్ జనతా మైదాన్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ తెలిపారు. రాధాకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమిపూజ కొరాపుట్: రాధాకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని నీలకంఠ నగర్–ఇచ్ఛావతి గుడల మధ్య నూతనంగా నిర్మి్ంచనున్న ఆలయ పనులకు నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి శుక్రవారం భూమి పూజ చేశారు. వేద పండితుల సమక్షంలో మట్టిని పోసి తొలి క్రతువు ముగించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కను దాస్ పాల్గొన్నారు. తాగునీటి బాటిళ్లలో నాటుసారా భువనేశ్వర్: మినరల్ వాటర్ బాటిళ్లలో నాటుసారా అమ్మకం గుట్టు రట్టయ్యింది. ఖుర్దా జిల్లా భువనేశ్వర్ శివారు దారుఠెంగో ప్రాంతంలో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఆకస్మిక దాడుల్లో అబ్కారీ విభాగం పోలీసులు 10,000 లీటర్ల నాటుసారాతో మినరల్ వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.19 లక్షలుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి మూడు నాలుగు చక్రాల వాహనాలు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. దంపతుల ఆత్మహత్య రాయగడ: ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకరించారు. వారి దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతుండేది. అయితే ఏ కష్టమొచ్చిందో గానీ ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన జిల్లాలోని చంద్రపూర్ సమితి లక్ష్మీపూర్ గ్రామంలో గల నువాసాహిలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతులను కేదార్ కుసులియా (32), శ్రీయా బొడొనాయక్ (27) లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ ఎస్డీపీఓ సంతొషిణి ఓరం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బిసంకటక్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. విజిలెన్స్ వలలో దశమంతపూర్ సీడీపీఓ కొరాపుట్: విజిలెన్స్ వలకు అవినీతి సీడీపీఓ చిక్కారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సీడీపీఓ శకుంతల దాస్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అరెస్టయ్యారు. అదముండా గ్రామ అంగన్వాడీ వర్కర్ మినతి ఖొస్లా విధి నిర్వహణ పత్రాలు ఆమోదించడానికి రూ.10 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇవ్వలేని మినతి జయపూర్ విజిలెన్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో వారు వల వేసి సీడీపీఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం జయపూర్ విజిలెన్స్ కార్యాలయానికి తరలిస్తున్నారు. -
కోపరేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ పర్యటన
కొరాపుట్: రాష్ట్ర కోపరేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, కొరాపుట్ జిల్లా నోడల్ అధికారి రాజేష్ ప్రభాకర్ పాటీల్ కొరాపుట్ జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్ భారత మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా పర్వత టన్నెల్ సందర్శించారు. అతి పెద్ద వాటర్ సప్లై ప్రాజెక్ట్, రాజపుట్లో మిలిట్ ప్రోసెసింగ్ సెంటర్, పెట్టెరులో రూరల్ ఇండస్ట్రీయల్ పార్క్లను సందర్శించి వాటి పురోగతిని సమీక్షించారు. గతంలో ఈ ప్రాంతంలో కలెక్టర్గా పనిచేయడంతో రాజేష్ రాకతో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. పలు చోట్ల ప్రజలు వినతులు ఇచ్చారు. పర్యటనలో జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరం సశ్యా రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. -
మసీదులో గంధంచెట్లు నరికివేత
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ కూడలి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న జామియా మసీదులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు గంధం చెట్లు నరికి తరలించే యత్నం చేశారు. ఈ విషయమై ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కు మసీదు మౌజన్ (గురువు) ఎస్.కె.మహ్మద్ ఫిర్యాదు చేసినట్లు మత పెద్దలు కె.ఎస్.అమానుల్లా, మరికొందరు చెప్పారు. మసీదులో సుమారు 40 వరకు చిన్నవి, పెద్దవి గంధం చెట్లున్నాయని, శుక్రవారం ఉదయం చెట్లను వాచ్మెన్ నాయుడు దగ్గరుండి ట్రిమ్మింగ్ చేసినట్లు తెలిసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు 30 అడుగుల పొడవుండే ఒక గంధం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు తరలించేశారని అదే వాచ్మెన్ మౌజన్కు చెప్పడంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇంకా లోపల ఎన్ని చెట్లు కొట్టేశారో తెలియాల్సి ఉందన్నారు. గంధం చెట్టు కొమ్మ -
22 బైక్ల స్వాధీనం
● బైక్ దొంగల గుట్టు రట్టు ● నలుగురు నిందితుల అరెస్టు జయపురం: ఒక బైక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తే మొత్తం బైక్ దొంగల గుట్టు రట్టయ్యింది. జయపురం పట్టణ పోలీసులకు అందిన ఒక కేసు దర్యాప్తు జరపగా అనేక బైక్ దొంగతనం కేసులు బయట పడ్డాయి. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కాశ్యప్ శుక్రవారం మధ్యాహ్నం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. గత నెల 27న జయపురం సౌరసాహి వాసి కార్తీక మహాపాత్రో(19) తన బైక్ పోయిందని ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఆ మేరకు దర్యాప్తు ప్రారంభించామని దర్యాప్తులో నరసింగ ఉరఫ్ నరేష్ దవురుని అదుపులోకి తీసుకుని విచారణ చేశామని తెలిపారు. అయితే తాను ఒక్కడినే కాదని, తనతో బొరిగుమ్మ సమితి బొడొదుబులి గ్రామ వాసి అనిల్ హరిజన్(33) కూడా ఉన్నాడని బయటపెట్టాడని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి దొంగిలించిన బైక్లు అన్నీ నవరంగపూర్ జిల్లా మైదల్పూర్ డెంగా సాహి లక్ష్మణ హరిజన్(50) ఇంటిలో ఉంచామని వెల్లడించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అనంతరం దొంగిలించిన మోటారు 22 బైక్లు అన్నీ లక్ష్మణ మఝి, భీమ ఖిలోల ద్వారా మల్కన్గిరి, కొరాపుట్, నవరంగపూర్ జిల్లాల మారుమూల ప్రాంతాల్లో రూ.10వేలు, రూ.15వేలకు అమ్మేసినట్లు తెలిపారని పేర్కొన్నారు. ఆ బైక్లన్నీ లక్ష్మణ్, భీమ ఖిలోల ద్వారా రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుడు అనిల్ హరిజన్ దొంగిలించిన మోటారు బైక్లను మైదల్పూర్ లక్ష్మణ ఇంటి సమీపంలో చేర్చి ఒక్కో కస్టమర్ను ఏర్పాటు చేసి వారికి అమ్ముతున్నట్లు వెల్లడించారు. బైక్ దొంగతనంలో ఆరితేరిన అనిల్ హరిజన్ను గతంలో బొరిగుమ్మ పోలీసులు అరెస్టు చేశారని, అప్పట్లో అతడి నుంచి 15 బైక్లు రికవరీ చేశారని పోలీసు అధికారి కాశ్యప్ వెల్లడించారు. రెండు నెలల కిందటే అనిల్ బెయిల్పై విడుదలయ్యాడని తెలిపారు. అతడు జయపురం పట్టణం, జయపూర్ సదర్, అంపాణి, బొరిగుమ్మ, బొయిపరిగుడ, రాయిఘర్, నవరంగపూర్, సునాబెడ, మొదలగు పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు చేశాడని వెల్లడించారు. గురువారం సాయంత్రం వారిని అరెస్టు చేసి శుక్రవారం హాజరు పరిచామని చెప్పారు. ఇంకొన్ని బైక్ల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బైక్ల అప్పగింతజయపురం: వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగలు దొంగిలించిన బైక్లను బైక్ల యజమానులకు జయపురం పోలీసు అధికారు శుక్రవారం అప్పగించారు. జయపురం పట్టణ పోలీసులు 22 బైక్లను నిందితుల నుంచి స్వాధీన పరుచుకున్నారు. వాటిని జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కాశ్యప్, పట్టణ పోలీసు అధికారి అశవిణీ కుమార్ పట్నాయిక్ తదితరుల సమక్షంలో యజమానులకు అప్పగించారు. -
పదో తరగతి ఫలితాలు విడుదల
● జిల్లా వ్యాప్తంగా 98.10 శాతం ఉత్తీర్ణత పర్లాకిమిడి: పదో తరగతి పరీక్ష ఫలితాలను సెకండ రీ ఎడ్యుకేషన్ బోర్టు శుక్రవారం ప్రకటించింది. గజ పతి జిల్లాలో ఉత్తీర్ణత శాతం 98.10 ఉన్నట్టు జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మాయాధర్ సాహు తెలిపారు. ఈసారి బాలికల కంటే బాలుర శాతం అధికంగా పాసయ్యారు. మొత్తం జిల్లాలో 110 ఉన్నత పాఠశాలల్లో పది పరీక్షలు ఫిభ్రవరిలో జరిగాయి. 7685 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా వారిలో 137 మంది గైర్హాజర్ అయ్యారు. ఏ1 (ఫస్టుక్లాస్) 15 మంది ఉత్తీర్ణత అవ్వగా, ఏ2లో 633, బి1లో 2254, బి2లో 2365, కంపార్ట్మెంటల్ 1331, డి గ్రేడ్ 745, ఈగ్రేడ్ 156, ఫెయిల్ 801 మంది ఉన్నారు. మొత్తంగా బాలికలు 20,647 మంది, బాలురు 20783 మంది పాసయ్యారు. సరస్వతీ శిశు విద్యామందిర్ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఏ1 గ్రేడ్ను (90శాతం) 566/600 ప్రజ్యోతి చౌదురి, అంకితా పాఢి 600మార్కులుకు గాను 553 సాధించింది. సరస్వతీశిశు విద్యామందిర్లో శతశాతం పాసయ్యినట్టు ప్రధాన అచార్యులు సరోజ్ పండా తెలియజేశారు. జయపురంలో 100 శాతం ఫలితాలు జయపురం: రాష్ట్రంలో మెట్రిక్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. కొరాపుట్ జిల్లాలో 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా తెలుగు సంస్కృతిక సమితిచే నిర్వహించబడుతున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించింది. ఈ పాఠశాల నుంచి 75 మంది మెట్రిక్ పరీక్షలు రాయగా వారంతా ఉత్తీర్ణులు అయ్యారు. వారి లో ఏ–2 గ్రేడ్లో ఒకరు ఉత్తీర్ణ కాగా బి.1 గ్రేడ్లో 11 మంది,బి.2 గ్రేడ్లో 23 మంది.సి.గ్రేడ్లో 32 మంది. డి గ్రేడ్లో 6 గురు, ఇ. గ్రేడ్లో ఇద్దరు ఉత్తీర్ణులైనట్టు పాఠశాల వర్గాలు వెల్లడించాయి. -
భారీ విమానయాన ప్రణాళికల ఆవిష్కరణ
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రామాణికలతో కూడిన భారీ విమానయాన ప్రణాళికని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో పారాదీప్లో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, 15 జిల్లాల్లో హెలీపోర్ట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విమానయాన మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశలో ఇదో కీలకమైన అడుగు. స్థానిక లోక్ సేవా భవన్లో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాష్ట్ర విమానాశ్రయాలు ఆధునీకరణ, విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ ప్రామాణికలు లక్ష్యంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. పారదీప్ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రణాళికలను ఆవిష్కరించింది. పూరీ విమానాశ్రయ సన్నాహాలు వేగవంతం పూరీలోని శ్రీ జగన్నాథ్ విమానాశ్రయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విమాన రాకపోకలకు ఆదరణ పెరుగుతున్నందున విమానయాన అనుసంధానం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు, సందర్శకుల రాకపోకలతో నిత్యం కిటకిటలాడే పూరీ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాధాన్యతని ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో వైమానిక ప్రయాణ సౌకర్యాలు పెంపొందించడానికి విస్తృత వ్యూహాన్ని ప్రతిబింబిస్తూ 15 జిల్లాల్లో హెలీపోర్ట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నట్లు ఈ సమావేశంలో ప్రస్తావించారు. హెలిపోర్ట్లు, విమానయాన కేంద్రాల అభివృద్ధి ప్రాంతీయ ప్రాధాన్యతను మెరుగుపరచడానికి 15 జిల్లాల్లో హెలిపోర్ట్లను నిర్మించే ప్రతిపాదనకు ప్రాధాన్యత కల్పించారు. ఢెంకనాల్ బిరాషోల్ ఎయిర్స్ట్రిప్ వద్ద బిజూ పట్నాయక్ ఏవియేషన్ సెంటర్ భవిష్యత్ అభివృద్ధి ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ప్రజా నిర్మాణ విభాగం నోడల్ ఏజెన్సీగా నియమించారు. రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో విమానయాన అనుసంధానం మరింత పెంపొందించేందుకు జయపురం, దండబోస్, రొంగైలుండా, గోటమా, సతిభట, రైసువాన్, తుషారా, జమదర్పాలి, మల్కన్గిరి, అమర్దా రోడ్ మరియు ఉత్కెలాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాలపై దృష్టి సారించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలపై దృష్టి రాష్ట్ర వ్యాప్తంగా విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు, డ్రోన్ హబ్లతో కూడిన ప్రపంచ స్థాయి విమానయాన సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే నిబద్ధతను ముఖ్యమంత్రి మాఝీ పునరుద్ఘాటించారు. ఒడిశా విమానయాన రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన మానవ వనరుల ప్రతిపాదనలను చర్చించారు. కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం 15 జిల్లాల్లో హెలీపోర్ట్లు -
11 నుంచి సిమిలిగుడ అగ్ని గంగమ్మ పండగలు
కొరాపుట్: సిమిలిగుడలో అగ్ని గంగమ్మ పండగలు 11వ తేదీ నుంచి జరపాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని అగ్ని గంగమ్మ దేవాలయ ప్రాంగణంలో తేదీ ఖరారు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సభ్యులందరూ సామూహికంగా మే 11 నుంచి 20వ తేదీ వరకు పండగలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, మాజీ ఎమ్మెల్యే రఘరాం పొడా ల్, సునాబెడా మున్సిపల్ చైర్మన్ రాజేంద్రకుమార్ పాత్రో, సునాబెడా ఎస్డీపీఓ సుమిత్ర జెన్న తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథ్ ధామ్ అంటే పూరీ మాత్రమే
● రామకృష్ణ దాస్ మహాపాత్రో భువనేశ్వర్: పశ్చిమ బెంగాలు దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రారంభోత్సవం వివాదాస్ప దం అయింది. ఈ ఆలయాన్ని జగన్నాథ ధామ్గా పేర్కొనడం, ఆలయంలో రాతి విగ్రహాలు చర్చనీయాంశం అయ్యాయి. ఇటువంటి వివాదస్పద జగన్నాథ ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ మంది రం నుంచి స్వామి సేవాయత్ల బృందం హాజరు కావడం రచ్చ ప్రేరేపించింది. ఈ పరిస్థితిపై దైతప తి నియోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ దాస్ మహాపాత్రో శుక్రవారం స్పందించారు. పూరీలో ప్రసిద్ధ జగన్నాథ ఆలయం శ్రీమందిరంలో మినహా మరెక్కడా దారు బ్రహ్మ లేడని పేర్కొన్నారు. అలాగే జగన్నాథ్ ధామ్ అంటే పూరీని మాత్రమే సూచిస్తుందన్నారు. మరెక్కడా జగన్నాథ్ ధామ్ ఉండదని తేల్చేశారు. ఈ మేరకు అధికారిక స్థాయిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆమెకి లేఖ రాసి ఈ విషయం తెలియజేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని దిఘాలో కొత్తగా ప్రారంభించబడిన జగన్నాథ ఆలయానికి ఆహ్వానం అందిన తర్వాత తాను హాజరైనట్లు వెల్లడించారు. అక్కడ విగ్రహాల ఎత్తు రెండున్నర అడు గుల నుంచి మూడు అడుగుల మధ్య ఉందన్నారు. మమతా బెనర్జీ తన శిష్యులలో ఒకరుగా పేర్కొన్నా రు. ఆమె తనను దిఘాలో జగన్నాథ ఆలయాన్ని స్థాపించమని ఆహ్వానించింది. తిథి ప్రకారం పూజ చేయమని కోరింది. అక్కడ 3 నెలలు రాతి విగ్రహా లు ఉన్నాయి. అయితే ప్రతిష్టించబడిన విగ్రహాలు వేప చెక్కతో తయారు చేయబడినవని స్పష్టం చేశా రు. పశ్చిమ బెంగాల్లోని దిఘాలో జగన్నాథ ఆల య స్థాపన మరియు దానికి జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడంపై చెలరేగిన వివాదంపట్ల సేవకుల లో మిశ్రమ స్పందనలు కలకలం రేపుతున్నాయి. -
గజపతి టాప్.. కొరాపుట్ లాస్ట్
● మెట్రిక్ పరీక్ష ఫలితాలు వెల్లడి ● సమగ్ర ఉత్తీర్ణత 94.93 శాతం భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది ఫలితాల్లో 94.93 శాతం సమగ్ర ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలు రాసిన 5 లక్షల 2 వేల 417 మంది విద్యార్థుల్లో 4 లక్షల 84 వేల 863 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచారు. బాలికల ఉత్తీర్ణత 96 శాతం నమోదు కాగా బాలుర ఉత్తీర్ణత 94 శాతానికి పరిమితమైంది. అత్యధికంగా 99.35 శాతం ఉత్తీర్ణతతో గజపతి జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. అత్యల్పంగా 92.83 శాతం ఉత్తీర్ణతతో కొరాపుట్ జిల్లా అట్టడుగుకు దిగజారింది. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్ బోర్డు కార్యాలయం సందర్శించి ఫలితాల్ని ప్రకటించారు. ఆయనతో విభాగం ప్రముఖ కార్యదర్శి షాలిని పండిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలితాల సంచికని ఆవిష్కరించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఫలితాలు bsodisha.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓఆర్10 అని టైప్ చేసి 5676750 కు ఎస్ఎంఎస్ చేస్తే ఫలితాలు వివరాలు అందుతాయన్నారు. పరీక్ష ఫలితాల్లో 3,273 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత రేటు 96.27 శాతం నమోదైంది. ముఖ్యమంత్రి అభినందనలు బోర్డు వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. ఆశాజనకమైన ఫలితాలు సాధించలేకపోయిన విద్యార్థులు దృఢ సంకల్పంతో సాధన చేసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. విద్యార్థులంతా ఉజ్వల భవిష్యత్తో ఉన్నత ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
కిట్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మరణం
● విదేశాంగ శాఖ సంతాపం ● యూజీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు ● క్యాంపస్ ప్రాంగణంలో పోలీసుల డేరా భువనేశ్వర్: స్థానిక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటి – కిట్) విశ్వవిద్యాలయ హాస్టళ్లలో నేపాల్కు చెందిన విద్యార్థినుల మరణాలు వరుసగా చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఈ విశ్వ విద్యాలయంలో నేపాలీ విద్యార్థి ప్రిషా షా మరణం అనుమానాస్ప దమైంది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం నుంచి క్యాంపస్లో పోలీసుల బృందం డేరా వేసింది. మరో వైపు ఈ విషాద సంఘటనపై విచారణ జరిపేందుకు పలు ప్రముఖ వర్గాలు ఎవరి తరహాలో వారు రంగంలోకి దిగారు. పోలీసు కమిషనర్, డిప్యూటీ పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఘటనా స్థలం సందర్శించారు. విద్యార్థిని విషాదకర మర ణం పట్ల విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసి సంతాపం ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో మృతు ల కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఒడిశా ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో నేపాలీ విద్యార్థి మరణం ఈ క్యాంపస్లో నేపాలీ విద్యార్థి మృతి చెందడం వరుసగా ఇది రెండోసారి. మృతుల కుటుంబానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించింది. ప్రస్తుతం ఒడిశా పోలీసులు సమగ్ర విచార ణ నిర్వహిస్తున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీ య విద్యార్థుల భద్రత, రక్షణ, శ్రేయస్సును తీవ్రంగా పరిగణిస్తుందని ఈ శాఖ పేర్కొంది. ఈ విషయంలో అనుక్షణం తాజా సమాచారం కోసం సమన్వయాన్ని నిర్ధారించడానికి నేపాలీ అధికారులు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కిట్ నిర్వహణ యంత్రాంగంతో తాము సన్నిహితంగా ఉంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ప్రిషా షా మరణంపై నేపాల్ రాయబా ర కార్యాలయం సంస్థ ప్రతినిధులు, పోలీసు అధికారులు మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర పార్టీలను సంప్రదించి చర్చలు జరిపింది. నేపాల్ రాయబార కార్యాలయం కూడా ఈ సంఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తును డిమాండ్ చేసింది. కిట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నేపాలీ విద్యార్థులందరి భద్రత, రక్షణను నిర్ధారించడం కీలకంగా పే ర్కొంది. ఈ విషయానికి సంబంధించి నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు ప్రధానమంత్రి కా ర్యాలయం నుంచి తాజా సమాచారం సేకరిస్తుంది. కిట్ విశ్వవిద్యాలయం ప్రతిస్పందన క్యాంపస్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, ఈ సంఘటనపై కిట్ అధికారు లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్యాంపస్లో ఈ సంఘటనను గుర్తించిన వెంటనే, హాస్టల్ అధికారు లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారి సమక్షంలోనే విద్యార్థి మృత దేహాన్ని స్వాధీ నం చేసుకున్నారు. ఆమెను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తదనంతరం తదుపరి ప్రక్రియ ల కోసం మృతదేహాన్ని ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు. నిజ నిర్ధారణ కమిటి ఈ సంఘటనపై యూజీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇగ్నో మాజీ వైస్ చాన్స్లర్ నాగే శ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్తో పాటు 3 మంది సభ్యులు ఉంటారు. క్యాంపస్లో ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయో కమిటీ నిజ నిర్ధారణ చేస్తుంది. దర్యాప్తు ముగించి కమిటీ 10 రోజుల్లో నివేదికను సమర్పిస్తుంది. -
దిఘా జగన్నాథ ఆలయ వివాదం తీవ్రతరం
● అంతర్గత దర్యాప్తునకు ఆదేశాలు భువనేశ్వర్: పశ్చిమబెంగాల్లోని దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రతిష్ట మహోత్సవం వివాదస్పదమై తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిస్థితిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పందించారు. ఈ వివాదం కోణంలో అంతర్గత దర్యాప్తు జరపాలని పూరీ శ్రీజగన్నాథ ఆలయ ప్రధాన పాలన అధికారి(సీఏఓ) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢికి మంత్రి లేఖ రాశారు. ఈ లేఖలో దర్యాప్తు జరపాల్సిన సమస్యాత్మక అంశాల్ని స్పష్టం చేశారు. దిఘా ఆలయానికి జగన్నాథ ధామ్ అని పేరు పెట్టడం అత్యంత వివాదస్పదం అయింది. దేశంలో సమగ్రంగా చతుర్థామాలు ఉన్నాయి. వీటిలో పూరీ ఒకటిగా స్థానం సాధించింది. ఈ పరిస్థితుల్లో దిఘా జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ ధామ్గా పేర్కొనడంతో రచ్చ రగులుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పూరీ శ్రీమందిరం నుంచి సేవాయత్లు దిఘా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం వివాదాన్ని మరింత రగిల్చింది. మరోవైపు దిఘా ఆలయంలో దేవతల విగ్రహాలను నిర్మించడానికి శ్రీమందిరంలో దారు విగ్రహాల తయారీ తర్వాత మిగిలిన పవిత్ర కలప ఉపయోగించినట్లు ప్రసారమైన వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దిఘా జగన్నాథ ఆలయాన్ని ఏప్రిల్ 30న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ చర్యలు జగన్నాథ స్వామి భక్తులు మరియు ఒడిశాలోని నాలుగున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వివాదస్పద అంశాల్ని పరిగణనలోకి తీసుకుని అంతర్గత దర్యాప్తు చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తీసుకు రావాల్సి ఉందని మంత్రి శ్రీమందిరం సీఏఓకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు
వజ్రపుకొత్తూరు రూరల్: యువతకు నైపుణ్యాలతోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని గరుడభద్రలో సైనింగ్ స్టార్ యువజన సంఘం 25వ వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయి డీఎస్సీ టాలెంట్ టెస్ట్ను గురువారం నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్లో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది అభ్యర్థులు పాల్గొని ఆన్లైన్లో ప్రతిభ పరీక్ష రాశారు. ఈ పోటీ పరీక్షలో కె.స్వప్న (శ్రీకాకుళం) ప్రతిభ కనబ ర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. కె.భారతి(శ్రీకాకుళం) ద్వితీయ స్థానం, ఎన్.శ్యామల(విజయనగరం) తృతీయ స్థానంతో పాటు మరో ఏడు స్థానాల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు నగదు బహుమతి తో పాటు జ్ఞాపికలను మాజీ మంత్రి చేతులమీదు గా అందజేశారు. కార్యక్రమంలో సైనింగ్ స్టార్ యువజన సంఘ అధ్యక్షుడు వై.సంతోష్కుమార్, సర్పంచ్ గూడ గిరిజ ఈశ్వరరావు, సైనింగ్ స్టార్ యువజన సంఘ కార్యదర్శి జి.నగేష్, గ్రామ సంఘ కార్యదర్శి చెల్లూరి పాపారావు, గాయిత్రి కళాశా ల ప్రిన్సిపాల్ షణ్ముఖరావు, జగన్ కోచింగ్ సెంటర్ అధినేత జగన్, గూడ భాస్కరరావు, వై.ధర్మారావు, వై.అప్పారావు, వై.అనందరావు, ఎ.దానేష్ పాల్గొన్నారు. -
15 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు పర్లాకిమిడి: గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గజపతి జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసుస్టేషన్ పరిధి హాడపోదా జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని అందుకున్న సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులు అడవ గ్రామానికి చెందిన రఘునాథ శెఠి, అజయ్ నాయక్లుగా గుర్తించామన్నారు. 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం! జయపురం: బైక్ దొంగల ఆట కట్టించేందుకు జయపురం పట్టణ పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా చోరీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారివద్ద నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ విషయాన్ని పట్టణ పోలీసు అధికారి వల్లభ చంధ్ర రౌత్ వద్ద ప్రస్తావించగా సమాదానం చెప్పేందుకు నిరాకరించారు. అయితే తగిన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు. గాయపడిన వ్యక్తి మృతి నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఢీకొని గాయపడిన తుంగాన గోవిందరావు (48) గురువారం వేకువజామున మృతి చెందారు. బుధవారం ఉదయం ట్రైన్ ఢీకొనడంతో గాయాలపాలై న విషయం తెలిసిందే. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు తెలిపా రు. కాగా మృతునికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు మహేష్, కుమార్తె అనితలు ఉన్నారు. కానిస్టేబుల్పై కేసు నమోదు కాశీబుగ్గ: పలాస కోర్టుకు సంబంధించి వివిధ కేసుల్లో రికవరీ అయిన బంగారం, నగదును సొంతానికి వాడుకున్న విషయమై ఒక కానిస్టేబుల్పై కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదయ్యింది. సంబంధిత బాధితులకు అందాల్సిన రూ.10 లక్షలు, ఆరు తులాల బంగారం అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించగా విషయం బయటపడింది. ఇదే విషయంపై కాశీబుగ్గ పోలీసుస్టేషన్ సీఐ సూర్యనారాయణకు వివరణ కోరగా, అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి
● బహుళార్ధసాధక కార్మికుల విశ్రాంతి గదుల ప్రారంభంలో సీఎం మాఝి ● ఒడిశా శ్రామిక్ సాథీ మొబైల్ యాప్ ప్రారంభం భువనేశ్వర్: ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నామని, ప్రధానంగా అట్టడుగు స్థాయి ప్రజలకు ప్రభుత్వ సేవలు అంకితం చేస్తున్నామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి ఇదే దృక్పథంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఓయూఏటీ వ్యవసాయ విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా నగరంలో 2 బహుళార్ధసాధక కార్మికుల విశ్రాంతి సముదాయాల్ని ప్రారంభించారు. స్థానిక డుమ్డుమా మరియు కల్పనా ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. ఈ ప్రాంగణాల్లో కార్మికులకు తాత్కాలిక ఆశ్రయ సౌకర్యాలతో పాటు సురక్షిత తాగు నీరు, మరుగుదొడ్లు, పార్కులు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో కటక్, రౌర్కెలా, సంబలపూర్, కెంజొహర్, బరంపురం వంటి ఇతర పట్టణ ప్రాంతాలలో కార్మికుల నిరీక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్మికులు అకాల మరణానికి గురైతే అందజేసే మరణ పరిహారం మొత్తం పరిమితి పెంచినట్లు తెలిపారు. ఇకపై సాధారణ మరణానికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పరిహారం పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 47 లక్షల మంది నిర్మాణ కార్మికులు నమోదు చేసుకున్నారు. వీరంతా వివిధ పథకాల కింద రూ.3,951 కోట్లకు పైగా సహాయం పొందారని వివరించారు. తాజాగా 4 లక్షలకు పైగా నిర్మాణ కార్మికులు నమోదు చేసుకుని రూ. 370 కోట్లకు పైగా సహాయం పొందారని తెలిపారు. యాప్ ప్రారంభం.. మే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది అర్హులైన నిర్మాణ కార్మికులకు ఒకేసారి కొత్త గుర్తింపు కార్డుల్ని సీఎం జారీ చేశారు. వీరిలో అర్హత కలిగిన లబ్ధిదారులకు రూ. 40 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయం అందజేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వివిధ సేవలు కార్మికులకు చిటికెలో లభ్యం అయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఒడిశా శ్రామిక్ సాథీ మొబైల్ యాప్ను ప్రారంభించారు. దీనివల్ల కార్మికులు ఇంటి నుంచే వివిధ సేవలను సులభంగా, సౌకర్యవంతంగా పొందగలుగుతారని సీఎం చెప్పారు. నిర్మాణ కార్మికులకు ఆన్లైన్ వర్కర్ రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, సహాయం కోసం దరఖాస్తు వంటి సేవలను పొందడంలో ఈ మొబైల్ యాప్ ఎంతో సహాయపడుతుందని తెలిపారు. వలస కార్మికులను గుర్తించి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఒడియా వలస కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లోక్సభ సభ్యురాలు, ఎమ్మెల్యే, కార్మిక–ఉపాధి శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి పాల్గొన్నారు. -
సెంట్రల్ వర్సిటీ వీసీ రాజీనామా ఆమోదం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా సునాబెడా సమీపంలో ఉన్న ఒడిశా సెంట్రల్ యునివర్సిటీ వైస్ చాన్సలర్ చక్రధర్ త్రిపాఠి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. గురువారం ఈయన స్థానంలో నర్సింగ్ చరణ్ పండాని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యాయవాది మృతికి సంతాపం కొరాపుట్: న్యాయవాది సుజాత పాత్రో అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గురువారం జయపూర్లోని కొరాపుట్ జిల్లా కోర్టుల సముదాయంలో సంతాప సభ నిర్వహించారు. బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరి భలోనాథ్ పట్నాయక్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సునాబెడాలో అప్రమత్తం కొరాపుట్: భారత్–పాక్ యుద్ధ వాతావారణ నేపథ్యంలో కొరాపుట్ జిల్లా సునాబెడాలో అప్రమత్తం చేశారు. యుద్ద విమానాల ఇంజిన్లు ఇక్కడి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తయారు చేసి అందిస్తుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఐడెంటీ కార్డులు లేనిదే ఎవరినీ అనుమతించడం లేదు. ఇస్కాన్ మందిరంలో పూజలు కొరాపుట్: కొట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర ఇస్కాన్ మందిరాన్ని దర్శించుకున్నారు. గురువారం పట్టణంలో ఇస్కాన్ మందిరానికి వెళ్లి భగవతం ప్రవచనాలు ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను సైన్యంలో పని చేస్తున్నప్పటి నుంచి ఇస్కాన్ సంస్కృతి కి గౌరవం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతర బీజేపీలో చేరిన తర్వాత ఇస్కాన్ పట్ల మరింత విదేయత పెరిగిందన్నారు. పెళ్లి ఊరేగింపులో పాములు భువనేశ్వర్: పెళ్లి ఊరేగింపులో నాగుపాములను ప్రదర్శించిన ఘటన భద్రక్ జిల్లా ధామ్రా బంశద గ్రామ పంచాయతీ ఛెడకా గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన వివాహ ఊరేగింపులో మూడు పాములను తీసుకొచ్చి నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న భద్రక్ వన్య ప్రాణుల విభాగం బృందం ఘటనా స్థలానికి చేరుకుని పాములను ప్రత్యేక బోనులో భద్రపరిచారు. సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని భద్రక్ మండల అటవీ అధికారి (డీఎఫ్ఓ) సౌభాగ్య కుమార్ సాహు తెలిపారు. కల్యాణం.. కమనీయం రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్ద గల శ్రీక్షేత్ర టౌన్ షిప్లో ఉన్న లక్ష్మీనృసింహుని సన్నిధిలో అక్షయ తృతియ పురస్కరించుకుని జరుగుతున్న చందనోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం కల్యాణోత్సవం అత్యంత వైభంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాఽథ్ ఆచార్యులు, స్థానిక బాలాజీ నగర్లో గల కల్యాణ వేంకటేశ్వరుని ఆలయ ప్రధానార్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవాలు సంప్రదాయ బద్ధంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
అరుదైన శస్త్ర చికిత్స
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గార మండలం అచ్చెన్నపాలెంకు చెందిన శిమ్మ నీలకంఠం వెల్డర్గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 30న పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కటింగ్ మిషన్ చేయిమీదకు రావడంతో కుడిచేయి భాగం తెగిపోయింది. నరాలు తెగిపోవడం, ఎక్కువగా రక్తస్రావం జరగడంతో పనిచేయలేని స్థితికి వచ్చేసింది. విశాఖపట్నంలోని ఒక ఆస్పత్రిని సంప్రదిస్తే సుమారు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలుసుకున్నారు. దీంతో వెంటనే రాగోలు జెమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ డాక్టర్ బుల్లి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా అరుదైన ఆపరేషన్ను ఉచితంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ చేయడానికి సుమారు 5 గంటల సమయం వెచ్చించినట్లు ఆర్ఎంవో మేనేజర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. -
క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
● జిల్లావ్యాప్తంగా 50 కేంద్రాల్లో శిక్షణ శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు (సమ్మర్ కోచింగ్ క్యాంప్లు) గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు శాప్ సూచనలతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 శిక్షణ శిబిరాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. 22 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ శిబిరాల వద్దకు క్రీడాకారులు, బాలబాలికలు తరలివస్తున్నారు. దీంతో క్రీడా మైదానాల్లో సందడి వాతావరణం నెలకొంది. క్రీడాకారులు శారీరక ఫిట్ నెస్తోపాటు నిర్దేశిత క్రీడలో సాధన చేపడుతున్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడి యం వేదికగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సీఈవో పి.సుందరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడలు కూడా అవ సరమేనన్న విషయాన్ని విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు గుర్తించాలన్నారు. ఒలింపిక్ అసోసియేష న్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బీవీ రమణ మాట్లాడుతూ క్రీడాకారులు తయారయ్యేది,ఓనమా లు దిద్దుకునేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలతోనేనని తెలిపారు. డీఎస్డీవో డాక్టర్ కె.శ్రీధర్రావు మాట్లాడుతూ జిల్లాలో 50 కేంద్రాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, అత్యంత ఆదరణ కలిగిన క్రీడాంశాలకు పెద్దపీట వేశామన్నారు. కేంద్రాని కి రూ.7 వేలు చొప్పున శాప్ కేటాయించిందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాలబాలికలు సద్వినియోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యాటకాధికారి ఎన్.నారాయణరావు, టీటీ కోచ్ ఎం.మాధురీలత, పీడీలు చల్లా జగదీష్, ఎన్వీ రమణ, జి.అర్జున్రెడ్డి, రాజీవ్, పురుషోత్తం, క్రీడాసంఘాల ప్రతినిధులు, కోచ్లు, సీనియ ర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
శాశ్వత పట్టాలు ఇవ్వాలి
జయపురం: జయపురం సమితి బరిణిపుట్ పంచాయతీ ముండిగుడ ఒడిశా కన్స్ట్రక్షన్ కాలనీ(ఓసీసీ) ప్రాంతంలో 50 ఏళ్లుగా నివసిస్తున్న వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ నేత రవీంద్రమహాపాత్రో కోరారు. మహాపాత్రో నేతృత్వంలో వందలాది మంది ఓసీసీ ప్రాంత నివాసులు జయపురం సబ్ కలెక్టర్కు గురువారం వినతి పత్రం సమర్పించారు. 2019లో ఆ ప్రాంత నివాసులైన 250 పైగా కుటుంబాల వారు ఇళ్ల పట్టాలు కోసం విజ్ఞప్తి చేశారన్నారు. జిల్లా కలెక్టర్ 49 కుటుంబాలకు బరిణిపుట్ పంచాయతీలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేశారని వెల్లడిచారు. అంతకు ముందు ఆ ప్రాంతంలో ఉంటున్న 250 కుటుంబాలకు భూమి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వినతి పత్రంలో గుర్తు చేశారు. అయితే వారికి 7 ఎకరాల 50 సెంట్ల భూమి చూసి అక్కడ ఇళ్లు కట్టుకోమన్నారన్నారు. అందుకు కొంతమంది అందుకు అంగీకరించలేదని వివరించారు. తరువాత కాలంలో ఆ డొంగర భూమిని చదును చేసి ఇళ్లు కట్టు కొనేందుకు అంగీకరించారని అందు చేత అచ్చట నివాసం ఏర్పరుకున్న వారికి శాశ్వత పట్టాలు సమకూర్చి ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని సబ్కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అధికారులకు ముండిగుడ వాసుల విజ్ఞప్తి -
ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళకు గాయాలు
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీలోని వీకేపేట రోడ్లో ఒక ట్రాక్టర్ స్కూటీని ఢీకొనడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం అత్యంత రద్దీగా ఉన్న వీకేపేట రోడ్లో రత్తకన్న వైపు నుంచి మార్కెట్ వైపు ఒక వ్యక్తి ట్రాక్టర్ని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూటీనీ తప్పించే క్రమంలో ఢీకొన్నాడు. దీంతో స్కూటీ నడుపుతున్న పెద్ద ఆకుల వీధికి చెందిన కిల్లంశెట్టి శరణ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండడం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ ముకుందరావు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సవరాశి దుదిష్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు జిమ్ ప్రారంభం
రాయగడ: జిల్లాలోని చందిలి రిజర్వ్ పోలీసు కార్యాలయం ప్రాంగణంలో పోలీసు జిమ్ ప్రారంభమయ్యింది. దక్షిణాంచల్ డీఐజీ అఖి లేశ్వర్ సింహ్ ముఖ్య అతిథిగా హాజరై జిమ్ను మంగళవారం ప్రారంభించారు. వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా పోలీసు విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక పరికరాల తో ప్రారంభమైన జిమ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఏఎస్పీ బిష్ణు ప్రసాద్ పాత్రో, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కవిబర్ డెవురా తదితరులు పాల్గొన్నారు. ఈసీహెచ్ఎస్ మొబైల్ యాప్ ప్రారంభం రాయగడ: గోపాల్పూర్కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు ఈసీహెచ్ఎస్ (ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రీబ్యూటరీ హెల్త్ స్కీమ్) మోబైల్ యాప్ను బరంపురంలోని పాలీ క్లీనిక్లో బుధవారం ప్రారంభించారు. ఈ యాప్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు సహకారం అందజేసేవిధంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ యాప్లో నమోదు చేసుకొని సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. వైభవంగా రామాలయ ప్రతిష్ట కొరాపుట్: జిల్లా కేంద్రంలోని పూజారిపుట్లో రామాలయ ప్రతిష్ట వైభవంగా బుధవారం నిర్వహించారు. సుమారు 600 మంది మహిళ లు నరేంద్ర సరోవర్ నుంచి కలశాలతో పవిత్ర నీటిని తీసుకొచ్చారు. ఆ నీటితో రాజస్థాన్లో తయారు చేసి దేవతామూర్తుల విగ్రహాలు అభిషేకం చేశారు. మధ్యాహ్నం సమయంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామానికి చెందిన పినిమింటి లక్ష్మీ(37) చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ భర్త రామారావు రోజు మద్యం సేవించి భార్యాపిల్లలతో గొడవ పడేవాడు. ఇంట్లో దాచిపెట్టిన డబ్బులను ఈ నెల 27న తీసుకుపోయి రోజంతా పూటుగా తాగి సాయంత్రం ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలుపుకొని తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుశం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమార్తె జగదీశ్వరి, కుమారుడు శ్యాం ఉన్నారు. వరకట్న వేధింపులపై కేసులు నమోదు కాశీబుగ్గ: పలాస మండలం, మున్సిపాలిటీ పరిధిలో వరకట్న వేధింపులపై కేసులు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ బుధవారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన కె.ఇందు తన భర్త మహేష్, భర్త కుటుంబ సభ్యులు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా, పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన రేఖమ్మ తన భర్త కై లష్హోరి రూ.3లక్షలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ఘటనలో కొత్తపోలవలసకు చెందిన తుంగాన గోవిందరావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు కేసు నమోదు చేశారు. -
ఆటాడుకుందాం రా..!
అథ్లెటిక్స్: జీహెచ్ స్కూల్ పలాస– 9494379648, టెక్కలి– 9492417570, జెడ్పీహెచ్ స్కూల్ కేకే రాజపురం– 8464906752, టీపీఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 8500271575, కేవీకే ఇచ్ఛాపురం– 9441024555, పాతపట్నం– 9100736583, జెడ్పీహెచ్ స్కూల్– 8688872304. వాలీబాల్: జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9441011391, జెడ్పీహెచ్ స్కూల్ పైడి భీమవరం– 9849326018, జెడ్పీహెచ్ స్కూల్ ప్రగడపుట్టుగ– 9491569394, జెడ్పీహెచ్ స్కూల్ కొర్ని– 9440955034, జెడ్పీహెచ్ స్కూల్ మాకివలస– 9963753719, జెడ్పీహెచ్ స్కూల్ పాతపట్నం– 9440955034, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ– 9494814087. కబడ్డీ: బలగ శ్రీకాకుళం – 9010406706, జెడ్పీహెచ్ స్కూల్ సింగుపురం– 9642287746, ప్రభుత్వ డిగ్రీ కళాశాల టెక్కలి– 9441262515, జెడ్పీహెచ్ స్కూల్ పల్లెసారధి– 9502983175. ఖోఖో: జెడ్పీహెచ్ స్కూల్ పలాస– 9618583449, కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9866288802, ఎంజీహెచ్ స్కూల్ ఇచ్ఛాపురం– 9177914135. హ్యాండ్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ అల్లినగరం– 9493764447, జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలవలస– 9966849462, జెడ్పీహెచ్ స్కూల్ పాతటెక్కలి– 7330831517. సాఫ్ట్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ ఇప్పిలి– 9440436317, జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9705302968, జెడ్పీహెచ్ స్కూల్ కురుడు– 9052500720. ఫుట్బాల్: కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9533691018, కలెక్టరేట్ వద్ద ఆర్అండ్బీ గెస్ట్హౌస్ హెచ్–గ్రౌండ్ శ్రీకాకుళం– 9177564623, జెడ్పీహెచ్ స్కూల్ నరసన్నపేట– 8639629920. బాల్ బ్యాడ్మింటన్: జీహెచ్ స్కూల్ ఎచ్చెర్ల– 8074452351, ఎంజేపీ నరసన్నపేట– 7013473337. బాక్సింగ్: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్,శ్రీకాకుళం– 8977496979, పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 9989364548. జూడో: జెడ్పీహెచ్ స్కూల్, వప్పంగి– 9440688828, జెడ్పీహెచ్ స్కూల్ పోలవరం– 9550743035. తైక్వాండో: ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం శ్రీకాకుళం– 9393178455, టౌన్ హాల్ శ్రీకాకుళం– 8919591487. వెయిట్ లిఫ్టింగ్: జీహెచ్ స్కూల్ నరసన్నపేట: 9492299769, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆమదాలవలస– 9390745150. బ్యాడ్మింటన్: టెక్కలి– 7799335725 బేస్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ లావేరు– 8639000705. బాస్కెట్బాల్: టెక్కలి– 8986951096. చెస్: కోడిరామ్మూర్తి (కేఆర్) స్టేడియం శ్రీకాకుళం– 9908162634. క్రికెట్: పాతపట్నం– 9701454500. ఫెన్సింగ్: టౌన్హాల్ శ్రీకాకుళం– 7660874844. సెపక్తక్రా: ఎన్టీఆర్ఎం హెచ్స్కూల్ శ్రీకాకుళం– 8500828965. టేబుల్టెన్నిస్: బాలభాను విద్యాలయం – 9290577033. టెన్నీకాయిట్: జీహెచ్స్కూల్ పలాస– 9441089592. ఉషూ: ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం శ్రీకాకుళం– 9885734313. ● నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం ● జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నెలరోజుల పాటు శిక్షణ ● 22 క్రీడాంశాలకు చోటు ● 8 ఏళ్లు పైబడిన బాలబాలికలకు అవకాశం శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో బాలబాలికలంతా మైదానబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులంతా మరో నెల రోజులపాటు ఆటల్లో ముగినితేలనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంప్)లను నిర్వహిస్తున్న విషయం విదితమే. జిల్లాలో గురువారం నుంచి శిక్షణా శిబిరాలు మొదలుకానున్నాయి. అరకొర నిధులతోనే.. మే ఒకటి నుంచి మొదలుకానున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు విధిల్చి చేతులు దులుపేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలలో మే నెలాఖరు వరకు ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. ఒక్కొక్క శిబిరానికి కేవలం రూ.7వేలు మాత్రమే కేటాయించారు. ఇందులో శిక్షకుడు/కోచ్కు రూ.1500, ఫ్లెక్సీకి రూ. 500, స్పోర్ట్స్ మెటీరియల్కు రూ.5వేలు వెచ్చించనున్నారు. శిక్షణ సమయంలో క్రీడాకారులకు పోటీ లను నిర్వహిస్తారు. ఆఖర్లో ఆన్లైన్లో సర్టిఫికెట్లు అందజేస్తారు. అరకొరగా నిధుల కేటాయింపు పట్ల క్రీడాసంఘాల ప్రతినిధులు పెదవివిరిస్తున్నారు. ఇవీ విధివిధానాలు.. ● సమ్మర్ కోచింగ్ క్యాంపులలో 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందిస్తారు. 16 ఏళ్లపైబడి ఆసక్తి కలినవారు కూడా హాజరుకావచ్చు. ● ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మరళా సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ● శాప్ కోచ్లతోపాటు పీడీలు/పీఈటీలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందించేందుకు అర్హులు. ● ప్రతిరోజు క్రీడాకారులకు హాజరు వేయాల్సి ఉంటుంది. ● వారంతాల్లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి. ● శిబిరాల సమయంలో గ్రామీణ, పాఠశాల స్థాయి స్పోర్ట్స్ క్లబ్లను క్రీడాంశాల వారీగా ఏర్పాటు చేయాలి. ● శిక్షణా శిబిరాల సమయంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రత్యేకంగా సానబెట్టి భవిష్యత్తులో జరిగే పోటీలకు సిద్ధంచేయాలి. ● దాతల సహకారం, చేయూతతో శిక్షణా శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలకు క్రీడాపరికరాలు, క్రీడాదుస్తులు, షూ, సాక్సులు, స్నాక్స్, మెడల్స్, బహుమతులు, అందించేలా ఆయా కేంద్రాల శిక్షకులు చొరవ తీసుకోవాలి. గ్రామీణ క్రీడలకు పెద్దపీట.. సమ్మర్ కోచింగ్ క్యాంప్ కేటాయింపులో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాలను కేటాయించారు. అత్యధికంగా అథ్లెటిక్స్కు, వాలీబాల్కు ఏడేసి చొప్పున కేంద్రాలను కేటాయించగా.. కబడ్డీ 4, ఫుట్బాల్ 3, హ్యాండ్బాల్ 3, సాఫ్ట్బాల్ 3, ఖోఖో 3, బాల్ బ్యాడ్మింటన్ 2, బాక్సింగ్ 2, జూడో 2, తైక్వాండో 2, వెయిట్లిఫ్టింగ్ 2, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, ఫెన్సింగ్, సెపక్తక్రా, టేబుల్టెన్నిస్, టెన్నికాయిట్, ఉషూ క్రీడాంశాల్లో చెరో కేంద్రం చొప్పున శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. అత్యంత ఆదరణ కలిగిన ఆయా ప్రాంతాల్లో పాఠశాలల మైదానాల్లోనే శిక్షణ అందించనున్నారు. శిబిరాలు ఎక్కడెక్కడంటే.. సద్వినియోగం చేసుకోవాలి.. బాలబాలికల ప్రతిభ బయటపడేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలలోనే. జాతీయస్థాయిలో తీర్చిదిద్దే శిక్షకులు జిల్లాలో ఉన్నారు. క్రమం తప్పుకుండా హాజరై శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాసంఘాలు, పీఈటీ సంఘ నాయకులతో కలిసి శిక్షణా కేంద్రాలను కేటాయించాం. కేంద్రానికి రూ.7వేలు చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించిన విదివిధానాలను శాప్ ప్రకటించింది. – డాక్టర్ కె.శ్రీధర్రావు, డీఎస్డీఓ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, శ్రీకాకుళం -
బాధిత కుటుంబాలకు చేయూత
భువనేశ్వర్: విధి నిర్వహణలో అకాల మరణం పాలైన ఇద్దరు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ముఖ్యమంత్రి చేయూతనిచ్చి ఆదుకున్నారు. దివంగత సిబ్బంది భార్యలకు హోం గార్డు ఉద్యోగం కల్పించారు. స్థానిక లోక్సేవా భవన్లో బుధవారం ముఖ్యమంత్రి నియామక పత్రం మరియు సహాయనిధి కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రభాసిని బెహరా, దేవి షబర్ నియామకపత్రంతో పాటు చెక్కులు అందుకున్నారు. వీరి ఇద్దరు భర్తలు పీసీఆర్ వ్యాన్లో డ్యూటీలో ఉండగా ప్రమాదంలో ఇటీవల మరణించారు. మహిళలకు చెక్కులు, నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం మోహన్చరణ్ -
లక్ష్మీనృసింహునికి ప్రత్యేక అభిషేకాలు
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్దనున్న శ్రీక్షేత్రటౌన్ షిప్లోని శ్రీలక్ష్మీ నృసింహ ఆలయంలో పవిత్ర అక్షయ తృతీయ పురస్కరించుకొని మంగళవారం నుంచి చందనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఆరాధన, దీపారాధన, క్షీరాభిషేకాలతో పాటు చందనాభిషేకాలు చేపట్టారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్రావు పరివేక్షణలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిషేకాలు చేస్తున్న అర్చకులు -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: బిసంకటక్ నుంచి పర్శాలికి వెళ్తున్న లక్ష్మీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఈ ఘటన పాతలొంబ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం ప్రయాణికులతో బిసంకటక్ నుంచి బయల్దేరిన బస్సు పాతలొంబ గ్రామానికి చేరేసరికి మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. గత రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మలుపు వద్ద మట్టి పేరుకుపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిడుగుపాటుకు 11 ఆవులు మృతి కొరాపుట్: పిడుగుపాటుకి 11 ఆవులు మృతి చెందిన ఘటన కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి సంగల్బెడా గ్రామ పంచాయతీ పుల్బాడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఆవుల మందపై పిడుగులు పడడంతో మొత్తం 11 ఆవులు మృత్యువాత పడ్డాయి. దీంతో యజమానులు విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. బుధవారం రైతు దినోత్సవం, పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా జిల్లా వ్యవసాయ మరియు కృషక్ స్వశక్తీకరణ ఆధ్వర్యంలో బి.ఎన్.ప్యాలస్ రోడ్డులో అధికారులు దుక్కులు దున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి రవీంద్రకుమార అఢెక్, జల విభాజన మరియు ప్రాజెక్టు డైరక్టర్ సురేష్ కుమార్ పట్నాయిక్, ఉద్యానవనాల శాఖ ఉపసంచాలకులు సుశాంత్ రంజన్ దాస్, అదనపు ప్రాణి చికిత్సా అధికారి డాక్టర్ రమాకాంత రోణా తదితరులు పాల్గొన్నారు. నూతన భవనం ప్రారంభం పర్లాకిమిడి: స్థానిక తెలుగు సొండివీధి సరస్వతీ శిశు విద్యామందిర్ సమీపంలో వందేమాతరం నృత్య, సంగీత పాఠశాల నూతన భవనాన్ని బుధవారం జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు ప్రారంభించారు. సుమారు 23 సంవంత్సరాల నుంచి ఈ నృత్య, సంగీత అకాడమీ అద్దె భవనంలో నడుస్తోంది. ప్రస్తుతం ఈ సంగీత, నృత్య అకాడమీలో 32 మంది విద్యార్థులు, 5 మంది గురువులు శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బసంతకుమార్ పట్నాయిక్, రాజీవ్ లోచన పండా, రబి పాణిగ్రాహి, అమూల్య పాత్రో, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
రాయగడ: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఆదివాసీ, హరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల సంక్షేమ శాఖల మంత్రి నిత్యానంద గొండా అన్నారు. పవిత్ర అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం గుణుపూర్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా ముందుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం పొలం దున్ని, విత్తనాలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఫరూల్ పట్వారి, బీజేపీ నాయకులు శివశంకర్ ఉలక, రబి గొమాంగో తదితరులు మంత్రి నిత్యానంద గొండా పాల్గొన్నారు. విత్తనాలు చల్లిన విద్యార్థులు జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ విభాగానికి చెందిన విద్యార్థులు అక్షయ తృతీయ పురస్కరించుకొని పంట పొలాల్లో విత్తనాలు జల్లారు. ఆ విభాగం ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ మిశ్రో, ప్రొఫెషర్ డాక్టర్ సుశాంత్ కుమార్ మహంతి, డాక్టర్ రినా స్వయి, అధ్యాపకులు, వ్యవసాయ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ కిషాన్ మోర్చ ఆధ్వర్యంలో సదరు సమితి అకుసింగి గ్రామంలో అక్షయ తృతీయ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పార్టీ డీఎల్పీసీ సభ్యులు సుమంత్ కుమార్ మహరణా, జిల్లా కృషక్ మోర్చ అధ్యక్షుడు కృష్ణ పండ తదితరులు పాల్గొన్నారు. -
అంకురార్పణ
నిత్యం చందన లేపనం భువనేశ్వర్: జగతినాథుడు కొలువుదీరిన శ్రీక్షేత్రం (పూరీ)లో పవిత్ర అక్షయ తృతీయ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీ జగన్నాథుని సంస్కృతిలో ఈ తిథితో విశ్వ విఖ్యాత రథయాత్ర ముడిపడి ఉంది. అక్షయ తృతీయ పురస్కరించుకుని ఈ ఏడాది జరగనున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర కోసం రథాల నిర్మాణం బుధవారం నుంచి ప్రారంభించారు. దీంతో 42 రోజుల పాటు జరిగే ప్రసిద్ధ చందన యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీమందిరం సింహ ద్వారం తలుపులు తెరిచి లోపలి భాగాన్ని శుభ్రం చేసి మంగళ హారతి సమర్పించారు. మధ్యాహ్న ధూపం 1.15 నుంచి 2.30 గంటల మధ్య నిర్వహించారు. మధ్యాహ్న ధూపం తర్వాత శ్రీమందిరం రత్న వేదిక నుంచి దేవతాత్రయం మూడు ఆజ్ఞామాలలు రథ తయారీ ప్రాంగణానికి చేరాయి. ఈ సందర్భంగా బాజాభజంత్రీలు, మేళతాళాలతో పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలముకున్నాయి. స్వామివార్షిక రథయాత్రకు ఇది ఆరంభ సంకేతంగా భక్తుల హృదయం పులకించింది. వన జాగరణ ఆచారం ప్రకారం రథ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ పూజారులు (దెవుళో పురోహిత్), రాజ గురువు, శాసీ్త్ర బ్రాహ్మణులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాలలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా నృసింహ మంత్రంతో నృసింహ స్వామియాగం నిర్వహించారు. ప్రత్యేక ఆచారాల ప్రకారం, ఆలయ పూజారి ముందుగా మూడు చెక్క దుంగలను స్పర్శింపజేశారు. దక్షిణ కాళీమాత మంత్రోచ్ఛరణతో పవిత్రం చేశారు. వెంబడి విశ్వకర్మలు రథాల నిర్మాణానికి సిద్ధం అయ్యారు. రథ నిర్మాణ అధిపతి (ముఖ్య విశ్వకర్మ), ప్రధాన భోయి సేవకుడు, చిత్రకారుడు, రూపకారుడు, కమ్మరి మొదలైన 10 వర్గాల మహారణల తలలకు పాగా (సాఢి బొంధొ) చుట్టి రథాల తయారీ పనులకు స్వాగతించారు. ఇతరేతర లాంచనాలు పూర్తి చేయడంతో మహరణ సేవకుల వర్గం రథాల నిర్మాణం ప్రారంభం చేపట్టింది. చందన యాత్ర శ్రీమందిరం రత్న వేదికపై ఆసీనుడైన శ్రీజగన్నాథ స్వామివారికి చందన లేపిత సేవ ఆరంభమైంది. పవిత్ర అక్షయ తృతీయ పురస్కరించుకుని బుధవారం నుంచి ఈ సేవ ప్రారంభం కావడం విశేషం. స్నాన పూర్ణిమ రోజు వరకు 42 రోజుల పాటు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ 42 రోజుల పాటు స్వామి నిత్యం చందన యాత్రలో పాల్గొంటాడు. తొలి సగం రోజులు (21) వెలుపలి చందన యాత్ర, చివరి సగం రోజులు (21) అంతర్ చందన యాత్రగా స్వామి నిత్యం సంధ్య వేళలో ఉత్సవం జరుపుకుంటాడు. వెలుపలి చందన యాత్రలో భాగంగా నిత్యం సంధ్య వేళలో పల్లకిలో ఊరేగుతూ నరేంద్ర పుష్కరిణి తీరం చేరుతాడు. ఈ పుష్కరిణిలో కొన్ని గంటల సేపు దేవేరులతో కలిసి నావికా విహారంలో పాల్గొంటారు. పుష్కరిణిలో నంద మరియు భద్ర అనే నావలపై దేవదేవుళ్లు జల క్రీడల్లో పాల్గొని భక్తులను మురిపిస్తారు. చివరి 21 రోజులు అంతర్ చందన యాత్రగా శ్రీ మందిరం లోపలి ప్రాకారంలో జరుగుతుంది. శ్రీమందిరంలో ఘనంగా అక్షయ తృతీయ ప్రారంభమైన చందన యాత్ర 42 రోజుల పాటు జరగనున్న చందన యాత్ర అక్షయ తృతీయ అత్యంత ఆనందోత్సాహాలతో జరిగే పండగగా స్వామి భక్తులు పరిగణిస్తారు. అక్షయ తృతీయ నుంచి స్నాన పూర్ణిమ వరకు నిత్యం భోగ మండప సేవ తర్వాత చందన లేపనం చేస్తారు. ఈ సందర్భంగా మూల విరాటుల సాధారణ వస్త్రధారణ తొలగించి శుక్ల వర్ణ వస్త్రాలను తొడుగుతారు. ఈ వస్త్రం పొడవు 10 మూరలు మరియు వెడల్పు 3 మూరలు ఉంటుంది. దీనిని చందన్ గొఢా అని వ్యవహరిస్తారు. ఈ సేవలో భాగంగా సుగంధిత పుష్పాదులతో మూల విరాటుల్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇదే తరహాలో శ్రీ మందిరం సింహద్వారం ఆవరణలో తొలి దర్శనం ఇచ్చే పతిత పావనుని కుడ్య ప్రతిమకుల అలంకరణ, సేవాదులు నిర్వహించడం ఆచారం. అల్లంత దూరం నుంచి ఆరు బయట నుంచి దర్శనం ఇచ్చి పతితుల్ని పావనం చేసే భగవంతుడుగా నిత్య దర్శనం ప్రసాదిస్తాడు. -
లక్ష్మీపూర్లో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత పర్యటించారు. మంగళవారం సమితిలోని గౌడ గుడ గ్రామ పంచాయతీ లక్ష్మణి గ్రామంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో బలి జాతర ఏర్పట్లను పర్యవేక్షించారు. గ్రామ గిరిజనులతో సమావేశమై వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. తాను అందుబాటులో లేనప్పుడు తన తరఫున ఎంపీ ప్రతినిధి ఈ ప్రాంతంలో ఉంటారని, ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అంతకు ముందు గ్రామ సరిహద్దులలో గిరిజన యువతులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామ దేవతకు ఎంపీ, ఎమ్మెల్యే పూజలు చేశారు. -
గోపాలచంద్ర శతపథికి రాష్ట్రపతి పురస్కారం
పర్లాకిమిడి: స్థానిక ముత్యాలమ్మ వీధిలో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచియిత, కవి గోపాలచంద్ర శతపథి (75)కి వయోసర్వశ్రేష్ఠ సమ్మాన్– 2021 అవార్డు న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో మే 2న అందుకోనున్నట్టు ఆయన తెలిపారు. గోపాలచంద్ర శతపథి 2009లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సర్వీసులో ఉత్తమ ఉపాధ్యాయునిగా 1992లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నట్టు తెలియజేశారు. ఇప్పుడు వయో సర్వశ్రేష్ట సమ్మాన్ అవార్డు 2021 అందుకోనున్నట్టు తెలిపారు. అవార్డు దక్కడం పట్ల డీఈఓ మాయాధర్ సాహు, జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అభినందనలు తెలిపారు. సెంచూరియన్ విద్యార్థులకు శిక్షణ పర్లాకిమిడి: గుసాని సమితి ఉప్పలాడ రవీంద్రనాథ్ ఠాగోర్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో సెంచూరియన్ వర్సిటీ ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్లాంటేషన్ డేను నిర్వహించారు. అలాగే వ్యవసాయదారుల శిక్షణ శిబిరం కూడా పాఠశాలలో ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో నూతన సేంద్రియ పద్ధతులను రైతులకు విద్యార్థులు తెలియజేశారు. రమణమూర్తికి ఈఓగా పదోన్నతి అరసవల్లి: అరసవల్లి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కుప్పన్నగారి రమణమూర్తికి గ్రేడ్–3 ఈవోగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి గతేడాది అరసవల్లి ఆలయానికి బదిలీపై రాగా.. తాజా పదోన్నతితో మళ్లీ విజయనగరంలో 6–సి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం అరసవల్లి ఆలయంలో అన్నదాన ప్రసాదాల సెక్షన్ ఇన్చార్జిగా ఉన్న ఈయనకు పదోన్నతి రావడంపై ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ‘ఆదిత్య’లో జాతీయ స్థాయి పోటీలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ ద్వారా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో క్విజ్, డిజిటల్ పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, స్లోగన్ రైటింగ్, అవేర్నెస్ రీల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. హోంగార్డు కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : హోంగార్డు పి.పైడిరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి రూ.4.07 లక్షల నగదు చెక్కును మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అందజేశారు. సహచర హోంగార్డుల ఒక్కరోజు వేతనాన్ని ఈవిధంగా అందించారు. నీలమణి దుర్గ ఉత్సవాలు ప్రారంభం పాతపట్నం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి 50వ వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమపూజ, అష్టోత్తర శతనామ పూజ, హోమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సుదీష్ఠ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మే 7 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఈవో టి.వాసుదేవరావు చెప్పారు. పూజా కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సన్యాసిరావు, బాబ్జీ, సతీష్, మడ్డు రామారావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒడిశా గవర్నర్కు స్వాగతం కంచిలి: మండలంలోని దాలేశ్వరం గ్రామంలోని సోలార్ ప్లాంట్ వద్దకు మంగళవారం విచ్చేసిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుకు మండల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను కలిసి రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఈఓపీఆర్డీ పి.ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా చట్టాలపై అవగాహన
జయపురం: మహిళా చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని వక్తలు అన్నారు. వర్కింగ్ మహిళల వేధింపు, ఎస్టీ, ఎస్సీ అత్యాచార చట్టం 1989పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు న్యాయ చైతన్య శిబిరాన్ని గోపాలకృష్ణ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గౌరహరి విహార్, రాణిపుట్లో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం నిర్వహించిన సచేతన శిబిరాన్ని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా లోక్ అదాలత్ శాశ్వత విచారపతి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి సుమన్ జెన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో ఉద్యోగాలు పొందిన మహిళలపై శారీరిక వేధింపుల నియంత్రణకు, అభ్యంతర అభియోగ కమిటీ ఏర్పాటు జరుగుతుందని మహిళలకు రక్షణ కల్పించే చట్టాలపైన, సోస్కొ చట్టాలపై వివరించారు. గోపాల కృష్ణ ఇంజినీరింగ్, టెక్నాలజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
తెలుగు భాషాభివృద్ధికి కృషి
జయపురం/కొరాపుట్: తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామని వక్తలు అన్నారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహణలో కొనసాగుతున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సోమవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి పది గంటల వరకు ఉత్సాహంగా కొనసాగింది. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయక్ అధ్యతన జరిగిన కార్యక్రమంలో అతిథులకు ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ స్వాగతం పలికారు. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. తెలుగు సాంస్కృతిక సమితి పెద్దల ఉద్యమంతో 1981లో తెలుగు బాలికల కోసం తెలుగు సాంస్కృతిక సమితి తెలుగు మాధ్యమ ఉన్నత పాఠశాలను నెలకొల్పిందని గుర్తు చేశారు. అనంతరం 2014లో ఆంగ్ల భాష మాధ్యమంలో కూడా ఉన్నత పాఠశాల ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. సమాజంలో అట్టడుగు వర్గాల విద్యార్థులకు విద్య నేర్పేందుకు ఈ పాఠశాల ఏర్పడిందన్నారు. తెలుగు విద్యాబోధనలో సమతి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆనాటి సమితి నిర్వాహకులు అవదానం వలన పాఠశాల నెలకొందన్నారు. పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. అతిథులుగా సిటీ ఉన్నత పాఠశాల పరిశీలన కమిటీ అధ్యక్షులు ఎ.శ్రీనివాసరావు, తెలుగు సాంస్కృతిక సమితి కార్యదర్శి వై.శ్రీనివాస ఖన్నా, పాఠశాల వ్యవస్థాపక సభ్యులు శశిభూషణ పట్నాయక్, సిటీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత, సిటీ ఎంఈ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం.మాధవి, సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్ పాల్గొన్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రొఫెషనల్, భాస్కర అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ, జానపద, సంబల్పురి, ఒడిస్సీ నృత్యాలు, తెలుగు సంప్రదాయ డ్యాన్స్లు ఆహూతులను అలరించాయి. సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో వక్తలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు -
గజపతిలో ఆరోగ్య సంక్షేమశాఖ కమిషన్ పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్లో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, కార్యదర్శి ఎస్.అస్వతీ మంగళవారం పర్యటించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వర్కింగ్ వుమెన్స్ హోస్టళ్లను తనిఖీ చేపట్టారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, ఒడిశా జీవనోపాదుల శాఖ డి.పి.ఎం టిమోన్ బోరా, మోహనా బీడీఓ రాజీవ్ దాస్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు ఉన్నారు. మోహనా ప్రభుత్వ ఆస్పత్రిలో అందజేస్తున్న ఉచిత మందులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాతీయ హెల్త్ మిషన్ పథకాలు అమలుపై ఆరా తీశారు. -
దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత
భువనేశ్వర్: ప్రసిద్ధ పూరీ శ్రీ జగన్నాథ ఆలయానికి అద్భుతమైన ప్రతిరూపం పశ్చిమ బెంగాల్లోని దిఘా ప్రాంతంలో నిర్మితమైంది. ఈ జగన్నాథ ఆలయం బుధవారం ప్రారంభించనున్నారు. దీని నిర్మాణానికి రూ. 250 కోట్లు వెచ్చించారు. పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలయాన్ని ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ దిఘాలోని జగన్నాథ ఆలయంలో జరిగే ప్రతిష్టోత్సవంలో పాల్గొనవద్దని పూరీలోని సువార్ మహాసూర్ నియోగుల వర్గం నిర్ణయించింది. ఉల్లంఘించిన వారు బహిష్కరణకు గురవుతారని ఈ వర్గం హెచ్చరించింది. కొత్తగా ప్రారంభం కానున్న ఈ ఆలయంలో రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. దారు విగ్రహాల బదులుగా రాతి విగ్రహాలు ఎంచుకోవడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ మందిరం నుంచి అంతా దూరంగా ఉండాలని సూచించారు ఉల్లంఘనకు పాల్పడితే ఆలయం నుంచి బహిష్కరణ, స్వామి సేవల నుంచి శాశ్వతంగా తొలగింపు వంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. -
53 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: ఉత్కళ గౌరవ్ మధుసూదన దాస్ జన్మదినం సందర్బంగా స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. స్థానిక డిప్యూటీ రిజస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ వారు నిర్వహించిన శిభిరాన్ని కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ పరిశీలన కమిటీ అధ్యక్షులు ఈశ్వర చంద్రపాణిగ్రహి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం అన్ని దానాలకంటే గొప్పదన్నారు. అర్హులందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి బ్లడ్బ్యాంక్ టెక్నిషియన్ అభయ పండ నేతృత్వంలో 53 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ భీమసేన్ సాహు, కేసీసీ బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శిశిర దాస్, జయపురం సబ్డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో పాల్గొన్నారు. -
నబరంగ్పూర్లో సినిమా చిత్రీకరణ
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో దూరదర్శన్ వారు నిర్మిస్తున్న ఒడియా చలన చిత్రం ఖాలీ హండి నిర్మాణం పూర్తిచేసుకుంది. మంగళవారం జిల్లా కేంద్ర పరిసర గ్రామాల్లో ముగింపు షాట్లు చిత్రీకరించారు. ఒక అమాయక గిరిజనుడు సమాజంలో వివిధ సమస్యలతో పోరాడి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో ఈ చిత్రంలో చూపిస్తారు. గతంలో 6 దూరదర్శన్ చిత్రాలకి దర్శకత్వం వహించిన మనోజ్ కుమార్ పట్నయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిల్లాకి చెందిన స్థానిక కళాకారులు జితేంద్ర పరిచా, జితేంద్ర కుమార్ చౌదరి, ప్రకాష్ చంద్ర బారిక్, తదితరులు నటించారు. త్రిశక్తి కల్చరల్ అసోసియేషన్ ఈ సినిమాను నిర్మించింది. -
మీనాజోలను తీర్థస్థలంగా మారుస్తాం
● రాష్ట్ర రవాణా, గనుల శాఖ మంత్రి బిభూతి జెన్న రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితిలో పులాపొలియా, వంశధార, చవులధువా నదుల కలిసే త్రివేణి సంగమంగా గుర్తింపు పొందిన మీనాజోల ప్రాంతాన్ని తీర్థ స్థలిగా గుర్తించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని రాష్ట్ర రవాణా, గనుల శాఖ మంత్రి బిభూతి జెన్న అన్నారు. సోమవారం నాడు మీనాజోలలో కొత్తగా నిర్మించిన మీనకేతనేశ్వర్ మందిరం ప్రారంభోత్సవంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ నుంచి తీసుకువచ్చిన స్పటిక లింగం ప్రాణ ప్రతిష్టోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మందిరం, లింగం ప్రతిష్టోత్సవాల్లో పాల్గొన్న మంత్రి జెన్న అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో గల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో మీనాజొల ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా గుర్తించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. మూడు నదుల సంగమంగా గుర్తింపు పొందిన మీనాజొలలో ఏటా శివరాత్రి నాడు ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుందని అన్నారు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాంతానికి పర్యాటక స్థలంగా గుర్తింపు దక్కితే ఇక్కడ కొలువై యున్న మీనకేతనేశ్వర్ మందిరం కూడా పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందుతుందని అభిప్రాయపడ్డారు. పర్యటకులకు, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ప్రాంతాభివృధ్దికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. మీనాజోల ఆధ్యాత్మిక కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ పండ నేతృత్వంలో ఈ ప్రాంతం ఎంతొ అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి జెన్న అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకుడు శివకుమార్ పట్నాయక్, యాల్ల కొండబాబు, కాళీరాం మాఝి తదితర ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు పద్మపూర్ సమీపంలో గల ముచికిపొదొరొ కూడలిలో మంత్రికి యాల్ల కొండబాబు అతని మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. -
డ్రైవర్కు గుండెపోటు!
● అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన బస్ కొరాపుట్: ప్రభుత్వ లక్ష్మీ బస్సు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు రావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మంగళవారం కొరాపుట్ జిల్లా గొడపొదర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు జయపూర్ వైపు వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో గృహోపకరణాలు దగ్ధం రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదళ పంచాయతీలోని నువాపడ గ్రామానికి చెందిన విలాస్ కొరకొరియా ఇంట్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువైన టీవీ, ఫ్రిడ్జ్, బీరువ తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. కుటుంబంతో కలిసి విలాస్ సోమవారం తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే ఇంట్లో దట్టమైన పొగ బయటకు వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు చూసి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేసమయానికే గృహోపకరణాలన్నీ బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. అంబొదళలో జగన్నాథుని విగ్రహ ప్రతిష్ట రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదళలో జగన్నాధ మందిరంలో జగన్నాథుని కొత్త విగ్రహ ప్రతిష్టోత్సవాలు సొమ,మంగళవారాల్లొ అత్యంత వైభవంగా జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో స్వామి వారి పూజా కార్యక్రమాలను నిర్వహించి జగన్నాథుని కొత్తగా రూపొందించిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జగన్నాథ మందిరం నిర్వాహక కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ జోషి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టోత్సవాలకు పరిసర ప్రాంతాలకు చెందిన వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రెండు నెలల కిందట స్వామి విగ్రహం కాలిపోగా.. కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. కళాకారులకు సన్మానం జయపురం: కొరాపుట్ జిల్లా ధమంజోడిలో పది రోజులు నిర్వహించిన పంచపటమాలి 19వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాటక పోటీలలో జయపురం కళాకారులు ‘జీవన ఎకో నాటక( జీవితం ఒక నాటకం)’అనే నాటకాన్ని ప్రదర్శించి పలు బహుమతులు అందుకున్నారు. నాటక రచయిత జగదీస్ అధికారి, అభినేత్రి విజయలక్ష్మీ పాణిగ్రహి, నటులు బిఘ్నరాజ్ ఆచార్య, బాలనటుడు నివేదన పాణిగ్రహి, ముఖ్యఅతిథి నటులు నిరంజన్ సామల్లను ఈ సందర్భంగా నిర్వహకులు సత్కరించి గౌరవించారు. ఈ నాటకానికి నిరంజన్ పాణిగ్రహి దర్శకత్వం వహించగా జి.మహేష్ సంగీతం సమకూర్చారు. -
ఘనంగా సుదర్శన హోమం
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్ద గల శ్రీక్షేత్ర టౌన్షిప్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహుని మందిరంలో మంగళవారం నుంచి చందనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాధ్ ఆచార్యులు, స్థానిక బాలాజీ నగర్లో గల కల్యాణ వేంకటేశ్వర మందిరానికి చెందిన ప్రధాన అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహ స్వామికి ఉదయం ఆరాధన, చందనాభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు సుదర్శన హోమం నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్వామి కల్యాణోత్సవాలు అత్యంత ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు. -
రోహింగ్యాలపై ఫిర్యాదు
కొరాపుట్: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలపై నబరంగ్పూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ పిర్యాదు చేసింది. మంగళవారం చాంబర్ ప్రతినిధులు ఎస్పీ మిహిర్ పండాను అతని కార్యాలయంలో కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాము కష్టపడి టాక్స్లు, విద్యుత్ బిల్లులు, కార్మికులకు వేతనాలు, సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నామన్నారు. సామాజిక అభివృద్ధిలో ఎన్నో వ్యయప్రయాసలు పడి భాగస్వామ్యం అయ్యామన్నారు. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చి ఈ ప్రాంతంలో బైక్ల మీద గ్రామాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. వారికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. వారి పూర్వ చరిత్ర కూడా ఎవరికీ తెలియదన్నారు. వీరి వలన సమాజంలో అసాంఘీక సమస్యలు ఏర్పడతాయన్నారు. ఎస్పీని కలిసిన వారిలో చాంబర్ ప్రెసిడెంట్ కను దాస్, సభ్యులు పి.ఎల్.మూర్తి, వి.మహేష్, రాకేష్ గుప్తా, తదితరులు ఉన్నారు. -
స్వాభిమాన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియాలో మంగళవారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, ఎస్పీ వినోద్కుమార్ పటేల్ పర్యటించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మావోల అలజడి ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో గిరిజనులు ఎక్కువగా గంజాయి సాగు చేసేవారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ల రాకతో మావోలు తగ్గిపోయారు. గిరిజనుల్లోనూ చైతన్యం వచ్చింది. ఈ సందర్భంగా గిరిజనులతో చర్చించిన కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేతు యోజన పథకంలో ఈ ప్రాంతంలో గిరిజనుల ఉపాధి కోసం గాను పసుపు, చోడి, అల్లం తదితర పంటలు పండించుకునేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు సందర్శించారు. -
మే 20 నుంచి రబీ ధాన్యం సేకరణ
రాయగడ: రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం మే 20 నుంచి సేకరిస్తుందని కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో జరిగిన సమీక్షసమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ ఏడాది జిల్లాలో 8,890 క్వింటాళ్ల ధాన్యం సేకరణకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మండీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణతో పాటు బజారు నియంత్రణ కమిటీ (ఆర్ఎంసి) అధికారులు మండీల ఏర్పాటుకు సంబంధించి అన్ని సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి రైతు నుంచి ధాన్యం సేకరించాలని ధాన్యం సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మండీల్లొ రైతులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బిష్ణు ప్రసాద్ కర్ మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకు 503 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వివరించారు. ధాన్యం క్వింటాల్ ఽమద్దతు ధర రూ.2300 ప్రభుత్వం ప్రకటించగా ఇన్పుట్ సహాయం కింద రైతులు ప్రతి క్వింటాల్కు అదనంగా మరో రూ.800 పొందగలరని అన్నారు. జిల్లాలోని బిసంకటక్, మునిగుడ, గుడారి, పద్మపూర్ ,రామనగుడ, కొలనార సమితుల్లో మే 20 నుంచి ధాన్యం మండీలు ప్రారంభమవ్వగా గుణుపూర్లో మే 28 నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సమావేశంలొ రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక జిల్లా స్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు. -
తీర ప్రాంతంలో భద్రత పెంపు
భువనేశ్వర్: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాష్ట్రంలో తీరప్రాంత భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవీ నది ముఖద్వారం వెంబడి అస్తరంగ్ మైరెన్ పోలీసు దళాలు నావికా దళ అధికారులు, మైరెన్ పోలీసుల సంయుక్త బృందంతో పహారా నిర్వహించారు. నదిలో మత్స్యకారుల గుర్తింపును పహారా బృందం తనిఖీ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఏదైనా అనుమానాస్పద కదలిక లేదా తెలియని వ్యక్తి సంచరిస్తే వారికి తెలియజేయాలని స్థానికుల్ని కోరారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లే ప్రతిసారీ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వారి మైరెన్ కార్డులు, వారి ఓటరు గుర్తింపు కార్డులను కూడా అడగాలని పోలీసు అధికారులు మత్స్యకారులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే సంప్రదించగల ఫోన్ నంబర్ను కూడా అధికారులు మత్స్యకారులకు అందజేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దేవి నది ముఖద్వారం వద్ద భద్రతను పెంచారు. ఏదైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినట్లు అనుమానం వస్తే తక్షణమే తెలియజేయాలని మత్స్యకారులను ఆదేశించినట్లు ఒక అధికారి తెలిపారు. -
వడగాడ్పులపై ఆరోగ్య శాఖ సమగ్ర సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో వేసవి తాపం విపరీతంగా పెరుగుతోంది. తెల్లారితే గడప దాటడం కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో వడగాడ్పుల ప్రభావంతో వడదెబ్బ ప్రమాదాల తీవ్రత పట్ల రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. వడగాడ్పుల సమర్థమైన నిర్వహణతో అవాంఛనీయ సంఘటనల నివారణకు విభాగం ప్రాధాన్యత కల్పించింది. ఆరోగ్య శాఖాపరమైన ఏర్పాట్లతో సాధారణ ప్రజానీకంలో అవగాహన పెంపొందించాలనే దృక్పథంతో పరిస్థితుల్ని సమీక్షించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ఆదేశాల మేరకు వడగాడ్పుల నిర్వహణతో వడదెబ్బ ప్రమాదాల నివారణ కోసం అవసరమైన కార్యాచరణ, అనుబంధ ఏర్పాట్లు క్రమబద్ధీకరణకు ప్రజారోగ్య (డీపీహెచ్) డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. వడ గాలుల ప్రభావాలను తగ్గించడానికి ఇంట్రావీనస్ ద్రవాలు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ఓఆర్ఎస్), మందులు, ఎయిర్ కూలర్లు, పవర్ బ్యాకప్ వ్యవస్థలు వంటి అవసరమైన వైద్య సామగ్రి నిరంతర లభ్యతను నిర్ధారించడానికి శాఖ కృషి చేస్తోందని తెలిపారు. వడదెబ్బ సంబంధిత బాధితుల సత్వర చికిత్స, వైద్యం కోసం ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని పడకలు ముందస్తుగా సిద్ధం చేయాలని రాష్ట్రంలో 30 జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. వడగాడ్పుల నిర్వహణపై దృష్టి సారించి సంబంధిత అనారోగ్యాలను నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ కార్యాచరణ కోసం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ శిక్షణలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు మాత్రమే కాకుండా, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, సాధారణ ప్రజానీకానికి వేసవి తాపం సంబంధిత ఆరోగ్య సమస్యలకు త్వరగా మరియు సమర్థవంతంగా స్పందించడానికి వీలుగా శిక్షణ కల్పిస్తారు. దీనితో పాటు, వేడిగాలులతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి, వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడంపై ప్రజలకు ఆచరణాత్మక సలహాలను అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సమాచార, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) ప్రచారం తీవ్రతరం చేస్తారు. తీవ్రమైన వేడి ప్రభావాన్ని తగ్గించడానికి సకాలంలో వైద్య సహాయం అందించడం, అవగాహన పెంచడం, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, వనరులు అందుబాటులో ఉన్నాయని సమీక్ష సమావేశంలో అధికారులు హామీ ఇచ్చారు. వేడి సంబంధిత వ్యాధుల నోడల్ అధికారి డాక్టర్ బసంత్ ప్రధాన్, రాష్ట్ర నిఘా అధికారి డాక్టర్ అశోక్ పాయిక్రాయ్, నర్సింగ్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సెఫాలి మల్లిక్, డీఎఫ్డబ్ల్యూ అదనపు డైరెక్టర్ డాక్టర్ ప్రతిభా ప్రధాన్, అన్ని జిల్లాల నుండి ప్రధాన జిల్లా వైద్య అధికారులు (సీడీఎంఓలు) వ్యక్తిగతంగా, వర్చువల్ మోడ్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితిలోని జలాశాయంలోకి కోటి రూపాయల విలువ చేసే చేపపిల్లలను జిల్లా మత్స్యశాఖ అధికారులు సోమవారం విడుదల చేశారు. సేతు యోజన పథకంలో భాగంగా వీటిని విడుదల చేసినట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ జేన్నా తెలిపారు. సమితిలోని తొమ్మిది పంచాయతీలకు చెందిన ప్రజలు చి త్రకొండ జలాశయంలో చేపలవేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. చేప పిల్లలు పెరి గి పెద్దవి అయితే అధిక రాబడి వస్తుందన్నారు. విస్తరాకులు కుట్టిన కలెక్టర్ కొరాపుట్: నబరంగ్పూర్ కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో విస్తరాకులు కుట్టి మహిళలకు స్ఫూర్తినిచ్చారు. సోమవారం జిల్లాలోని పపడాహండి సమితి సెమ్లా గ్రామంలో ఒర్మాస్ సహాయ సహకారాలతో నడుస్తున్న మాత్రుశక్తి ప్రొడ్యూసర్ ఎంటర్ప్రైజెస్ను సందర్శించారు. అక్కడ ఉన్న విస్తరాకులను మిషన్ ద్వారా కుట్టి మహిళలను ఆశ్చర్య పరిచారు. నిలిచిన పపడాహండి– ఉమ్మర్కోట్ మార్గం కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా పపడాహండి–ఉమ్మర్ కోట్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ భారీ వాన కురిసింది. పపడా హండి సమీపంలో సాయుధ స్థూపం సమీపంలో కల్వర్టు నిర్మాణంలో ఉంది. వాహనాల రాకపోకల కోసం పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు మొత్తం నీటితో నిండిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డెక్కిన ప్రజలు కొరాపుట్: విద్యుత్, తాగునీటి కోసం సోమవా రం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి ఒడియా పెంట గ్రామ పంచాయతీ కేంద్రంలో ప్రజలు రోడ్డెక్కారు. లక్ష్మీపూర్–టికిరి మార్గంలో రోడ్డుపై ఖాళీ కుండలతో ధర్నాకు దిగారు. విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. గ్రామంలో తాగునీటి సర ఫరా లేదని ఆరోపించారు. వెంటనే అధికారు లు అక్కడకు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ వైర్లు కలపి పునరుద్ధరించారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సునాలీ కార్జికి నాలుగో ర్యాంకు పర్లాకిమిడి: బరంపురం విశ్వవిద్యాలయం ప్లస్త్రీ పరీక్ష ఫలితాలు సోమవారం ప్రకటించింది. పర్లాకిమిడి మహిళా కళాశాల ప్లస్త్రీ డిగ్రీ విద్యార్థినులు సోషల్ సైన్సు విభాగంలో ర్యాంకులు సాధించారు. వారిలో ఒకరు సోనాలీ కార్జి సోషల్ సైన్సులో నాలుగో ర్యాంకు సాధించారు. పదో ర్యాంకును సునీతా ప్రధాన్ సాధించారు. వీరికి ప్రిన్సిపాల్ రీనా సాహు, అధ్యాపకురాలు ముధుస్మితా ప్రధాన్లు మెమోంటోలతో సత్కరించారు. -
హైటెక్ గ్రూప్ బిశ్వజిత్ పాణిగ్రాహికి సత్కారం
పర్లాకిమిడి: ఉన్నత విద్య, ఆరోగ్యశాఖలో అనేక విప్లమాత్మక మార్పులు తెచ్చిన ఒడిశాలోని హైటెక్ గ్రూప్ మెడికల్ కళాశాలల డైరక్టర్ బిశ్వజిత్ పాణిగ్రాహిని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ సంఘం మంత్రి డాక్టర్ ముఖేష్ మహలింగ సోమవారం భువనేశ్వర్లో మెమొంటోతో సత్కరించారు. భువనేశ్వర్లో జరిగిన కాన్క్లేవ్ ఒడిశా కార్యక్రమంలో బిశ్వజిత్ను సత్కరించారు. బిశ్వజిత్ పాణిగ్రాహి హైటెక్ మెడికల్ కళాశాలల మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి కుమారుడు. రూర్కెలా, భు భనేశ్వర్, తిరుపతిలో వైద్య కళాశాలలు నెలకొల్పిన చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సంతానం సురేష్కుమార్ పాణిగ్రాహి. -
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. బాలాజీ (57) అనారో గ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ భాహీణి పతి, మున్సిపల్ మాజీ చైర్మన్ మీకాక్షి బాహీనీ పతి, జయపూర్ మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత తదితరులు కాాపువీధిలోని ఆయన స్వగృహానికి వచ్చిన బాలాజీ మృతదేహానికి నివాళులర్పి్ంచారు.అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కాగా బాలాజీ భార్య పి.రామలక్ష్మి 11వ వార్డు కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నారు. పొలాల్లోకి కలుషిత నీరు కొరాపుట్: కలుషిత నీటితో పంట పొలాలు పాడవుతున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డులో వేస్తున్నారు. కానీ మురుగు నీరు మాత్రం రంగబలి కుంబ చంపాగు సెంటర్ ప్రాంతాల వైపు వెళ్తోంది. ఆ ప్రాంతంలో పొలాల్లో నిల్వ ఉండిపోతోంది. ఈ నీరు వెళ్లే మార్గం మళ్లించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బొడొనాలో డ్యామ్ సందర్శన రాయగడ: జిల్లాలోని కెందుగుడ ప్రాంతంలో గల బొడొనాలో డ్యామ్ను జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి సోమవారం సందర్శించారు. అక్కడ గల మత్సకారులతో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేటకు వెళ్లే మత్సకారులు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. చేపల వేటనే జీవనోపాధిగా బతకు బాటు కొనసాగిస్తున్న మత్సకారులకు అండగా ఉంటామన్నారు. డ్యామ్ నుంచి సేకరించిన చేపలను వీధుల్లో తిరిగి విక్రయించే మహిళలతో కాసేపు ముచ్చటించారు. ప్రభుత్వం మత్సకారులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుందర్గఢ్ దుళింగ బొగ్గు గనిలో ప్రమాదం భువనేశ్వర్: సుందర్గఢ్ దుళింగ బొగ్గు గనిలో సోమవారం ఉదయం ప్రమాదం సంభవించింది. ఆపరేటర్లకు తీసుకుని వెళ్తున్న బస్సు గనిలో బోల్తా పడింది. బస్సులో 30 మందికి పైగా ఆపరేటర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి పైగా గాయపడ్డారు. చికిత్స కోసం క్షతగాత్రులను బ్రజ్రాజ్నగర్లోని ఆస్పత్రిలో చేర్చారు. మృతుడు పుడాపల్లి నివాసి నిత్యానంద ప్రధాన్గా గుర్తించారు. ఘటనా స్థలంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
భువనేశ్వర్ స్టేషన్ వద్ద హై అలర్ట్
భువనేశ్వర్: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో నగరంలో రైల్వేస్టేషన్ల వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా చర్యలు పటిష్టపరిచారు. ఆయా ప్రాంగణాల్లో ప్రయాణికులు, సిబ్బంది ఇతరేతర ప్రజలకు ఏమాత్రం భద్రత లోపించకుండా అవాంఛనీయ సంఘటనల నివారణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లలో భాగంగా రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది సోమవారం స్థానిక రైల్వే స్టేషన్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫామ్ల వద్ద ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి లేదా ఏదైనా సందిగ్ధ సామాన్లు చూస్తే తెలియజేయాలని ప్రయాణికులకు ఆర్పీఎఫ్ అధికారు లు కోరారు. ప్రయాణికులను లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలనలో అధునాతన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రవేశ, నిష్క్రమణ ప్రాంగణాలు, ప్లాట్ ఫారమ్, పార్కింగ్ ప్రాంతాల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆయా ప్రాంగణాల్లో నిఘాను బలోపేతం చేశారు. ప్రజల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. తనిఖీల సమయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలని, ఏవైనా లగేజీలు లేకపోవడాన్ని లేదా అనుమానాస్పద ప్రవర్తనను వెంటనే నివేదించాలని ప్రయాణికులను అభ్యర్థించారు. భద్రతా స్క్రీనింగ్ కోసం అవసరమైన అదనపు సమయం కేటాయించేందుకు ప్రయాణికులు స్టేషన్కు రైలు ప్రయాణం సమయం కంటే ముందుగానే స్టేషనుకు చేరుకోవాలని రక్షణ అధికారులు అభ్యర్థించారు. -
ముగిసిన రెడ్క్రాస్ శిక్షణ శిబిరం
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్క్రాస్ శిక్షకుల శిక్షణ శిబిరం సోమవారం సాయంత్రం సెమిలిగుడ ఉన్నత పాఠశాలలో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ప్రధమ కార్యక్రమంలో సాధన కర్మి రామచంద్ర పాల్హెచ్ఐబీ, ఎయిడ్స్లపై వివరించి వాటి నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలుప వివరించినట్లు వెల్లడించారు. ముగింపు కార్యక్రమంలో అగ్నిమాపక విభా గ అధికారి శ్రీపతి స్వైయ్ అగ్ని ప్రమాదాలలో బాధితులను రక్షించటంలో రెడ్ క్రాస్ కార్యకర్తలు అనుపరించాల్సిన పద్ధతులను వివరించారు. రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ సాధన కర్మి యజ్ఞేశ్వర పండ ప్రకృతి ప్రమాదాలలో అనుసరించాల్సిన విధానాలు, బాధితుల రక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. జూనియర్ రెడ్క్రాస్ అధికారి హరేకృష్ణ మహారాణ అధ్యక్షతన రెండవ అధివేషన్ జరిగింది. కార్యక్రమంలో రెడ్క్రాస్ జీవిత కాల సభ్యులు షేక్ ఇబ్రహిమ్, జగన్నాథ్ విద్యాపీఠం, సునాబెడ ప్రధాన ఉపాధ్యాయులు సిద్దార్థ మహాపాత్రో రెడ్క్రాస్ ప్రాధాన్యతను వివరించారు. మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముగింపు కార్యక్రమంలో జ్యోతిరంజన్ నంద, సపన్ దీక్షిత్, తపన పొరిడ, సాహెబ్ పరవిన్, శుభక్ష్మిత సాహు, అశోక్ కుమార్ పవడ పాల్గొన్నారు. సెమిలిగుడ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విష్ణుప్రియ సామంతసింహార్ ధన్యవాదాలు తెలియజేశారు. -
ఓఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
రాయగడ: స్థానిక కొత్తస్టాండు వద్ద గల ఓఎస్ఆర్టీసీ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత 38 రోజులుగా ఓఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు డ్రైవర్లు, కండక్టర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళన లో పాల్గొన్నారు. జీతభత్యాలు చెల్లించకపొవడంతోపాటు అసలు పనులు కల్పిస్తారో, లేదో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొందని వారంతా ఆరోపించా రు. రాయగడ ఓఎస్ఆర్టీసీ డిపో పరిధిలో రాయగ డ, కొరాపుట్ జిల్లాల ప్రయాణీకులకు బస్సు సేవ లు అందిస్తుండేవి. అత్యంత పాత బడిన బస్సుల ను నమామాత్రంగా నడిపిస్తున్న ప్రభుత్వం వాటి ఆలనాపాలనను పూర్తిగా మరిచిపోయింది. దీంతో బస్సుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతకొద్ది రోజుల క్రితం డిపోలో నడుస్తున్న పాత బస్సులు కండీషన్ సరిగా లేకపోవడంతో పాటు ఫిట్నెస్ లేవని ఆర్టీఓ అధికారి బస్సులను రద్దు చేశారు. అప్పటి నుంచి బస్సులు నడవకపోవడంతొ పాటు బస్సుల్లో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు పనులు లేక ఖాళీగా ఉండేవారు. బస్సులను యథావిధిగా నడిపించడం లేదు సరికదా తమకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళనకు దిగారు. 2015లో రాయగడ ఓఎస్ఆర్టీసీ డిపో ఏర్పాటైంది. ఈ డిపో పరిధిలో రాయగడ, కొరాపుట్ జిల్లల్ల్లో 9 రూట్లలో 11 బస్సులు నడుస్తుండేవి. ఈ బస్సుల్లో పనిచేస్తున్న 14 మంది డ్రైవర్లు, 12 మంది కండక్టర్లు జీవనోపాధి పొందుతుండేవారు. -
ఏడుగురు సైబర్ మోసగాళ్లు అరెస్టు
భువనేశ్వర్: పూరీ నీలాద్రీ భక్త నివాస్ మోసపూరిత వెబ్సైట్ను సృష్టించి వసతి కల్పించడంలో యాత్రికులను మోసం చేసే ప్రయత్నంలో పాల్గొన్న ప్రధాన నింది తుడితో సహా ఏడుగురిని రాష్ట్ర క్రైమ్ (సీఐడీ సైబర్ క్రైమ్) యూనిట్ విజయవంతంగా అరెస్టు చేసింద ని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా విలేకర్లకు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తుల్లో ప్రధాన నిందితుడు అన్షుమాన్ శర్మ (24)గా గుర్తించారు. మిగిలిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన అరవింద్ కుమార్ (35), ఆకాష్ కేశర్వాణి (33), గుజరాత్ కు చెందిన హితేష్భాయ్ పాత్రో (39), పార్థ్ పర్మా ర్ (25), ఠక్కర్ కర్సాంజి శోభాజీ (48), కురేషి మహ్మద్ అస్లాం (31) ఉన్నారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయ ప్రధాన నిర్వాహకుడి (సీఏఓ) లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నకిలీ వెబ్సైట్ సృష్టించి పుణ్య క్షేత్రం పూరీలో వసతి సదుపాయం కల్పిస్తా మని మోసగిస్తున్నట్లు ప్రజలు, భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు దాఖలు కావడంతో చర్యలు తీసుకోవా లని శ్రీ మందిరం సీఏఓ ఫిర్యాదు రాష్ట్ర క్రైం శాఖకు ఫిర్యాదు చేశారు. అమాయకపు యాత్రికులను వాట్సాప్ ద్వారా మొబైలు నంబరుకు పూరీ పుణ్య క్షేత్రంలో నీలాద్రి భక్త నివాస్లో వసతి సదుపా యం ఖరారు చేసినట్లు మోసగించి ఆన్లైన్లో చెల్లింపులు ప్రేరేపించి మోసాలకు పాల్పడుతున్న ట్లు ఫిర్యాదులో వివరించారు. మోసగాళ్లు కెనరా బ్యాంకులోని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (ఖాతా నంబర్: 110217193478) లోకి చెల్లింపులు స్వీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నా రు. అన్షుమాన్ శర్మ వెబ్సైట్ను మే 22, 2024న సృష్టించాడని తేలింది. ఫిర్యాదు నమోదైన వెంటనే ఆ మోసపూరిత సైట్ను తొలగించారు. అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాను ఉపయోగించిన మరో సహచరుడు అరవింద్ కుమార్ను కూడా దర్యాప్తులో గుర్తించారు. అరెస్టు చేసిన అనుమానితుల నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నీలాద్రి భక్త నివాస్ వెబ్సైట్కు సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గోడాడీ హోస్టింగ్ సమాచారం, వెబ్సైట్ను రూపొందించడానికి ఉపయోగించిన రిజిస్టర్డ్ సిమ్ కార్డ్తో సహా అనేక వస్తువులను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఈ మోసపూరిత వ్యవహారంలో 4 వేర్వేరు కేసులు దాఖలు చేశారు. వీటి దర్యాప్తు కొనసాగించడానికి 2 దర్యాప్తు బృందాలను గుజరాత్ (అహ్మదాబాద్, ఆనంద్ జిల్లా, సూరత్) ఉత్తరప్రదేశ్కు పంపారు. రూ.1.28 కోట్లు మోసం గుజరాత్లోని సూరత్కు చెందిన హితేష్భాయ్ పాత్రో (39) ఖాతాలో నేరుగా రూ. 27 లక్షలు జమ అయిన ఆధారంతో ఆయనను అరెస్టు చేశారు. 6 చెక్ పుస్తకాలు, 31 డెబిట్/క్రెడిట్ కార్డులు, నకిలీ కంపెనీల 13 రబ్బరు స్టాంపులు, 12 మొబైల్ హ్యాండ్సెట్లు, సిమ్ కార్డులు, 4 పెన్ డ్రైవ్లు ఎనిమిది ప్రభుత్వ, ప్రభుత్వేతర ఐడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో సమగ్రంగా రూ.1.28 కోట్లు భారీ మోసం బట్టబయలైందని డీజీ పేర్కొన్నారు. రూ. 7.5 కోట్లు భారీ మోసం ఈ మోసం వ్యవహారంలో అహ్మదాబాద్కు చెందిన పార్థ్ పర్మార్ (25) ప్రాథమిక ఖాతాదారుడిగా వ్యవహరించినట్లు ధృవీకరించి అరెస్టు చేశారు. అతని ఖాతాలో ప్రత్యక్షంగా రూ. 25 లక్షలు జమ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డును స్వాధీనం చేసుకుని కొనసాగించిన దర్యాప్తులో మోసం పరిమాణం రూ.7.5 కోట్లుగా తేలింది. రూ. 87.8 లక్షల మోసం ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గుజరాత్లోని బనస్కాంతకు చెందిన ఠక్కర్ కర్సాంజీ శోభాజీ (48) తన ఖాతాలో రూ. 9.3 లక్షలు జమ చేసినట్లు గుర్తించడంతో ఈ డొంక కదిలింది. గుజరాత్లోని ఖేడా జిల్లాకు చెందిన కురేషి మొహమ్మద్ అస్లాం (31) ఖాతాలో రూ. 6 లక్షలు జమ అయినట్లు తేలింది. వీరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.4 కోట్లు మోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఆకాష్ కేషర్వానీ (33) ఖాతాకు రూ. 3.7 లక్షలు బదిలీ ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి. తదుపరి దర్యాప్తులో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలలో అదనపు కరెంట్ ఖాతాల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేరంలో ఇతర భాగస్వాములను, దాని ట్రాన్స్ ఇండియా పరిణామాలను, డబ్బు జాడను దర్యాప్తు బృందం కనుగొంటుందని తెలిపారు. -
వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు
కొరాపుట్: ఈ నెల రెండో వారంలో కేంద్రం తెచ్చిన వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పేర్కొన్నారు. సోమవారం కలహండి జిల్లా భవానిపట్న లో ఇండియన్ ఫుడ్ పార్క్లో జరిగిన బీజేపీ వర్క్ షాప్లో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ బిల్లు లోక్ సభ, రాజ్యసభలలో అనుమతి పొందిందన్నారు. వక్ఫ్ రూల్స్ వలన ముస్లిం సోదరులు, సోదరీ మణులు గతంలో చాలా ఇబ్బందులు పడ్డా రన్నారు. ఇకపై ఆ కష్టాలు ఉండవని చెప్పారు. పేద ముస్లిం లకు ఈ బిల్లు ప్రస్తుతం సహాయం చేస్తుందని బలబద్ర మజ్జి పేర్కోన్నారు.ఈ సమావేవంలో కలహండి ఎంపీ రాజమాత మాళవిక దేవి, ఎంఎల్ ఎ సుదీర్ రంజన్ పఠజోషిలు పాల్గోన్నారు. -
ఘనంగా చాంబర్ ఆఫ్ కామర్స్ స్వర్ణోత్సవాలు
కొరాపుట్: జయపూర్ చాంబార్ ఆఫ్ కామర్స్ స్వర్ణోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. కొరపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి భద్రతలు బాగుంటే వర్తక వాణిజ్య రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవానికి సంబంధించి సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీని పతి, మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత, ప్రెసిడెంట్ ప్రభాకర్, సెక్రటరీ డి.మాధవ, సలహాదారుడు శశి పట్నాయక్, అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి వచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కడ్రక ఔదార్యం
రాయగడ: రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్ర క మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కొందరు వృద్ధులు సోమవారం మధ్యా హ్నం నడుచుకుంటూ వెళుతుండటం చూసి తన వాహనాన్ని ఆపి వారిని కలిశారు. ఎక్కడకు వెళుతు న్నారని ఆరా తీశారు. ఇంత ఎండలో నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏమిటని అడిగారు. తా ము సదరు సమితి పరిధి తడమ పంచాయతీలోని లుహాకాల్ గ్రామం నుంచి వచ్చామని వారంతా సమాధానం చెప్పారు. పింఛన్ తీసుకునేందుకు తా మంతా 11 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామని వివరించారు. ఆటో కొసం పడికాపులు కాచినప్పటి కీ లభించకపోవడంతో గత్యంతరం లేక నడుచుకుంటూ సమీపంలోని కొత్తబస్టాండుకు వెళుతున్నామని చెప్పారు. వివరాలు సేకరించిన ఎంఎల్ఏ కడ్రక ఆటోలను రప్పించి వారి వారి గ్రామాలకు తరలించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పెన్సన్ ను ఇటువంటి తరహా వృధ్దులకు ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చే సౌకర్యం కల్పించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని ఈ సందర్భంగా కడ్రక చెప్పారు. -
మధుసూదన్ జయంతి వేడుకలు
పర్లాకిమిడి: ఉత్కళ గౌరవ్ మధుసూదన్దాస్ జయంతిని పర్లాకిమిడి జిల్లా కోర్టులో లాయర్స్డే గా సోమ వారం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికారణ అధ్యక్షులు ప్రణబ్ కుమార్ రౌత్రాయ్, ముఖ్యవక్తగా ఎస్.కె.సి.జి.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జితేంద్ర పట్నాయక్, అదనపు జిల్లా జడ్జి ప్రదీప్కుమార్ సోనాల, ఫ్యామిలీ కోర్టు జడ్జి అశోక్ కుమార్ పాహి, జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌవు లో, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జితేంద్ర కుమార్ పట్నాయక్, కార్యదర్శి పృఽథ్వీరాజ్, వినియోగదారుల ఫోరం అధ్యక్షులు రాజేంద్రపండా హాజరయ్యారు. మధుసూదన్ దాస్ ఒడిశాకు ప్రథమ పట్టభద్రులు, ప్రథమ లాయర్గా పనిచేశారని వక్తలు గుర్తు చేశారు. స్వతంత్ర ఒడిశా పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారని జిల్లా జడ్జి ప్రణబ్కుమార్ రౌత్రాయ్ అన్నారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్కళ గౌరవ మాధుసూదన్ దాస్ జయంతిని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ జిల్లా జడ్జి శాంతాన్ కుమార్ దాస్ హాజరై మాధుసూదన్ దాస్ విగ్రహాని కి పూలమాలాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. పలువురు లాయర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అలానే ఉచిత వైద్య సేవలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీత్పాల్ సింగ్, గోవిందపాత్రో, గోపాల్పండ పాల్గొన్నారు. రాయగడ: ఉత్కళ గౌరవ్ మధుసూదన్ దాస్ చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. మధుసూదన్ దాస్ 177వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయగడ బార్ అసొసియేషన్ అధ్యక్షుడు దేవి ప్రసాద్ పట్నాయక్, న్యాయవాదులు బ్రజసుందర్ నాయక్, బాబు రాజ్గురు పాల్గొన్నారు. అలాగే స్థానిక యూజీఎంఐటీ ఇనిస్టిట్యూట్లో సిబ్బంది కూడా మధుసూదన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భువనేశ్వర్: ఉత్కళ గౌరవ్ మధుసూదన్ దాస్ 177వ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, విపక్ష నేత నవీన్ పట్నాయక్, వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలు సహా పార్టీలకు అతీతంగా ఆయనకు నివాళులర్పించారు. స్థానిక రాజ్ భవన్ స్క్వేర్ వద్ద ఉన్న ఉత్కల్ గౌరవ్ విగ్రహం దగ్గర వివిధ రంగాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర శాసన సభ ఆవరణలో మధు బాబు నిలువెత్తు విగ్రహం దగ్గర స్పీకరు, ముఖ్యమంత్రి ఇతర మంత్రులు, శాసన సభ సభ్యులు ఇతరేతర ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నివాళులు అర్పించింది. ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. మధుబాబు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రత్యేక ఒడిశా ప్రావిన్స్ ఏర్పాటు, రాష్ట్ర పారిశ్రామికీకరణ, ఒడియా భాషా రక్షణకు ఆయన చేసిన అసమానమైన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ప్రతిపక్ష నాయకుడు మరియు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తెలిపారు. -
పారాదీప్లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: పారాదీప్ జీరో పాయింట్ ప్రాంతం స్టాక్ యార్డ్లో సోమవారం భయానక అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ పూతతో కూడిన ఇనుప పైపుల పోగులో మంటలు చెలరేగాయి. 10 యూనిట్లు పైబడి కుజంగ్ అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) చమురు పైప్ లైన్ వేయడం జరుగుతోంది. మంటల్లో కోట్లాది రూపాయల విలువైన పైపులు కాలి బూడిదయ్యాయి. ఈ పైపులు ద్రవ పెట్రోలియం ఉత్పత్తులను భూగర్భం గుండా రవాణా చేయడానికి ఉద్దేశించినవి. జగత్సింగ్పూర్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంటు, స్థానిక ఠాణా ఇనస్పెక్టరు ఇంచార్జి ప్రత్యక్షంగా ఘటనా స్థలం సందర్శించారు. ప్రమాదం తీవ్రతని సమీక్షించారు. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత దానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేశామని అధికారులు తెలిపారు. -
కర్ణపాడులో ఏనుగుల బీభత్సం
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి కర్ణపాడు గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో గల గొట్టపు బావిని పీకిపారేశాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులు చెంది బితుకుబితుకుమంటూ రాత్రంతా గడిపారు. అనంతరం గ్రామంలో గల అరటి, మామిడి, పనస చెట్లను ధ్వంసం చేశాయి. సమాచారం తెలుసుకున్న సికరపాయి అటవీ శాఖ ఫారెస్టర్ పీకే జెన్న, వన రక్షకుడు రామ సామల్ సంఘటన జరిగిన గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన బాధిత కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. సేకరించిన వివరాలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నయవంచకుడిపై పోలీసులకు ఫిర్యాదు కొరాపుట్: ప్రేమ పేరుతో నమ్మించి 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేసి పరారైన నయవంచకుడిపై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న హిర్లి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల గిరిజన బాలికను ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన షేక్ అలం హుస్సేన్ నమ్మించాడు. నిజమని నమ్మిన బాలిక అతనికి సర్వం అర్పించడంతో గర్భం దాల్చింది. అయితే అనంతరం అతను కనిపించకుండా పోవడంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించింది. వారి సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్లో షేక్ అలం హుస్సేన్పై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఘాట్ రోడ్డులో లారీ బోల్తా కొరాపుట్: ఘాట్ రోడ్డులో కర్రల లోడుతో ఉన్న లారీ బోల్తా పడింది. సోమవారం కొరాపుట్–జయపూర్ మార్గంలో ఘాట్ రోడ్డులో మలుపు వద్ద ఏపీ 35 0588 నంబర్ గల లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దాంతో కర్రలు రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. వాహనాలు దారి లేక ఆగిపోయాయి. వెంటనే లారీ సిబ్బంది అడ్డంగా ఉన్న కర్రలు తొలగించి మార్గం సుగమం చేశారు. కాశీపూర్లో ఇద్దరు ఆత్మహత్య రాయగడ : జిల్లాలోని కాశీపూర్ సమితి టికిరి పంచాయతీలోని వివాహిత కాంచన్ మాఝి (20 ) ఉరి వేసుకుని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఆమెకు ఏడాది కిందట కంసారిగుడ గ్రామానికి చెందిన మున్నా మాఝితో వివాహమైంది. భార్యభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో ఆమె తన అక్క వద్ద ఉంటోంది. ఆదివారం నాడు కూలి పనులకు వెళ్లిన కాంచన ఇంటికి తిరిగి రాకపొవడంతో అక్క వెతికింది. సమీపంలొ గల ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ కాంచన మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అదే రోజున కాశీపూర్ గ్రామంలోని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కాశీపూర్ అటవీ శాఖ రేంజ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బాలిక మతిస్థిమితం బాగులేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
ఎంపీ పర్యటనపై ఉద్రిక్తత
జయపురం, కొరాపుట్: కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క జయపూర్ పర్యటనపై ఉద్రిక్తత నెలకొంది. ఒక్క సారిగా శాంతి భద్రతల సమస్య రేగింది. ఇటీవల పార్లమెంట్లో జరిగిన వక్ఫ్ బోర్డు వ్యతిరేక బిల్లు పై జరిగిన ఓటింగ్ లో పార్టీ ఆదేశానుసారం వ్యతిరేకంగా ఉల్క ఓటు వేశారు. దాన్ని నిరసిస్తూ జయపూర్లో హిందూ పరివార్ వర్గాలు ఆయన జయపూర్ పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించాయి. ముందస్తుగా గమనించిన ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించారు. వెంటనే జయపూర్ పట్టణ పోలీసులు వారిని అదుపు లోనికి తీసుకున్నారు. ఒక్కటైన ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఇంత వరకు ఎంపీ ఉల్కకి స్థానిక ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి వర్గాలకు సరిపడేది కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం ఎంపీకి అండగా నిలిచింది. ఎమ్మెల్యే అనుచరులు బైక్ ర్యాలీ ద్వారా ఎంపీ ఉల్కకి స్వాగతం పలికారు. జయపూర్ మెయిన్ రోడ్డులో గల కాంగ్రెస్ కార్యాలయంలో భారీ ఎత్తున కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయం శిరోధార్యం పార్టీ నిర్ణయం ప్రకారం వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశానని, రాజ్యంగ స్ఫూర్తి ప్రకారం నడుచుకున్నానని ఉల్క తెలిపారు. పెహల్గాంలో టెర్రరిస్టులు జరిపిన హత్యాకాండ అమానుషమని అన్నారు. ఇలాంటి హింసని ఏమాత్రం అంగీకరించకూడదన్నారు. మీరేనా హిందువులు...నేను కాదా ఎంపీని అడ్డుకొంటామని హెచ్చరించిన వారే హిందువులా.. మరి నేను కాదా అంటూ ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే పోరాటానికి వెనుకాడబోమన్నారు. -
ట్రక్కులో రూ.కోటి విలువైన గంజాయి జప్తు
భువనేశ్వర్: నగరం గుండా గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో సోమవారం ఒక ట్రక్కు లోడు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా అవుతున్న ఈ సరుకు మార్కెట్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. పుల్బణీ జిల్లా నుంచి హిమాచల్ ప్రదేశ్కు ట్రక్కులో ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఆకస్మిక దాడిలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టుబడింది. గంజాయిని ట్రక్కుకు లోడ్ చేసిన ప్యాకెట్లలో రహస్యంగా చుట్టి ఉన్నట్లు తేలింది. ఈ దాడిలో 5 క్వింటాళ్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈ మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది. -
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి
పర్లాకిమిడి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను కూడళ్లలో ప్రతిష్టించి ఆరాధించే కంటే ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని దళిత సమాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.బాలక్రిష్ణ అన్నారు. అంబేడ్కర్ సమ్మాన్ అభియాన్ పేరిట భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక టౌన్ హాలులో బీజేపీ జిల్లా అధ్యక్షులు నవకిశోర్ శోబోరో ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా కోరాపుట్ ఎంపీ అభ్యర్థి కాళీరాం మఝి విచ్చేసి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. గౌరవ అతిథులుగా కొరాపుట్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, సుమంత్ కుమార్ ప్రధాన్, స్వస్థంబ్ మాజీ కార్యదర్శి జమానా కర్రెయ్య, రజక వికాస్ పరిషత్ అధ్యక్షులు కె.మోహన్రావు, బీజేపీ జిల్లా సాధారణ కార్యదర్శి జగన్నాథమహాపాత్రో పాల్గొన్నారు. అంబేడ్కర్ పేద కుటుంబంలో పుట్టినా ఆయన అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాడని జమానా కర్రెయ్య అన్నారు. భారత రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్తోనే వెనుకబడిన జాతులు, కులాలు ఈరోజు ఉన్నత స్థాయికి చేరుకున్నాయని కె.మోహన్రావు అన్నారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో అధ్యక్షత వహించగా నృసింహ చరణ్ పట్నాయక్, ఛిత్రిసింహాద్రి సహకరించారు. -
కొండలెక్కి.. వాగులు దాటి
కొరాపుట్: దండకారణ్యంలోని దుర్గమ అటవీ ప్రాంతాలలో ఉండే గిరిజన గూడేంలను లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత సందర్శించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి గౌడుగుడ గ్రామ పంచాయతీ లచ్చమణి, తులమట్టంగి, ఉప్పర్ మట్టంగి గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలకు రోడ్డు మార్గం లేదు. కనీసం బైక్ వెళ్లడానికి కూడా అవకాశం లేదు. దీంతో ఎమ్మెల్యే కాలి నడకన కొండలు ఎక్కి, వాగులు దాటి గ్రామాలకు చేరుకున్నారు. పలు చోట్ల గిరిజనులతో మీటింగ్లు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల ముందు ఉన్న అరుగులే వేదికలయ్యాయి. స్వాతంత్య్ర అనంతరం ఇంత వరకు ఆ గ్రామాలకు ఎవరూ వెళ్లలేదు. పవిత్ర శాంత తొలి ఎమ్మెల్యే. తులమట్టంగి వద్ద ఉన్న పెద్ద జలపాతాన్ని కూడా సందర్శించి రోడ్డు వేయాలని పర్యాటక శాఖకు లేఖ రాశారు. -
చిరుత, ఎలుగు దాడులు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా రాయగర్ సమితి కేంద్రానికి సరిహద్దులోని సరోనా ప్రాంతం అచిడోంగ్రి గ్రామంలోకి ఆదివారం చిరుత పులి ప్రవేశించింది. వీధిలో ఆడుకుంటున్న చిన్నారి బాలుడిపై దాడికి తెగబడింది. పిల్లవాడు భయంతో కేకలు వేయగా గిరిజనులు ఆయుధాలతో పులి పై దాడి చేశారు. వెంటనే ఆ బాలుడిని వదిలి అడవిలోకి పారిపోయింది. బాధితుడిని కాంకేర్ లోని కోమ్లాదేవి ఆస్పత్రికి తరలించారు. వేర్వేరు చోట ఎలుగు బంట్లు దాడులు ఆదివారం నబరంగ్ఫూర్ జిల్లా రాయగర్ సమితి కుసుంపూర్ గిరిజన గ్రామానికి చెందిన రాములు గొండో మెంతి ఆకులు సేకరణకు అడవి లోనికి వెళ్లింది. ఒక ఎలుగు బంటి వెనక నుంచి దాడి చేసి కాలు,భుజం మీద గాయ పరిచింది. భయంతో రాములు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గిరిజనుల రక్షించారు. హత్తిగావ్ పంచాయతీ లెండి గ్రామానికి చెందిన శంకర్ గొండో అడవిలో మెంతి ఆకుల సేకరణకి వెళ్లాడు. అతనిపై కూడా వేరే ఎలుగు బంటి దాడి చేసింది. సహచరులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరినీ రాయగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్తిగాం అటవీ ప్రాంతంలో ఎలుగు బంట్లు అధికంగా వచ్చాయని అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల్లో హెచ్చరికలు చేశారు. కానీ గిరిజనులు జీవనోపాధి కోసం తేనె, కలప, గుగ్గిలం, మెంతి ఆకుల సేకరణ కి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. -
భక్తులకు మజ్జిగ వితరణ
రాయగడ: స్థానిక మణిద్వీప మహిళా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగౌరీ మందిరం ప్రాంగణంలో ఆదివారం మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగౌరీ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షురాలు మరాటం సుజన తెలిపారు. ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో క్లబ్ ద్వారా సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తమ క్లబ్ తరచూ నిర్వహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వి.స్వాతి, కోశాధికారి కె.లావణ్య, సహాయ కార్యదర్శి కె.సుహాసిని, సభ్యులు కింతలి జ్యోతిర్మణి, క్రిష్ణవేణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.పాము కాటుతో వ్యక్తి మృతి మల్కన్గిరి: పాముకాటుతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా పోడియా సమితి మాటేర్ పంచాయతీ కుమారగూడ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకోగా బీమా మాడీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేందు ఆకులు (బీడీ ఆకులు) తీయడం కోసం బీమా మాడీ సమీప అడవికి వెళ్లాడు. కింద పడిపోయిన ఆకులు తీస్తుండగా అందులో ఉన్న విష సర్పం కాటు వేసింది. భయంతో కేకలు వేయగా సమీపంలో ఉన్న వారు అక్కడకు చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. బాధితుడిని పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు..అప్పటికే బీమా మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు పోడియా పోలీసుస్టేషన్ అధికారి నిరోధ్ కుమార్ బాష్ ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్యామ్లో పడి యువకుడు.. కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో చంపాపుట్ గ్రామానికి చెందిన బలరాం దురువా (40) ఆదివారం మాచ్ఖండ్ నది పరిధిలోని జాలా పుట్ డ్యామ్లో పడి మృతి చెందాడు. నందపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది మృతదేహాన్ని డ్యామ్ నుంచి వెలుపలికి తీశారు. పాడువా పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.గూడ్స్ రైలులో మంటలు రాయగడ: రాయిపూర్ నుంచి విశాఖపట్నం పోర్టుకు బొగ్గులోడుతో వెళుతున్న గూడ్స్రైలులో మంటలు చెలరేగాయి. శనివారం సాయంత్రం ఈ ఘటన జిల్లాలోని బిసంకటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రాయిపూర్ నుంచి బొగ్గు లోడుతో వస్తున్న గూడ్స్ బిసంకటక్ రైల్వే స్టేషన్లో కొద్దిసేపు నిలిచింది. కొంతసేపటికి ఒక బోగీ నుంచి పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే స్టేషన్ మాస్టార్కు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఆయన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగుపాటుకు పశువులు మృతి రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో పిడుగుపాటుకు మూడు పశువులు మృతి చెందాయి. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతొ కూడిన వర్షం కురిసింది. ఇంటిముందు ఉన్న చెట్టు కింద పశువులు పచ్చిక మేస్తున్న సమయంలో చెట్టుపై పిడుగు పడింది. దీంతో కింద ఉన్న తమ పశువులు మృతి చెందాయని బాధితులు ఘాసి భొత్ర, సుందర్ కౌసల్యలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
వేర్వేరు సంఘటనల్లో నలుగురు జల సమాధి
భువనేశ్వర్: రాష్ట్రంలో రెండు వేర్వేరు సంఘటనలలో నలుగురు బాలురు జల సమాధి అయ్యారు. ఆదివారం ఆయా ప్రాంతాల్లో విషాదం అలుముకుంది. కటక్, నయాగఢ్ జిల్లాల్లో ఈ విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. నయాగఢ్ జిల్లా దస్పల్లా పోలీస్ ఠాణా పరిధి గోడిబిడ గ్రామంలో ముగ్గురు బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు ముగ్గురు చెరువులో స్నానం చేస్తూ దురదృష్టవశాత్తు నీట మునిగారు. బాలురును బహదఖల పొడా సాహికి చెందిన 9 ఏళ్ల శుభ ఖిలార్, ఉమాకాంత్ నాయక్, నువాగాంవ్ పోలీస్ ఠాణా పరిధిలోని ఖలమడ గ్రామానికి చెందిన 11 ఏళ్ల ఏళ్ల రితేష్ ప్రధాన్గా గుర్తించారు. ఈ ముగ్గురినీ వెలికి తీసి దసపల్లా మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడికి చేరుకునే లోపే వీరంతా మరణించారని వైద్యులు ప్రకటించారు. కఠొజొడి నదిలో బాలుడు గల్లంతు కటక్లోని ఖాన్ నగర్ సమీపంలోని కఠొజొడి నదిలో కొట్టుకుపోయి 14 ఏళ్ల మైనర్ బాలుడు సూర్యకాంత్ మాఝీ గల్లంతయ్యాడు. నగరంలోని బేతాబింధాని సాహికి చెందిన సూర్యకాంత్ స్నానం చేస్తుండగా బలమైన ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి బాలుని గాలించి ఖాన్ నగర్ రైల్వే వంతెన సమీపంలోని నది నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్రంలో అకాల వర్షాలు
● 9 జిల్లాలకు ఐఎండీ నారింజ రంగు, 21 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కేంద్రం రాష్ట్రంలోని 30 జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసింది. 9 జిల్లాలకు నారింజ, 21 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మే నెల 1వ తేదీ వరకు ఈ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని భావిస్తున్నారు. నారింజ హెచ్చరిక సుందర్గఢ్, కెంజొహర్, మయూర్భంజ్, బాలాసోర్, భద్రక్, గజపతి, గంజాం, రాయగడ మరియు కొరాపుట్ జిల్లాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలుల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. పసుపు హెచ్చరిక జాజ్పూర్, కేంద్రాపడా, కటక్, జగత్సింగ్పూర్, ఝార్సుగుడ, బర్గడ్, సంబల్పూర్, దేవ్గడ్, అంగుల్, ఢెంకనాల్, పూరీ, ఖుర్దా, నయాగడ్, సోన్పూర్, బౌధ్, నువాపడా, బొలంగీర్, కలహండి, కంధమల్, నవరంగ్పూర్, మల్కన్గిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసే అవకాశం ఉంది. -
గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన
కొరాపుట్: సహజసిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరంలో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పర్యటించారు. ఆదివారం ఉదయం కొరాపుట్ జిల్లా బొయిపరి గుడ సమితి రామగిరి పంచాయతీలో ఉన్న ఈ క్షేత్రం సందర్శించారు. అక్కడ జరుగుతున్న క్షేత్ర అభివృద్ధి పనుల పురోగతి సమీక్షించారు. సత్వరం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని దండకారణ్య కొండల్లో నివసిస్తున్న గిరిజనులకు ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేశారు. పర్యటనలో కొట్పాడ్ ఎమ్మెల్యే రుఫుదర్ బోత్ర, పార్టీ నాయకులు,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పాక్ మహిళ తిరుగు ప్రయాణం
భువనేశ్వర్: పాకిస్తాన్ జాతీయురాలు నగ్మా యూసుఫ్ ఆదివారం భువనేశ్వర్ నుంచి బయలుదేరింది. స్వదేశానికి తిరిగి పంపడానికి ఇక్కడి అధికారులు గుర్తించిన పొరుగు దేశానికి చెందిన 12 మంది పాకిస్తాన్ పౌరులలో ఆమె ఒకరు. 2008 సంవత్సరంలో భారతీయ పౌరుడు మొహమ్మద్ నిజాముద్దీన్ను వివాహం చేసుకుంది. తర్వాత ఆమె దీర్ఘకాలిక వీసాపై స్థానిక బీజేబీ నగర్ ప్రాంతంలో నివసిస్తోంది. వీసా పునరుద్ధరణ కోసం చేసిన దరఖాస్తులు తిరస్కరించిన తర్వాత ఆమె ఇటీవలే విజిటర్ వీసా పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విజిటర్ వీసా గడువు ముగియడానికి కొన్ని రోజుల ముందుగా ఆమె కమిషనరేట్ పోలీస్లోని విదేశీయుల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఆ దరఖాస్తు పెండింగ్లో ఉంది. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ పచ్చిక బయళ్లలో పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడిలో 26 మంది మరణించిన తర్వాత కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆమె దేశం విడిచి వెళ్లమని కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తును ఆమోదించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లమని ఆమెకు నోటీసు ఇచ్చింది. సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కొరాపుట్: సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని దసరాపొద నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లే మార్గంలో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు సంఘం అధ్యక్షుడు రాధా నాధ్ బెహరా ఆదివారం ప్రారంభ పూజలు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి భూమి పూజ చేశారు. గత ఎమ్మెల్యే సదాశివ ప్రదాని తన కోటా నిధులు రు.4 లక్షలు ఇవ్వగా ప్రస్తత ఎమ్మెల్యే గౌరీ మరో రు.4 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ భవనం కోసం ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఇంటికి కూరలు తేవాలి కదా..! కొరాపుట్: దేశానికి రాజైనా ఇంటికి యజమానే కదా. సోమవారం నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి రాయగడ జిల్లా పర్యటనకి పయనమయ్యారు. మార్గ మధ్యంలో ఆకు కూరలు కనిపించాయి. తన కాన్వాయ్ ఆపించి వాటిని బేరమాడి కొనుక్కున్నారు. నిత్య ప్రజా జీవితంలో సతమతమవుతున్నప్పటికీ తాను కూడా ఒక ఇంటికి యజమాని అని గుర్తుకు తెచ్చుకొని ఆ ఆకుకూరలు సంచిలో వేసుకొని బయలు దేరారు.