
ఢిల్లీ: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని ధర్మాసనం ఆదేశించింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై తనిఖీ జరపాలని కేంద్ర సాధికార కమిటీకి ఆదేశాలిచ్చింది. కొల్లేరులో ప్రైవేట్ భూములను నోటిఫై చేయడంపై ప్రైవేట్ మత్స్య కారుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొల్లేరు ప్రస్తుత స్థితిపై నివేదిక అందించాలని సీఈసీని ఆదేశించింది.
ఏపీ వెట్ ల్యాండ్ స్టేట్ అథారిటీ సుప్రీంకోర్టు ఆదేశాలను సరిగా అమలు చేస్తున్నో లేదో నివేదిక ఇవ్వాలి. కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలి. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ తీర్మానాలను, కొల్లేరు సరిహద్దులపై ఆర్ సుకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాలి’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
వన్య ప్రాణుల సంరక్షణ చట్టానికి అనుగుణంగా కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం నోటిఫై చేశారా?. కొల్లేరులో ఉన్న ప్రైవేటు భూ యజమానుల హక్కులను ఎలా సెటిల్ చేశారు? అని ప్రశ్నించిన ధర్మాసనం.. 12 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది తాడిమళ్ల గౌతమ్ పిటిషన్ దాఖలు చేశారు.