IPL 2019
-
'మలింగ రూపంలో దురదృష్టం వెంటాడింది'
2019 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ ఇది. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఆఖరి బంతి వరకు విజయం దోబుచులాడిన చివరకు ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానుల గుండెలు బరువెక్కిపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగిన చెన్నై సూపర్కింగ్స్కు ఈ టార్గెట్ పెద్ద కష్టమని ఎంత మాత్రం అనిపించలేదు, అందుకు తగ్గట్టుగానే ఓపెనర్ షేన్ వాట్సన్ 59 బంతుల్లోనే 80 పరుగులు చేయడంతో సూపర్ కింగ్స్ విజయానికి చేరువగా వచ్చింది. అయితే చివర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. దీనికి తోడు స్టార్ బౌలర్ లసిత్ మలింగ ఆఖరి ఓవర్లో చేసిన మ్యాజిక్తో చెన్నై విజయానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయి ఓడిపోవాల్సి వచ్చింది.దీంతో ముంబై ఇండియన్స్ నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ను చేజెక్కించుకుంది. తాజాగా అప్పటి ఫైనల్లో ఓడిపోయిన చెన్నై జట్టులో సభ్యుడిగా ఉన్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మరోసారి ఆ మ్యాచ్ను గుర్తుచేసుకున్నాడు. అనిస్ సాజన్ నిర్వహించిన ఇన్స్టా లైవ్ చాట్లో పాల్గొన్న తాహిర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'ఆ ఫైనల్ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగుతో ఓడిపోవడం నా గుండెను బద్దలయ్యేలా చేసింది. ఎందుకంటే లీగ్లో మేము అప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుచుకుంటే వచ్చాం. అందులో పెద్ద టీమ్స్ కూడా ఉన్నాయి... వాటిని కూడా రెండేసి సార్లు ఓడించాం. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు జట్టుతో జర్నీ చేసిన నేను ఫైనల్లో కేవలం ఒక్కపరుగుతో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయా. మాకు టైటిల్ దూరం కావడానికి ఒక్క పరుగే తేడా.. కానీ ఆ ఒక్క పరుగే మమ్మల్ని టైటిల్కు దూరం చేసింది. మేం కష్టపడ్డాం.. గెలుపుకోసం ప్రయత్నించాం.అయినా గెలుపోటములు అనేది మన చేతిలో ఉండవు.(తండ్రైన హార్దిక్ పాండ్యా..) నిజానికి ఆ మ్యాచ్ ఈజీగా గెలవాల్సింది..వాట్సన్ మంచి ఆరంభాన్నిచ్చాడు. శార్థుల్ ఠాకూర్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ లసిత్ మలింగ రూపంలో దురదృష్టం మమల్ని వెంటాడింది. మలింగ ఆరోజు ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒత్తిడిని తట్టుకొని మరీ బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగుతో ముంబైకి టైటిల్ కట్టబెట్టాడు. నిజంగా ప్రపంచంలో మలింగ అత్యుత్తమ బౌలర్ అనడంలో సందేహం లేదు. కానీ ఏం చేస్తాం.. మాది కాని రోజు ఇలాగే ఉంటుంది అని ఆ క్షణంలో నాకు అనిపించింది' అంటూ పేర్కొన్నాడు.కాగా కరోనాతో వాయిదా పడిన ఐపీఎల్ 13 వ సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 మొదలుకానుంది. 51 రోజులు పాటు జగరునున్న ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 8న జరగనుంది. -
యూటర్న్ క్రికెటర్లు..
2019లో పలువురు క్రికెటర్లు తమ నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డారు. తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదనే భావించి కొందరు ముందస్తు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే, మరికొంతమంది ఆవేశంతో క్రికెట్కు వీడ్కోలు చెప్పి ఆపై యూటర్న్ తీసుకున్నారు. ఇలా క్రికెట్లో కొనసాగాలా.. వద్దా అనే డైలామాలో ఉన్న విదేశీ క్రికెటర్లలో వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవోలతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్లు ఉండగా, భారత్ నుంచి అంబటి రాయుడు ఉన్నాడు. ఇక అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఎంఎస్ ధోని, కోహ్లిలు కూడా ఈ ఏడాది హాట్ టాపిక్గా నిలిచారు. క్రిస్ గేల్ వన్డే వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతానంటూ ఆ మెగా టోర్నీ ఆరంభానికి ముందే వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ ప్రకటించాడు.దాంతో అంతా గేల్ రిటైర్మెంట్ ఉంటుందనే అనుకున్నారు. కానీ మనోడు ఝలక్ ఇచ్చాడు. తాను అంతర్జాతీయ క్రికెట్కు విశ్రాంతి ప్రకటించడం లేదంటూ మరొకసారి వెల్లడించాడు. అదే సమయంలో తాను టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. భారత్తో సిరీస్ తర్వాత తన రిటైర్మెంట్పై నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నాడు. అటు తర్వాత మళ్లీ మరొకసారి మాట్లాడాడు. తనకు మరిన్ని సిరీస్లు ఆడితే ఫిట్నెస్పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వీడ్కోలు నిర్ణయాన్ని ఆలోచిస్తానన్నాడు. డ్వేన్ బ్రేవో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఏడాదికి పైగా దాటిన తర్వాత వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో యూటర్న్ తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ప్రత్యేకంగా టీ20 సెలక్షన్స్కు తాను కూడా అందుబాటులో ఉంటానంటూ వెల్లడించాడు. గతంలో తమ బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేని కారణంగానే తాను అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ఇప్పుడు పాలన మారడంతో మనసు మార్చుఉన్నానని అన్నాడు. విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేస్తూ వచ్చిన బ్రేవో తన రిటైర్మెంట్ను 2018 అక్టోబర్లో ప్రకటించాడు. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో భాగంగా విండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బ్రేవోను చేర్చారు. కాకపోతే బ్రేవోకు ఆడే అవకాశం రాలేదు. 2012, 2016ల్లో విండీస్ గెలిచిన టీ20 వరల్డ్కప్లో బ్రేవో సభ్యుడు. 2016 సెప్టెంబర్లో విండీస్ జెర్సీలో బ్రేవో చివరిసారి కనిపించాడు. ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ! గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం అయ్యాయి. వన్డే వరల్డ్కప్లో తాను ఆడతానని సఫారీ క్రికెట్ బోర్డుకు విన్నవించినా చివరి నిమిషంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఏబీ రీఎంట్రీపై ఏమీ చేయలేకపోయాడు. కాగా, ప్రస్తుతం ఏబీ రీ ఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం చేశారు. దక్షిణాఫ్రికా క్రికెట్ సంధి దశలో ఉన్న కారణంగా ఏబీ డివిలియర్స్ను తిరిగి జట్టులోకి తేవాలనే యత్నంలో ఉన్నారు డుప్లెసిస్తో పాటు ఆ జట్టు కొత్త కోచ్ మార్క్ బౌచర్లు. దాంతో డివిలియర్స్ రీఎంట్రీ షురూ అయ్యేలా కనబడుతోంది. తనకు ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఉందని ఏబీ మాటను దృష్టిలో పెట్టుకుని అతని కోసం ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఏబీ తన అంతర్జాతీయ పునరాగమనంపై నిర్ణయాన్ని వెల్లడించవచ్చు. అంబటి రాయుడు పునరాగమనం.. వన్డే వరల్డ్కప్కు తనను స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేసినా పిలుపు రాలేదనే కోపంతో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్ అంబటి రాయుడు. విజయ్ శంకర్ను నాలుగో స్థానానికి తీసుకున్నారు. దాంతో సహజంగానే అసంతృప్తి చెందిన రాయుడు ‘ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే 3డి అద్దాలు కొన్నాను’ అంటూ ట్వీట్ చేయడం వివాదం రేపింది. మున్ముందూ తనను ఎంపిక చేయకపోవచ్చని భావించిన రాయుడు మొత్తానికే గుడ్బై చెప్పేశాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. మళ్లీ అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టు కెప్టెన్గా కూడా రాయుడు ఎంపికయ్యాడు. కాగా, కొన్ని దేశవాళీ మ్యాచ్ల తర్వాత హెచ్సీఏలో రాజ్యమేలుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను హైదరాబాద్ జట్టు నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో రాయుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఫీల్డ్ అంపైర్తో ధోని వాగ్వాదం ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యవహరించిన తీరు అప్పట్లో దుమారం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా..డగౌట్ నుంచి మైదానంలోకి వచ్చి అంపైర్తో వాగ్వాదానికి దిగడం ధోని సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో వేలెత్తి చూపే తొలి సంఘటనగా మిగిలింది. అంపైర్ ముందుగా నోబాల్ ఇచ్చి ఆ తర్వాత కాదనడం ధోనికి కోపం తెప్పించింది. అది నోబా.. కాదా అనే విషయంలో స్పష్టత లేదు. చివరికి అంపైర్లు దాన్ని నోబ్ కాదని తేల్చారు. ఆ క్రమంలోనే స్టేడియంలోకి వెళ్లిన ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఫలితంగా నిబంధనలను అతిక్రమించిన ధోనిపై మ్యాచ్ రుసుములో 50 శాతం జరిమానాగా విధించారు. వరల్డ్కప్లో కోహ్లి రెండుసార్లు ఆగ్రహం ఈ ఏడాది వన్డే వరల్డ్కప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్ను టీమిండియా చెమటోడ్చి గెలిచింది. పసికూనలనుకున్న అఫ్గానిస్తాన్ క్రికెటర్లు .. కట్టుదిట్టంగా ఆడి కోహ్లి సేనకు చుక్కలు చూపించారు. చివరికి బౌలర్ల సత్తాతో ఆపసోపాలు పడి భారతజట్టు గెలిచినా.. ప్రశంసలు మాత్రం అఫ్గాన్కే దక్కాయి. అయితే ఆ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అంపైర్లతో కెప్టెన్ కోహ్లి వాగ్వాదానికి దిగాడు. షమీ బౌలింగ్లో హజ్రతుల్లాహ్ జజాయి ప్యాడ్ను తాకుతూ బాల్ వెళ్లింది. ఎల్బీడబ్ల్యూ కోసం కోహ్లి సేన అప్పీల్ చేసింది. అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో షమీ, ధోనిలతో మాట్లాడిన కోహ్లి.. డీఆర్ఎస్ కోరుతూ.. అంపైర్ల దగ్గరకు వెళ్లాడు. వాళ్లతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. అటు తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సైతం కోహ్లి.. ఫీల్డ్ అంపైర్లతో వాదానికి దిగాడు. ఒక ఎల్బీ విషయంలో థర్డ్ అంపైర్ బాల్ ట్రాకర్ను వినియోగించకపోవడాన్ని కోహ్లి ప్రశ్నించాడు. థర్డ్ అంపైర్ అలా ఎందుకు చేశాడంటూ ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదం చేశాడు. విండీస్తో తొలి వన్డేలో సైతం కోహ్లినే.. రవీంద్ర జడేజా రనౌట్ వివాదం కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. జడేజా పరుగు తీసే క్రమంలో రోస్టన్ ఛేజ్ నాన్ స్టైకింగ్ ఎండ్లో వికెట్లను డైరక్ట్ త్రో గిరటేశాడు. అయితే దానిపై అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఆ సమయంలో జడేజా క్రీజ్లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్ అంపైర్ షాన్ జార్జ్ అది నాటౌట్గా ప్రకటించాడు. అయితే అది ఔట్గా రిప్లేలో తేలడంతో పొలార్డ్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. దాంతో చేసేది లేక థర్డ్ అంపైర్ను ఆశ్రయించాడు ఫీల్డ్ అంపైర్. దాంతో థర్డ్ అంపైర్ పలు కోణాల్లో చెక్ చేసి అది ఔట్గా నిర్దారించడంతో జడేజా పెవిలియన్ చేరాడు. ఇలా చేయడంపై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ డగౌట్లోకి వచ్చేసి బౌండరీ లైన్ వద్ద మ్యాచ్ అధికారితో వాదనకు దిగాడు. ఒకసారి నాటౌట్గా ఫీల్డ్ అంపైర్ ప్రకటించిన తర్వాత మళ్లీ థర్డ్ అంపైర్కు ఎలా రిఫర్ చేస్తారంటూ కోహ్లి వాదించాడు. -
విరాట్ కోహ్లి మోత.. రోహిత్ ఊచకోత
ఈ ఏడాది టెస్టు ఫార్మాట్లో ఓపెనర్ పాత్రలో అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో ఓపెనర్గా దిగిన వరుస రెండు ఇన్నింగ్స్లో సెంచరీల మోత మోగించి ఓపెనర్గా అరంగేట్రం టెస్టులోనే వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్లో ఓపెనర్గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా లిఖించాడు.దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్(16) ఇక భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2010-11 సీజన్లో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో హర్భజన్ సింగ్ 14 సిక్సర్లు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించి ఆ ఫీట్ నమోదు చేసిన ఐదో భారత ఓపెనర్గా అరుదైన ఘనతకు నమోదు చేశాడు. విండీస్తో రెండో వన్డేలో శతకం సాధించడం ద్వారా రోహిత్ శర్మ ఒక రికార్డును నమోదు చేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్మన్గా రోహిత్ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 22 ఏళ్లుగా శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య (1997లో 2387 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ విండీస్పై మూడో మ్యాచ్లో అధిగమించాడు. ఓవరాల్గా ఈ ఏడాది రోహిత్ మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 2442 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఈ ఏడాది 28 వన్డేలు ఆడి 1490 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్ అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన రికార్డును రోహిత్ తిరగరాశాడు. 2018లో అంతర్జాతీయంగా 74 సిక్సర్లు సాధించిన రోహిత్.. ఈ ఏడాది 78 సిక్సర్లు కొట్టాడు. ఆసీస్ రికార్డు బ్రేక్.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా కొత్త రికార్డును లిఖించింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. స్వదేశీ వరుస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. సఫారీలతో టెస్టు సిరీస్ను సాధించిన తర్వాత భారత్కు ఇది వరుసగా 11వ స్వదేశీ టెస్టు సిరీస్ విజయం. ఈ క్రమంలోనే ఆసీస్ రికార్డును టీమిండియా బద్ధలు కొట్టింది. 1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆసీస్ తమ దేశంలో సాధించిన వరుస టెస్టు సిరీస్ విజయాలు సంఖ్య 10. ఆపై 2004-09 సీజన్ మధ్యలో ఆసీస్ మరోసారి 10 వరుస స్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే ఆసీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా తాజాగా బ్రేక్ చేసింది. 2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 స్వదేశీ టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఫలితంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కాగా బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను కూడా క్లీన్స్వీప్ చేయడం ద్వారా భారత్ వరుసగా 12వ స్వదేశీ టెస్టు సిరీస్ విజయాన్ని సాధించిందింది. కోహ్లినే టాప్ ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి 928 రేటింగ్ పాయింట్లతో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉండగా, 895 పాయింట్లతో వన్డేల్లో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి 2455 పరుగులు చేసి టాప్లో నిలిచాడు. ఫలితంగా వరుసగా నాల్గో ఏడాదిని కూడా టాప్లోనే ముగించాడు కోహ్లి. ఈ ఏడాది కోహ్లి సాధించిన సెంచరీలు ఏడు కాగా, అత్యధిక స్కోరు 254 నాటౌట్. ఇక భారత్లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులోనే శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి (57 సార్లు) ప్రస్తుతం జాక్వస్ కలిస్తో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సచిన్ (76 సార్లు), జయసూర్య (58 సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మయాంక్ డబుల్ మోత.. టెస్టు ఫార్మాట్లోకి అడుగుపెట్టిన ఏడాది వ్యవధిలోనే టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లపై డబుల్ సెంచరీలు సాధించి ఓపెనర్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంకను సాధించాడు. ఇటీవల విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో మయాంక్ 11వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా మయాంక్ నిలవడమే కాకుండా, బంగ్లాదేశ్తో టెస్టులో 243 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోరు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్.. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ద్విశతకం సాధించాడు. బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో ఓవరాల్గా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ద్విశతకం చేశాడు. ఇది మయాంక్ దూకుడుకు నిదర్శనం. కుల్దీప్ డబుల్ హ్యాట్రిక్.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వెస్టిండీస్తో రెండో వన్డేలో హ్యాట్రిక్ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్గా నయా రికార్డును లిఖించాడు. 2017లో కోల్కతాలో ఆసీస్తో జరిగిన వన్డేలో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించగా, మరొకసారి హ్యాట్రిక్ను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన వారిలో చేతన్ శర్మ(1987లో న్యూజిలాండ్పై), కపిల్ దేవ్(1991లో శ్రీలంకపై), మహ్మద్ షమీ(2019లో అఫ్గానిస్తాన్పై)లు ఉన్నారు. వీరంతా ఒకేసారి హ్యాట్రిక్లు సాధిస్తే, కుల్దీప్ యాదవ్ మాత్రం రెండుసార్లు హ్యాట్రిక్లు సాధించడం విశేషం. ఇలా ఒకటికంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్లు సాధించిన వారిలో మలింగా(3సార్లు) తొలి స్థానంలో ఉండగా, రెండు సందర్భాల్లో హ్యాట్రిక్లు సాధించిన వారిలో వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, చమిందా వాస్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో భరోసా దొరికిందా? చాలాకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానం కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. అయితే దీనికి శ్రేయస్ అయ్యర్ ద్వారా సమాధానం దొరికినట్టే కనబడుతోంది. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత చాలాకాలం స్థానం కోల్పోయాడు. ఆడపా దడపా అవకాశాలు తప్పితే టీమిండియా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోవడంలో విఫలం అయ్యాడు. కాగా, ఈ ఏడాది మాత్రం శ్రేయస్ అయ్యర్ నాల్గో స్థానంలో సరిపోతాననే సంకేతాలు ఇస్తున్నాడు. వెస్టిండీస్తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో అయ్యర్ నాల్గో స్థానంలో బ్యాటింగ్కు దిగి హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే అవసరమైన సందర్భాల్లో భారీ హిట్టింగ్కు దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు అయ్యర్. , -
టీమిండియా @ 360
ఈ ఏడాది టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. ప్రధానంగా టెస్టుల్లో సత్తాను చాటుతూ దూసుకుపోయింది. ఐసీసీ టెస్టు చాంపియన్లో భాగంగా ఈ ఏడాది(2019) పలు సిరీస్లను ఆడిన టీమిండియా ఒక్క సిరీస్ను కూడా కోల్పోలేదు. అసలు ఏ ఒక్క మ్యాచ్లోనూ ఓటమి చవిచూడలేదు. టెస్టు చాంపియన్ కోసం ద్వైపాక్షిక సిరీస్లు ఖరారైన తర్వాత ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. అక్కడ కరీబియన్లను క్లీన్స్వీప్ చేసింది. తొలుతు రెండు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్..ఆపై వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. అదే ఊపును రెండు టెస్టుల సిరీస్లో కూడా కొనసాగించింది. ఫలితంగా ఆ రెండు టెస్టుల్లో విజయం సాధించి 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్లో ఇది భారత్కు తొలి అడుగు. అటు తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్లో సఫారీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వని టీమిండియా..హ్యాట్రిక్ విజయాలతో దుమ్ములేపింది. తొలి టెస్టును 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగులతో విజయం సాధించగా, మూడో టెస్టును ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇది మూడు టెస్టుల సిరీస్ కాబట్టి మ్యాచ్కు 40 పాయింట్లు చొప్పున భారత్ మరో 120 పాయింట్లను సాధించింది. అటు తర్వాత నవంబర్లో బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో భాగంగా మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1 గెలవగా, రెండు టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులను కూడా భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. ఇండోర్లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలవగా, కోల్కతాలో జరిగిన డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది రెండు టెస్టులో సిరీస్ కాబట్టి మ్యాచ్కు 60 పాయింట్ల చొప్పున 120 పాయింట్లను దక్కించుకుంది. దాంతో ఓవరాల్గా 360 పాయింట్లతో టీమిండియా టాప్లో కొనసాగుతోంది. టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలోనూ ప్రథమ స్థానంలో ఉండటం మన పటిష్టమైన బలగానికి అద్దం పడుతోంది. ఐసీసీ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్థానంలో ఆసీస్ ఉంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 216 పాయింట్లతో ఉంది. ఇప్పటివరకూ ఆసీస్ 8 మ్యాచ్లు ఆడి ఐదు గెలుపొందగా, రెండింట ఓటమి పాలైంది. ఒకటి డ్రాగా ముగిసింది.ఆసీస్ తర్వాత స్థానంలో శ్రీలంక 80 పాయింట్లతో ఉంది. 60 పాయింట్లతో కివీస్ నాల్గో స్థానంలోనూ, 56 పాయింట్లతో ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉన్నాయి. టెస్టు చరిత్రలో తొలిసారి.. వరుసగా నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాల్ని సాధించడం ద్వారా టీమిండియా నయా రికార్డును నెలకొల్పింది. టెస్టు చరిత్రలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్లో సాధించడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టులను కూడా ఇన్నింగ్స్ తేడాతోనే భారత్ గెలుచుకుంది. ఫలితంగా వరుసగా నాలుగు మ్యాచ్లను ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. అదే సమయంలో ఆ ఘనత సాధించిన కెప్టెన్గా కూడా విరాట్ కోహ్లి రికార్డు నమోదు చేశాడు. -
వన్ అండ్ ఓన్లీ రో‘హిట్’
రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప స్కోరును నమోదు చేసి ఒక్క పరుగుతో చాంపియన్గా నిలిచిన రోహిత్ సేన.. 2019 ఐపీఎల్లో కూడా మళ్లీ అదే అద్భుతాన్ని చేసి చూపించింది. బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై... చెత్త ఫీల్డింగ్, క్యాచ్లు, రనౌట్లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది. ఐపీఎల్ ఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్గా నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. హైదరాబాద్లో జరిగిన టైటిల్ ఫైట్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (41 నాటౌట్; 25 బంతుల్లో), డీకాక్(29; 17 బంతుల్లో)లు రాణించారు. ఆపై చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 148 పరుగులు చేసే ఓటమి పాలైంది. వాట్సన్(80; 59 బంతుల్లో) బ్యాట్ ఝుళిపించినా చెన్నైను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ధోని రనౌటే మలుపు.. ఫామ్లో ఉన్న కెప్టెన్ ధోని కీలక సమయంలో రనౌట్ కావడం చెన్నై శిబిరాన్ని ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. హార్దిక్ బౌలింగ్లో వాట్సన్ ఫైన్లెగ్ వైపు ఆడగా సింగిల్ వచ్చింది. బంతిని ఆపి మలింగ విసిరిన త్రో నాన్ స్ట్రయికింగ్ ఎండ్కు దూరంగా వెళుతుండటంతో ధోని రెండో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లపైకి కొట్టాడు. బంతి స్టంప్స్కు తగిలే సమయంలో బ్యాట్ క్రీజ్ గీతపైనే ఉంది. నిజానికి ధోని తనే ఔట్గా భావించి ముందే నడవటం మొదలు పెట్టినా ఫీల్డ్ అంపైర్లు అతడిని ఆపారు. సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసిన అనంతరం చివరకు అంపైర్ నైజేల్ లాంజ్ ధోనిని ఔట్గా ప్రకటించాడు. ఈ వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. చివరి 5 ఓవర్లలో... ధోని వికెట్ పడ్డాక వాట్సన్తో పాటు పెద్దగా ఫామ్లో లేని బ్రేవో క్రీజ్లో ఉన్నాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి చెన్నైకి కష్టంగానే కనిపిస్తోంది. అయితే 16వ ఓవర్లో మళ్లీ ఆట మారిపోయింది. మలింగ వేసిన ఈ ఓవర్లో బ్రేవో సిక్స్ బాదగా, వాట్సన్ 3 ఫోర్లు కొట్టాడు. దాంతో 20 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు అద్భుత బౌలింగ్తో ప్రశంసలు అందుకున్న రాహుల్ చహర్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్ను వదిలేసి ప్రత్యర్థికి మరో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 6, 6 బాది వాట్సన్ చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ చెన్నై వైపు తిరిగింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్ కింగ్స్ మొహం చాటేసింది. వన్ అండ్ ఓన్లీ రో‘హిట్’.. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ విజయాల్లో పాలుపంచుకున్న ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ.. 2013, 2015, 2017, 2019లలో ముంబై జట్టుకు సారథ్యం వహించాడు. కాగా, 2009లో చాంపియన్ అయిన డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. దాంతో ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఏకైక క్రికెటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇక ముంబై నెగ్గిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్లోనూ ఆ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం ఇక్కడ విశేషం. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం ఇక్కడ మరో విశేషం. ఈ సీజన్లో డేవిడ్ వార్నర్(692 పరుగులు-సన్రైజర్స్ హైదరాబాద్) ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. అత్యధిక వికెట్లు సాధించే బౌలర్కు ఇచ్చే పర్పుల్ క్యాప్ అవార్డు ఇమ్రాన్ తాహీర్(26 వికెట్లు-సీఎస్కే) దక్కించుకున్నాడు. పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు కీరోన్ పొలార్డ్కు దక్కింది. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును శుబ్మన్ గిల్ (కోల్కతా నైట్రైడర్స్) అందుకోగా, ఫెయిర్ ప్లే అవార్డును సన్రైజర్స్ హైదరాబాద్ ఎగరేసుకుపోయింది. -
అశ్విన్ ఫ్రాంచైజీ మారింది..
న్యూఢిల్లీ: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాబోయే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నాడు. అతడిని 2018 సీజన్లో రూ.7.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ సారథ్య బాధ్యతలూ అప్పజెప్పింది. రెండు సీజన్లలో అశ్విన్ జట్టు 12 మ్యాచ్ల్లో గెలిచి, 16 మ్యాచ్ల్లో ఓడింది. ఓ దశలో మెరుగైన ఆటతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచినా తర్వాత వెనుకబడింది. ఇప్పుడు ఢిల్లీ నగదు ఒప్పందంపైనే అతడిని తీసుకోనుందని సమాచారం. ‘అశ్విన్ ఫ్రాంచైజీ మార్పు అంశంపై బీసీసీఐ నుంచి త్వరలో ప్రకటన రానుంది. జట్టులోకి యువ స్పిన్నర్ను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న పంజాబ్ అశ్విన్ను వదులుకునేందుకు సిద్ధపడింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అశ్విన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రయత్నించినా అది ముందుకు కదల్లేదని సమాచారం. -
అశ్విన్కు ఉద్వాసన తప్పదా?
న్యూఢిల్లీ: ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో టాప్ స్పిన్నర్గా వెలుగొందిన రవి చంద్రన్ అశ్విన్ పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్కే పరిమితం అయిపోయిన అశ్విన్.. అక్కడ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోవడంలో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్ వంటి యువ స్పిన్నర్లు భారత జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోవడంతో అశ్విన్కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇదిలా ఉంచితే, రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అశ్విన్ను కింగ్స్ పంజాబ్ జట్టు కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పించాలని చూస్తోంది. గత రెండు సీజన్లలో కింగ్స్ పంజాబ్ కెప్టెన్గా ఉన్న అశ్విన్.. పూర్తిగా విఫలం కావడం అందుకు కారణంగా కనిపిస్తోంది. జట్టును ముందుండి నడిపించడంలో వైఫల్యం చెందడంతో పాటు స్పిన్నర్గా కూడా పెద్దగా రాణించలేదు. దాంతో అశ్విన్కు గుడ్ బై చెప్పాలనే యోచనలో కింగ్స్ పంజాబ్ యాజమాన్యం ఉంది. అదే సమయంలో ఆటగాడిగా కూడా అశ్విన్ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ వారాంతంలో సమావేశమైన కింగ్స్ పంజాబ్ మేనేజ్మెంట్ అధికారులు అశ్విన్ కెప్టెన్సీపై సుదీర్ఘంగా చర్చించారట. ఆటగాడిగా కూడా రిలీజ్ చేయాలని కొందరు పెద్దలు సూచించడంతో అశ్విన్కు ఉద్వాసన తప్పకపోవచ్చు. 2018 ఐపీఎల్ సీజన్లో భాగంగా అశ్విన్ను రూ.7 కోట్లకు పైగా వెచ్చించి కింగ్స్ పంజాబ్ తీసుకుంది. అయితే కింగ్స్ మేనేజ్మెంట్ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. కింగ్స్ పంజాబ్ తరఫున 28 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 25 వికెట్లే తీశాడు. ఓవరాల్గా 139 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ ఖాతాలో 125 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే కింగ్స్ పంజాబ్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను నియమిస్తారనే వాదన ఉంది. వచ్చే సీజన్లో పంజాబ్ జట్టుకు రాహుల్కు సారథ్య పగ్గాలు అప్పచెప్పాలని చూస్తున్నారు. ఇటీవల కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్ పదవికి మైక్ హెసన్ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో కోచ్ అన్వేషణలో పడ్డారు. ఆ క్రమంలోనే సమావేశం జరగ్గా, కెప్టెన్సీ మార్పుపై కూడా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ అశ్విన్ను కింగ్స్ పంజాబ్ వదులుకుంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునే అవకాశం ఉందని మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది. అశ్విన్ కోసం ఢిల్లీతో పాటు రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీ పడే అవకాశం ఉన్నట్లు అందులో పేర్కొంది. -
కింగ్స్ పంజాబ్కు హెస్సన్ గుడ్ బై
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్లో కింగ్స్ పంజాబ్కు కోచ్గా వ్యవహరించిన మైక్ హెస్సన్ ఆ పదవికి గుడ్ బై చెప్పేశాడు. ఏడాదిలోపే తన కోచ్ పదవి నుంచి హెస్సెన్ తప్పుకున్నాడు. గతేడాది అక్టోబర్లో కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్గా నియమించబడ్డ హెస్సన్ పది నెలలు పాటు మాత్రమే కింగ్స్ పంబాబ్ ఫ్రాంచైజీ కలిసి ఉన్నాడు. తాను కింగ్స్ పంజాబ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్న హెస్సన్ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘ కింగ్స్ పంజాబ్తో కలిసి పని చేసినంత కాలం చాలా ఎంజాయ్ చేశాను. గత సీజన్లో నాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినందుకు కింగ్స్ పంజాబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ ఏడాది కింగ్స్ పంజాబ్ నిరూత్సాహ పరచడం నిరాశకు గురి చేసింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. మీరు సక్సెస్ అయ్యే సమయం ఎంతో దూరం లేదు’ అని హెస్సెన్ పేర్కొన్నాడు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి మైక్ హెస్సెన్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. టామ్ మూడీ, గ్యారీ కిరెస్టన్లతో పాటు హెస్సెన్కు రేసులో ఉన్నాడు. అయితే పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవి నుంచి మికీ ఆర్థర్ను తప్పించడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. దాంతో పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవికి సైతం హెస్సన్ దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ టీమిండియా ప్రధాన కోచ్ పదవి రాకపోయినా, పాకిస్తాన్ క్రికెట్ కోచ్గానైనా ఎంపిక అవుతాననే నమ్మకంలో హెస్సెన్ ఉన్నాడు. ఆ క్రమంలోనే ముందుగా కింగ్స్ పంజాబ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
అంతా ఐపీఎలే చేసింది : డూప్లెసిస్
లండన్ : ప్రపంచకప్ ముందు జరిగిన ఐపీఎలే తమ కొంపముంచిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ కొంతమంది ఆటగాళ్లను ఈ క్యాష్ రిచ్ లీగ్కు అనుమతించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. తీవ్ర పని భారంతో తమ ఆటగాళ్లు ఈ మెగాటోర్నీలో రాణించలేకపోయారని తెలిపాడు. ముఖ్యంగా కగిసో రబడ వైఫల్యం తమ జట్టు విజయాలపై ప్రభావం చూపిందన్నాడు. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో సఫారి జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ప్రస్థానం లీగ్ దశలోనే ముగిసింది. ఇప్పటి వరకు ఒకటే విజయంతో సరిపెట్టుకున్న సఫారీ ఐదు మ్యాచ్ల్లో ఓడింది. దీంతో సెమీస్ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయింది. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తమ పరాజయంపై డూప్లెసిస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. లీగ్ దశలోనే వెనుదిరగడం చాలా ఇబ్బందికరంగా ఉందన్నాడు. ‘మా ఓటమిపై సరైన సమాధానం చెప్పలేకపోతున్నాను. మేం అసలు ఐపీఎల్ ఆడకుండా ఉండాల్సింది. కనీసం రబడనైనా అడ్డుకోవాల్సింది. అతను ఐపీఎల్ ఆడకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కేవలం ఐపీఎల్ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందనుకోవడం లేదు. కానీ కొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి తాజాగా బరిలోకి దిగేవారు. విశ్రాంతి లేకుండా ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. ఇతర పేసర్లు గాయాలు కూడా రబడపై ప్రభావం చూపాయి. అతనొక్కడే భారాన్ని మోసాడు. ఇది అతని బౌలింగ్పై ప్రభావం చూపింది. టోర్నీ ఆరంభంలో రాణించకుంటే.. మనపై మనకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. రబడ విషయంలో కూడా అదే జరిగింది. అతను ఎదో ఒకటి చేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఏం జరగలేదు. ఎదో చేయాలనే తపన రబడ వేసే ప్రతి బంతిలోను, చివరకు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా కనిపించింది’ అని డూప్లెసిస్ చెప్పుకొచ్చాడు. 6 మ్యాచ్ల్లో రబడ 50.83 సగటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తీవ్ర వర్క్లోడ్తో అతను రాణించలేకపోయాడు. ఇది దక్షిణాఫ్రికా గెలుపుపై ప్రభావం చూపింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 12 మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి కోలుకున్న ఆ జట్టు స్టార్పేసర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్లో ఆడటంతో మళ్లీ గాయపడ్డాడు. ఇది కూడా దక్షిణాఫ్రికాపై తీవ్ర ప్రభావం చూపింది. చదవండి : పాకిస్తాన్ గెలిచింది... -
హతవిధీ... సఫారీ ఆశలు ఆవిరి!
సౌతాంప్టన్: ఈ ప్రపంచకప్లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. దక్షిణాఫ్రికాను నిండా ముంచేసింది. ఇంకా విజయాల బోణీ కొట్టని సఫారీ జట్టుకు ఇది కీలకమైన పోరు. కానీ ఈ మ్యాచ్ రద్దవడంతో డు ప్లెసిస్ సేన సెమీస్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. మొత్తానికి దక్షిణాఫ్రికాను ఈ మెగా ఈవెంట్లో ప్రత్యర్థులే కాదు వర్షం కూడా దెబ్బకొట్టింది. వానతో ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ ఎంతోసేపు సాగలేదు. వర్షంతో ఆట నిలిచే సమయానికి దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన వెస్టిండీస్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. డికాక్ (17 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి సఫారీ ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆమ్లా (6) విఫలమయ్యాడు. కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో గేల్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన మార్క్రమ్ (5)ను కూడా కాట్రెలే ఔట్ చేశాడు. కెప్టెన్ డుప్లెసిస్ (0 నాటౌట్) క్రీజులోకి వచ్చిన కాసేపటికే వర్షం కూడా వచ్చింది. మైదానాన్ని ముంచెత్తింది. దీంతో ఆటకు చాలా సేపు అంతరాయం ఏర్పడింది. చివరకు పిచ్, ఔట్ఫీల్డ్ మ్యాచ్ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు పాల్ విల్సన్, రొడ్ టక్కర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు ఒక్కో పాయింట్తో సరిపెట్టుకున్నాయి. చిత్రంగా మూడు మ్యాచ్లాడినా పాయింట్లు గెలవలేకపోయిన దక్షిణాఫ్రికా ఖాతాలో ఎట్టకేలకు రద్దయిన మ్యాచ్తో ఓ పాయింట్ చేరింది. ప్రపంచకప్లో నేడు శ్రీలంక vs బంగ్లాదేశ్ మధ్యాహ్నం గం.3 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
గతేడాదే ఫిక్స్ అయ్యా.. ఇదే చివరిదని: యువీ
ముంబై : ఇంగ్లండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన క్షణాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. టీమిండియా రెండో సారి ప్రపంచకప్ గెలవడంలో అతడు పడిన శ్రమ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. కేన్సర్ మహమ్మారిని జయించి తిరిగి కొత్త క్రీడా జీవితం ప్రారంభించాలనుకున్న అతడికి ఏదీ కలసిరాలేదు. దీంతో కొంతకాలం నిరీక్షించాడు.. అలసిపోయాడు.. అవమానపడ్డాడు. చివరికి తనకు ప్రాణమైన క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. నా కల ఘనంగా నెరవేరింది.. ‘క్రికెట్ కోసం తన రక్తం, స్వేదం ధారపోశాను. క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం. జీవితంలో ఏ విధంగా పోరాడాలో క్రికెటే నేర్పింది. జీవితంలో నేను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. క్రికెట్ ఆడటం.. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం నేర్పింది. 18 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాను, 40 టెస్టులు, 304 వన్డేలు ఆడాను. ప్రపంచకప్ గెలవడం నా కల, అది ఘనంగా నెరవేరింది. కాస్త అసంతృప్తిగానే.. నా కెరీర్ను ఎలా ముగించాలనే కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. ఈ ఏడాది ఐపీఎల్లో ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉంటే నాకు ఇంకాస్త సంతృప్తిగా ఉండేది. ఆ సంతృప్తితో క్రికెట్కు వీడ్కోలు చెప్పేవాడిని. అయితే జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదా. 2019 ఐపీఎలే నాకు చివరిది అని గతేడాదే నిర్ణయించుకున్నా. ఇకపై ఐపీఎల్కు నేను అందుబాటులో ఉండను. బీసీసీఐ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నా. (చదవండి: క్రికెట్కు గుడ్బై చెప్పిన యువరాజ్ సింగ్) బీసీసీఐ అనుమతిస్తే.. బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తే విదేశాల్లో టీ20 లీగుల్లో ఆడేందుకు ఎదురు చూస్తున్నా. ఈ వయసులో ఎంజాయ్ చేస్తూ ఆడే టోర్నీల్లో అయితేనే ఆడగలను అనిపిస్తుంది. అంతర్జాతీయ కెరీర్ గురించి ఆలోచించుకుంటూ ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడటం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. అందుకే బీసీసీఐ అనుమతితో విదేశాల్లో టీ20 లీగ్లు ఆడాలని ఉంది’ అంటూ యువీ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. యువీకి కలిసిరాని ఐపీఎల్ ఐపీఎల్తో అనామక క్రికెటర్లు రాత్రికిరాత్రే స్టార్లు అయినవారు ఉన్నారు. కానీ ఐపీఎల్ ప్రారంభానికే ముందే టీ20ల్లో టీమిండియా స్టార్ అయిన యువీ ఈ రిచ్లీగ్ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 132 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండ్ స్టైలీష్ బ్యాట్స్మన్ 2,750 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఈ టోర్నీలో నిలకడలేమితో అనేక జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పుణె వారియర్స్కు సారథిగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లలో ఆటగాడిగా ఆడాడు. 2015 ఐపీఎల్ సీజన్లో దిల్లీ జట్టు యువరాజ్ను రికార్డు స్థాయిలో రూ. 16కోట్లకు సొంతం చేసుకోగా పూర్ ఫామ్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు ముంబయి ఇండియన్స్ యువీని కేవలం రూ. కోటి ప్రారంభ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడి 98 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధశతకం ఉంది. చదవండి: క్రికెట్ ఎంత ఇష్టమో.. అంత అయిష్టం యువీ హార్ట్ టచింగ్ వీడియో.. వైరల్ -
ఐపీఎల్ అతడి కొంపముంచింది: డుప్లెసిస్
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టుకు ఏది కలసిరావడంలేదు. ఆతిథ్య ఇంగ్లండ్, పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు పరాజయాలతోనే సతమతమవతున్న సఫారీ జట్టుకు ఆటగాళ్ల గాయాలు మరో తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఎన్గిడి గాయపడ్డాడు. దీంతో అతడికి పదిరోజుల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఇక ఆ జట్టు స్టార్ బౌలర్ డెల్ స్టెయిన్కు పాత గాయం తిరగబెట్టడంతో ఏకంగా టోర్నీకే దూరమయ్యాడు. దీంతో స్టెయిన్ ప్రపంచకప్కు దూరం కావడానికి ఐపీఎల్ కారణమంటూ సఫారీ జట్టు సారథి డుప్లెసిస్ నిందిస్తున్నాడు. ‘ఐపీఎల్లో స్టెయిన్ ఆడకుంటే ప్రస్తుతం ప్రపంచకప్లో అతడి సేవలను దక్షిణాఫ్రికా వినియోగించుకునేది. ఐపీఎల్కు ముందు అతడు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్లో ఆడాడు. రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత మళ్లీ గాయపడటంతో టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో ఆడకుండా విశ్రాంతి తీసుకోకపోవడమే స్టెయిన్ చేసిన పొరపాటు’అంటూ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున ప్రాతినిథ్యం వహించిన స్టెయిన్ కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. -
కాలేజీలో మొదలై ఆకాష్ అంబానీ పెళ్లి వరకు అతడే..
హిమాయత్నగర్: ఆ యువకుడు మైక్ పట్టుకుంటే స్టేడియంలోని క్రీడాభిమానుల్లో జోష్ పెరగాల్సిందే. వేడుకల్లో వేసే పంచ్లకు అతిథులు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. కాలేజీలో జరిగిన చిన్న ఈవెంట్తో మొదలైన ప్రయాణం ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లిలో యాంకరింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. కాలేజీ క్రికెట్ కామెంట్రీనుంచి మొదలైన జర్నీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున యాంకరింగ్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకునేంతగా ఎదిగాడు. అతడే ‘సన్నీ ఖండేల్వాల్’.. మన నగర యువకుడు. క్రికెటర్స్ బ్యాటింగ్, బౌలింగ్లో టెన్షన్గా ఉన్నప్పుడు వారికి నచ్చిన మ్యూజిక్ని ట్యూన్ చేస్తూ.. స్టెప్పులేస్తూ వారిని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ ‘ది ఫోర్త్ అంపైర్’గా గుర్తింపు పొందాడు మన సిటీ కుర్రాడు. నగరానికి చెందిన రమేష్ ఖండేల్వాల్, సీమ ఖండేల్వాల్ కుమారుడు సన్నీ ఖండేల్వాల్. అమీర్పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్లో అక్షరాభ్యాసం చేసిన ఇతడు.. సెయింట్ మేరీస్లో కాలేజీ విద్యను పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో నుంచే మంచి యాంకర్ అవ్వాలనే అభిలాష ఇతడిలో పెరిగింది. కాలేజీలో జరిగే చిన్నా, చితకా పార్టీలు, ఈవెంట్లకు సన్నీనే యాంకరింగ్ చేసేవాడు. కొడుకులోని తపనను చూసిన తండ్రి.. భవిష్యత్లో యాంకరింగ్కు మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇవ్వడంతో సన్నీ ఈవెంట్స్ కోర్సు కూడా చేశాడు. మిస్టర్ వలంటైన్ విన్నర్ ఏటా ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే ‘మిస్టర్ యూత్’ ప్రోగ్రాంకి కాలేజీ నుంచి సన్నీ పాల్గొన్నాడు. ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పోటీ పడగా ‘వీజే హంట్’ విభాగంలో, ‘స్టేజ్ అప్పీరెన్స్’లో సౌత్ ఇండియా–20గా నిలిచాడు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి ‘మిష్టర్ వలంటైన్’ టైటిల్ని సొంతం చేసుకున్నాడు మన హైదరాబాదీ. దుబాయ్లో సైతం.. దుబాయ్లో నిర్వహించే టీ–10 క్రికెట్ పోటీలకు సైతం సన్నీ యాంకరింగ్ చేస్తుడండం గమనార్హం. ఇందుకోసం అక్కడి నిర్వాహకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ యాంకర్లను ఆహ్వానించగా.. సన్నీ మాత్రమే ఎంపికయ్యాడు. దుబాయ్ లీగ్లో మన సన్నీ యాంకరింగ్ చూసిన అక్కడి అపర కుబేరుల్లో ఒకరైన రిజ్వాన్ నిజాన్ మంత్రముగ్ధుడై సన్నీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటా.. పాటా.. మాటలతో మైమరపించే సన్నీ ఖండేల్వాల్, ప్రొ కబడ్డీ పోటీల్లో సుస్మితాసేన్తో.. సచిన్నే మైమరిపించాడు మూడేళ్ల క్రితం నగరంలోని ఇనార్బిట్ మాల్లో జరిగిన ఓ ఈవెంట్కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. ఆవేడుకను సన్నీనే యాంకర్. సచిన్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ఈవెంట్కు పోటెత్తారు. వారందికీ ‘టైన్ టైంస్ సచిన్..సచిన్’.. అన్న నినాదాన్ని వారందరిలోకీ ఎక్కించాడు. సచిన్ వేదిక ఎక్కిన వెంటనే అభిమానులంతా ఒక్కసారిగా అదేవిధంగా స్పందించారు. ఆ కాంప్లిమెంట్కు ఫిదా అయిపోయాడు. ఐపీఎల్ సమయంలో యాంకరింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్ను గెలుపుదిశగా ప్రోత్సహిస్తున్న తనపై సచిన్ చూపించే అభిమానాన్ని వర్ణించలేనంటూ సన్నీ తన ఆనందాన్ని వ్యక్తం పరిచాడు. సన్నీ ప్రొ కబడ్డీలోనూ అదే జోష్ చూపుతున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్కు చెందిన కబడ్డీ టీమ్కి సన్నీ యాంకరింగ్ చేస్తూ తనకు మాత్రమే సొంతమైన చతురత.. చలోక్తులతో జట్టు సభ్యులను, యజమాని అక్షయ్ కుమార్ మన్ననలు అందుకున్నాడు. ఐపీఎల్లోకి అలా.. కాలేజీ ఈవెంట్లు, వేడుకల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సన్నీ.. ‘ఇండియన్ క్రికెట్ లీగ్’కు 2005–2006లో యాంకరింగ్ చేశాడు. ఇది చేస్తుండగా 2006లో ప్రారంభమైన ‘ఐపీఎల్’కి అనుకోకుండా యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్, అనంతరం పూణేకి ప్రాతినిధ్యం వహించాడు. వీటిలో సన్నీ ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ ఆరో సీజన్కు యాంకరింగ్ చేసేందుకు ఆహ్వానించింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్కు యాంకరింగ్ చేస్తూ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల కుటుంబానికి ‘సన్ని’హితుడిగా మారిపోయాడు. ఆకాష్ అంబానీ వివాహాన్ని ఎంత అట్టహాసంగా చేశారో దేశమంతా తెలిసిందే. ఆ పెళ్లిల్లో నీతూ అంబానీకి ఇష్టమైన ‘కృష్ణ రాసలీల’ గురించి తెలుసుకున్న సన్నీ.. ఆ థీమ్ను ‘ఎయిర్–వాటర్–ఎర్త్’ రూపంలో కళాకారులతో ప్రదర్శించి ఆ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథుల దృష్టిలో నిలిచిపోయాడు. ‘ఈ ప్రదర్శనకు ముఖేష్, నీతూ అంబానీలు సైతం ఆశ్చర్యంతో పులకించిపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. -
ఐపీఎల్లో ‘వరల్డ్కప్’ ఆటగాళ్లు.. ప్చ్!
క్రికెట్ అభిమానుల్ని 51 రోజులపాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2019 సీజన్ ముగిసింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరి బంతి వరకూ పోరాడిన ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ సేన ఖాతాలో నాలుగో ఐపీఎల్ టైటిల్ చేరింది. ఇక ఫైనల్ మ్యాచ్లో గాయం కూడా లెక్క చేయకుండా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్ వాట్సన్కు సీఎస్కే అభిమానులు ఫిదా అయ్యారు. ఐపీఎల్ సమరం ముగిసింది మరి నెక్ట్స్ ఏంటి? అంటే ఇంకేంటి ప్రపంచకప్ కదా అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు. అయితే ప్రపంచకప్లో పాల్గొనబోయే టీమిండియా ఎంపిక పట్ల మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. యువ సంచలనం రిషభ్ పంత్, సీనియర్ ఆటగాడు అంబటి రాయుడు, మరో స్పెషలిస్టు పేసర్ను తీసుకోకోపోవడంపై సెలక్షన్ విధానాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే మే 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వసమరానికి ముందు జరిగిన ఐపీఎల్లో వరల్డ్కప్కు ఎంపికైన భారత జట్టు సభ్యుల ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం. కోహ్లి, రోహిత్.. ప్చ్ కనీసం ఈ సారయినా.. అనే నినాదంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ సీజన్ను సవాల్గా తీసుకున్నాడు. అందుకోసం మానసికంగా, శారీరకంగా సిద్దమయ్యాడు. అయితే సీజన్ మారినా ఆర్సీబీ తలరాత మారలేదు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సారి కాస్త పరుగుల ప్రవాహం తగ్గింది. 14 మ్యాచ్లు ఆడిన కోహ్లి 33.14 సగటుతో 464 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్దసెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. రోహిత్ శర్మ తన జట్టుకయితే నాలుగోసారి టైటిల్ అందిచాడు కానీ.. బ్యాట్స్మన్గా మాత్రం విఫలమాయ్యడు. ఈ సీజన్లో రోహిత్ మెరుపులు మెరవలేదు. ఇక గాయం కారణంగా ఓ మ్యాచ్కు దూరమై భయపెట్టించాడు. ఇక ఈ సీజన్లో రోహిత్ 15 మ్యాచ్ల్లో 28.92 సగటుతో 405 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ఐపీఎల్లో జెర్సీ మార్చి బరిలోకి దిగిన శిఖర్ ధావన్ పర్వాలేదనిపించాడు. గబ్బర్ నుంచి అభిమానులు అశించిన ప్రదర్శన ఇచ్చాడు. కానీ జట్టుకు అవసరమైన దశలో విఫలమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన ధావన్ ఐదు హాఫ్ సెంచరీలతో 521 పరుగులు సాధించాడు. ఇక విదేశీ పిచ్లపై ముఖ్యంగా ఇంగ్లండ్ గడ్డపై రాణించే ధావన్పై అందరి చూపు ఉంది. మరి ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. రాహుల్ రాజసం.. ధోని ధనాధన్ ఈ సీజన్లో కేఎల్ రాహుల్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, స్టైలీష్ ప్లేయర్గా రాహుల్ నిలిచాడు. ఇక ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన రాహుల్ 593 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్దసెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. అయితే నిలకడలేమి రాహుల్కు ప్రధాన సమస్య. అది అధిగమిస్తే ప్రపంచకప్లో స్టార్ బ్యాట్స్మెన్ అవడం ఖాయం వయసు కేవలం సంఖ్య మాత్రమేనని.. వయసుతో ఆటలో మార్పురాదని ఎంఎస్ ధోని ఈ సీజన్లో నిరూపించాడు. డాడీ ఆర్మీ అంటూ ఎగతాళి చేసినవారికి బ్యాట్తో సమాధానమిచ్చాడు. ఇక బెస్ట్ ఫినిషర్గా గుర్తింపు పొందిన ఈ జార్ఖండ్ డైనమెట్ 15 మ్యాచ్ల్లో 416 పరుగులు సాధించి సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ధోని సగటు 83.80గా ఉండటం విశేషం. ఇక ధోనికిదే చివరి ప్రపంచకప్ కావడంతో టీమిండియాకు మరోసారి కప్ అందిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. లక్కీ ప్లేయర్స్ టీమిండియాలో వారు రావడం, ఉండటంలో అదృష్టమనేది కీలకపాత్ర. ముఖ్యంగా కేదార్ జాదవ్ టీమిండియా లక్కీప్లేయర్గా గుర్తింపు పొందాడు. అతడున్న చాలా మ్యాచ్లు టీమిండియా గెలిచింది. అయితే తాజా ఐపీఎల్ సీజన్లో జాదవ్ తీవ్రంగా నిరాశపరిచాడు. తను ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 162 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఇక కింగ్స్ పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడి ప్లేఆఫ్స్కు దూరమయ్యాడు. ప్రస్తుతం ప్రపంచకప్లో ఆడేది కూడా అనుమానంగా ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్నా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. అనుభవమనే ఏకైక కారణంతో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్. లేకుంటే యువ సంచలనం రిషభ్ పంత్కు చోటు దక్కేది. ఐపీఎల్ సీజన్ 12ను ఘనంగా ఆరంభించి చివరికి ప్లేఆఫ్స్కు కూడా చేరలేదు కోల్కతా నైట్రైడర్స్. ఇక సారథిగా ఈ సీజన్లో విఫలమైన కార్తీక్ ఆటగాడిగా కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అతడాడిన 14 మ్యాచ్ల్లో కేవలం 253 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. జట్టుకు అవసరమైన సమయంలో కార్తీక్ విఫలమయ్యాడని విమర్శలు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్న లక్కీ ప్లేయర్ విజయ్ శంకర్. ఆల్రౌండర్ కోటాలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న విజయ్ శంకర్ ఈ సీజన్లో పెద్దగా మెరవలేకపోయాడు. 15 మ్యాచుల్లో 20.33 సగటుతో కేవలం 244 పరుగులు సాధించాడు విజయ్ శంకర్. ఆల్రౌండ్ షో ఓకే.. వివాదాలతోనే కాదు ఆటతోనూ హైలెట్గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో పాండ్యా పాత్ర మరవలేనిది. తన ఆల్రౌండ్ షోతో ముంబైకి ఘనవిజయాలందించాడు. ఇక ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 44.86 సగటుతో 402 పరుగులు చేసిన పాండ్యా.. బౌలింగ్లో 14 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో మామూలు ప్రదర్శనతోనే సరిపెట్టుకున్నాడు. బౌలింగ్లో 15 వికెట్లు తీసిన జడేజా, బ్యాటింగ్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. బంతి తిప్పలేకపోయారు.. మణికట్టు స్పిన్నర్లుగా గుర్తింపు పోందిన కుల్దీప్ యాదవ్, చహల్లు ఈ సీజన్లో నిరాశపరిచారు. ముఖ్యంగా కుల్దీప్ వికెట్ల విషయం పక్కకు పెడితే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. బెంగళూరుపై చెత్త ప్రదర్శనతో ఏకంగా జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక చహల్ ఆర్సీబీ బౌలింగ్ భారాన్ని మోశాడు. 14 మ్యాచ్లు ఆడిన చహల్ 18 వికెట్లు తీయగా.. 9 మ్యాచ్లు ఆడిన కుల్దీప్ కేవలం నాలుగు వికెట్లే తీసి విఫలమయ్యాడు. ఇక ఇదే సీజన్లో సీఎస్కే స్సిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకోగా.. మన స్పిన్నర్లు రాణించకపోవడం విడ్డూరం. బుమ్ బుమ్ బుమ్రా.. డెత్ ఓవర్ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రిత్ బుమ్రా మరోసారి ఈ సీజన్లో తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కీలకసమయాలలో వికెట్లు పడగొట్టి, పరుగులు కట్టడిచేసి ముంబైకి అనేక విజయాలను అందించాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన ఈ స్టార్ పేసర్ 19 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రపంచకప్లో బౌలింగ్ విభాగానికి నాయకత్వ వహించే బుమ్రా రాణింపు పైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక కింగ్స్ ఎలెవన్ తరుపున బరిలో దిగిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 14మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేసే షమీ ఈ సారి 8.68 రన్రేట్తో పరుగులు సమర్పించుకోవడం విశేషం. సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున బరిలో దిగిన భువనేశ్వర్, కొన్ని మ్యాచులకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. మొత్తంగా 15 మ్యాచుల్లో 13 వికెట్లు మాత్రమే తీసిన భువనేశ్వర్ కుమార్, కీలక సమయంలో ఫెయిల్ అవ్వడం టీమిండియాను కలవరబెట్టే అంశం. -
కుటుంబ సభ్యులతో మాల్దీవుల్లో ‘హిట్మ్యాన్’
టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గుడుపుతున్నాడు. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 2019 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన హోరా హోరీ మ్యాచ్లో ఐపీఎల్ సీజన్12 కప్ని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దాడాడు. ఇటు ఐపీఎల్ విజయంతో మంచి జోష్లో ఉన్న హిట్మ్యాన్ రోహిత్ త్వరలో జరగబోయే వరల్డ్కప్కు ముందు భార్య రితికా, కూతురు సమారియాలతోపాటూ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో పర్యటిస్తున్నాడు. ఫ్యామిలీ టూర్కు సంబంధించి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. నాలుగుసార్లు ముంబైకి టైటిల్ అందించిన రోహిత్.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు సభ్యుడిగా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. రిక్కీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న రోహిత్ 2013లో తన జట్టుకు మొదటిసారి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015లో ముంబైకి టైటిల్ అందించిన హిట్ మ్యాన్ 2017, 2019ల్లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ల్లో ఒక్క పరుగు తేడాతో తన జట్టును విజేతగా నిలిపాడు. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న #10YearChallenge (టెన్ ఇయర్ ఛాలెంజ్)లో భాగంగా రోహిత్కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 2009 ఐపీఎల్లో అప్పటి దక్కెన్ చార్జెస్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్లో ముంబై జట్టుకు కెప్టెన్గా ఉండి ట్రోఫీ అందుకున్నాడు. 2009, 2019 ఫొటోలను జత చేసి షేర్ చేయడంతో ఆ ఫొటో ట్రెండ్ అవుతోంది. -
ఇక ఆపండ్రా నాయనా.. ఆ ట్వీట్ తీసేశా!
వెల్లింగ్టన్: ఐపీఎల్-12వ సీజన్ ముగిసి నాలుగు రోజులు అయ్యింది. అయినప్పటికీ ముంబై ఇండియన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రనౌటైన తీరుపై అభిమానులు ఇంకా డైలమాలోనే ఉన్నారు. ఆ మ్యాచ్లో ధోనిని బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్గా ప్రకటించినట్లయితే సీఎస్కేనే కప్ సొంతం చేసుకునేదని, థర్డ్ అంపైర్ తప్పిదం వల్లే మిస్టర్ కూల్ రనౌట్ అయ్యాడనేది ఆ జట్టు అభిమానుల వాదన. కీలక సమయంలో ధోని రనౌట్ పై క్లారిటీ లేకున్నా అంపైర్లు తమ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఇదిలా ఉంచితే, అలాంటి సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషమ్ ఈ రనౌట్ వివాదంలో తలదూర్చి సీఎస్కే అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్లో నీషమ్ పాల్గొనుకున్నా ఈ సీజన్ ను ఫాలో అయినట్టున్నాడు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోని రనౌట్ వివాదం అతని దృష్టికి వెళ్లింది. దీంతో ఈ రనౌట్ పై తన అభిప్రాయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. ‘అది కచ్చితంగా రనౌటే.. థర్డ్ అంపైర్ నిర్ణయం నన్ను ఏమీ విస్మయానికి గురి చేయలేదు. కొందరు అభిమానులు క్రికెట్ అంటే ఇంత ప్యాషనేట్ గా వుండటం తనకెంతో నచ్చింది. నాకు ధోని అంటే చాలా ఇష్టం. కానీ అది నాటౌట్ అంటే ఆశ్చర్యంగా వుంటోంది’ అంటూ ధోని రనౌట్ ఫొటోను ట్వీట్ చేశాడు. అది కాస్తా చెన్నై అభిమానులకు నచ్చకపోవడంతో అదే ట్విట్టర్ ద్వారా నిషమ్ ను ఓ ఆటాడుకుంటున్నారు. (ఇక్కడ చదవండి: ‘డబ్బు కోసమే.. ధోనిని ఔట్గా ప్రకటించారు’) 'నువ్వో అంతర్జాతీయ క్రికెటర్ అంటే మాకు నమ్మబుద్ది కావడం లేదు. అంపైర్లకే కాదు నిషమ్ను కూడా ఎవరో మేనేజ్ చేసినట్లున్నారు' అంటూ వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ ట్వీట్ కు అత్యధికంగా నెగెటివ్ కామెంట్స్ వస్తుండటంతో నీషమ్ దాన్ని తొలగించాడు. ఆ ట్వీట్ ను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందోకూడా వివరణ ఇచ్చుకున్నాడు. 'ఎంఎస్ ధోని రనౌట్ గురించి చేసిన ట్వీట్ను తొలిగించానని, తన అభిప్రాయాన్ని మార్చుకుని ఈ పని చేయలేదని తెలిపాడు. మరి ఎందుకలా చేశానంటే.. ‘రోజూ 200 పైగా అధికంగా చెత్త కామెంట్స్ రావడం...వాటిని చూసి నేను అనారోగ్యానికి గురవడం జరిగింది. నేను వాటిని అసలు కేర్ చేయలేదు. దయచేసి మళ్లీ నాకు ఈ విషయం గురించి ట్వీట్ చేయకండి. హేవ్ ఏ గుడ్ డే’ అంటూ ట్వీట్ చేశాడు. -
అతనికి సరితూగే వారు లేరు: సెహ్వాగ్
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో హార్దిక్ పాండ్యా ప్రతిభకు ఎవరూ సరితూగలేరని సెహ్వాగ్ కొనియాడాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 12లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు బ్యాటు, మరోవైపు బంతితో రాణించి ఔరా అనిపించాడు. ముంబై ఇండియన్స్కు కప్ గెలవడంతో హార్దిక్ ప్రధాన పాత్ర పోషించాడు.త్వరలో ప్రపంచకప్ మొదలవనున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రతిభపై సెహ్వాగ్ స్పందించాడు. 'బ్యాటింగ్, బౌలింగ్లో హార్దిక్ పాండ్యా ప్రతిభకు దగ్గరలో కూడా ఎవరూ లేరు. ఒకవేళ బీసీసీఐ ఎంపిక చేసిన త్రీ డైమెన్షన్ ప్లేయర్లలో హార్దిక్తో ఎవరైనా సమానంగా ఉండి ఉంటే.. అతను తిరిగి జట్టుకు ఎంపికయ్యేవాడే కాదు' అని సెహ్వాగ్ అన్నారు. కాఫీ విత్ కరణ్ షో వివాదంతో హార్దిక్, కేఎల్ రాహుల్లపై బీసీసీఐ తాత్కాలిక సస్పెన్షన్తో పాటు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఐపీఎల్ 12లో ఈ ఇద్దరు అదరగొట్టారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ.. మొత్తం 16 మ్యాచ్ల్లో 191.42 స్ట్రెక్రేట్తో 402 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 91. ఇక బంతితో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
కోహ్లి తర్వాతే అతనే సరైనోడు..!
న్యూఢిల్లీ : ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోహ్లిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ కెప్టెన్సీ ధోని, రోహిత్తో కోహ్లిని పోల్చలేమంటూ స్పష్టం చేశారు. రోహిత్ సారథ్యంలోని ముంబై జట్టు 4 సార్లు, ధోని సారథ్యంలోని చెన్నై జట్టు 3 సార్లు ఐపీల్ విజేతగా అవతరించాయని గుర్తు చేశాడు. కానీ, ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారిగా ఐపీఎల్ టైటిల్ సాధించలేదని అన్నాడు. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడని వివరించారు. 2016లో ఫైనల్ చేర్చడం మినహా ఆర్సీబీకి కోహ్లి ఏమీ చేయలేకపోయాడని ఎద్దేవా చేశాడు. ఇక ముంబై జట్టుకు రోహిత్ సరైనోడని కితాబిచ్చాడు. ‘నాకు తెలిసి ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మాత్రమే. ఇక ఆసియా కప్పులోనూ రోహిత్ కెప్టెన్సీ నిరూపించుకున్నాడు. భారత జట్టును విజేతగా నిలిపాడు. రాబోయే రోజుల్లో కోహ్లి తర్వాత భారత జట్టును నడిపించేది రోహిత్ శర్మానే’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. (చదవండి : ముంబై చార్మినార్) ఇక స్టార్ ఆటగాళ్లున్నప్పటికీ ఐపీఎల్-12 సీజన్లో ఆర్సీబీ 11 పాయింట్లు మాత్రమే సాధించి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఫైనల్లో చెన్నైతో తలపడిన ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో ధోని సేనపై విజయం సాధించి ఐపీఎల్ కప్ను నాలుగోసారి ఎగరేసుకుపోయింది. ఇక తాజా వరల్డ్కప్ ఇండియన్ క్రికెట్ టీమ్లో మరో నాణ్యమైన బౌలర్ ఉంటే బాగుండేదని గంభీర్ ఇదివరకే అభిప్రాయపడ్డాడు. బుమ్రా, షమీ, భువనేశ్వర్కు తోడుగా మరో ఫాస్ట్ బౌలర్ ఉంటే బాగుండేదన్నాడు. ఆల్రౌండర్లు హర్దిక్, విజయ్ శంకర్ ఫాస్ట్ బౌలర్లు అయినప్పటికీ టీమిండియాలో ఇంకో ఫాస్ట్ బౌలర్ ఉండాల్సిందని చెప్పాడు. తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గౌతమ్ గంభీర్ పోటీచేసిన సంగతి తెలిసిందే. -
బెయిర్ స్టో విధ్వంసం.. పాక్ చిత్తుచిత్తుగా
బ్రిస్టల్: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెయిర్ స్టో(128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా స్థానిక కౌంటీ గ్రౌండ్లో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. బెయిర్ స్టో ఆకాశమే హద్గుగా చెలరేగడంలో 359 పరుగుల భారీ స్కోర్ కూడా చిన్నబోయింది. మరో 31 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యం పూర్తి చేసిన ఇంగ్లండ్ సీరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకపోయింది. బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు లభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ హీరో ఫఖర్ జామన్(2) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(151; 131 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్సర్) భారీ శతకం సాధించాడు. ఇమామ్తో పాటు అసిఫ్ అలీ(52), సోహైల్(41)లు రాణించడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా, టామ్ కరన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను పాక్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా బెయిర్ స్టోలో ఇంకా ఐపీఎల్ ప్రభావం తగ్గినట్టు కనిపించలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఓపెనర్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెయిర్ స్టోకు తోడుగా జాసన్ రాయ్(76), రూట్(43), మొయిన్ అలీ(46 నాటౌట్)లు రాణించడంతో ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెయిర్ స్టో ఐపీఎల్తో తన ఆటలో చాలా మార్పు వచ్చిందని, అక్కడ నేర్చుకున్న పాఠాలు తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు. -
ఐపీఎల్ ఫైనల్ చాలా ‘హాట్’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ వెబ్ ప్లాట్ఫామ్ ‘హాట్ స్టార్’లో సూపర్ హిట్టయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ను ఒకే సమయంలో గరిష్టంగా 18.6 మిలియన్ల (1 కోటి 86 లక్షలు) వీక్షకులు చూసినట్లు హాట్ స్టార్ ప్రకటించింది. ఇదే టోర్నీ మరో మ్యాచ్లో నమోదైన 12.7 మిలియన్ల రికార్డుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గత ఏడాది ఇదే హాట్స్టార్లో మ్యాచ్ను చూసిన వారితో పోలిస్తే ఈ సారి వీక్షకుల సంఖ్య ఏకంగా 74 శాతం పెరగడం విశేషం. -
వాట్సన్పై ముంబై ఫ్యాన్స్ కామెంట్స్
ఐపీఎల్ ఫైనల్లో గాయాన్ని లెక్కచేయకుండా వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్పై అన్నివైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇతర జట్ల అభిమానులు కూడా అతడిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ను వ్యతిరేకించే వారు కూడా వాట్సన్ ఆటకు ఫిదా అయిపోయారు. ‘నేను ముంబై ఇండియన్స్ అభిమానిని. కానీ వాట్సన్ ఆట, అంకితభావం చూశాక అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాన’ని ముంబై అభిమాని ఒకరు కామెంట్ చేశారు. ‘నేను రోహిత్ సేన ఫ్యాన్ని. రక్తంతో తడిసిన ప్యాడ్స్తో ఆడినట్టు వాట్సన్ ఫొటోలు చూసిన తర్వాత విజయానికి అన్నివిధాల అర్హుడని భావించాను. దురదృష్టవశాత్తు విజయాన్ని అందించలేకపోయాడు. ఒక్క విషయం మాత్రం నిజం. తన ఆటతో లక్షలాది మంది హృదయాలను గెల్చుకున్నాడ’ని నిశాంత్ పరిహార్ అనే ముంబై ఇండియన్స్ అభిమాని పేర్కొన్నాడు. రక్తమోడుతూ వాట్సన్ బ్యాటింగ్ చేయడం చూసి కన్నీరు ఆగలేదని, నోటి వెంట మాటలు రాలేదని మరో అభిమాని వెల్లడించారు. వాట్సన్ వారియర్, లెజెండ్ అని.. ఐపీఎల్ ట్రోఫికి అతడు అన్నివిధాల అర్హుడన్నారు. అతడిపై గౌరవం పెరిగిందన్నాడు. వాట్సన్ను అల్టిమేట్ హీరోగా, సూపర్ హీరోగా సినీ నటి కస్తూరి వర్ణించారు. గాయం బాధను పంటి బిగువున బిగబట్టి ప్రపంచానికి రక్తం రంగును పసుపుగా చూపించాడని ప్రశంసించారు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అతడు ఆడటం గౌరవంగానూ, గర్వంగా ఉందన్నారు. -
‘డబ్బు కోసమే.. ధోనిని ఔట్గా ప్రకటించారు’
చెన్నై: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సీఎస్కే సారథి ధోని రనౌట్ నిర్ణయం వివాదస్పదమైంది. ధోని రనౌట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి.. ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఒక కోణంలో ధోనీ బంతి వికెట్లకు తగలకముందే లైన్ను దాటినట్టు కనిపించింది. మరో కోణంలో మాత్రం లైన్కు కొద్దిగా అటు-ఇటు ఉన్నట్టు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్మన్కు ఫేవర్గా నిర్ణయం ప్రకటించకుండా వ్యతిరేకంగా ప్రకటించారని సీఎస్కే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధోని రనౌట్ నిర్ణయంపై ఇంకా రగులుతూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘మరోసారి ఐపీఎల్లో చెత్త నిర్ణయం..థర్డ్ అంపైర్ తన ఖాతాలో డబ్బులు పడేంత వరకూ ఎదురుచూసి.. ఆ తర్వాత ధోనీని ఔట్గా ప్రకటించాడు’ అని కొందరు అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై సీఎస్కే స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘ఫైనల్ మ్యాచ్లో మేము తప్పిదాలు చేసిన మాట వాస్తవం. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యాం. ముంబై జట్టులో జస్ప్రిత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రపంచకప్లో బుమ్రా ప్రధానమవుతాడు. కీలక సమయంలో ధోని రనౌట్ కావడం మ్యాచ్పై ప్రభావం చూపింది. అయితే బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్గా ప్రకటించాల్సింది కానీ అది జరగేలేదు. సీఎస్కేకు వ్యతిరేకంగా అంపైర్ నిర్ణయం ప్రకటించాడు. ఇది చాలా కఠిన నిర్ణయం. వాట్సన్ పోరాటం ఆకట్టుకుంది.’అంటూ భజ్జీ పేర్కొన్నాడు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : వివాదస్పదమైన ధోని రనౌట్ నిర్ణయం -
గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్ చేసిన వాట్సన్
-
కుంబ్లేను గుర్తుచేశావ్ వాట్సన్..
చెన్నై: గాయం లెక్క చేయకుండా.. రక్తం కారుతున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్ వాట్సన్కు చెన్నై సూపర్కింగ్స్ యాజమాన్యం, అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు. విజయం ఎవరిని వరించినా గాయంతో వాట్సన్ పోరాడిన తీరు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. మంగళవారం సీఎస్కే తన అధికారిక ట్వీటర్లోనూ వాట్సన్పై ప్రశంసల జల్లు కురిపించింది. ఆటపై వాట్సన్కున్న అంకితభావం గొప్పది, అతడు నిజమైన చాంపియన్ అంటూ సీఎస్కే ట్వీట్ చేసింది. వాట్సన్ ఎంత అంకితభావం ఆటగాడో తెలుస్తుందని, అతడిపై గౌరవం పెరుగుతుందని సహచర ఆటగాడు హర్భజన్ సింగ్ కొనియాడాడు. ఒక వైపు రక్తం కారుతున్న పట్టించుకోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని భజ్జీ ప్రశంసించాడు. వాట్సన్ టీమిండియా లెజెండ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను గుర్తుచేశాడంటూ కొంతమంది గుర్తు చేశారు. కుంబ్లే కూడా ఓ టెస్టు మ్యాచ్ సందర్భంగా గాయపడితే. తలకు కట్టు కట్టుకొని మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఇక సీఎస్కే ఫ్యాన్స్ కూడా వాట్సన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మ్యాచ్ ఓడినా.. మా మనసులను గెలుచుకున్నావ్’, ‘సీఎస్కే అభిమానుల గుండెల్లో వాట్సన్కు ఎప్పుడూ స్థానం ఉంటుంది’ ‘సీఎస్కే అభిమాని అయినందుకు చాలా గర్వంగా ఉంది’ అంటూ సీఎస్కే అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్ చేసిన వాట్సన్ -
బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్
-
‘థ్యాంక్యూ సచిన్ సర్’
ముంబై : ప్రస్తుత యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కరే స్ఫూర్తి. అతడి ఆటను ఆదర్శంగా తీసుకుని క్రికెట్వైపు అడుగులు వేసిన వారూ ఎందరో ఉన్నారు. అయితే ఏకంగా సచినే ఓ క్రికెటర్ ఆటను మెచ్చుకుంటే ఇంకేంటి ఎగిరి గంతేసుడే. ప్రస్తుతం టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా చేస్తుంది అదే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం సచిన్ మాట్లాడుతూ ప్రస్తుతం బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన బుమ్రా‘నాకు మాటలు రావడంలేదు.. థ్యాంక్యూ సచిన్ సర్’అంటూ ట్వీట్ చేశాడు. చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన ఫైనల్ పోరులో చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ను ఔట్ చేసి ముంబైకి విజయం అదించింది మలింగ అయితే.. ఓడిపోయే మ్యాచ్ను అక్కడి వరకు తీసుకవచ్చింది మాత్రం బుమ్రానే. ఫైనల్ మ్యాచ్లో బుమ్రా(2/14) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక సమయాలలో రాయుడు, బ్రేవో వికెట్లను పడగొట్టాడు. అయితై ఫైనల్ మ్యాచ్ అనంతరం సచిన్ను యువరాజ్ సింగ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా బుమ్రా ఇప్పటికే ప్రపంచ ఆగ్రశ్రేణి బౌలర్ అయ్యాడని.. అతడిలో ఇంకా అత్యుత్తమ ప్రదర్శన దాగి ఉందని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్ మొత్తంలో బుమ్రా 16 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి 6.63 ఎకానమీ సాధించాడు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ -
వార్నీ.. కేఎల్ రాహుల్ అవార్డు.. పాండ్యా చేతికి!
హైదరాబాద్: హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మధ్య ఉన్న దోస్తీ గురించి తెలిసిందే. వీరిద్దరు కలిసి కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొని.. మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీంతో వీరిద్దరిపై బీసీసీఐ చర్యలు తీసుకొంది. కొన్ని మ్యాచ్లు ఆడకుండా వేటు కూడా వేసింది. ఈ వివాదం తర్వాత వీరు కలిసి పెద్దగా కనిపించలేదు. కానీ ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్కు ఐపీఎల్ మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ అవార్డు ప్రకటించారు. కేఎల్ రాహుల్ అక్కడ లేకపోవడంతో అతని తరఫున హార్దిక్ పాండ్యా అవార్డు అందుకున్నారు. ఇలా అవార్డు అందుకోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లతోపాటు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకంటే విడ్డూరం ఇంకొకటి ఉండదని, ఐపీఎల్ ఫైనల్ హైలెట్ అంటే.. అది కేఎల్ రాహుల్ అవార్డును పాండ్యా తీసుకోవడమేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్షిఫ్ అంటే ఇలా ఉండాలని, వివాదాలు ఎన్ని వచ్చినా ఇలాంటి మ్యాజిక్ మూమెంట్స్తో కలిసి సాగాలని, అదే నిజమైన స్నేహమని మరికొంతమంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై జోరుగా బెట్టింగ్ ఆడుతున్న 14 మందిని అనంతపురం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడుసెల్ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను సీఐ యుగంధర్ వెల్లడించారు. ఆదివారం ఐపీఎల్ ఫైనల్లో చైన్నె సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయయి. నగరంలోని సైఫుల్లా హిందూ శ్మశాన వాటిక సమీపంలో, హౌసింగ్బోర్డు కాలనీ శివారులోని క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేసినట్లు సీఐ తెలిపారు. నవోదయ కాలనీకి చెందిన ఉద్దల కిష్టప్ప, రాప్తాడు మండల కేంద్రానికి చెందిన చిరుతల శివయ్య, నగరంలో గౌసల్వరావీధికి చెందిన తపాలా సర్దార్ అనే క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశామన్నారు. వీరితో పాటునగరంలో ఆముదాలవీధికి చెందిన పసుపులేటి సాయికుమార్, లక్ష్మీనగర్కు చెందిన అచల సల్మాన్ఖాన్, రహమత్నగర్కు చెందిన సాదిక్, అశోక్నగర్కు చెందిన మంజునాథ్, మారుతీనగర్కు చెందిన షేక్బాషా, రాజమ్మవీదికి చెందిన హాజీషఫీ, గుంతకల్లు చెందిన శ్రీనివాసులు, నగరంలో పాన్వాలీవీధికి చెందిన షాకీర్, వేణుగోపాల్కు చెందిన ఓంకార్, బళ్లారి రోడ్డుకు చెందిన సోమశేఖర్, భవానీనగర్కు చెందిన షేక్బాబాఫకృద్దీన్లను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. క్రికెట్బుకీలు బెట్టింగ్తో పాటు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లు తేలిందని తెలిపారు. -
రక్తంతో తడిసిన వాట్సన్ మోకాలిని చూశారా?
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో వీరోచితంగా బ్యాటింగ్ చేసి.. చెన్నై సూపర్కింగ్స్ జట్టును దాదాపుగా విజయతీరాలకు చేర్చి.. చివరలో రన్నౌట్ అయిన సీనియర్ బ్యాట్స్మన్ షేన్ వాట్సన్ గురించి ఆ జట్టు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మోకాలికి దెబ్బతగిలి.. రక్తం కారుతున్నా.. ఆ గాయం తాలుకూ బాధ సలుపుతున్నా.. ఏమాత్రం చెక్కుచెదరకుండా షేన్ వాట్సన్ చివరివరకు బ్యాటింగ్ చేశాడని హర్భజన్ వెల్లడించాడు. ఎడమ మోకాలు వద్ద రక్తంతో వాట్సన్ ప్యాంటు తడిసిపోయిన ఫొటోను భజ్జీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘గాయ్స్.. రక్తంతో తడిసిన అతని మోకాలిని చూశారా? మ్యాచ్ తర్వాత అతని గాయానికి ఆరు కుట్లు వేశారు. మ్యాచ్ డైవింగ్ సందర్భంగా వాట్సన్ గాయపడ్డాడు. అయినా ఎవరికీ చెప్పకుండా అతను వీరోచితంగా బ్యాటింగ్ కొనసాగించాడు. వాట్సన్ అంటే అది. అతను దాదాపుగా మమ్నల్ని విజయం ముంగిటికి తీసుకొచ్చాడు’ అని భజ్జీ తెలిపాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో ఒంటరిపోరాటం చేసిన వాట్సన్.. 59 బంతుల్లో 80 పరుగులు చేసి.. చివరిఓవర్లో రన్నౌట్ అయిన సంగతి తెలిసిందే. వాట్సన్ రన్నౌట్తో గట్టి షాక్కు గురైన చెన్నై జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఈ మ్యాచ్లో ఓడి.. ఐపీఎల్ కప్ కోల్పోయింది. వాట్సన్ వీరోచిత ఇన్సింగ్స్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. డైవింగ్లో గాయపడి.. మోకాలు రక్తపుమయంగా మారిన ఏమాత్రం బెదరకుండా బ్యాటింగ్ కొనసాగించిన వాట్సన్ను హీరో ఆఫ్ ది మ్యాచ్గా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఫైనల్ మ్యాచ్ రోజూ రెచ్చిపోయిన పిక్పాకెటర్లు..
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్ల్లో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగింది. మే 12న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్లో తారాస్థాయికి చేరింది. మార్చి 29 నుంచి మే 12 వరకు ఉప్పల్ స్టేడియం వేదికగా సాగిన మ్యాచ్లకు టికెట్లను బ్లాక్లో అమ్మిన 93 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 304 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. మ్యాచ్లు వీక్షించేందుకు వచ్చిన యు వతులను వేధిస్తున్న ఐదుగురు ఈవ్టీజర్లను మఫ్టీలో ఉన్న రాచకొండ షీ బృందాలు పట్టుకున్నాయి. అలాగే క్రికెట్ అభిమానుల నుంచి డబ్బులు, బంగారు ఆభరణాలు కొట్టేసిన ఐదు గురు దొంగలను కూడా అదుపులోకి తీసుకున్నా రు. మద్యం తాగి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన న్యూసెన్స్ కేసులు కూడా పరిమిత సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరి అక్రిడేషన్ కార్డును మరొకరు వాడిన కేసులో ఒకరిపై 420 కేసు కూడా నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో 116 కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఆయా పెట్టీ కేసులు మినహా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని, భద్రతపరంగా పోలీసులు బాగా పనిచేశారని రాచకొండ పోలీ సు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహనదారుల కు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, క్రికెట్ అభిమానుల కోసం ఆర్టీసీ, మెట్రోలు ప్రత్యేక సేవలు అందించడంతో ఎవరి ఇళ్లకు వారు సక్రమంగా చేరుకోగలిగారన్నారు. -
ఈ సీజనే అత్యుత్తమం
ఈ ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఆఖరి ఓవర్దాకా సాగి ఉత్కంఠ రేపాయి. ప్రేక్షకుల్ని చివరిదాకా కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాయి. తాజా ఫైనల్ పోరులో ఆఖరి బంతే విజేతను తేల్చింది. అసలు సిసలైన ఫైనల్ మజానిచ్చింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే ఈ సీజన్ టోర్నీ అత్యుత్తమమైంది. మొత్తానికి ఏటికేడు ఐపీఎల్ స్థాయి పెరుగుతూనే ఉంది. ముంబై ఇండియన్స్కు అభినందనలు. రోహిత్ సారథ్యంలో ముంబై నాలుగో టైటిల్ నెగ్గింది. లీగ్ చరిత్రలో అతనిప్పుడు విజయవంతమైన కెప్టెన్. ఆదివారం ఉత్తమ కెప్టెన్ల మధ్య అత్యుత్తమ సమరమే జరిగింది. బెంగళూరు, చెన్నైల మధ్య బోర్ కొట్టిన మ్యాచ్తో ఈ సీజన్ మొదలైంది. (బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైంది) కానీ రానురాను మ్యాచ్ల స్వరూపం మారింది. అయితే నిర్వాహకులు గత చాంపియన్, అట్టడుగున నిలిచిన జట్ల మధ్య కాకుండా విజేత, రన్నరప్ జట్ల మధ్య తొలి మ్యాచ్ నిర్వహిస్తే బాగుంటుంది. అలాగే మ్యాచ్లు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలి. కొన్ని మ్యాచ్లైతే 4 గంటలపాటు జరిగాయి. 190 నిమిషాలు లేదంటే 200 నిమిషాల్లో మ్యాచ్లు ముగిసేలా చర్యలు తీసుకోవాలి. లేట్ ఓవర్ రేట్కు కేవలం ఆర్థిక జరిమానా సరిపోదు... ‘క్రికెటింగ్ పెనాల్టీ’లను విధించాలి. తద్వారా వాళ్ల పాయింట్లతో పాటు మ్యాచ్లకూ ఇది తీవ్రంగా పరిణమిస్తుంది. ఔటైతే తదుపరి బ్యాట్స్మన్ 2 నిమిషాల్లో కాకుండా 45 సెకన్లలోనే క్రీజులోకి వచ్చేలా నిబంధనలు తేవాలి. ఓవర్ ముగిసిన తర్వాత మొదలయ్యే ఓవర్ తొలి బంతికి టైమ్ పీరియడ్ ఉండాలి. ఆ సమయంలోపు బంతి వేయకుంటే అంపైర్ ఫ్రీహిట్గా ప్రకటించాలి. అప్పుడే మ్యాచ్లు నిర్ణీత సమయంలో ముగించేందుకు ప్రయత్నిస్తారు. పిచ్లపై కూడా నిర్వాహకులు దృష్టి పెట్టాలి. ఫైనల్ మ్యాచ్ సాగినట్లే బ్యాట్స్మన్, బౌలర్లకు సమాన అవకాశమిచ్చే పిచ్లను రూపొందించాలి. ఇవన్నీ అమలు చేస్తే భవిష్యత్లోనూ ఇక ఐపీఎల్కు తిరుగుండదు. -
బేసి... సరి అయినప్పుడు!
సాక్షి క్రీడావిభాగం : ముంబై ఇండియన్స్ పేసర్ అల్జారి జోసెఫ్ ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్లు ఆడి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. నిబంధనల ప్రకారం జట్టు నుంచి వెళ్లిపోయాక అతని గాయం సమస్య సొంత బాధ్యత లేదా వెస్టిండీస్ బోర్డు చూసుకోవాలి. కానీ ముంబై ఇండియన్స్ అలా చేయలేదు. తమ సొంత ఖర్చులతో జోసెఫ్ పూర్తిగా కోలుకునే వరకు ముంబైలోనే ఉంచి చికిత్స చేయించేందుకు సిద్ధమైంది. ముంబై టీమ్ సంస్కృతి గురించి ఎవరైనా మాట్లాడితే ఇలాంటి ఉదాహరణలు బోలెడు. నీకు ఏ లోటు రాకుండా చూస్తాం... మాకు విజయాలు అందించు చాలు అనేది ముంబై టీమ్లో మాత్రమే కనిపించే తత్వం. అందుకే చాలా మంది వేలం నుంచి కూడా ఆ టీమ్లో ఉండాలని కోరుకుంటారు. చివరి వరకు కూడా ఓటమి అంగీకరించకుండా పోరాడే గుణం ముంబై ఆటగాళ్లలో తరచుగా కనిపిస్తోంది. అది కూడా ఏ ఒక్కరో కాకుండా సమష్టి తత్వంతో ఆ జట్టు వరుసగా టైటిల్స్ సాధిస్తోంది. తలా ఓ చేయి... ఈ సీజన్కు వచ్చేసరికి ట్రోఫీ విజయాన్ని ఏ ఒక్కరికో ఆపాదించలేం. సరిగ్గా చెప్పాలంటే అందరూ ఒక్కో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎప్పటిలాగే ఆరంభంలో పరాజయాలతో మొదలు పెట్టిన ముంబై అనూహ్యంగా దూసుకుపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యకరం. కేవలం 2 అర్ధసెంచరీలతో మొత్తం 405 పరుగులు చేయడం రోహిత్ స్థాయి ప్రదర్శన కాదు. అయినా సరే జట్టుకు అది సమస్యగా మారలేదు. డి కాక్ నాలుగు అర్ధసెంచరీలు సహా 529 పరుగులతో టీమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ క్వాలిఫయర్లో తన క్లాస్ చూపించగా, హార్దిక్ పాండ్యా ఏకంగా 192 స్ట్రైక్రేట్తో 402 పరుగులు చేయడం ముంబై విజయంలో కీలకంగా మారిందని చెప్పవచ్చు. పొలార్డ్ ఒకే ఒక అర్ధసెంచరీ చేసినా అది అవసరమైన మ్యాచ్లో జట్టును గెలిపించింది. ఇప్పుడు ఫైనల్లో అతని ఆట మళ్లీ ముంబై తమ జట్టుతోనే కొనసాగించేందుకు కారణంగా మారనుంది. టీమ్నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం. బౌలింగ్లో బుమ్రా, రాహుల్ చహర్ చెరో 19, 13 వికెట్లు తీసి కీలకంగా మారారు. మలింగ భారీగా పరుగులిచ్చినా ఫైనల్ తరహాలో అసలు సమయంలో తన సత్తా ప్రదర్శిస్తూ తనపై మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సమష్టి ఆటతో పాటు మొత్తంగా రోహిత్ వ్యూహాలు ముంబైని మహాన్గా నిలిపాయి.మరోవైపు కేవలం ధోని బ్యాటింగ్, అతని కెప్టెన్సీనే నమ్ముకున్న చెన్నై చివరి మెట్టుపై కుప్పకూలింది. ధోని రనౌట్ కాకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో కానీ మొత్తంగా ఆరంభం నుంచి వారికి సమస్యగా ఉన్న బ్యాటింగ్ చివరకు కొంప ముంచింది. చెన్నై అసలు పోరులో మాత్రం బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక చివరకు 0–4తో ముంబైపై ఓడి సీజన్ ముగించింది. రోహిత్ పగ్గాలు చేపట్టాక... జంబో జెట్ టీమ్, భారీ హంగామా, అంబానీల అండాదండా ఉన్నా ఐపీఎల్ తొలి ఐదు సీజన్లలో ముంబై టైటిల్ గెలవలేకపోయింది. సచిన్ టీమ్లో ఉన్నా, పాంటింగ్ లాంటి దిగ్గజం కెప్టెన్గా వచ్చినా ఆ తర్వాత కూడా రాత మారలేదు. కానీ 2013లో రోహిత్ శర్మ నాయకుడిగా వచ్చి టీమ్ను మార్చేశాడు. అంతకుముందుతో పోలిస్తే ఒక్కసారిగా ముంబై టీమ్ మారిపోయినట్లుగా కనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్కు పరిమిత సంఖ్యలోనే కెప్టెన్సీ అవకాశాలు వచ్చినా... ఐపీఎల్లో మాత్రం తన నాయకత్వ లక్షణాలతో రోహిత్ వరుస విజయాలు అందించాడు. 2013, 2015, 2017 లతో పాటు ఇప్పుడు 2019లో బేసి సంవత్సరాల్లో టైటిల్ సాధించి కొత్త ఘనతను సృష్టించాడు. ఇందులో మూడు సార్లు ధోని నాయకత్వంలోని చెన్నైపై... మరో మ్యాచ్లో ధోని సభ్యుడిగా ఉన్న టీమ్పై గెలవడం ముంబై స్థాయిని చూపిస్తోంది. 2017లో పుణేతో జరిగిన ఫైనల్లో 129 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలగడం కూడా రోహిత్ వల్లే సాధ్యమైంది. -
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు కానీ కప్ గెలిచాం
-
క్యాప్లు సాధించకున్నా.. కప్ గెలిచాం..
హైదరాబాద్: సమష్టి కృషితోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ట్రోఫీని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుందని ఆ జట్టు ప్రధాన కోచ్ మహేళ జయవర్దనే పేర్కొన్నాడు. బహుమతి ప్రధానాత్సోవం అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లును ఉద్దేశించి ప్రసంగించాడు. దీనిక సంబంధించిన వీడియో ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆటగాళ్లు తప్పిదాలు చేశారని.. కానీ త్వరగా కోలుకొని అద్భుత ప్రదర్శనిచ్చారని కొనియాడాడు. టోర్నీ ఆసాంతం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను సొంత కుటుంబ సభ్యుల్లా ఆకాశ్, నీతా అంబానీలు చూసుకున్నారని ప్రశంసించాడు. ‘మన జట్టులో ఒక్క ఆటగాడు కూడా ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు. కానీ కప్ గెలిచాం. సమిష్టిగా ఆడి విజయం సాధించాం. చెన్నై మ్యాచ్లో మనం అనేక తప్పిదాలు చేశాం. కానీ త్వరగా కోలుకొని అత్యుత్తమ ప్రదర్శననిచ్చాం. ఐపీఎల్ 12 గెలవడంలో ప్రతీ ఒక్క ఆటగాడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు’అంటూ జయవర్దనే ప్రసంగించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ పోరులో సీఎస్కేపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు ఐపీఎల్ టోర్నీలు కైవసం చేసుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ సాధించలేదు కానీ కప్ గెలిచాం -
‘ధోని హార్ట్ బ్రేక్ అయ్యింది’
డిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ధోని సేనపై అద్భుత రికార్డు ఉన్న ముంబై అదే జోరును కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో కప్ను ఎగురేసుకుపోయింది. కచ్చితంగా గెలిచి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంటుందని భావించిన చెన్నై జట్టు ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమ జట్టు చేసిన తప్పులే తమకు ట్రోఫీని దూరం చేశాయంటూ చెన్నై సారథి ధోని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరు జట్లు తప్పిదాలు చేశాయని, తమ కంటే ఒక తప్పిదం తక్కువ చేయడం వల్లే ప్రత్యర్థి జట్టు విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు. కాగా ఫైనల్ మ్యాచ్లో ఓటమిని ధోని తట్టుకోలేకపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.‘మ్యాచ్ తర్వాత నా గుండె ధోనితో మాట్లాడటం మొదలుపెట్టింది. కేవలం ఒకే ఒక్క పరుగుతో టైటిల్ కోల్పోవడం తన హార్ట్ను బ్రేక్ చేసింది. ధోని ఇంతలా బాధపడటం ఇంతకు ముందెన్నడు చూడలేదు’ అని పేర్కొన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో ఆట అంత గొప్పగా ఏమీలేదనీ, అయినా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూడాలనే ఉత్సాహం కచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చాంపియన్ బౌలర్లు ఉన్న జట్టునే విజయం వరించే అవకాశాలు ఎక్కువ. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచే ఐపీఎల్ చిరకాలం వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. My heart went out to Dhoni speaking to him in the post match, he seemed really heartbroken. Never seen him like that before. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) May 12, 2019 -
ఐపీఎల్-12లో జ్యోతిష్యమే గెలిచింది..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ఫైనల్ పోరులో జ్యోతిష్యమే గెలిచింది. మ్యాచ్కు కొద్ది గంటల ముందు విజేతగా ముంబై ఇండియన్స్ నిలుస్తుందని పలువురు జ్యోతిష్కులు వెల్లడించారు. రోహిత్ శర్మకు, ముంబై ఇండియన్స్ జట్టుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలోనూ కెప్టెన్గా రోహిత్ శర్మ అద్భుతాలు సాధిస్తాడని, ధోనీకి అనుకూలంగా ఉన్న గ్రహాలు, అదృష్టం ఈసారి రోహిత్కు అనుకూలమయ్యాయని వారు వివరించారు. అయితే జోతిష్యుల అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగో సారి ముద్దాడింది. దీంతో తమ జ్యోతిష్యమే గెలిచిందని పలువురు సిద్దాంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం స్థానక రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో చెన్నై సూపర్కింగ్స్పై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. అయితే గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం తప్పకుండా ఉండాలంటారు. నిన్నటి మ్యాచ్లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ అదృష్టం రోహిత్కు ఉన్న గ్రహబలమేనని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. బల్కంపేట అమ్మవారి ఆలయంలో నీతా అంబానీ పూజలు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమె మ్యాచ్ మధ్యలో బల్కంపేటలోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడి ఆవరణలోని పోచమ్మ, నాగదేవత ఆలయాలను కూడా ఆమె సందర్శించారు. అనంతరం నీతా అంబానీ తిరిగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్కంఠంగా సాగుతున్న మ్యాచ్ ఆసాంతం ఆమె పూజలు చేశారు. చివరి బంతి సమయంలో కూడా మంత్రాలు చదువుతూ కనిపించారు. ఆమె మొక్కులు ఫలించే ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిందని సోషల్మీడియాలో ముంబై ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నీతా అంబానీ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు. చదవండి: విజేత ఎవరో చెప్పిన జ్యోతిష్కుడు -
నాలుగు కాదు.. ఐదు: రోహిత్
హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ముంబై సారథి రోహిత్ శర్మ తన భార్య, బిడ్డతో కలిసి కాసేపు సరదాగా గడిపాడు . ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ సందర్భంగా నాలుగు సార్లు ఐపీఎల్ టోర్నీ గెలిచిన అనందం ఎలాగుందంటూ రిపోర్టర్ ప్రశ్నించగా.. నాలుగు కాదు, ఐదు అంటూ రోహిత్ సమాధనమిచ్చాడు. ఐపీఎల్-2009 ట్రోఫీని గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ నాలుగు ఐపీఎల్ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నాలుగు టైటిళ్లను సొంతం చేసుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. అంతేకాకుండా ఐదు ఐపీఎల్ ఫైనల్స్లో విజయం సాధించిన జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉండి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆదివారం స్థానిక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో సీఎస్కేపై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఐపీఎల్-2019 ట్రోఫీని కైవసం చేసుకుంది. -
సీఎస్కే ఓటమికి కారణమైన వాట్సన్ను రనౌట్
-
చెన్నై ఓటమికి అతడే కారణం..
హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కీలక సమయాలలో బ్యాట్స్మెన్ రనౌట్లు అవడం చెన్నై సూపర్కింగ్స్ కొంపముంచింది. బెస్ట్ ఫినిషర్గా పేరుగాంచిన ఎంఎస్ ధోని(2)ని ఇషాన్ కిషన్ తన సూపర్త్రోతో రనౌట్ చేసి చెన్నై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక చివరి ఓవర్లో మంచి ఊపు మీదున్న షేన్ వాట్సన్(80) రనౌట్ కావడం మ్యాచ్ గతినే తిప్పేసింది. అయితే వాట్సన్ రనౌట్కు జడేజానే కారణం అంటూ సీఎస్కే అభిమానులు ఫైర్ అవుతున్నారు. అవసరంలేకున్నా జడేజా రెండో పరుగు కోసం యత్నించి వాట్సన్ను రనౌట్ చేసి సీఎస్కే ఓటమికి కారణమయ్యాడంటూ మండిపడుతున్నారు. ‘ఏం మనిషివిరా నాయనా.. వాట్సన్ను అట్లా రనౌట్ చేయించినవ్’, ‘చెన్నై ఓటమికి జడేజానే కారణం.. అతడే అపరాధి’, ‘జడేజా అత్యుత్సాహానికి వాట్సన్ బలయ్యాడు’, ‘జడేజానే అపరాధి’ ,అంటూ సీఎస్కే ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మ్యాచ్ అనంతరం ధోని, వాట్సన్లు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. మలింగ వేసిన తొలి బంతికి వాట్సన్ సింగల్ తీయగా.. రెండో బంతికి జడేజా సింగల్ తీసాడు. ఇక మూడో బంతికి వాట్సన్ రెండు పరుగులు చేసాడు. దీంతో 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. అప్పటికే వాట్సన్ జోరుమీదుండడంతో చెన్నై విజయం ఖాయం అనుకున్నారు అందరు. చెన్నై అభిమానులు సంబరాలు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. నాలుగో బంతిని వాట్సన్ డీప్ పాయింట్ వైపు షాట్ ఆడగా.. మొదటి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించిన వాట్సన్ రనౌటయ్యాడు. వాట్సన్ రెండో రన్ కోసం వెళ్లాలా వద్దా అనుకుంటుండగానే.. జడేజా పరుగు కోసం ప్రయత్నించడంతో అతను కూడా వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2పరుగులు తీసిన శార్దూల్.. చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో చెన్నై ఓడింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : సీఎస్కే ఓటమికి కారణమైన వాట్సన్ను రనౌట్ -
చివరి ఓవర్ హర్దిక్కు ఇద్దామనుకున్నా: రోహిత్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ఫైనల్ పోరులో అంతిమ విజయం ముంబే ఇండియన్స్కే దక్కింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. దీంతో ముంబై ఖాతాలో నాలుగో టైటిల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన చెన్నై.. ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది. కాగా మ్యాచ్ అనంతరం ముంబై సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కప్ను నాలుగో సారి ముంబై అందుకోవడం చాలా గర్వంగా, అనందరంగా ఉందన్నాడు. ఫైనల్ మ్యాచ్లో వెటరన్ బౌలర్ మలింగనే చాంపియన్ అంటూ పేర్కొన్నాడు. ‘ముంబై విజయం అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. ఒక ఛాంపియన్ బౌలర్ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. ఈ మ్యాచ్ ఛాంపియన్ అతనే. మలింగ తన మూడో ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దీంతో 20 ఓవర్ హార్దిక్ పాండ్యాతో వేయిద్దాం అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితిల్లో ఎలా బౌలింగ్ చేయాలో మలింగకు బాగా తెలుసు. అందుకే అతనివైపు మొగ్గు చూపాను’ అని రోహిత్ వివరించాడు. -
కోపంతో బ్యాటును గాల్లోకి ఎగరవేసిన పొలార్డ్
-
తీవ్ర ఉత్కంఠ రేపిన దోని రన్నౌట్
-
పెండింగ్లో రన్నౌట్.. నరాలు తెగే ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పలు భావోద్వేగమైన ఘట్టాలకు వేదికగా నిలిచి క్షణక్షణం ఉత్కంఠ రేపింది. ఫలితం కోసం చివరి ఓవర్ చివరి బంతి వరకు కొనసాగిన ఈ ఉత్కంఠభరిత థ్రిల్లర్ మ్యాచ్లో కేవలం ఒకే పరుగు తేడాతో ముంబై గట్టెక్కి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ రన్నౌట్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించడం.. మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్గా పేరొందిన ధోనీ.. లక్ష్య ఛేదనలో జట్టుకు ఎంతో అవసరమైన దశలో.. అతడు రన్నౌట్ అయ్యాడా? లేదా? అన్నది తేల్చే బాధ్యత థర్డ్ అంపైర్పై పడింది. హార్దిక్ పాండ్యా వేసిన 13వ ఓవర్ రెండో బంతిని స్ట్రయికింగ్లో ఉన్న షేన్ వాట్సన్ షార్ట్ ఫైన్లెగ్లో దిశగా తరలించాడు. దీంతో సింగిల్ వచ్చింది. అయితే, అక్కడ ఉన్న లసిత్ మలింగా ఓవర్త్రో విసరడంతో మరొక పరుగు కోసం ఇద్దరు ప్రయత్నించారు. బంతిని వేగంగా అందుకున్న ఇషాన్ కిషన్ బౌలర్స్ ఎండ్ వైపుగా ఉన్న స్టంప్స్కు నేరుగా విసిరాడు. బంతి వికెట్లకు తగలడంతో తీర్పు ఇచ్చే బాధ్యతను గ్రౌండ్ అంపైర్.. థర్డ్ అంపైర్కు అప్పగించారు. థర్డ్ అంపైర్ నిగేల్ లాంజ్ వివిధ కోణాల్లో విశ్లేషణ జరిపేందుకు సమయం తీసుకున్నాడు. ఒక కోణంలో ధోనీ బంతి వికెట్లకు తగలకముందే లైన్ను దాటినట్టు కనిపించింది. మరో కోణంలో మాత్రం లైన్కు కొద్దిగా అటు-ఇటు ఉన్నట్టు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయం పెండింగ్లో ఉన్నంతసేపు మైదానం భావోద్వేగాలతో క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారిపోయింది. ధోనీని ఔట్ అని ప్రకటించడంతో చెన్నై అభిమానులు ఉసూరుమన్నారు. మరోవైపు ధోనీ రన్నౌట్ నిర్ణయంపై వివాదం ముసురుకునే అవకాశం కనిపిస్తోంది. అసలు ధోనీ రన్నౌట్ కాకపోయినా.. లైన్ దాటినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా.. ఔట్ ఇచ్చారని చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సింగిల్స్ తీయడంలో సిద్ధహస్తుడైన ధోనీ రన్నౌట్ కావడమన్నది అత్యంత అరుదు అని చెప్పాలి. ఈ సీజన్లో చివరిసారిగా ముంబై ఇండియన్స్పై మ్యాచ్లోనే ధోనీ రన్నౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2017లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ తరఫున ఆడిన ధోనీ సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఓసారి రన్నౌట్ అయ్యాడు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : తీవ్ర ఉత్కంఠ రేపిన దోని రన్నౌట్ -
ఇది ఫన్నీ ఫైనల్ మ్యాచ్.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తమ జట్టు చేసిన తప్పులే తమకు ఐపీఎల్ ట్రోపీని దూరం చేశాయని చెన్నై సూపర్కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో ఘనవిజయాన్ని సాధించి.. ఐపీఎల్ –2019 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేసినా.. షేన్ వాట్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చినా.. చివరి ఓవర్లో చేసిన తప్పిదాల కారణంగా చెన్నై జట్టు విజయం ముంగిట బోల్తా పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ గురించి ధోనీ వ్యాఖ్యానిస్తూ.. ఇది ఫన్నీ ఫైనల్ మ్యాచ్ అని, మ్యాచ్ ఆసాంతం ఇరుజట్లు పరస్పరం ట్రోఫీని ఇచ్చిపుచ్చుకున్నాయని పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్ ఒకదశలో వరుసగా వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడినా.. కీరన్ పొలార్డ్ వీరోచిత ఇన్నింగ్స్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం చెన్నై జట్టు ధాటిగానే ఆరంభించింది. అయితే, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ వికెట్లు వరుసగా కోల్పోవడం ఆ జట్టును దెబ్బతీసింది. అయితే, వాట్సన్ ధాటిగా ఆడుతూ.. జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. కానీ ఉత్కంఠగా సాగిన ఫైనల్ ఓవర్లో లసిత్ మలింగా మ్యాజిక్తో ముంబైదే పైచేయి అయింది. మ్యాచ్ ప్రజెంటేషన్ వేడుక అనంతరం మాట్లాడిన ధోనీ మ్యాచ్ గమనంపై స్పందిస్తూ.. ‘ఇది చాలా ఫన్నీ గేమ్. మ్యాచ్ ఆసాంతం మేం పరస్పరం ట్రోఫీని చేతులు మార్చుకుంటూ వచ్చాం. ఇరు జట్టు తప్పిదాలు చేశాయి. ఒక తప్పిదం తక్కువ చేయడం వల్ల ప్రత్యర్థి జట్టు విజేతగా అవతరించింది’ అని ధోనీ పేర్కొన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించి ముంబైని 150 కన్నా తక్కువ స్కోరుకు కట్టడి చేశారని, కానీ, బ్యాటింగ్లో తాము అనుకున్నమేరకు రాణించకపోవడంతో పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇప్పుడు తమ ఫోకస్ వరల్డ్కప్ వైపు మళ్లించామని, అయితే, చెన్నై ఓటమికి కారణాలేమిటో సమీక్షిస్తామని చెప్పారు. -
పొలార్డ్కు ఏమైంది.. గాల్లోకి బ్యాట్ విసిరేసి.. నిరసన
సాక్షి, హైదరాబాద్: ఆదివారం 32వ వసంతంలోకి అడుగుపెట్టిన కీరన్ పొలార్డ్ చెన్నైతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ల తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అజేయంగా 41 పరుగులు చేసి.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన పొలార్డ్.. జట్టు విజయంలోనూ కీలకమయ్యాడు. అయితే, చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో వేసిన చివరి ఓవర్లో వరుసగా రెండు బంతులు ట్రామ్లైన్స్ దాటి దూరంగా వెళ్లాయి. మొదటి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్.. రెండో బంతి కూడా దూరంగా వెళ్లడంతో వైడ్గా భావించి వదిలేశాడు. వైడ్గా వెళ్లిన ఈ రెండు బంతులను ఆన్ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్.. లీగల్ బంతులుగానే గుర్తించాడు. క్రీజ్కు దూరంగా బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో పొలార్డ్కు బాగా కోపం వచ్చింది. కోపాన్ని అణచుకోలేకపోయిన పొలార్డ్ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో సన్నద్ధమవుతుండగా.. అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ (ట్రామ్లైన్స్ దగ్గర) నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. పొలార్డ్ వికెట్లకు పూర్తిగా పక్కకు జరగడంతో బౌలింగ్ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. క్రీజ్ నుంచి బయటకు వచ్చి.. .. పోలార్డ్ అసహనం ప్రకటించడంతో బిత్తరపోయిన ఇద్దరు అంపైర్లు అతని వద్దకు వచ్చి సముదాయించారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం పోలార్డ్కు జరిమానా విధించారు. అతడు మ్యాచ్ ఫీజులో 25శాతం జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. అయితే, పోలార్డ్ చేసిన తప్పిదమేమిటో ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ వెల్లడించలేదు. అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి ప్రకటించినందుకే అతనికి ఈ శిక్ష విధించినట్టు తెలుస్తోంది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : కోపంతో బ్యాటును గాల్లోకి ఎగరవేసిన పొలార్డ్ -
ముంబైదే ఐపీఎల్ టైటిల్
-
కప్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
-
థ్రిల్లింగ్ ఫైనల్లో ముంబై విండియన్స్
ఒక్క పరుగు... ఒక్క పరుగు... ముంబై ఇండియన్స్ ఇకపై ఉచ్ఛరించే మంత్రమిది... రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప స్కోరును నమోదు చేసి ఒక్క పరుగుతో చాంపియన్గా నిలిచిన రోహిత్ సేన ఇప్పుడు మళ్లీ అదే అద్భుతాన్ని చేసి చూపించింది. బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై... చెత్త ఫీల్డింగ్, క్యాచ్లు, రనౌట్లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది. చార్మినార్ కోటలో ‘చార్ మార్’ చేస్తూ నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. అనూహ్య పరిణామాలతో, మలుపులతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తుది పోరులో ముంబై విజయజెండా ఎగరవేసింది. మ్యాచ్లో ఎక్కువ భాగం పట్టు కొనసాగించిన ధోని వ్యూహానికే ఇక టైటిల్ ఖాయమనిపించగా... రోహిత్ చివరి ఓవర్ ప్లాన్ అద్భుతంగా పని చేసింది. సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ ఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్గా నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. వాట్సన్ మినహా... సింగిల్ తీయడంలో తడబాటు... త్రుటిలో తప్పించుకున్న రనౌట్... ఇలా చెన్నై తొలి మూడు ఓవర్ల ఇన్నింగ్స్ గందరగోళంగా సాగింది. ఆ తర్వాత కృనాల్ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన డు ప్లెసిస్ (13 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మలింగ ఓవర్లో వాట్సన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ ఇచ్చిన క్యాచ్ను మలింగ వదిలేయడంతో చెన్నైకి లైఫ్ లభించింది. అతి కష్టమ్మీద పరుగులు తీస్తూ, అప్పటికే అంపైర్ రివ్యూలో ఒకసారి బతికిపోయిన రైనా (8) ఈసారి నిలవలేకపోయాడు. రాహుల్ చహర్ బౌలింగ్లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. ఇప్పుడు రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. రాయుడు (1) తన వైఫల్యం కొనసాగిస్తూ బుమ్రా బౌన్సర్కు ఔటయ్యాడు. వరుసగా వికెట్లు పోతుండగా, మరో ఎండ్లో నిలిచిన వాట్సన్లో కూడా జోరు తగ్గింది. మళ్లీ జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ధోని (2) పైనే పడింది. అయితే అతను అనూహ్యంగా రనౌట్ అయిన్పటికీ, ఆ తర్వాత వాట్సన్ జోరుతో చెన్నై గెలుపునకు చేరువగా రాగలిగింది. ధోని రనౌట్తో... ఫామ్లో ఉన్న కెప్టెన్ ధోని కీలక సమయంలో రనౌట్ కావడం చెన్నై శిబిరాన్ని ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. హార్దిక్ బౌలింగ్లో వాట్సన్ ఫైన్లెగ్ వైపు ఆడగా సింగిల్ వచ్చింది. బంతిని ఆపి మలింగ విసిరిన త్రో నాన్ స్ట్రయికింగ్ ఎండ్కు దూరంగా వెళుతుండటంతో ధోని రెండో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లపైకి కొట్టాడు. బంతి స్టంప్స్కు తగిలే సమయంలో బ్యాట్ క్రీజ్ గీతపైనే ఉంది. నిజానికి ధోని తనే ఔట్గా భావించి ముందే నడవటం మొదలు పెట్టినా ఫీల్డ్ అంపైర్లు అతడిని ఆపారు. సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసిన అనంతరం చివరకు అంపైర్ నైజేల్ లాంజ్ ధోనిని ఔట్గా ప్రకటించాడు. ఈ వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. చివరి 5 ఓవర్లలో... ధోని వికెట్ పడ్డాక వాట్సన్తో పాటు పెద్దగా ఫామ్లో లేని బ్రేవో క్రీజ్లో ఉన్నాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి చెన్నైకి కష్టంగానే కనిపిస్తోంది. అయితే 16వ ఓవర్లో మళ్లీ ఆట మారిపోయింది. మలింగ వేసిన ఈ ఓవర్లో బ్రేవో సిక్స్ బాదగా, వాట్సన్ 3 ఫోర్లు కొట్టాడు. దాంతో 20 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు అద్భుత బౌలింగ్తో ప్రశంసలు అందుకున్న రాహుల్ చహర్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్ను వదిలేసి ప్రత్యర్థికి మరో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 6, 6 బాది వాట్సన్ చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ చెన్నై వైపు తిరిగింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్ కింగ్స్ మొహం చాటేసింది. రోహిత్ విఫలం... ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత పొలార్డ్ మినహా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో జోష్ కనిపించలేదు. జట్టు ఇన్నింగ్స్లో మొత్తం 9 ఫోర్లే ఉన్నాయి. ఇన్నింగ్స్ తొలి రెండు ఓవర్లలో ఒక సిక్సర్ సహా ముంబై పది పరుగులే చేసింది. అనంతరం డి కాక్ దూకుడైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. దీపక్ చహర్ వేసిన మూడో ఓవర్లో డి కాక్ మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత శార్దుల్ బౌలింగ్లోనూ అతను మరో సిక్స్ బాదాడు. అయితే తర్వాతి బంతికే డి కాక్ను ఔట్ చేసి శార్దుల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పవర్ప్లే చివరి ఓవర్ చెన్నైకి మరింతగా కలిసొచ్చింది. అంతకుముందు ఓవర్లో భారీగా పరుగులిచ్చినా దీపక్ చహర్తో మళ్లీ బౌలింగ్ వేయించిన ధోని వ్యూహం పని చేసింది. చక్కటి బంతిని డ్రైవ్ చేయబోయి కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్ మెయిడిన్గా కూడా ముగిసింది. క్వాలిఫయర్ హీరో సూర్య కుమార్ (17 బంతుల్లో 15; ఫోర్) తడబడుతూ ఆడగా, కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 7) విఫలమయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు) కొద్దిగా నిలిచినా వేగంగా ఆడలేకపోవడంతో రన్రేట్ బాగా తగ్గింది. పొలార్డ్ మెరుపులు... ఆదివారం ఫైనల్ రోజునే పుట్టిన రోజు జరుపుకున్న పొలార్డ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గతంలో చెన్నైపై మూడు ఫైనల్స్లో కలిపి 60 బంతుల్లో 123 పరుగులు చేసిన రికార్డు ఉన్న అతను మరోసారి ఆకట్టుకున్నాడు. తాహిర్ వరుస ఓవర్లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. మరోవైపు 4 పరుగుల వద్ద రైనా క్యాచ్ వదిలేసినా హార్దిక్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) దానిని పెద్దగా వాడుకోలేకపోయాడు. దీపక్ చహర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన హార్దిక్ రివ్యూకు వెళ్లినా లాభం లేకపోయింది. బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ ఆట ముగించాడు. పొలార్డ్ నిరసన... ఐపీఎల్లో గతంలో ఒకసారి తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో నోటికి ప్లాస్టర్ వేసుకొని మైదానంలోకి దిగిన పొలార్డ్ మరోసారి తనదైన తరహాలో నిరసన తెలిపాడు. బ్రేవో వేసిన చివరి ఓవర్ మూడో బంతి క్రీజ్కు దూరంగా వెళుతుండటంతో అతను వైడ్గా భావించి వదిలేశాడు. అయితే అంపైర్ నితిన్ మీనన్ మాత్రం వైడ్ ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించిన పొలార్డ్ తర్వాతి బంతికి వికెట్లకు పూర్తిగా పక్కకు జరిగి, అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ (ట్రామ్లైన్స్) నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. దాంతో బౌలింగ్ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. చివరకు అంపైర్ గౌల్డ్, మీనన్ కలిసి సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు. లాంజ్ను పక్కన పెట్టారు... ఐపీఎల్ మ్యాచ్లో కోహ్లితో వాదన తర్వాత గది అద్దాలపై తన ప్రతాపం చూపించిన అంపైర్ నైజేల్ లాంజ్పై ఎలాంటి చర్య ఉండదని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. పైగా ఈ సీజన్లో భారత అంపైర్ల ప్రమాణాలు సరిగ్గా లేవని, లాంజ్ అత్యుత్తమ అంపైర్లలో ఒకడని కితాబు కూడా ఇచ్చింది. ఫైనల్కు నాలుగు రోజుల ముందు ప్రకటించిన ఫీల్డ్ అంపైర్ల జాబితాలో నైజేల్ లాంజ్ పేరు ఉంది. తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్లాంటి కీలక మ్యాచ్కు అలాంటి అంపైర్ అవసరం ఉందని కూడా బోర్డు ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో, లేక ఎవరినుంచైనా అభ్యంతరం వచ్చిందో తెలీదు కానీ అతడిని ఫీల్డ్ అంపైరింగ్ నుంచి పక్కన పెట్టారు. చివరకు థర్డ్ అంపైర్ స్థానానికి పరిమితం చేశారు. అతని స్థానంలో వచ్చిన నితిన్ మీనన్ బోర్డు భయపడినట్లు పేలవ అంపైరింగ్ చేశాడు. పొలార్డ్కు వైడ్ నిరాకరించడం అందులో ఒకటి. ►1 ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ విజయాల్లో పాలుపంచుకున్న ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. 2009 చాంపియన్ డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉండగా... 2013, 2015, 2017, 2019లలో ముంబై జట్టుకు రోహిత్ సారథ్యం వహించాడు. ►4 ముంబై జట్టు నెగ్గిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్లో (2013, 2015, 2017, 2019) తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం. ►4 ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం విశేషం. 2010లో చెన్నై 22 పరుగుల తేడాతో... 2013లో ముంబై 23 పరుగుల తేడాతో... 2015లో ముంబై 41 పరుగుల తేడాతో... 2019లో ముంబై ఒక పరుగు తేడాతో గెలిచాయి. ఐపీఎల్ అవార్డులు ►ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్) డేవిడ్ వార్నర్ (హైదరాబాద్) 692 పరుగులు ప్రైజ్మనీ రూ.10లక్షలు, ట్రోఫీ ►పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) ఇమ్రాన్ తాహిర్ (చెన్నై) 26 వికెట్లు ప్రైజ్మనీ రూ.10లక్షలు, ట్రోఫీ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు: ►పంజాబ్, హైదరాబాద్ ప్రైజ్మనీ: రూ. 25 లక్షలు చొప్పున ►పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ, ►సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ ఆండ్రీ రసెల్ (కోల్కతా నైట్రైడర్స్) ట్రోఫీ, టాటా మోటార్స్ హారియర్ ఎస్యువీ కారు ►స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ లోకేశ్ రాహుల్ (పంజాబ్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ ►డ్రీమ్–11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు రాహుల్ చహర్ (ముంబై ఇండియన్స్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ ►ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు శుబ్మన్ గిల్ (కోల్కతా నైట్రైడర్స్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ►ఫెయిర్ ప్లే అవార్డు సన్రైజర్స్ హైదరాబాద్ ►మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ (కోల్కతా) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ -
ఐపీఎల్ ఫైనల్: సీఎస్కే టార్గెట్ 150
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-12లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన రోహిత్, డీకాక్లు చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వరుస ఓవర్లలో డీకాక్(29), రోహిత్(15)లు ఔటయ్యారు. అనంతరం వచ్చిన సూర్యకుమార్(15), కృనాల్(7)లు తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులో నిలదొక్కుకపోయిన ఇషాన్ కిషన్(23)కూడా ఔటయ్యాడు. దీంతో ముంబైని ఆదుకునే బాధ్యత పొలార్డ్, హార్దిక్లు తీసుకున్నారు. పోలార్డ్ మెరుపులు కీలక మ్యాచ్లో కీరన్ పొలార్డ్ రాణించాడు. సీఎస్కే ముందు భారీ స్కోర్ ఉంచాలాంటే తప్పకుండా ఆడాల్సిన సమయంలో పొలార్డ్ తన వంతు బాధ్యత నిర్వర్తించాడు. అయితే హార్దిక్కు పక్కా స్కెచ్ వేసిన ధోని.. అతడు పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్(16)ను దీపక్ చహర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే పొలార్డ్(41 నాటౌట్; 25 బంతుల్లో; 3ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో దీపక్ చహర్ మూడు వికెట్లు తీయగా.. శార్దూల్, తాహీర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముంబైని చివరి ఓవర్లలో కట్టడిచేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఒకింత సక్సెస్ అయ్యారు. -
ముంబైకి ఎదురుదెబ్బ.. రోహిత్ ఔట్
-
ఐపీఎల్ క్రేజ్.. బుకీల అరెస్టు
-
కొట్టేదెవరు?
-
ఐపీఎల్ ఫైనల్: టాస్ గెలిచిన ముంబై
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2019 ఫైనల్ మ్యాచ్లో టాస్ వేశారు. చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న ఈ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఒక మార్పు చేసింది. స్పిన్నర్ జయంత్ యాదవ్ను పక్కకుపెట్టిన ముంబై మిచెల మెక్లీన్గాన్కు అవకాశం కల్పించింది. ఫైనల్ పోరుకు సీఎస్కే ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. అయితే టాస్ అనంతరం ధోని మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచినా ముందు బౌలింగే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. దీంతో మ్యాచ్పై మరింత ఉత్కంఠ రేపుతోంది. తుదిజట్లు: ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండా, పొలార్డ్, మిచెల్ మెక్లీన్గాన్, రాహుల్ చహర్, బుమ్రా, మలింగ సీఎస్కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), డుప్లెసిస్, వాట్సన్, రైనా, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, డ్వేన్ బ్రేవో, దీపక్ చహర్, హర్భజన్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్ -
ముంబైదే ఐపీఎల్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2019 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే చెరో మూడు సార్లు ఐపీఎల్ టోర్నీ గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ జట్లు మరోసారి కప్ను కైవసం చేసుకునేందుకు తలపడుతున్నాయి. మ్యాచ్ ఫలితాన్ని అమాంతం మార్చేసే బ్యాట్స్మెన్, ప్రత్యర్థిని కట్టిపడేసే బౌలర్లు, మెరుపు విన్యాసాల ఫీల్డర్లతో ఢీ అంటే ఢీ అనేలా ఇరుజట్లు ఉన్నాయి. అయితే సీఎస్కేపై లీగ్ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్లో ఓసారి మొత్తం మూడు విజయాలతో గణాంకాల్లో ఈసారి ముంబైదే పై చేయి. మరి... ఇదే ఊపులో కెప్టెన్ రోహిత్ శర్మ బృందం కప్ను ఎగరేసుకుపోతుందో? ఈ పరాజయాలకు ‘మిస్టర్ కూల్’ ధోని జట్టు ఘనంగా ప్రతీకారం తీర్చుకుంటుందో? చూడాలి. మ్యాచ్ లైవ్ అప్డేట్స్ ఇవి.. -
హర్భజన్ అసంతృప్తి.. ఫ్యాన్స్ అనుమానాలు
హైదరాబాద్: చెన్నై సూపర్కింగ్స్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్థానిక ఐటీసీ కాకతీయ హోటల్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హోటల్ వాళ్లు అందించిన ఆహారం, రూమ్ సర్వీస్ అస్సలు బాగోలేదంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో దిగింది. అయితే సీఎస్కే బస చేస్తున్న ఐటీసీ హోటల్ సిబ్బంది తీరుపై హర్భజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమను పట్టించుకునే సమయం కూడా హోటల్ సిబ్బందికి లేదని ఎద్దేవా చేశాడు. హర్భజన్ ట్వీట్పై స్పందించిన ఐటీసీ క్షమాపణలు చెప్పింది. వీలైనంత త్వరగా మెరుగైన సేవలు అందిస్తామని ట్వీట్లో పేర్కొంది. అయితే ప్రస్తుతం హర్భజన్ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. హర్భజన్ను మానసికంగా దెబ్బతీయాలనే ముంబై ఇండియన్సే కుట్ర చేసిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఫుడ్ బాగోలేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోకుండా ఈ రచ్చ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆన్లైన్లో ప్యారడైజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొమ్మని సలహాలు ఇస్తున్నారు. -
ఐపీఎల్ క్రేజ్.. బుకీల అరెస్టు
సాక్షి, గుంటూరు: ఐపీఎల్కు ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అందులోనూ ఫైనల్ మ్యాచ్ అంటే అటు క్రీడాభిమానులకు పండగే పండగ. వాళ్లతో పాటు బుకీలు కూడా అంతే సంబరాలు చేసుకుంటారు. వందల కోట్ల రూపాయల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై పందేలను బుకీలు నిర్వహిస్తుండటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇద్దరు బూకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతాకు చెందిన అభీర్ చంద్, శ్యాంఘోష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు లక్షల నగదు, రెండు ల్యాప్టాప్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఐపీఎల్-12 విజేత ఎవరో చెప్పిన జ్యోతిష్కుడు
హైదరాబాద్ : ఇండియన్ ప్రిమియర్ లీగ్ సీజన్ 12 తుది దశకు చేరుకుంది. నేడు స్థానిక రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టైటిల్ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్లో విజేతగా ఎవరు నిలుస్తారో ప్రముఖ జ్యోతిష్కుడు గ్రీన్స్టోన్ లోబో అంచనావేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫలితం 2013,2015 సీజన్ల మాదిరిగానే రానుందని తెలిపారు. ఆ సీజన్లలో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టే ఈ సారి చాంపియన్గా అవతరించే అవకాశాలున్నాయని ఆ జ్యోతిష్కుడు అంచనా వేశారు. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్కే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, దీంతో కప్ ముంబై జట్టే ఎగరేసుకపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఐపీఎల్ ప్రారంభంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కూడా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉండటం ఖాయమని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఫిఫా ప్రపంచకప్ 2018 విజేత విషయంలోనూ ఈ జ్యోతిష్కుడి అంచనాలు బాగానే పనిచేశాయి. దీంతో ఈ సారి కప్ తమదేనని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే అభిమానులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. దీంతో జ్యోతిష్కుడు చెప్పినట్లు ముంబై గెలుస్తుందా లేక అతడి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్కే గెలుస్తుందా అనేది వేచి చూడాలి. -
జోరుగా బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలు
-
బ్లాక్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తుది సమరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ను వీక్షించాలని భావించిన వేలాది మంది నగరవాసులకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే సామాన్యునికి అందుబాటులో ఉండగా అవి కూడా వారికి లభించలేదనే తెలుస్తోంది. అయితే మరోవైపు కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ మ్యాచ్ టికెట్లను ముందుగానే బ్లాక్ చేశారు. స్టేడియం చుట్టు నంబర్ ప్లేట్లు లేని బైక్లపై చక్కర్లు కొడుతు జోరుగా బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్నారు. వెయ్యి రూపాయల టికెట్ను ఐదు వేలకు, రెండు వేల టికెట్ను పదివేలకు అమ్ముతున్నారు. అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ ముఠా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తెలస్తోంది. టికెట్లు బ్లాక్లో దర్శనమివ్వడంతో మ్యాచ్ నిర్వాహకుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో లభించాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లడంపై నగరంలోని కిక్రెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్లో టికెట్ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను చెన్నై, ముంబై జట్ల యాజమాన్యాలు తీసుకున్నాయి. మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
చెన్నై చెడుగుడు ఆడుకుంటుందా? ముంబై మెరిపిస్తుందా?
-
రాజధానికి ఐపీఎల్ ఫీవర్
సాక్షి హైదరాబాద్: రాజధానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ తుది మ్యాచ్ను వీక్షించేందుకు టిక్కెట్ల కోసం ప్రయత్నించిన వేలాది మంది హైదరాబాదీలకు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి ఇక్కడ ఫైనల్ పోరు సాగనుంది. తమ జట్లు ఫైనల్ చేరే అవకాశాన్ని ముందే ఊహించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్ జట్టు యాజమాన్యాలు ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 90 శాతం టికెట్లు బ్లాక్ చేశాయి. ముందుగా అనుకున్నట్లు ఈ జట్లు ఫైనల్కు రావడంతో ఈ రెండు జట్ల యాజమాన్యాలు తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారితో స్టేడియాన్ని నింపుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను చెన్నై, ముంబై జట్ల యాజమాన్యాలు తీసుకున్నాయి. మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ చాలా వరకూ తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. కొద్దిమంది హైదరాబాదీలు మాత్రమే ఈ మ్యాచ్ చూసేందుకు అతి కష్టం మీద టికెట్లు సంపాదించుకున్నారు. దీంతో ఈ మ్యాచ్ చూడాలని ఆశపడ్డ వేలాది మంది స్థానిక క్రికెట్ ప్రియులకు తిలకించే అవకాశం లేకుండా పోయింది. నేడు జరగనున్న ఫైనల్ పోరు చూసేందుకు మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన దాదాపు 25 వేల మంది శనివారం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకున్నారు. రాజధానిలోని 3, 4, 5 నక్షత్రాల హోటళ్లు పూర్తిగా వీరితో నిండిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఎగ్జిక్యూటివ్లు 5 వేల మంది ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు హైదరాబాద్లో హోటళ్లను బుక్ చేశారు. టికెట్ల కోసం వీవీఐపీల ఒత్తిడి... ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నాటి ఫైనల్ పోరు తిలకించేందుకు పాసుల కోసం ప్రయ త్నించిన వీవీఐపీలకు చుక్కెదురైంది. ముంబై ఫైనల్కు రావడంతో పరిస్థితులు మారిపోయాయని, అన్ని బాక్స్లు దాదాపుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బుక్ చేసుకుందని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు టికెట్ల కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. చివరకు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారులకు కూడా వీవీఐపీ పాసులు లభించలేదు. ఐపీఎల్ నిర్వాహకులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు కొద్ది పాసులే ఇవ్వడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీట్లు బ్లాక్.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంది. వీటిలో 35 వేలకు పైగా సీట్లను ‘చెన్నై, ముంబై’ తీసుకున్నాయి. 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన వారికి ఇచ్చారు. సామాన్యులకు మిగిల్చింది 2 వేల టికెట్లు మాత్రమే. హోటళ్లు ఫుల్.. మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన దాదాపు 25 వేల మంది ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నా రు. రాజధానిలోని 3, 4, 5 నక్షత్రాల హోటళ్లు పూర్తిగా వీరితో నిండిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన 5 వేల మంది ఎగ్జిక్యూటివ్లు మ్యాచ్ను తిలకించనున్నారు. వీవీఐపీలకు నిల్... రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు టికెట్ల కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. చివరకు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారులకు కూడా వీవీఐపీ పాసులు లభించలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు కూడా కొద్ది పాసులే ఇచ్చారు. -
హవ్వ.. కోహ్లికి స్థానం లేదా?
హైదరాబాద్ : టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, కోచ్ అనిల్ కుంబ్లే తన ఉత్తమ ఐపీఎల్-12 జట్టును ప్రకటించాడు. అన్ని జట్లలోంచి తనకు నచ్చిన ఆటగాళ్లతో కూడిన తన కలల జట్టును ప్రకటించాడు. 11 మందితో కూడిన ఆ జట్టులో పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి అవకాశం ఇవ్వలేదు. కోహ్లిని కాదని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయాస్ అయ్యర్కు అవకాశం కల్పించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాడు. వికెట్ కీపర్ బాధ్యతలు కూడా కెప్టెన్ కూల్కే అందించాడు. యువ సంచలనం రిషబ్ పంత్కు కూడా తన జట్టులో చోటిచ్చిన కుంబ్లే.. అతడు మంచి ఫినిషర్గా ఎదుగుతున్నాడని ప్రశంసించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్లు విధ్వంసం సృష్టించారని, వీరిద్దరితో మిడిలార్డర్ బలోపేతంగా ఉంటుందన్నాడు. కెప్టెన్లుగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ధోని తన దృష్టిలో ఉన్నారని, అయితే వీరిందరిలో ధోనీనే సూపర్ అని వ్యాఖ్యానించారు. ఇక కోహ్లిని తీసుకోకపోవడంపై కూడా కుంబ్లే క్లారిటీ ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ కష్టతరమైన ఢిల్లీ పిచ్లపై అవలీలగా పరుగులు సాధించాడని, జట్టు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి బాధ్యతగా ఆడాడని గుర్తుచేశాడు. అందుకే కోహ్లి కన్నా అయ్యర్ బెటర్ ఆప్షన్ అనిపించిందని తెలిపాడు. అయితే దీనిపై కోహ్లి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. హవ్వ.. కోహ్లి లేని ఐపీఎల్ జట్టా అంటూ కామెంట్ చేస్తున్నారు. -
పంత్కు హిందీ నేర్పిస్తున్న జీవా ధోనీ
-
పంత్కు పాఠాలు నేర్పిస్తున్న జీవా
భారత క్రికెట్ మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోనీ గారాల కూతురు జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. క్యూట్ ఎక్స్ప్రెషన్తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా ధోనీ. తాజాగా జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు జీవా హిందీ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. -
ఐపీఎల్ ఫైనల్ టికెట్లపై అనుమానాలు?
హైదరాబాద్: స్థానిక రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న నిర్వాహకులు టికెట్లను హాంఫట్ అనేశారు. సాధారణంగా మ్యాచ్ టిక్కెట్ల గురించి పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా అభిమానులకు సమాచారం అందించడం ఆనవాయితీ. కానీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆ ఆనవాయితీని నిర్వాహకులు పక్కకు పెట్టారు. ప్లేఆఫ్ మ్యాచ్ల టిక్కెట్లను పద్దతి ప్రకారమే అందుబాటులో పెట్టిన నిర్వాహకులు.. ఫైనల్ మ్యాచ్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుండానే టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఫైనల్ మ్యాచ్ టికెట్లను ఈవెంట్స్ .కామ్ సంస్థ ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన ఆ సంస్థ రెండు నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైనట్లు చూపించింది. అయితే వెబ్సైట్లో కేవలం ఎక్కువ ధరల టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారని కామన్ టికెట్ల సంగతేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు....? ఎన్ని అమ్ముడయ్యాయి...? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు....? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయంపై ఈవెంట్స్నౌ ప్రతినిధిలు నోరు మెదుపటం లేదు. ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఈ వివాదంపై స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ఆదరణ దృష్ట్యా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐతే ఈవెంట్స్నౌ.కామ్ గానీ.. హెచ్సీఏ గానీ మొదట్నుంచీ టిక్కెట్ల అమ్మకంపై గుట్టుగానే ఉన్నాయి. ఎవరికీ కనీస సమాచారం అందించలేదు. రోజువారీ టిక్కెట్ల అమ్మకాల గురించి బీసీసీఐ, హెచ్సీఏలకు సమాచారం ఇవ్వాలి. ఈవెంట్స్నౌ సంస్థ ఆ పని చేసిందో లేదో తెలియదు. కొన్ని నిమిషాల వ్యవధిలో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని హెచ్సీఏ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
ఇలా అయితే.. ఫైనల్ మ్యాచ్ చూసేదెలా?
హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ చూడాలని ఉత్సాహంగా వచ్చే అభిమానులకు టికెట్ల గోల్మాల్ ఇబ్బందులుగా మారింది. ఎలాగైనా ఫైనల్ మ్యాచ్ చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేటు గాళ్లు బ్లాక్ టికెట్ల దందాను బహిరంగంగా మొదలెట్టేశారు. ఇక వెబ్సైట్లలో ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండానే కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే టికెట్లను అందుబాటులో ఉంచారు. అనంతరం సర్వర్ డౌన్ అయిందని బుకాయించిన నిర్వాహకులు.. వెంటనే సోల్డ్ ఔట్ అని పెట్టేశారు. ఇక ఆ కొద్ది నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు జింఖానా గ్రౌండ్స్కు వచ్చి టికెట్లు తీసుకోవడానికి దాదాపు ఐదు గంటలకు పైగా క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు. ఇక అన్ని సైట్లలలో టికెట్స్ సోల్డ్ ఔట్ దర్శనమిస్తున్నప్పటికీ బ్లాక్లో మాత్రం టికెట్ల దందా జోరుగా సాగుతోంది. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియం చుట్టూ క్రికెట్ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతున్నారు. స్టేడియం వెలుపల రూ. 2 వేల టికెట్లను బ్లాక్లో రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు అమ్ముతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. దాదాపు 36 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో దాదాపు 15వేల టికెట్ల వరకు స్పాన్సర్లు, బీసీసీఐ, ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు కేటాయిస్తారు. అయితే మిగిలిన 21వేల టికెట్ల అమ్మకంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) పారదర్శకత పాటించడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో కూడా కామన్ టికెట్లనే బ్లాక్ చేశారని.. ఎక్కువ ధర టికెట్లను మాత్రమే అమ్మారని.. ప్రస్తుతం అవి కూడా దొరకని పరిస్థితికి అధికారులు తీసుకొచ్చారని ఫ్యాన్స్ వాపోయారు. అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని హెచ్సీఏ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగ రేపు ఐపీఎల్ ఫైనల్లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో మాజా చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. -
ఐపీఎల్లో నాలుగో బౌలర్గా
-
ఐపీఎల్ ఫైనల్ టికెట్ల అమ్మకంలో మాయాజాలం
-
ఐపీఎల్ ఫైనల్.. సీపీ కీలక ప్రెస్మీట్
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్కింగ్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బందోబస్తు విషయమై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం లోపల, పరిసరాల్లో 300 కెమెరాలు ఏర్పాటు చేసి.. నిత్యం పర్యవేక్షిస్తామని, ఇందుకోసంస్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,850 మంది పోలీసులతో మ్యాచ్కు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రేక్షకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారని తెలిపారు. స్టేడియం, పిచ్ అంత ఇప్పటికే తనిఖీ చేశామని, నిషేధిత వస్తువులను ఎవ్వరూ మైదానంలోకి తీసుకుసరావొద్దని సూచించారు. హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, లాప్టాప్, మద్యం, తినే ఆహార పదార్థాలతోపాటు బయటినుంచి తీసుకొచ్చే వాటర్ బాటిళ్లను సైతం లోపలికి అనుమతించమని వెల్లడించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, అన్ని ప్రవేశద్వారాల వద్ద చెకింగ్ పాయింట్స్ ఉంటాయని తెలిపారు. -
మ్యాచ్లో అనూహ్యం.. పంత్ షూలేస్ ఊడటంతో!
మైదానంలో వారిద్దరు ప్రత్యర్థులైనా.. మైదానం ఆవల వారిద్దరూ మంచి స్నేహితులు. అందుకే అతను ప్రత్యర్థి ఆటగాడు అయినా.. ఆడుతున్నది కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్ అయినా.. అదేమీ పట్టించుకోకుండా రిషభ్ పంత్ షూస్ లేస్ ఉడిపోగానే.. వెంటనే సురేశ్ రైనా పరిగెత్తుకెళ్లి లేస్ కట్టాడు. వైజాగ్లో శుక్రవారం జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఈ అరుదైన క్రీడాస్ఫూర్తికి వేదికగా నిలిచింది. ఈ ఐపీఎల్ సీజన్లో దాదాపు అన్ని జట్లకు యువ క్రికెటర్ రిషభ్ పంత్ కొరకరానికొయ్యగా మిగిలాడు. బ్యాటింగ్లో అదరగొడుతున్న ఈ యంగ్స్టర్ చెన్నైతో మ్యాచ్లోనూ ఒంటరిపోరాటం చేసే ప్రయత్నం చేశాడు. చెన్నై బౌలర్లు ఢిల్లీ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతూ.. వరుసగా పెవిలియన్కు తరలిస్తున్న క్రమంలో రిషభ్ పంత్ షూలేస్ ఊడిపోయాయి. క్రీజ్కు సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న రైనా ఇది గమనించి.. వెంటనే వచ్చి పంత్ షూ లేస్ కట్టాడు. ఇది క్రీడాభిమానులు మనస్సు దోచుకుంటోంది. పలువురు పంత్-రైనా మధ్య ఉన్న బాండింగ్ను మెచ్చుకుంటున్నారు. గత మ్యాచ్లో క్రీజ్లోకి వస్తున్న రైనాకు అడ్డుగా నిలబడి.. సరదాగా పంత్ ఆటపట్టించిన సంగతి తెలిసిందే. -
మంచి పాఠం నేర్చుకున్నాం : శ్రేయస్
ఐపీఎల్ సీజన్12లో భాగంగా జరిగిన క్వాలిఫయర్ 2లో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్పై ఆరు వికెట్లతో విజయం సాధించి ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. తద్వారా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ధోనీ సేన ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ కుర్ర కెప్టెన్ శ్రేయస్ ఢిల్లీ జట్టును నడిపించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీజన్లో కొత్త జెర్సీ.. జట్టు పేరు మార్పుతో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ కనీసం మూడో స్థానంలోనైనా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ దశకు చేరి ఎలిమినేటర్లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ రానున్న సీజన్లలో మరింత మెరుగ్గా రాణించి ఐపీఎల్ కప్ సాధిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐపీఎల్ 11 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 12వ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్గా బరిలోకి దిగిన జట్టును మూడో స్థానంలో నిలపడం ద్వారా తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని శ్రేయస్ నిలబెట్టుకున్నాడనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్లో ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపాడు. గర్వంగా ఉంది.. ‘ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా గర్విస్తున్నా. మాపై ఒత్తిడి ఉంటుందన్న మాట నిజం. అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయాం. వపర్ప్లేలో చెన్నై స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కఠినంగా మారింది. వికెట్ అనుకూలిస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్ రాణిస్తారనుకున్నా. కానీ అలా జరుగలేదు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. మాకు ఇదొక మంచి గుణపాఠం. అయినప్పటికీ నా టీమ్ ప్రదర్శన పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. నిజానికి ఈ సీజన్ మా కలను కాస్తైనా నెరవేర్చింది. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై రానున్న సీజన్లో మరింత మెరుగ్గా రాణిస్తాం. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు’ అని అయ్యర్ పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో..‘ టాస్ వేసే సమయాల్లో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి మేటి కెప్టెన్ల పక్కన నిలబడటం అదృష్టంగా భావిస్తున్నా. వారు జట్లను నడిపించిన తీరు చూసి.. కెప్టెన్గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అంటూ ఈ యువ కెప్టెన్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి : ఎనిమిదోస్సారి కాగా విశాఖ వేదికగా జరిగిన క్యాలిఫైయర్ 2 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కొలిన్ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్ చహర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్కు వీరిద్దరు 62 బంతుల్లో 81 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. -
మ్యాచ్లో అనూహ్యం.. పంత్ షూలేస్ ఊడటంతో!
-
చెన్నై చెడుగుడు
విశాఖ స్పోర్ట్స్ :అనుకోని వరంతో పరవశించిన విశాఖ ఆనందోత్సాహాల తరంగమే అయింది. మండే ఎండాకాలంలో మురిపించిన విరివానలా వచ్చిన ఐపీఎల్ సంరంభం పులకింపజేస్తే.. ఆ జల్లుల్లో నిలువెల్లా తడిసి తన్మయంతో ఆడిపాడింది. టోర్నీమెంట్ రెండో క్వాలిఫయర్లో ఎదురులేని చెన్నై ఎక్స్ప్రెస్ను నిండు గుండెతో స్వాగతించింది. ధోనీ అంటే తరగని మక్కువ గల వైజాగ్ క్రీడాభిమాన గణం ఆ అభిమానం ఏ సందర్భంలోనైనా తరగని గని వంటిదని నిరూపించింది. ప్రేక్షకాదరణను దండిగా పొందిన ధోనీ సేన ఆడుతూ పాడుతూ ఐపీఎల్ ఫైనల్కు చేరిన తరుణాన్ని విశాఖ ఓ పండగలా ఎంజాయ్ చేసింది. ఎలిమినేటర్లో మాదిరిగా వైఎస్సార్ స్టేడియంలో ఉత్సాహం, ఉల్లాసం జతకట్టి కేరింతలు కొడితే.. ఆటలో ఆనందాన్ని మించి ఐపీఎల్ మజాను విశాఖ ఆస్వాదించింది. బుధవారం నాటి మ్యాచ్లో దూసుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్వాలిఫయిర్లో తేలిపోవడంతో.. సెమీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్ ఏకపక్షమే అయింది. చెన్నై సింహం జూలు విదిల్చి మ్యాచ్ను ఎగరేసుకుపోయిన వైనాన్ని పక్కన పెడితే.. శుక్రవారం రాత్రి సందడిగా సాగింది. నెరవేరని ఆశతో ఢిల్లీ నిరాశ పడినా.. సముచితమైన జట్టే తుదిపోరుకు తరలుతోందన్న సంతృప్తితో విశాఖ వీరాభిమానుల దండు ఇళ్లకు మరలింది. కీలకమైన ప్లే ఆఫ్ను అద్భుతంగా నిర్వహించి విశాఖ అందరి హృదయాలనూ చూరగొంది. ముఖ్యంగా సీఎస్కే సారథి ధోనీ మనసును మరోసారి సాగర నగరి గెలుచుకుంది. -
వారి వల్లే మేం ఫైనల్కు వచ్చాం: ధోనీ
వైజాగ్ : ఎంఎస్ ధోనీ మరోసారి తానేంటో నిరూపించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డ్యాడ్స్ ఆర్మీగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరోసారి ఫైనల్కు చేర్చాడు. వైజాగ్లో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ఆరు వికెట్లతో సునాయస విజయాన్ని అందుకోవడం ద్వారా చెన్నై జట్టు ఎనిమిదిసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ధోనీ సేన.. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ను నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లకు 147 పరుగులకు పరిమితం చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. డు ప్లెసిస్, షేన్ వాట్సన్ అర్ధ సెంచరీలతో రాణించడంతో అలవోకగా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. ఈ సీజన్లో చెన్నై జట్టు మంచి ప్రదర్శనకు, ఫైనల్కు చేరడానికి బౌలర్లే కారణమని ప్రశంసల జల్లు కురిపించారు. ‘వికెట్లు పడగొట్టడమే మ్యాచ్లో అత్యంత కీలకం. కాబట్టి బౌలర్లకే క్రెడిట్ ఇవ్వాల్సిందే. తనకు ఏం కావాలన్నది కెప్టెన్ అడుగుతాడు. దానిని బట్టి బౌలర్లు ఎలా బౌలింగ్చేయాలి, ఎలా వికెట్లు తీయాలి అన్నది నిర్ణయించుకుంటారు. ఈ సీజన్లో మేం ఇక్కడ ఉన్నామంటే అందుకే బౌలర్లే కారణం. మా బౌలింగ్ డిపార్ట్మెంట్కు థాంక్స్ చెప్తున్నా’ అని ధోనీ వివరించారు. ఐపీఎల్ 12వ సీజన్లో ఫైనల్కు చేరుకున్న చెన్నై జట్టు ఆదివారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ‘గత ఏడాది కన్నా భిన్నంగా ఈ సారి ఐపీఎల్ ఫైనల్కు వచ్చాం. గత మ్యాచ్లో పరుగుల విషయంలో, క్యాచ్ల విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ గట్టిగా కమ్బ్యాక్ ఇచ్చాం. 140కిపైగా పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించడం ఆనందంగా ఉంది. మా బౌలర్ల కృషి కూడా చాలా బావుంది. ఢిల్లీని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగాం. వాళ్ల బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఓపెనర్లను త్వరగా ఔట్ చేయడం చాలా ముఖ్యంగా భావించాం. ఢిల్లీలో లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు. వారిని కట్టడి చేసేందుకు మా దగ్గర ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను వాడాం. మైదానం చిన్నగా ఉండటంతో త్వరగా వికెట్లు రాబట్టడం కీలకంగా భావించాం’ అని ధోనీ తెలిపారు. -
ఫైనల్ చేరిన చెన్నై సూపర్కింగ్స్
-
ఫైనల్ చేరిన ధోని బృందం
-
ఎన్నిమిదోస్సారి
అనుభవం ముందు యువతరం తలవంచింది. సీనియర్ నాయకుడి వ్యూహాలకు కుర్ర కెప్టెన్ ప్రణాళికలు సరిపోలేదు. ధోని నేతృత్వంలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో మళ్లీ తన ముద్రను చూపించింది. ఏకంగా ఎనిమిదోసారి ఫైనల్కు చేరి తమ సత్తా ఏమిటో ప్రదర్శించింది. ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ దశకు చేరి ఎలిమినేటర్లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన మూడో స్థానానికే పరిమితమైంది. ముందుగా చెన్నై స్పిన్ త్రయం దెబ్బకు 147 పరుగులే చేసి విజయావకాశాలు తగ్గించుకున్న శ్రేయస్ అయ్యర్ బృందం తర్వాత సాధారణ బౌలింగ్ ప్రదర్శనతో, చెత్త ఫీల్డింగ్తో చెన్నైని నిలువరించలేకపోయింది. వెటరన్లు వాట్సన్, డు ప్లెసిస్ అర్ధ సెంచరీలకు యువ ఢిల్లీ ఆట ముగిసింది. ఇక నాలుగోసారి ఫైనల్లో తలపడనున్న చెన్నై, ముంబై మధ్య విజేత ఎవరో ఆదివారం హైదరాబాద్లో తేలనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నిషేధం తర్వాత గత ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేసి చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి టైటిల్ను నిలబెట్టుకునేందుకు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్లో విజేతగా నిలిచి సూపర్ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో చెన్నై 6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కొలిన్ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్ చహర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్కు వీరిద్దరు 62 బంతుల్లో 81 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. పంత్ మినహా... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటి నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. మధ్యలో పంత్ ప్రయత్నం మినహా జట్టు బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. టాప్–4 బ్యాట్స్మెన్ నుంచి కనీసం ఒక్క సిక్సర్ కూడా రాకపోగా, స్కోరులో అత్యధిక భాగస్వామ్యం 22 పరుగులే అంటే పరిస్థితి అర్థమవుతుంది! శార్దుల్ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో ధావన్ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే చహర్ బౌలింగ్లో పృథ్వీ షా (6 బంతుల్లో 5; ఫోర్) వికెట్ల ముందు దొరికిపోవడంతో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ముందుగా అంపైర్ నాటౌట్గా ప్రకటించినా... ధోని రివ్యూ కోరి ఫలితం సాధించాడు. కొద్ది సేపటికి హర్భజన్ బౌలింగ్లో ధోని చక్కటి క్యాచ్ పట్టడంతో ధావన్ వెనుదిరిగాడు. అనంతరం భజ్జీని సమర్థంగా ఎదుర్కొని వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మున్రో... జడేజాకు తలవంచాడు. కెప్టెన్ అయ్యర్ (18 బంతుల్లో 13; ఫోర్) పేలవ ఫామ్ను కొనసాగిస్తూ మళ్లీ విఫలమయ్యాడు. ఈ దశలో జట్టు స్కోరు 75/4 కాగా... పంత్ 10 పరుగుల వద్ద ఆడుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ (6 బంతుల్లో 3), రూథర్ఫోర్డ్ (12 బంతుల్లో 10; సిక్స్), కీమో పాల్ (7 బంతుల్లో 3) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పంత్ ధాటిని పెంచాడు. తాహిర్ ఓవర్లో వరుసగా అతను ఫోర్, సిక్స్ కొట్టడంతో కొంత ఊపు వచ్చింది. అయితే అది ఎంతో సేపు సాగలేదు. చివరకు బ్రేవో బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి పంత్ ఔటయ్యాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్లో బౌల్ట్ (3 బంతుల్లో 6) ఒక సిక్స్... చివరి రెండు బంతులకు ఇషాంత్ శర్మ (3 బంతుల్లో 10 నాటౌట్) వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో ఈ మాత్రం స్కోరైనా వచ్చింది. పంత్ వెనుదిరిగాక ఢిల్లీ చివరి 8 బంతుల్లో 24 పరుగులు రాబట్టగలిగింది. ఒక బ్యాట్స్మన్ (విజయ్)ను తప్పించి తుది జట్టులో పేసర్ శార్దుల్కు చోటిచ్చిన చెన్నై అతనితో ఒకటే ఓవర్ వేయించగా... ఈ సీజన్లో చాలా వరకు పేలవ ప్రదర్శన కనబర్చిన బ్రేవో (2/19) ఎట్టకేలకు తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు చెలరేగగా... తొలి నాలుగు ఓవర్ల పాటు కాస్త ప్రశాంతత... ఆ తర్వాత ఒక్కసారిగా చెన్నై ఓపెనర్లు చెలరేగిపోయారు. వరుసగా గత నాలుగు మ్యాచ్లలో విఫలమైన వాట్సన్ ఫామ్ అందుకోగా, డు ప్లెసిస్ తన దూకుడును చూపించాడు. బౌల్ట్, ఇషాంత్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 16 పరుగులే చేసింది. కానీ అక్షర్ వేసిన ఐదో ఓవర్తో ఆట మలుపు తిరిగింది. ఈ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ప్లెసిస్... ఇషాంత్ వేసిన తర్వాతి ఓవర్లో తొలి మూడు బంతులను వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే ప్లెసిస్ను ఔట్ చేసి బౌల్ట్ తొలి వికెట్ భాగస్వామ్యాన్ని ముగించాడు. ఇక్కడి నుంచి బాధ్యత తీసుకున్న వాట్సన్... పాల్ వేసిన 12వ ఓవర్లో చెలరేగిపోయాడు. ఏకంగా 3 సిక్సర్లు, ఫోర్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్న తర్వాత మిశ్రా బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి వాట్సన్ వెనుదిరిగాడు. చివర్లో రైనా (13 బంతుల్లో 11), ధోని (9 బంతుల్లో 9) వెనుదిరిగినా చెన్నైకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. రాయుడు (20 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలవడంతో ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టు గెలిచింది. ఆనవాయితీ కొనసాగింది... ఐపీఎల్లో 2011 నుంచి ప్లే ఆఫ్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఈ సీజన్ వరకు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు కచ్చితంగా ఫైనల్ చేరుతోంది. 2011లో చెన్నై, 2012లో కోల్కతా నైట్రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కోల్కతా నైట్రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, 2016లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, 2018, 2019లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు లీగ్ దశలో రెండో స్థానంలో నిలవడంతో పాటు ఫైనల్కు చేరుకున్నాయి. మరో విశేషమేమింటే 2011 నుంచి 2015 వరకు వరుసగా ఐదేళ్లపాటు ఐపీఎల్లో లీగ్ దశ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టుకే టైటిల్ లభించింది. ►4 ఐపీఎల్ ఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండటం ఇది నాలుగోసారి. 2010లో చెన్నై విజేతగా నిలువగా... 2013, 2015లలో ముంబై టైటిల్ సాధించింది. ►4 ఐపీఎల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో బౌలర్ హర్భజన్. ఈ జాబితాలో లసిత్ మలింగ (169 వికెట్లు), అమిత్ మిశ్రా (157 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా... పీయూష్ చావ్లా (150 వికెట్లు), హర్భజన్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ►2 ఐపీఎల్ చరిత్రలో 100 విజయాలు నమోదు చేసుకున్న రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్ 106 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. రనౌట్ చేయడంలో విఫలమై... గత కొన్ని మ్యాచ్లలో చెన్నైకి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోతున్నారు. ఆ ఒత్తిడి వారిపై ఆరంభంలోనే కనిపించింది. అయితే చేతికి చిక్కిన చక్కటి అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వృథా చేసుకొని ఫలితం అనుభవించింది. ఇన్నింగ్స్ మూడో బంతికే రనౌట్ చేసే చాన్స్ వచ్చినా బుర్ర వాడకుండా ప్రత్యర్థికి లైఫ్ అందించింది. బౌల్ట్ వేసిన బంతిని పాయింట్ దిశగా ఆడి వాట్సన్, డు ప్లెసిస్ సింగిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఇద్దరిలో సమన్వయ లోపంతో గందరగోళానికి లోనై ఒక దశలో ఇద్దరు పిచ్ మధ్యలోకి వచ్చేశారు. అయితే ఢిల్లీ ఫీల్డర్లు సరైన రీతిలో త్రో వేయడంలో విఫలం కావడంతో ఇద్దరు బ్యాట్స్మెన్ క్షేమంగా బయటపడ్డారు. బంతిని ఆపి అక్షర్ పటేల్ నాన్స్ట్రయికింగ్ దిశగా విసరగా, అక్కడే ఉన్న మున్రో బ్యాట్స్మెన్ గమనాన్ని పట్టించుకోకుండా కీపర్ వైపు విసిరాడు. అది దూరంగా వెళ్లడంతో పంత్ కూడా దానిని అందుకోలేకపోయాడు. ఆలోగా ప్లెసిస్ వేగంగా వచ్చి పరుగు పూర్తి చేసుకోగా క్యాపిటల్స్ ఆటగాళ్లంతా తలలు పట్టుకున్నారు. మున్రో కాస్త చురుగ్గా ఆలోచిస్తే సునాయాసంగా రనౌట్ చేయగలిగే అవకాశం అక్కడ ఉంది. తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఉంటే అసలే ఒక బ్యాట్స్మన్ తక్కువగా ఉన్న చెన్నైపై కచ్చితంగా ఒత్తిడి పెరిగేదే! -
క్వాలిఫయర్2: సీఎస్కే టార్గెట్ 148
విశాఖపట్నం: ఐపీఎల్ సీజన్ 12 క్వాలిఫయర్ 2లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. పృథ్వీ షా(5) తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. అయితే ధావన్(18)ను హర్భజన్ పెవిలియన్కు పంపించాడు. పృథ్వీ షా ఔటైన తర్వాత అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన కోలిన్ మున్రో(27) ఢిల్లీ ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయాడు. దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడగొడుతూనే మరోవైపు పరుగులు రాకుండా సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే ఈ క్రమంలో జట్టును ఆదుకుంటాడని ఆశలు పెట్టుకున్న అయ్యర్(13) తాహీర్ బౌలింగ్లో ఓ చెత్త షాట్కు బలయ్యాడు. వికెట్లు పడుతున్నా పంత్ క్రీజులో ఉండటంతో ఢిల్లీ జట్టులోనూ, అభిమానుల్లోనూ ఏదో ఆశ కలిగింది. అయితే పంత్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ధోని.. అతడు పరుగులు చేయకుండా కట్టడి చేయించాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం చేశాడు పంత్. అదే ఊపులో పంత్(38) కూడా నిష్క్రమించాడు. ఇక చివరి ఓవర్లో ఇషాంత్(10నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో హర్భజన్, బ్రేవో, దీపక్ చాహర్, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు. -
ముంబైని ఢీ కొట్టేదెవరో?
-
ముంబైని ఢీ కొట్టేదెవరో?
విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్వాలిఫయర్ 2లో భాగంగా మూడు సార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. శుక్రవారం స్థానిక వైఎస్సార్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్లో ఛేదన వైపే సీఎస్కే సారథి ధోని మొగ్గు చూపాడు. ఇక ఈ మ్యాచ్ కోసం సీఎస్కే ఒక్క మార్పు చేసింది. బ్యాట్స్మెన్ మురళీ విజయ్ను తప్పించి పేసర్ శార్దూల్ ఠాకూర్ను తీసుకుంది. ఢిల్లీ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఎలిమినేటర్లో సన్రైజర్స్ను ఓడించి దిల్లీ ఈ మ్యాచ్కు అర్హత సాధించగా క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై, లీగ్లో టాప్-2 ఫినిషర్గా ఫైనల్ కోసం ఆడేందుకు మరో అవకాశం దక్కించుకుంది. అపార అనుభవం ఆలంబనగా ఉన్న చెన్నై, యువ రక్తం ఉరకలేస్తున్న ఢిల్లీ జట్లు శుక్రవారం తలపడబోయే ఈ క్వాలిఫయిర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగలా, దండిగా సందడిని అందజేయడం గ్యారంటీ అని ఇప్పటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఈ మ్యాచ్లో గెలవనున్న జట్టు హైదరాబాద్లో జరగనున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ను సవాలు చేయబోతోంది. అందుకే వైఎస్సార్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇరుజట్లు బౌలింగ్లో మేటిగా ఉండటం... స్పి న్నర్లు పిచ్ను అనువుగా మార్చుకుని బ్యాట్స్మెన్పై ఒత్తిడి తెచ్చేవారే కావడంతో ఫ్లాట్ పిచ్పై పరుగుల వరద ఎలా పారుతుందో వేచి చూడాల్సిందే. చెన్నై పేసర్ దీపక్ చహర్ పవర్ప్లేలో చెలరేగిపోతున్నాడు. ఐíపీఎల్లో ఇరుజట్లు 20సార్లు తలపడగా సూపర్ కింగ్స్ 14సార్లు విజయం సాధించగా ఢిల్లీ ఆరుసార్లు మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో రెండు రౌండ్లలోనూ సూపర్కింగ్సే విజయం సాధించింది. చెన్నై జోరుకు ఢిల్లీ అడ్డుకుంటుందో లేక చెన్నై ఈ సీజన్లో ఢిల్లీపై మూడోసారి విజయాన్ని సాధించి మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమౌతుందో లేదో చూడాలి. తుదిజట్లు సీఎస్కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), డుప్లెసిస్, వాట్సన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషభ్ పంత్, కోలిన్ మున్రో, అక్షర్పటేల్, రూథర్ఫర్డ్, కీమో పాల్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్ -
‘అతడు ఈ తరం సెహ్వాగ్’
న్యూఢిల్లీ: యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలతో ముంచెత్తాడు. అతడిని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో పోల్చాడు. ఇలాంటి ఆటగాడిని భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని, సహజంగా ఆడనివ్వాలని సూచించాడు. ‘రిషబ్ పంత్ను ఈ తరానికి చెందిన వీరేంద్ర సెహ్వాగ్గా చెప్పుకోవచ్చు. భిన్నంగా చూడాల్సిన బ్యాట్స్మన్లో అతడు ఒకడు. పంత్ను జట్టులోకి తీసుకున్నా, తీసుకోకపోయినా అతడి ఆటతీరు మాత్రం మారద’ని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్–12లో బుధవారం విశాఖపట్నంలో సన్రైజర్స్ హైదరాబాద్తో ఉత్కంఠభరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి ‘మ్యాన్ ద మ్యాచ్’ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో ఈరోజు జరగనున్న క్వాలిఫయర్ –2 మ్యాచ్లో పంత్పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ సీజన్లో రిషబ్ పంత్ ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడి 450 పరుగులు చేశాడు. (చదవండి: ఐపీఎల్ 12; కుర్రాళ్లు కుమ్మేశారు!) -
జోరుగా ఆన్లైన్ బెట్టింగ్లు
క్రికెట్కు యువతలో ఉన్న క్రేజ్ను ఆసరాగా చేసుకున్న బుకీలు ఆన్లైన్లో బెట్టింగులను ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు. బెట్టింగ్లకు డీలర్షిప్లు తీసుకుని, కమీషన్లపై పనిచేసేలా సబ్డీలర్లను నియమించుకుని చెలరేగిపోతున్నారు. ఈజీ మనీ కోసం యువకులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వేలు, లక్షలాది రూపాయలు బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంగా మాఫియా రూ.కోట్లలో బెట్టింగ్లకు పాల్పడుతోంది. దినసరి కూలీలు, యువత ఈజీ మని కోసం వేలల్లో పందేలు కాస్తుంటే.. వారిని మాయ చేస్తున్న బుకీలు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. సాధారణ క్రికెట్ మ్యాచ్లకే బెట్టింగ్లు భారీగా నడుస్తుంటాయి. ఇక టీ–20, ఐపీఎల్ మ్యాచ్ల సీజన్లో బెట్టింగ్లు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఒక్కరోజులోనే జిల్లాలో రూ.5 నుంచి 10కోట్ల వరకు బెట్టింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్–12 ఫైనల్ మ్యాచ్ జరిగే మే 12వ తేదీలో బెట్టింగ్లు రూ.30కోట్లు దాటే అవకాశాలున్నాయని బెట్టర్లు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల వ్యక్తుల ద్వారా బుకీల దందా ఆన్¯Œలైన్ క్రికెట్ బెట్టింగ్ కొన్ని విదేశాల్లో అధికారికంగా కొనసాగుతోంది. ఆయా దేశాల వ్యక్తులతో పరిచయాలు చేసుకున్న మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాల్లోని వ్యక్తులతో జిల్లాకు చెందిన బుకీలు పరిచయాలు చేసుకుని ఈ దందా నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న జాతీయ బుకీలతో సంబంధాలున్న జిల్లాకు చెందిన క్రికెట్ బుకీలు ఆన్¯Œలైన్ బెట్టింగ్లో డీలర్ షిప్ తీసుకుని సబ్ డీలర్స్ను సైతం నియమించుకున్నారు. ముందస్తుగా ఫండర్ల నుంచి బుకీలు (డీలర్ షీప్ తీసుకున్న నిర్వాహకులు) కొంత సొమ్ము తీసుకుని బెట్టింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ, ఆన్లైన్ లింక్లు షేర్ చేస్తారు. వెబ్ పేజీ, లైన్, నేరుగా ఫోన్లో మాట్లాడే విధంగా మొత్తంగా మూడు దశల్లో పెద్దఎత్తున ఈ దందా కొనసాగుతోంది. ఇదే తరహాలో బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ భారీ ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన బుకీల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు బిత్తరపోయే వివరాలు తెలిశాయి. జిల్లాకు చెందిన 36 మందితో సహా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జాతీయస్థాయి బెట్టింగ్ బుకీల వివరాలు వెలుగు చూశాయి. ప్రత్యేకమైన యాప్లు ఐపీఎల్, ఇతర క్రికెట్ బెట్టింగ్ల కోసం నిర్వాహకులు హైటెక్ పద్ధతిని వినియోగిస్తున్నారు. సెల్ఫో¯Œన్లలో బెట్ –365, బెట్వీ, స్పోర్ట్స్ బెట్టింగ్, బెట్ ప్లేయర్, డ్రీమ్ 11, మై టీమ్, ఇండస్ గేమ్స్, మై టీమ్ 11 వంటి యాప్ల నుంచి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్తో పాటు వాలీబాల్, టెన్నిస్, ఫుట్బాల్ వంటి క్రీడలపై కూడా ఈ యాప్ల ద్వారా బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి లావాదేవీలు గూగుల్ పే, మై మనీ, భీమ్, ఫోన్ పే వంటి ఆన్లైన్ నగదు బదిలీ యాప్ల ద్వారా బెట్టింగ్ రాయుళ్లు చేపడుతున్నారు. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో కొన్ని పెద్దపెద్ద హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలు, శివారు ప్రాంతాల్లోని ఫ్లాట్లు అడ్డాలుగా చేసుకుని బుకీలు దందా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నంత సేపు బెట్టింగ్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. వేసిన బాళ్లు, క్యాచ్లు, వికెట్లు, ఫోర్లు, సిక్స్లను బట్టి బెట్టింగ్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. చిత్తవుతున్న యువత జల్సాలకు అలవాటుపడిన యువత తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఈజీ మనీ సంపాదన బాట పడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి బుకీలు తమవైపుకు ఆకర్షించుకుని యువతను ఆర్థికంగా గుల్ల చేస్తున్నారు. జిల్లాలోని పలు పేరు మోసిన కాలేజీలు, యూనివర్సిటీల్లో సైతం కొందరు విద్యార్థులు సహ బుకీలుగా ఉంటూ తోటి విద్యార్థులతో బెట్టింగ్లు వేయిస్తున్నారు. చదువులు, హాస్టళ్ల అవసరాల కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును బెట్టింగ్ల్లో పెట్టి పోగొట్టుకుంటున్న విద్యార్థులు వచ్చే మ్యాచ్లో డబ్బు వస్తుందని ఆశతో మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్నారు. చాలా సందర్భాల్లో బుకీలే విద్యార్థులకు డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. తెలిసో తెలియకో ఈ కూపంలోకి దిగి బుకీలకు డబ్బు కట్టలేక, ఇంట్లో తల్లిదండ్రులకు విషయం తెలుస్తుందని విద్యార్థులు సతమవుతూ చదువుపై శ్రద్ధ పెట్టలేక బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. -
అలా కొట్టాలి.. మనం నిలవాలి..
విశాఖ స్పోర్ట్స్: ఉవ్వెత్తున ఎగసే ఉత్సాహ కెరటం ఒకటి.. దూకుడుతో దూసుకొచ్చే నవ తరంగం వేరొకటి. ఎదురే లేని రీతిలో హోరెత్తే ప్రతిభా ప్రభంజనం ఒకటి.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉత్తేజంతో ఉరకలేస్తున్న నవ నయగారా జలపాతం వేరొకటి. ఆ రెండూ ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో శుక్రవారం విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో ఢీకొనబోయే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లని ఈపాటికే అర్థమై ఉంటుంది. అపార శక్తితో, అనంత విశ్వాసంతో ఊపు మీదనున్న సీఎస్కే, ఇప్పుడిప్పుడే జోరెక్కి, ఇదే తుది అవకాశమన్నట్టు తలపడే డీసీ.. ముఖాముఖీ పోరాడబోయే ఈ మ్యాచ్.. ఫైనల్కు ముందు ఫైనల్ అంత ఉత్కంఠ కలిగించేదని అవగతమయ్యే ఉంటుంది. అసాధారణ పోరు..: నిజమే.. అపార అనుభవం ఆలంబనగా ఉన్న చెన్నై, యువ రక్తం ఉరకలేస్తున్న ఢిల్లీ జట్లు శుక్రవారం తలపడబోయే ఈ క్వాలిఫయిర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగలా, దండిగా సందడిని అందజేయడం గ్యారంటీ అని ఇప్పటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఈ మ్యాచ్లో గెలవనున్న జట్టు హైదరాబాద్లో జరగనున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ను సవాలు చేయబోతోంది. అందుకే వైఎస్సార్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇరుజట్లు బౌలింగ్లో మేటిగా ఉండటం... స్పి న్నర్లు పిచ్ను అనువుగా మార్చుకుని బ్యాట్స్మెన్పై ఒత్తిడి తెచ్చేవారే కావడంతో ఫ్లాట్ పిచ్పై పరుగుల వరద ఎలా పారుతుందో వేచి చూడాల్సిందే. చెన్నై పేసర్ దీపక్ చహర్ పవర్ప్లేలో చెలరేగిపోతున్నాడు. ఐíపీఎల్లో ఇరుజట్లు 20సార్లు తలపడగా సూపర్ కింగ్స్ 14సార్లు విజయం సాధించగా ఢిల్లీ ఆరుసార్లు మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో రెండు రౌండ్లలోనూ సూపర్కింగ్సే విజయం సాధించింది. చెన్నై జోరుకు ఢిల్లీ అడ్డుకుంటుందో లేక చెన్నై ఈ సీజన్లో ఢిల్లీపై మూడోసారి విజయాన్ని సాధించి మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమౌతుందో శుక్రవారం రాత్రి తేలిపోతుంది. ప్లే ఆఫ్ కింగ్ చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 2010,11 సీజన్లలో టైటిల్ సాధించగా...తిరిగి 2018లోనూ చాంపియన్గా నిలిచింది. అయితే ఏ సీజన్లోనూ లీగ్ దశలో టాప్ పొజిషన్కు చేరుకోకుండానే ప్లేఆఫ్ ఆడి చాంపియన్షిప్ సాధించడం విశేషం. అయితే 2013, 15ల్లో లీగ్ దశలో టాప్ పొజిషన్కు చేరినా చాంపియన్గా నిలవలేకపోయింది. ప్రస్తుత సీజన్లో సయితం లీగ్లో విజేతగా నిలవలేక పోయిన చెన్నై మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించేందుకు శుక్రవారం అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్కు చేరని ఢిల్లీ: గడచిన ఐíపీఎల్ సీజన్స్ వేటిలోనూ చాంపియన్గా నిలవలేక పోయిన ఢిల్లీ కాపిటల్స్ ఈసారి లీగ్ దశలో చక్కగా రాణించింది. ఎలిమినేషన్లో సన్రైజర్స్పై గెలిచిన ఊపుతో క్వాలిఫైయింగ్ మ్యాచ్కు సిద్ధమౌతోంది. బుధవారం హైదరాబాద్తో మ్యాచ్ వైఎస్ఆర్ స్టేడియంలోనే జరగడంతో పిచ్పై పూర్తి అవగాహనతో ఉంది. ఏడేళ్ళ విరామం అనంతరం ప్లేఆఫ్కు చేరి న ఢిల్లీ జట్టు ఈసారైనా టైటిల్ పోరుకు అర్హత సాధి స్తుందేమో తేలిపోనుంది. ఢిల్లీ ఈసారైనా చివరి హార్డిల్ దాటుతుందా అనేది నేటి రాత్ని ఏడున్నరకు ప్రారంభం కానున్న రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్లో తేలిపోనుంది. ముఖాముఖిలో చెన్నైదే పైచేయి ప్లేఆఫ్ తొలి మ్యాచ్లో ఓటమితో చెన్నై టైటిల్ పోరు అర్హత మ్యాచ్కు సిద్ధమౌతుండగా తొలి మ్యాచ్లో ఎలిమినేషన్లో విజయం సాధించి అత్మవిశ్వాసంతో ఢిల్లీ జట్టు సై అంటోంది. లీగ్ దశలో ఆడిన రెండు ముఖాముఖి పోటీల్లోనూ ఢిల్లీపై చెన్నై విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ సొంతగడ్డపై జరిగిన లీగ్ తొలి దశ మ్యాచ్లో సీఎస్కే ఆరు వికెట్ల ఆ«ధిక్యంతో గెలిచింది. చెన్నైలో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో సీఎస్కే 80 పరుగుల భారీ ఆధిక్యంతో విజయభేరి మోగించింది. సాయంత్రం సాధన ఐపిఎల్ ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ జట్లు గురువారం వైఎస్ఆర్ స్టేడియంలోని నెట్స్లో శ్రమించాయి. చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ధోనీ, ఢిల్లీ కాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా ఇరుజట్ల ఆటగాళ్ళు నెట్స్లో ప్రాక్టీస్ చేసారు. ఎండలు మండుతుండటంతో ఇరుజట్లుసాయంత్రం స్టేడియంకు చేరుకుని ఫ్లడ్లైట్ల వెలుతురులోనే ప్రాక్టీస్ చేశాయి.ఐపీఎల్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. చెన్నైపై నెగ్గి ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఇండియన్స్తో ఢీకొట్టే ఛాన్స్ కోసం శుక్రవారం విశాఖ వేదికగా జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ, చెన్నై తలపడనున్నాయి. ఇందుకోసం రెండు జట్లు గురువారంఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్తో తీవ్ర కసరత్తులు చేశాయి. సెమీఫైనల్ లాంటిఈ మ్యాచ్ కోసం విశాఖ క్రీడాభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. -
సూపర్కింగ్స్తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్
-
ఆలస్యంగా తేరుకున్న మనీశ్పాండే..
గత నాలుగేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. ఈ నాలుగేళ్లలోనూ ప్లే ఆఫ్స్కు చేరిన హైదరాబాద్ ఒకసారి టైటిల్ను గెలవడంతో పాటు మరోసారి రన్నరప్గా నిలిచింది. అదృష్టం కలిసిరావడంతో ఈసారి కూడా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న సన్ జట్టు రాణించలేకపోయింది. బ్యాట్స్మన్, బౌలర్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో ఎలిమినేటర్స్తోనే లీగ్లో తన ప్రయాణాన్ని ముగించింది. అంతంతమాత్రంగానే ఉన్న బ్యాటింగ్ లైనప్తో సన్ ఇక్కడివరకు చేరడంలో ఇద్దరు బ్యాట్స్మెన్ ప్రధాన పాత్ర పోషించారు. వీరితో పాటు ఈ సీజన్లో హైదరాబాద్ ప్రదర్శనను ప్రభావితం చేసిన అంశాలను కూలంకషంగా పరిశీలిద్దాం... వార్నర్, బెయిర్స్టోనే వెన్నెముక ఎలిమినేటర్స్ మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడటం హైదరాబాద్ యాజమాన్యాన్ని తీవ్రంగా బాధించి ఉండవచ్చు. ఎందుకంటే అదృష్టవశాత్తు ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న హైదరాబాద్ తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. లీగ్ చరిత్రలోనే కేవలం 12 పాయింట్లతో ఒక జట్టు ప్లేఆఫ్స్కు చేరడం ఇదే తొలిసారి. మెరుగైన నెట్రన్రేట్ కారణంగా కేవలం ఆరు విజయాలే సాధించినప్పటికీ హైదరాబాద్కు అది సాధ్యమైంది. దీనికి కారణం వార్నర్, బెయిర్ స్టో జోడీ. సన్ సాధించిన మొత్తం పరుగుల్లో వీరిద్దరి వాటానే 61 శాతం కావడం జట్టు విజయాల్లో వీరి పాత్రను చూపిస్తోంది. వీరిద్దరూ ప్రపంచకప్ కోసం తమ దేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత సన్ కనీసం ఒక్క మ్యాచ్లోనూ విజయాన్ని అందుకోలేకపోయింది. భాగస్వామ్యమే నిలిపింది సన్రైజర్స్ సాధించిన విజయాలన్నీ వార్నర్– బెయిర్ స్టో అద్భుత భాగస్వామ్యాల కారణంగా వచ్చినవే. లీగ్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ 100కు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఈ జంట జట్టు విజయానికి బాటలు వేసింది. ఇందులో బెంగళూరుపై 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా ఉంది. ఈ సీజన్లో వీరిద్దరూ జంటగా 10 ఇన్నింగ్స్లలో 791 పరుగుల్ని జోడించారు. ఐపీఎల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా... టి20ల చరిత్రలో మూడో రికార్డు భాగస్వామ్యంగా నిలిచింది. ఈ సీజన్లో వార్నర్ 692 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో ఉండగా... బెయిర్ స్టో 445 పరుగులతో పదో స్థానంలో నిలిచాడు. రషీద్ మాయాజాలం సన్రైజర్స్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన మరో ఆటగాడు రషీద్ ఖాన్. గతేడాదితో పోలిస్తే రషీద్ ఈ సీజన్లో రాణించలేదనేది పలువురి అభిప్రాయం. అయితే గణాంకాలు మాత్రం ఇది నిజం కాదంటున్నాయి. గతంతో పోలిస్తే వికెట్లు తీయడంలో వెనుకబడినప్పటికీ ఈసారి అతను మరింత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈసీజన్లో 6.28 ఎకానమీతో 17 వికెట్లను రషీద్ దక్కించుకున్నాడు. 2018లో 21 వికెట్లు తీసిన రషీద్ 6.73 ఎకానమీని నమోదు చేశాడు. నిజం చెప్పాలంటే రషీద్ బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ తెలివిగా వ్యవహరించడం వల్లే అతని ప్రదర్శన కాస్త వెనకబడినట్లుగా సగటు ప్రేక్షకునికి అనిపిస్తోంది. ఈ మిస్టరీ బౌలర్ బౌలింగ్లో పరుగులు సాధించడం కంటే వికెట్ను కాపాడుకోవడానికే బ్యాట్స్మెన్ మొగ్గుచూపడంతో ఈసారి రషీద్ వికెట్ల సంఖ్య తగ్గింది. ఆలస్యంగా తేరుకున్న మనీశ్పాండే ప్రారంభ మ్యాచ్ల్లో అంతగా ఆకట్టుకోని ఆల్రౌండర్ మనీశ్ పాండే... లీగ్ చివరి దశలో ఫామ్లోకి వచ్చాడు. బెయిర్ స్టో జట్టుకు దూరమయ్యాక వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన పాండే విలువైన ఇన్నింగ్స్లు ఆడాడు. విజయ్ శంకర్ పరిస్థితి దీనికి భిన్నం. లీగ్ ఆరంభ మ్యాచ్ల్లో కొంత మెరుగ్గా ఆడిన విజయ్ శంకర్ కీలక మ్యాచ్ల్లో రాణించలేకపోయాడు. కేవలం 126.42 స్ట్రయిక్ రేట్తో పరుగులు సాధించాడు. కేన్ విలియమ్సన్ ఒకటీఅరా మ్యాచ్ల్లో మినహా మునుపటి మెరుపులు మెరిపించలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్నా అతను తన ధాటిని ప్రదర్శించలేకపోయాడు. దీంతో ఓపెనింగ్ నుంచి తప్పుకుని వేరే స్థానంలో బరిలో దిగినా మెప్పించలేకపోయాడు. గతేడాది ఓపెనర్గా ఆడిన విలియమ్సన్ టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు జట్టును రన్నరప్గా నిలిపాడు. రాణించని ఐదో బౌలర్ అఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, మొహ్మమద్ నబీ... పేసర్లలో భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ తమ అద్భుత ప్రదర్శనలు నమోదు చేశారు. కానీ ఐదో బౌలర్గా తమకు వచ్చిన అవకాశాలను సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థంపి సమర్థంగా వినియోగించుకోలేకపోయారు. ఓవర్కు 8 పరుగులకు మించి ఇస్తూ ప్రత్యర్థికి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మిడిలార్డర్ సమస్య సన్రైజర్స్ను సీజన్ ఆసాంతం వేధించిన సమస్య మిడిలార్డర్ వైఫల్యం. వన్డౌన్ బ్యాట్స్మెన్ అయిన మనీశ్ పాండే, విజయ్ శంకర్ మిడిలార్డర్లో రాణించలేకపోయారు. నం.3 స్థానంలో వీరిద్దరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. యూసుఫ్ పఠాన్ ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 40 పరుగులు... దీపక్ హుడా 11 మ్యాచ్ల్లో 64 పరుగులతో చెత్త ప్రదర్శనను కనబరిచారు. చాలా ఆలస్యంగా అభిషేక్ శర్మను ఆడించినా అతనికి ఎక్కువ అవకాశాల్లేక కుదురుకోలేకపోయాడు. మిడిలార్డర్లో నాణ్యమైన బ్యాట్స్మెన్ లేకపోవడం సన్ను దెబ్బతీసింది. మొహమ్మద్ నబీ 8 మ్యాచ్లలో 6.65 ఎకానమీతోనే పరుగులు ఇవ్వడంతో పాటు 151.31 స్ట్రైక్రేట్తో పరుగులు సాధించి ఈ సీజన్లో రైజర్స్ ‘స్టార్’గా నిలిచాడు. -
ఫైనల్దారిలో...
ఐపీఎల్ తుది అంకంలో సెమీ ఫైనల్ మ్యాచ్. బ్యాటింగ్, బౌలింగ్లో పెద్దపెద్ద స్టార్లు లేకున్నా ఒక్కో మెట్టు ఎక్కుతూ నాకౌట్ దశకు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్... కొంత తడబడినా హిట్టర్లు, ఫలితాన్ని మార్చేయగల మొనగాళ్లతో కూడిన, తక్కువ అంచనా వేయలేని చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ నగరంలో శుక్రవారం క్వాలిఫయర్ –2 మ్యాచ్. ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ ఆడిన అనుభవంతో ఉన్న ఢిల్లీ ఆ అనుకూలతను సద్వినియోగం చేసుకుని ఫైనల్ బెర్తు కొట్టేస్తుందో? తమ శక్తియుక్తులను కూడదీసుకుని చెన్నై పైచేయి సాధిస్తుందో చూడాలి. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్లలో ఒత్తిడిని గట్టెక్కిన అనుభవం ఉన్న ధోని బృందానికి, కుర్రాళ్లతో నిండిన అయ్యర్ జట్టు ఎంతటి పోటీ ఇస్తుందో అనేది ఆసక్తికరం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అసలు ప్లే ఆఫ్స్ చేరుతుందని భావించని ఢిల్లీకి, క్వాలిఫయర్–2 ఆడాల్సి వస్తుందని ఊహించని చెన్నైకి మధ్య ఐపీఎల్–12 ఫైనల్ బెర్తు కోసం శుక్రవారం ఇక్కడి డా.వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానం వేదికగా సమరం జరుగనుంది. లీగ్ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశలో మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న ఢిల్లీ... అదే జోరులో తుది పోరాటానికి అర్హత సాధించాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో ఎదురైన పరాజయాల నుంచి తేరుకుని ఫైనల్ చేరాలని చెన్నై పట్టుదలగా ఉంది. సీనియర్ శిఖర్ ధావన్కు తోడు ఢిల్లీ యువ బ్యాటింగ్ త్రయం పృథ్వీ షా–కెప్టెన్ శ్రేయస్ అయ్యర్–రిషభ్ పంత్, చెన్నై స్పిన్ త్రయం తాహిర్–హర్భజన్–జడేజాలలో ఎవరు రాణిస్తే మ్యాచ్ వారి పరమవుతుంది. కుర్రాళ్లు కుమ్మేస్తేనే... కీలక సమయంలో ఓపెనర్ పృథ్వీ ఫామ్లోకి రావడం ఢిల్లీని సంతోషపరిచే అంశం. ధావన్ కూడా రాణిస్తే జట్టు ఇన్నింగ్స్కు మంచి పునాది పడుతుంది. తర్వాత సంగతిని అయ్యర్, పంత్ చూసుకుంటారు. అయితే, అయ్యర్ అంచనాలకు తగ్గట్లు స్కోరు చేయడం లేదు. ఈ నలుగురి అనంతరం సరైన బ్యాట్స్మన్ లేకపోవడం మరో లోటు. నాలుగో స్థానం నుంచి ఏడో స్థానం మధ్య జట్టు బ్యాట్స్మన్ సగటు 20.5 కావడమే దీనికి నిదర్శనం. ఇంగ్రామ్, మున్రో ఇద్దరూ ధాటిగా ఆడగలవారే. సన్ రైజర్స్తో మ్యాచ్లో మున్రోను తీసుకున్నారు. అతడినే కొనసాగిస్తారా? లేక ఇంగ్రామ్ను తీసుకుంటారా? అనేది చూడాలి. అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్లతో ఢిల్లీ స్పిన్ పటిష్ఠంగా ఉంది. గత మ్యాచ్లో మిశ్రా బౌలింగే ఫలితాన్ని ప్రభావితం చేసింది. బ్యాట్తోనూ రాణించే క్రిస్ మోరిస్ను ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడించే వీలుంది. ఇషాంత్ లయ తప్పకుండా, కచ్చితత్వంతో బంతులేస్తుండటం సానుకూలాంశం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, వాటిని సమన్వయం చేసుకుంటూ ఆడే చెన్నైపై నెగ్గాలంటే ఢిల్లీ కాస్తంత ఎక్కువే శ్రమించక తప్పదు. చెన్నై... చేజారకుండా పంజాబ్, ముంబైలతో జరిగిన చివరి రెండు మ్యాచ్ల్లో చెన్నై జోరు తగ్గిందనే చెప్పాలి. బ్యాటింగ్ వైఫల్యమే దీనికి ప్రధాన కారణం. క్వాలిఫయర్–1లో అది కూడా సొంతగడ్డపై ముంబైని నిలువరించలేకపోయింది. ఓపెనర్ షేన్ వాట్సన్ ఫామ్ దారుణంగా ఉంది. దీంతో డుప్లెసిస్, రైనాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. కెప్టెన్ ధోని ఆదుకుంటుండటంతో కొంతైనా పోటీ ఇస్తోంది. రాయుడు, మురళీ విజయ్ బ్యాట్ ఝళిపిస్తేనే భారీ స్కోరు చేయగలుగుతుంది. హిట్టింగ్తో స్కోరును పెంచగల బ్రేవోకు బ్యాటింగ్ అవకాశం రావడం లేదు. స్పిన్ త్రయంతో పాటు పేసర్ దీపక్ చహర్ తమ బాధ్యతలు సమర్థంగా నెరవేరుస్తుండటంతో బౌలింగ్లో మాత్రం సూపర్ కింగ్స్కు తిరుగులేదు. బ్యాటింగ్లో భారీ స్కోరు చేస్తే... బౌలింగ్ దన్నుతో చెన్నై బయటపడగలదు. లీగ్ దశలో ఢిల్లీని 99 పరుగులకే చుట్టేసిన తీరే దీనికి ఉదాహరణ. ►ఈ సీజన్లో ధోని చేసిన 405 పరుగుల్లో 213 పరుగులు 18 నుంచి 20వ ఓవర్ మధ్య వచ్చినవే. ►ఢిల్లీ ఆల్రౌండర్ మోరిస్ పడగొట్టిన 13 వికెట్లలో 10 వికెట్లు 16 నుంచి 20వ ఓవర్ మధ్య తీసినవే. ► 55 ఐపీఎల్ 12లో చెన్నై స్పిన్నర్లు తీసిన వికెట్ల సంఖ్య. అన్ని సీజన్లలోకెల్లా ఇదే అత్యధికం. తాహిర్–హర్భజన్–జడేజా ముగ్గురూ 12పైగా వికెట్లు సాధించారు. ►148 గత ఆరేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్లు, ఐపీఎల్ సహా వైజాగ్ మైదానంలో సగటు స్కోరిది. ఇక్కడ స్పిన్నర్ల ఎకానమీ రేట్ 6 కాగా, పేసర్లది 9.6 ►తుది జట్లు (అంచనా) ►చెన్నై: వాట్సన్, డుప్లెసిస్, రైనా, మురళీ విజయ్, రాయుడు, ధోని, జడేజా, బ్రేవో, హర్భజన్, దీపక్ చహర్, తాహిర్ ►ఢిల్లీ: పృథ్వీ, ధావన్, అయ్యర్, పంత్, ఇంగ్రామ్/మున్రో, రూథర్ఫర్డ్, అక్షర్, కీమోపాల్, మిశ్రా, మోరిస్/ బౌల్ట్, ఇషాంత్. -
‘థంపికి అందుకే బౌలింగ్ ఇచ్చాం’
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై సన్రైజర్స్ రెండు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే విజయానికి దగ్గరగా వెళుతున్న సన్రైజర్స్కు బాసిల్ థంపి వేసిన ఓవర్ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్న థంపి సన్రైజర్స్కు విజయాన్ని దూరం చేశాడు. అయితే ఖలీల్ను కాదని థంపికి బంతినివ్వడంపై సారథి విలియమ్సన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన విలియమ్సన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. రిషభ్ పంత్ ఎడమచేతివాటం బ్యాట్స్మన్ కావడంతో కుడిచేతివాటం పేసర్ సరైన ఆప్షన్ అని భావించడంతోనే థంపికి అవకాశం ఇచ్చానని తెలిపాడు. అయితే ఢిల్లీ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. అతడిని ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ తమ ప్రణాళికలు అమలు కాకుండా చేశాడని పేర్కొన్నాడు. ‘మేం నిర్దేశించింది మంచి లక్ష్యమే. ఈ పిచ్పై ఎంత కావాలో అంత లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచాం. అయితే ఢిల్లీ బ్యాట్స్మెన్ సమష్టిగా ఆడారు. ఈ విజయానికి వాళ్లు పూర్తి అర్హులు. ఢిల్లీ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ కలిసికట్టుగా రాణించారు. అయితే మాకు వచ్చిన అవకాశాలను జారవిడిచాం. ఈ మ్యాచ్లో వందశాతం రాణించామని చెప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కీలకమైన మ్యాచ్ల్లో ప్రతీ ఆటగాడు రాణించాల్సి ఉంటుంది. కానీ, మా జట్టులో అలా జరగలేదు. డేవిడ్ వార్నర్, బెయిర్స్టో లేకుండా బరిలో దిగిన మ్యాచ్ల్లోనూ బాగానే ఆడాం. అయితే, చాలా మ్యాచ్ల్లో విజయతీరాలకు వచ్చి ఓడిపోయాం. వచ్చే సీజన్లో మరింత రాణించేందుకు కృషి చేస్తాం’ అని విలియమ్సన్ వివరించాడు. -
అమిత్ నీకిది తగునా..?
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ద్వారా ఔటయ్యాడు. ఐపీఎల్లో ఇలా ఔటైన రెండో ఆటగాడిగా మిశ్రా నిలిచాడు. ఐపీఎల్ 2013లో రాంచీ వేదికగా పుణే వారియర్స్తో జరుగిన మ్యాచ్లో అప్పటి కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు యుసఫ్ పఠాన్ కూడా సరిగ్గా ఇలానే పెవిలియన్కు చేరాడు. ఇక మిశ్రా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఈ వెటరన్ ఆటగాడు ప్రవర్తించాడని కొందరు కామెంట్ చేశారు. పరిగెత్తేప్పుడు మిశ్రా గూగ్లీకి ప్రయత్నించాడని మరికొందరు చమత్కరించారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ క్యాపిటల్స్-సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో రసవత్తర డ్రామా నడిచింది. 3 బంతుల్లో 2 పరుగులు అవసరమైన స్థితిలో ఖలీల్ బంతికి షాట్ ఆడబోయి విఫలమయ్యాడు అమిత్ మిశ్రా. బంతి బీట్ అయ్యాక అతను పరుగందుకున్నాడు. వికెట్ కీపర్ సాహా బంతిని స్టంప్స్కు కొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. పిచ్ మధ్యలో ఉన్న ఖలీల్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకింగ్ వైపున్న స్టంప్స్ కొట్టబోయాడు. ఐతే మిశ్రా ఈ సంగతి గమనించి ఉన్నట్లుండి తన దారి మార్చుకున్నాడు. స్టంప్స్కు అడ్డంగా పరుగెత్తే ప్రయత్నం చేశాడు. దీంతో ఖలీల్ విసిరిన బంతి అతడికే తాకింది. దీనిపై ఖలీల్ సమీక్ష కోరాడు. మూడో అంపైర్ రీప్లే చూసి మిశ్రా ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డం పడ్డాడని నిర్ధరించి.. ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద అతడిని ఔట్గా ప్రకటించాడు. -
ఐపీఎల్ చరిత్రలో రెండో ఆటగాడు మిశ్రా
-
ఖలీల్ వికెట్ తీసి 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్
-
థంపి.. ఏం బౌలింగ్రా అది?
హైదరాబాద్: ‘బాసిల్ థంపి’ ఈ పేరును సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోరు. చేతుల దాకా వచ్చిన విజయాన్ని తన ఒక్క ఓవర్తో ఈ సన్రైజర్స్ పేసర్ దూరం చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా విశాఖపట్నం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్- ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా థంపి వేసిన 18వ ఓవర్ అప్పటివరకు విజయం దిశగా సాగుతున్న సన్రైజర్స్ గతి మార్చింది. దీంతో థంపిని టార్గెట్ చేస్తూ సన్రైజర్స్ అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘నీకెవడ్రా బౌలింగ్ నేర్పింది’అంటూ ఓ అభిమాని మండిపడగా..‘నాకు బయటకనిపించు తాట తీస్తా’, ‘ఢిల్లీ గెలవలేదు.. థంపి ఓడించాడు’, ‘థంపి ఏం బౌలింగ్రా అది’అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పోస్ట్ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్రైజర్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి అదిరే ఆరంభం లభించినప్పటికీ.. ఖలీల్, రషీద్ఖాన్లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఢిల్లీని కష్టాల్లోకి నెట్టారు. చివర్లో మహ్మద్ నబి, భువనేశ్వర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీకి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులో పంత్ మినహా బ్యాట్స్మెన్ ఎవరూ లేకపోవడంతో సన్రైజర్స్ శిబిరంలో ఆనందం మొదలైంది. ఈ దశలో సారథి విలియమ్సన్ ఖలీల్కు రెండు ఓవర్లు వేసే అవకాశం ఉన్నా థంపికి బంతిని అప్పగించాడు. థంపి వేసని ఆ ఓవరల్లో పంత్ రెచ్చిపోయాడు. వరుస బౌండరీలతో చెలరేగడంతో ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీకి చివరి రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులే అవసరమవడంతో సులువుగా విజయం సాధించింది. అయితే థంపికి కాకుండా ఖలీల్కు బౌలింగ్ అవకాశం ఇస్తే సమీకరణాలు వేరేగా ఉండేవని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో థంపిపై సన్రైజర్స్ అభిమానులు గరంగరంగా ఉన్నారు. -
ఖలీల్ ‘ఫోన్ కాల్’ సెలబ్రేషన్స్
హైదరాబాద్: క్రికెట్లో బ్యాట్స్మన్ను ఔట్ చేసిన తర్వాత బౌలర్లు వివిధ రకాల హావభావాలతో సంబరాలు చేసుకుంటారు. అలా సంబరాలు భిన్నంగా చేసుకునే వారిలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ మొదటి స్థానంలో ఉంటాడు. తాజాగా మరో ఆటగాడు చేసుకున్న సంబరాలు ఆశ్చర్యంతో పాటు ఆలోచనలో పడేశాయి. సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్ ‘ఫోన్ కాల్ సెలెబ్రేషన్స్’ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా బుధవారం రాత్రి విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో సన్రైజర్స్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు ధావన్, పృద్విషాలు మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. 8వ ఓవర్లో ధావన్ను దీపక్ హుడా పెవిలియన్కు పంపాడు. 11వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను.. చివరి బంతికి పృథ్వీ షాను ఖలీల్ ఔట్ చేశాడు. అప్పటికే అర్ధ సెంచరీ చేసి ఊపుమీదున్న షా పెవిలియన్ చేరడంతో ఖలీల్ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. చేతిలో నంబర్స్ నొక్కి.. హలో అంటూ మైదానంలో పరుగెత్తుతూ 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి సంబందించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ‘నా ఆట చూడమంటూ చీఫ్ సెలక్టర్కు ఫోన్ చేస్తున్నాడు’,,‘మ్యాచ్ గెలుస్తున్నాం అని ఎవరికో కాల్ చేశాడు’అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్బంగా కోహ్లిని ఔట్ చేసిన తర్వాత కూడా ఖలీల్ చిత్రమైన రీతిలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం ఖలీల్ను కోహ్లి ఆటపట్టిచ్చిన విషయం తెలిసిందే. -
ఐపీఎల్ 12; కుర్రాళ్లు కుమ్మేశారు!
సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్–12లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో యువ ఆటగాళ్లు సత్తా చాటారు. 21 సంవత్సరాలు, అంత కన్నా తక్కువ వయసున్న నలుగురు ఆటగాళ్లు మ్యాచ్లో కీలక ప్రదర్శన చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. డీసీ విజయం సాధించడంలో ఇద్దరు యువ ఆటగాళ్లు పృథ్వీ షా, రిషబ్ పంత్ కీలక భూమిక పోషించారు. ఆరంభంలో పృథ్వీ షా అర్ధసెంచరీతో అదరగొట్టగా, చివరల్లో పంత్ మెరుపులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్లో 21 ఏళ్ల విండీస్ టీనేజర్ కీమో పాల్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత బౌలింగ్తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మేడిన్ ఓవర్ కూడా ఉండటం విశేషం. ఈ నలుగురిలో అందరి కంటే చిన్నవాడైన పృథ్వీ షా(19) ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడి 348 పరుగులు సాధించాడు. పంత్(21) 15 మ్యాచ్ల్లో 450 పరుగులు చేశాడు. కీమో పాల్ 7 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు దక్కించుకున్నాడు. 20 ఏళ్ల వయసున్న రషీద్ ఖాన్ 15 మ్యాచ్ల్లో 17 వికెట్లు నేలకూల్చాడు. ఈ నలుగురిలో ఎవరు స్టార్ ఫెర్ఫార్మర్ అంటూ ఐసీసీ కూడా ట్వీట్ చేసింది. (చదవండి: సన్పోరు సమాప్తం) -
తీగలాగితే డొంక కదిలింది
క్రికెట్ బెట్టింగ్ అనేక మంది జీవితాలను నాశనం చేసింది. ఎందరో యువకులు సర్వం కోల్పోయి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడిన మధ్యప్రదేశ్ యువకులను విచారిస్తే కంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా 220 మందికిపైగా బుకీలు ఉన్నట్లు గుర్తించారు. బుకీలను అరెస్టు చేసేందుకు రూరల్ ఎస్పీ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన రాష్ట్రాల పోలీసులతో సంప్రదించి బెట్టింగ్ ముఠాల గుట్టురట్టు చేసేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు: యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ ఆన్లైన్లో ఘరానా మోసాలకు పాల్పడుతున్న జిల్లాకు చెందిన బుకీతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ ద్వివేది, అవదీష్ ప్రతాప్సింగ్, దివ్యాంషు సింగ్లను అదుపులోకి తీసుకొని, 5న రాజపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి నాగార్జునలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచి జిల్లాలో బెట్టింగ్లు కొనసాగుతున్న సంఘటనలు ఎస్పీ రాజశేఖరబాబు దృష్టికి వెళ్లడంతో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బుకీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పరారీలో ఉన్న కలకత్తాకు చెందిన ప్రధాన బుకీ వద్ద నుంచి నాగార్జున ప్రత్యేకంగా వెబ్సైట్లో లింక్లను తీసుకొని వాటిని బెట్టింగ్ రాయుళ్లకు షేర్ చేస్తూ వాటి ద్వారా బెట్టింగ్లు నిర్వహించాడు. రంగంలోకి టాస్క్ఫోర్స్ బృందం... సత్తెనపల్లి కేంద్రంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ల్లో నాగార్జున బెట్టింగ్లో తనకు ఇవ్వాల్సి ఉన్న రూ 6 వేలు ఇవ్వలేదంటూ సత్తెనపల్లికి చెందిన అంకళ్ల ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు బాధ్యతను టాస్క్ఫోర్స్ బృందానికి అప్పగించారు. దీంతో వరుసగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దైన శైలిలో విచారణ చేపట్టడంతో పలు ఆసక్తి కర విషయాలు వెలుగు చూడటంతో అవాక్కవడం వారి వంతైంది. ఖాకీ సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 226 మంది బెట్టింగ్లో పాల్గొన్నట్లు తేల్చారు. వెంటనే ప్రధాన నిందుతుడైన నాగరాజు బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి అతని ఖాతాలో ఉన్న రూ. 22,16 లక్షల నగదును సీజ్ చేశారు. విడివిడిగా విచారణలో.... విచారణలో భాగంగా మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు యువకులను విడివిడిగా విచారణ చేపట్టడంతో పొంతన లేని సమాదానాలు చెప్పడంతో మరింత లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయాలు రాబట్టారు. ముగ్గురు నిందితుల వాట్సాప్, ఫేస్బుక్ లను పరిశీలించి వారి వద్ద ఉన్న బుకీల ఫోను నెంబర్లను వారి అడ్రస్లను పరిశీలిస్తే దాదాపుగా దేశ వ్యాప్తంగా బుకీలు వీరి పరిధిలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునతో పాటు ఇంకా బుకీలు ఉండటంతో పాటు దేశ వ్యాప్తంగా 220 మంది ప్రధాన బుకీలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. బెట్టింగ్ రాయుళ్ల సంగతికి వస్తే వేలాదిగా ఉన్నట్లు గుర్తించారు. డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లిన ఎస్పీ... క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి పునాదులను జిల్లాలో కూడా పోలీసులు గుర్తించడంతో జిల్లాలో ఉన్న బుకీలందరూ విషయం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా అండర్గ్రౌండ్కు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ప్రకారం బుకీలను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. టాస్క్ఫోర్స్ బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు ప్రారంబించారు. విచారణలో తీగ లాగితే డొంక కదలడంతో దేశ వ్యాప్తంగా బుకీలు ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లారు. మిగిలిన రాష్ట్రాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారని తెలిసింది. మరోసారి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురి పోలీస్ కష్టడీకి తీసుకొని విచారణ చేపట్టేందుకు సిద్దం అయ్యారు. టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు బుకీల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాధ్యం అయ్యేనా... ఖాకీ సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలను గుర్తించి వారిని అరెస్టు చేయడం రాష్ట్ర పోలీసులకు సవాలుగా నిలిచింది. పక్క రాష్ట్రం నుంచి నిందితులను అరెస్టు చేయాలంటే డీజీపీ అనుమతితో ఎస్పీ ఫారన్ పాస్పోర్టు జారీ చేయాల్సి ఉంటుంది. విడతల వారీగా చేపట్టినా అందరినీ అరెస్టు చేయాలంటే దాదాపుగా ఏడాది సమయం పడుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. ఇదంతా సాధ్యం అవుతుందా? లేక పోతే మమ అనిపిస్తారా? అనే సందేహాలు పోలీస్శాఖలో ఉన్నాయి. ఏదిఏమైనా పోలీస్బాస్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే సాధ్యం అవుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సాగర్ నగరికి సూపర్ కింగ్స్
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బుధవారం సాయంత్రం నగరానికి చేరుకుంది. జట్టు సభ్యులకు విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. కెప్టెన్ ధోని, జట్టు సభ్యులు సురేష్ రైనా, హర్బజన్సింగ్, డుప్లెసిస్, షేన్ వాట్సన్, మురళీ విజయ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చహర్, డ్వేన్ బ్రేవో, మోహిత్శర్మ తదితరులు విశాఖ చేరుకున్నారు. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఓటమి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శుక్రవారం నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఎలిమినేషన్ ఆడనుంది. బుధవారం ఎలిమినేషన్ మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చైన్నై తలపడనుంది. -
సన్పోరు సమాప్తం
-
ఎలిమినేటర్లో ఓడిన హైదరాబాద్
-
సన్పోరు సమాప్తం
అతి తక్కువ పాయింట్లతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్ చేరిన జట్టుగా గుర్తింపు పొందిన సన్రైజర్స్ ఆట అంతటితోనే ముగిసింది. లీగ్లో కొనసాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్లో హైదరాబాద్ విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసక్తికరంగా, అనూహ్య మలుపులతో సాగిన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్లో అంతంత మాత్రం ప్రదర్శనతో సాధారణ స్కోరు నమోదు చేసిన రైజర్స్ బౌలింగ్లో మాత్రం ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో మ్యాచ్ను సొంతం చేసుకునేలా కనిపించింది. కానీ రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆట గమనాన్ని మార్చేసింది. చివరకు మరో బంతి మిగిలి ఉండగా విజయాన్ని అందుకొని ఢిల్లీ సంబరాలు చేసుకుంది. గత ఏడాది రన్నరప్ సన్రైజర్స్ ఈసారి నాలుగో స్థానానికి పరిమితం కాగా... 2012 తర్వాత ప్లే ఆఫ్ చేరి ఎలిమినేటర్లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టే లక్ష్యంతో రేపు వైజాగ్లోనే చెన్నైతో పోరు సిద్ధమైంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఐపీఎల్–12లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆట ముగిసింది. బుధవారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (19 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (36 బంతుల్లో 30; 3 ఫోర్లు), కెప్టెన్ విలియమ్సన్ (27 బంతుల్లో 28; 2 ఫోర్లు), విజయ్ శంకర్ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా అమిత్ మిశ్రా (1/16) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయగా, కీమో పాల్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రిషభ్ పంత్ (21 బంతుల్లో 49; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్ క్యాపిటల్స్ను గెలిపించాయి. అంతంత మాత్రమే... సీజన్లో మూడో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న గప్టిల్ కీలక పోరులో రైజర్స్కు కావాల్సిన శుభారంభాన్ని అందించాడు. ఇషాంత్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన గప్టిల్, బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో మరో రెండు భారీ సిక్సర్లతో జోరు ప్రదర్శించాడు. మరోవైపు బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే అంపైర్ ఎల్బీగా ప్రకటించినా ‘రివ్యూ’ కోరి సానుకూల ఫలితం పొందిన వృద్ధిమాన్ సాహా (8) ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఆ తర్వాత మిశ్రా తన తొలి ఓవర్లోనే గప్టిల్ను ఔట్ చేయడంతో ఒక్కసారిగా స్కోరు వేగం తగ్గింది. 5 పరుగుల వద్ద మిశ్రా బౌలింగ్లో విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ను పంత్ వదిలేశాడు. ఈ దశలో పాండే, విలియమ్సన్ ధాటిగా ఆడటంలో విఫలమయ్యారు. వరుసగా నాలుగు ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. వీరిద్దరు మూడో వికెట్కు 34 పరుగులు జోడించినా... 42 బంతులు తీసుకున్నారు. పాండేను ఔట్ చేసి పాల్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, ఇషాంత్ చక్కటి యార్కర్తో విలియమ్సన్ను బౌల్డ్ చేశాడు. అయితే చివర్లో విజయ్ శంకర్, నబీ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు హైదరాబాద్కు మెరుగైన స్కోరు అందించాయి. బౌల్ట్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన శంకర్ మరో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. పాల్ వేసిన 20వ ఓవర్లో రైజర్స్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయినా... ఆఖరి ఐదు ఓవర్లలో కలిపి 58 పరుగులు చేయగలిగింది. షా సూపర్... ఛేదనలో యువ పృథ్వీ షా అదిరే ఆటను ప్రదర్శించడంతో ఢిల్లీ దూసుకుపోయింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో శిఖర్ ధావన్ (16 బంతుల్లో 17; 3 ఫోర్లు) రెండు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టగా, షా దానిని కొనసాగించాడు. ఖలీల్ తొలి ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగిన అతను, భువీ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో వరుస బంతుల్లో షా 4, 6, 4 బాదడం విశేషం. అంతకుముందు 15 పరుగుల వద్ద నబీ బౌలింగ్లో తాను ఇచ్చిన సునాయాస క్యాచ్ను మిడాఫ్లో బాసిల్ థంపి వదిలేయడంతో బతికిపోయిన షా ఆ ‘లైఫ్’ను సమర్థంగా వాడుకున్నాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 55 పరుగులకు చేరగా తొలి వికెట్ భాగస్వామ్యాన్ని దీపక్ హుడా విడదీశాడు. హుడా వేసిన వైడ్ బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడబోయిన ధావన్... సాహా అద్భుత ప్రదర్శనకు స్టంపౌట్గా వెనుదిరిగాడు. 31 బంతుల్లో పృథ్వీ అర్ధ సెంచరీ పూర్తి కాగా... మరో ఎండ్లో కెప్టెన్ అయ్యర్ (10 బంతుల్లో 8; ఫోర్) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయ్యర్తో పాటు షార్ట్ బంతితో అదే ఓవర్లో పృథ్వీని కూడా ఔట్ చేసి ఖలీల్ అహ్మద్ ఒక్కసారిగా రైజర్స్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆ తర్వాత 15వ ఓవర్ను అద్భుతంగా ‘మెయిడిన్’ వేసిన రషీద్ ఖాన్... మున్రో (13 బంతుల్లో 14; ఫోర్, సిక్స్), అక్షర్ (0)లను ఔట్ చేయడంతో అనూహ్యంగా మ్యాచ్ సన్రైజర్స్ వైపు మొగ్గింది. అయితే పంత్ విధ్వంసం హైదరాబాద్ను ఐపీఎల్ నుంచి నిష్క్రమించేలా చేసింది. చివర్లో ఉత్కంఠ... జట్టును విజయానికి అతి చేరువగా తెచ్చిన పంత్ మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అవసరం లేకపోయినా భువనేశ్వర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔట్ కావడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగిపోయింది. 8 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉండగా పంత్ వెనుదిరిగాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 5 పరుగులు అవసరంకాగా... నాలుగో బంతికి పరుగు తీసే ప్రయత్నంలో మిశ్రా... బౌలర్ ఖలీల్ త్రోకు అడ్డుగా రావడంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూపంలో వెనుదిరిగాడు. 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండటంతో రైజర్స్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఐదో బంతిని కీమో పాల్ మిడ్ వికెట్ మీదుగా ఫోర్ కొట్టడంతో క్యాపిటల్స్ బృందం ఊపిరి పీల్చుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎలిమినేటర్ మ్యాచ్: ఢిల్లీ లక్ష్యం 163
విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్కు అదిరే ఆరంభం లభించలేదు. ఓపెనర్ వృద్దిమాన్ సాహా(8) మరోసారి నిరాశపరిచాడు. మరోవైపు ఆరంభం నుంచే ధాటిగా ఆడిన గప్టిల్(36) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఈ క్రమంలో మనీశ్ పాండేతో కలిసి సారథి విలియమ్సన్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో పాండే(30)ను కీమో పాల్ ఔట్ చేశాడు. రావడం.. బాదడం మనీష్ పాండే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ రావడంతోనే చెలరేగి పోయాడు. విలియమ్సన్(28) ఔటైన తర్వాత కూడా శంకర్ ఊపు తగ్గలేదు. మహ్మద్ నబీతో కలిసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఇన్నింగ్స్ జోరుగా కొనసాగుతుండగా శంకర్(25), నబీ(20)లు వెంటవెంటేనే ఔటయ్యారు. కీమో పాల్ వేసిన చివరి ఓవర్లో మూడు వికెట్లు పడటంతో సన్రైజర్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి. అయినప్పటికీ సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్ మూడు వికెట్లు దక్కించుకోగా.. ఇషాంత్ శర్మ రెండు.. బౌల్ట్, మిశ్రాలు తలో వికెట్ దక్కించుకున్నారు -
తిరుమలలో రోహిత్ శర్మ
సాక్షి, తిరుమల: టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం తిరుమలకు చేరుకున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నాడు. రోహిత్ శర్మ తరచుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటాడు. 2017లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత సతీసమేతంగా వెంకన్నను దర్శించుకున్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 12లో ముంబై ఇండియన్స్ టీమ్ ఫైనల్కు చేరింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి టైటిల్ వేటకు సిద్ధమైంది. ఈ నెల 12న హైదరాబాద్లో రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. విశాఖ చేరుకున్న ధోని సేన ఈనెల 10న విశాఖపట్నంలో వైఎస్ఆర్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైయర్-2 మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బుధవారం ఇక్కడికి చేరుకుంది. విశాఖ విమానాశ్రయంలో ఆటగాళ్లకు నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. -
చెన్నైతో తలపడేదెవరో?
విశాఖపట్నం: ఐపీఎల్లో రన్నరప్ హోదాలో ఎలిమినేషన్ మ్యాచ్కు సిద్దమౌతున్న సన్రైజర్స్ హైదరాబాద్....ఏడేళ్ల ఆనంతరం తిరిగి ఐపీఎల్ ప్లేఆఫ్కు అర్హత సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య నాకౌట్ పోరుకు విశాఖ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. తొలిసారిగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న విశాఖ స్టేడియం... సన్రైజర్స్కు రెండో హోమ్ గ్రౌండ్. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ సన్రైజర్స్ను బ్యాటింగ్కు అహ్వానించాడు. ఇక ఈ మ్యాచ్లో ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. కోలిన్ ఇంగ్రామ్ను పక్కకు పెట్టిన ఢిల్లీ కోలిన్ మున్రోను తీసుకుంది. వరుసగా విఫలమవతుతున్న యూసఫ్ ఫఠాన్ను తప్పించిన సన్రైజర్స్ దీపక్ హుడాకు అవకాశం కల్పించింది. ఐపీఎల్ లీగ్ దశ ముఖాముఖిలో తలో మ్యాచ్ గెలిచాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు క్యాలిఫయర్2లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది. సమాయానుకూలం.. కీలకం విశాఖలో ఎలిమినేషన్ మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లకు పిచ్ కండిషన్ కొత్తే అయినా సమయానుకూలంగా ఆడిన జట్టే క్వాలిఫయింగ్కు చేరుకోగలదు. ఇరుజట్లలోనూ స్టార్ విదేశీ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేరు. రబడ గాయం కారణంగా వెనుతిరగ్గా విరుచుకుపడే వార్నర్ ఇంటి ముఖం పట్టాడు. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు టాప్ ఆర్డర్లోని పృధ్వీషా, రిషబ్ పంత్, శిఖర్ ధావన్లలో ఏ ఇద్దరు పదహారు ఓవర్ల వరకు నిలిచినా భారీ స్కోర్ నమోదు కానుంది. శిఖర్–పృధ్వీ ఓపెనర్లుగా రాణిస్తుండగా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ తోడవుతున్నాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రబడ స్థానంలో ఇషాంత్ చెలరేగే అవకాశం ఉంది. . ట్రెంట్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ బంతితో చెలరేగనున్నారు. ఇక సన్రైజర్స్ చాంపియన్ అనుభవంతో బరిలోకి దిగుతోంది. తుదిజట్లు: ఢిల్లీ క్యాపిటల్స్: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, కోలిన్ మున్రో, రిషభ్ పంత్, రూథర్ఫర్డ్, అక్షర్ పటేల్, కీమో పాల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ సన్రైజర్స్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), వృద్దిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, మహ్మద్ నబి, దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, బాసిల్ థంపి -
ధోని టాస్ గెలిస్తే ఏం చేస్తాడు: ఐఐటీ మద్రాస్
హైదరాబాద్: ఐపీఎల్ ఫీవర్ క్రీడల వరకే కాదు.. చదువుల్లోకి కూడా పాకింది. ఐఐటీ మద్రాస్ సోమవారం నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో ఐపీఎల్కు సంబంధించిన ప్రశ్న అడిగి విద్యార్థులను ఆశ్చర్యపరిచింది. మంగళవారం చెపాక్ వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ ఎంచుకోవాలా అనే ప్రశ్నను సంధించింది. మ్యాచ్ జరగడానికి ముందు రోజు నిర్వహించిన మెటీరియల్ అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ పేపర్లో ఇదే తొలి ప్రశ్న కావడం విశేషం. క్రికెట్ అంటే ఇష్టపడే చాలా మంది విద్యార్థులనే కాదు.. ఐసీసీని కూడా ఈ ప్రశ్న ఆకర్షించింది. ప్రొఫెసర్ విఘ్నేష్ రూపొందించిన ఈ ప్రశ్నను మ్యాచ్ జరగడానికి ముందే ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రసుత్తం ఐసీసీ చేసిన ట్వీట్ తెగత వైరల్ అవుతోంది. ‘డై అండ్ నైట్ మ్యాచ్ల్లో మంచు కీలక పాత్ర పోషిస్తుంది. అవుట్ ఫీల్డ్పై మంచు అధికంగా కురవడం వల్ల బంతి తడిగా మారుతుంది. దీంతో బంతిపై పట్టు సాధించడం స్పిన్నర్లకు కష్టం అవుతుంది. ఫాస్ట్ బౌలర్లు కూడా నిర్దేశించిన చోట బంతిని విసరలేరు. దీంతో మంచు ఎక్కువగా ఉండటం రాత్రి పూట ఫీల్డింగ్ చేసే జట్టుకు ప్రతికూలంగా మారుతుంది. ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ మే 7న చెపాక్ స్టేడియంలో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది. ఆ రోజున చెన్నైలో గాలిలో తేమ 70 శాతం ఉండొచ్చు. ఆట ప్రారంభంలో ఉష్ణోగ్రత 39 డిగ్రీలు ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి అది 27 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సమాచారం ఆధారంగా ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ చేయాలా?’ అనే ప్రశ్నను విద్యార్థులకు సంధించారు. ఈ ప్రశ్నను రూపొందించిన ప్రొఫెసర్ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘32-33 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరితే మంచు ప్రభావం ఉంటుంది. ముంబైతో మ్యాచ్ జరిగే రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ సమయానికి 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.. దీంతో కచ్చితంగా మంచు కురుస్తుంది. కాబట్టి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం తెలివైన నిర్ణయం’అంటూ వివరించాడు. అనుకున్నట్టే టాస్ గెలిచిన చెన్నై సారథి ధోని తొలుత బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. బ్యాట్స్మెన్ వైపల్యానికి తోడు ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే నిర్దేశించిన స్వల్పలక్ష్యాన్ని ముంబై ఆడుతూ పాడుతూ ఛేదించడంతో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఐఐటీ ప్రొఫెసర్లా ధోని ఆలోచించలేకపోయాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూన్నారు. View this post on Instagram Shout out to Professor Vignesh at @iit_madras for making exams relevant to important, real-life issues! Can anyone help @mahi7781 and @chennaiipl make a decision before the toss tomorrow? (and show your workings 😜) #LoveCricket #Cricket #Madras A post shared by ICC (@icc) on May 6, 2019 at 7:20am PDT -
పాండ్యా ట్వీట్కు ధోని ఫ్యాన్స్ ఫిదా
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యాల బ్రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీడా, వ్యక్తిగత జీవితంలో ధోనినే తనకు ఆదర్శమంటూ పాండ్యా పలువేదికల్లో ప్రకటించాడు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ధోనిపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని అనేకసార్లు చాటుకున్నాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని మార్క్ హెలికాప్టర్ షాట్లతో పాండ్యా సంచలనం సృష్టిస్తున్నాడు. తాజాగా ధోని గురించి పాండ్యా చేసిన ట్వీట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంగళవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్ అనంతరం పాండ్యా తన ట్విటర్లో ధోనితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అంతేకాకుండా ‘నా స్ఫూర్తి, నా స్నేహితుడు, నా సోదరుడు, నా లెజెండ్ ఈయనే.. మహేంద్ర సింగ్ ధోనీ’ అంటూ పోస్టు చేశాడు. దీంతో పాటు ధోనీ హెలికాప్టర్ షాట్లను గుర్తుచేస్తూ హెలికాప్టర్ ఎమోజీని పెట్టాడు. ప్రస్తుతం పాండ్యా చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ధోని అభిమానులు పాండ్యా ట్వీట్కు ఫిదా అయ్యారు. ప్రస్తుతం యువ క్రికెటర్లకు ధోనినే స్పూర్తి అంటూ అతడి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మంగళవారం చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్తో తలపడిన మూడు మ్యాచ్ల్లోనూ సీఎస్కే ఓడిపోయింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ నేరుగా ఫైనల్కు చేరగా... సీఎస్కే మాత్రం క్వాలిఫయర్2 ఆడాల్సి వచ్చింది. My inspiration, my friend, my brother, my legend ❤🚁 @msdhoni pic.twitter.com/yBu0HEiPJw — hardik pandya (@hardikpandya7) May 8, 2019 -
క్యాచ్ వదిలేస్తావా? విజయ్పై ధోనీ ఆగ్రహం
చెన్నై: ఐపీఎల్ సీజన్లో భాగంగా మంగళవారం సొంతగడ్డపై జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో చెన్నైకి అంతగా కలిసిరాలేదు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై చేసింది 131 పరుగులే. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సునాయసంగా ఛేదించింది. బ్యాటింగ్లో విఫలమైన చెన్నై జట్టు బౌలింగ్లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది. దీనికితోడు చెన్నై ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు ముంబైకి కలిసివచ్చాయి. ముఖ్యంగా 132 పరుగుల లక్ష్యఛేదనలో ఆద్యంతం చెలరేగిపోయిన సూర్యకుమార్ యాదవ్ను తక్కువ స్కోరుకే ఔట్ చేసే అవకాశం చెన్నైకి వచ్చింది. దీపక్ చాహర్ బౌలింగ్లో సూర్యకుమార్ ఒకింత పేలవమైన షాట్ ఆడాడు. దీంతో బంతి గాల్లోకి లేచింది. తనకు కొద్ది దూరం నుంచి వెళుతున్న బంతిని పరిగెడుతూ అందుకునే ప్రయత్నం చేసిన మురళీ విజయ్ చివరికీ క్యాచ్ను వదిలేశాడు. ఒకింత కష్టమైపా ఈ క్యాచ్ను విజయ్ పట్టుకొని ఉంటే మ్యాచ్ వేరే తరహాలో ఉండేది. కీలకమైన దశలో క్యాచ్లో వదిలేసిన విజయ్పై మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రీప్లేలో విజయ్పై ధోని ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. -
విజయ్పై ధోనీ ఆగ్రహం
-
చెన్నైకి షాక్.. అందుకే మేం గెలిచాం!
చెన్నై: ఎంఏ చిదంబరం స్టేడియం అలియాస్ చెపాక్ మైదానం.. ఏళ్లుగా చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు ఈ మైదానం పెట్టని కోటగా ఉంది. ఈ మైదానంలో 24 మ్యాచ్లు ఆడిన చెన్నై 19 విజయాలను సొంతం చేసుకుంది. స్లోగా, మందకొడిగా ఉండే చెపాక్ మైదానాన్ని తన కంచుకోటగా మార్చుకున్న చెన్నై జట్టు.. ఇక్కడ ప్రత్యర్థులను వరుసగా మట్టికరిపిస్తూ వస్తోంది. ఇక, తాజా ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ విషయంలో ఇది తలకిందులైందనే చెప్పాలి. ఐపీఎల్ చాంపియన్స్ డెన్ అయిన చెప్పాక్లో చెన్నైని ఓడించే మంత్రాన్ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. వరుసగా మూడుసార్లు చెన్నైని సొంత మైదానంలో ఓడించిన ముంబై ఇండియన్స్.. తాజాగా ఫైనల్కు చేరుకుంది. ఐపీఎల్ ఫైనల్కు వెళ్లడం ఆ జట్టుకు ఇది ఐదోసారి. గతంలో నాలుగుసార్లు ఫైనల్కు వెళ్లిన ముంబై మూడుసార్లు కప్ సొంతం చేసుకుంది. తాజా ఐపీఎల్ క్వాలిఫైయర్-1లో కంచుకోటలో చెన్నైను ముంబై అలవోకగా మట్టికరిపించింది. మందకొడిగా ఉండే చెప్పాక్ పిచ్ను బాగా అర్థం చేసుకున్న ముంబై జట్టు తన స్పిన్ వనరులతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టును కుదేలు చేసింది. చెన్నైను 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 131 పరుగులకు మాత్రమే పరిమితం చేసిన ముంబై బౌలర్లు రాహుల్ చాహర్ (14 పరుగులకు 2 వికెట్లు, కృనాల్ (21 పరుగులకు 1 వికెట్), జయంత్ యాదవ్ (25 పరుగులకు ఒక వికెట్).. ధోనీలాంటి టాప్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. 2010 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే.. ఐదు మ్యాచ్ల్లో మూడు విజయాలతో చెన్నైపై ముంబై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మ్యాచ్ అనంతరం ఈ అంశంపై ముంబై సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చెన్నైను సొంతగడ్డ మీద ఓడించడంపై స్పందిస్తూ.. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఎదురుదాడి చేయగల బ్యాటింగ్ యూనిట్, వ్యూహాలు ఉండటమే చెప్పాక్లో తమ విజయానికి కారణమన్నారు. తమ జట్టు కూర్పు సమతూకంతో ఉందని, పరిస్థితులు ఎలా ఉన్నా దీటుగా ఆడగల నేర్పు ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారని, చెప్పాక్ మైదానంలోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం, ఆత్మవిశ్వాసంతో బ్యాట్స్మెన్ ఆడటమే చెన్నైలో తమ వరుస విజయాలకు కారణమని రోహిత్ తెలిపారు. ఇక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకొని.. ఆకళింపు చేసుకొని బాగా ఆడగలిగామని రోహిత్ ఆనందం వ్యక్తం చేశారు. 54 బంతుల్లో 71 పరుగులు చేసి ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముంబై ఇండియన్స్ ఉత్తమ బ్యాట్స్మెన్లో సూర్యకూమార్ ఒకరని కొనియాడారు. తమ జట్టు ఫైనల్కు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఫైనల్కు ఇంకా మూడురోజుల సమయం ఉండటంతో ఈ విరామాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ఫైనల్కు సరికొత్తగా సన్నద్ధమవుతామని రోహిత్ వివరించారు. -
సన్రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ డిష్యుం డిష్యుం..
ఎన్నెన్నో మలుపులు.. ఎన్నెన్నో మెలికలు. ఎన్నెన్నో ఎత్తులు.. ఎన్నెన్నో లెక్కలు. ఈసారి.. ప్రతిసారీ.. ఇవే ఉత్కంఠభరిత, ఉత్తేజకర పరిణామాలు. అందుకే ఐపీఎల్ ప్రీమియర్ లవ్లీ లీగ్ అయింది. క్రికెట్ పిచ్చోళ్లకు కిక్కిచ్చే మేటి పోటీ అయింది. అలాటి కిర్రాక్ పార్టీ లాటి టోర్నీ.. చావో రేవో తేలే దశలో.. నువ్వో నేనో మిగిలే కసితో.. జరుగుతున్న ప్లే ఆఫ్ మ్యాచ్లను తెచ్చి మన వైజాగ్కు బహుమతిలా అప్పజెప్పింది. ఇక చూస్కో నా సామిరంగా.. ఇప్పుడు వైజాగ్ క్రేజీ క్రికెట్ జోరుతో ఊగిపోతోంది. కీలకమైన ఎలిమినేషన్ మ్యాచ్ బుధవారం మన వైఎస్సార్ స్టేడియంలో సర్రని దూసుకుపోయే తారాజువ్వలా దూసుకుపోనుండగా.. రెండు కసి మీద ఉండే జట్లు పేల్చబోయే సిక్సర్ల ఔట్ల కోసం.. బౌండరీల బాంబుల కోసం ప్రతి క్రికెట్ వీరాభిమాని హృదయం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మరోవైపున ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య కాబోతూ ఉండడంతో అటు ఇదే హోం గ్రౌండయిన సన్రైజర్స్ సత్తా చూపి టోర్నీలో నిలబడాలని పట్టుదలతో ఉంటే.. అనుకోకుండా దొరికిన అవకాశాన్ని వృథా కానివ్వకూడదని దూకుడు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కాలుదువ్వుతోంది. రేగిపోతున్న ఈ రెండు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరును చూడడానికి వైఎస్సార్ స్టేడియం ఫుల్ ప్యాక్డ్గా రెడీగా ఉంది. ఇక టోర్నీలో నిలిచే జట్టేది? నిరాశతో వెనుతిరిగే జట్టేది? నేడే తేలిపోతుంది. గెట్ రెడీ ఫర్ ది థండర్. గెట్ రెడీ ఫర్ ది ఫీవర్! విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్లో రన్నర్సప్ హోదాలో ఎలిమినేషన్ మ్యాచ్కు సిద్దమౌతున్న సన్రైజర్స్ హైదరాబాద్....ఏడేళ్ల ఆనంతరం తిరిగి ఐపీఎల్ ప్లేఆఫ్కు అర్హత సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య నాకౌట్ పోరుకు విశాఖ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. తొలిసారిగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న విశాఖ స్టేడియం... సన్రైజర్స్కు రెండో హోమ్ గ్రౌండ్. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ప్రస్తుత ఐపీఎల్ సీజన్లీగ్లో ఢిల్లీ కాపిటల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఒకదశలో ఏకంగా తొలిస్థానానికే ఎగబాకింది. ఇక 12 పాయింట్లే సాధించిన జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్కు అర్హత సాధించడం విశేషం. నెట్ రన్రేట్తో సన్రైజర్స్ ఇలా ప్లేఆఫ్కు చేరుకోగలిగింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ మంచి ఊపు మీద ఉన్నా నెట్రన్రేట్లో వెనుకబడి ఎలిమినేషన్ ఆడాల్సి వస్తోంది. ఇక ఈ రెండు జట్ల మధ్య పోరులో విజయం ఎవర్ని వరిస్తే ఆ జట్టు క్వాలిఫైయింగ్కు చేరుకోనుండగా ఓడిన జట్టు ఇంటికి మరలనుంది. అందుకే క్వాలిఫయింగే లక్ష్యంగా విశాఖ స్టేడియంలో ఇరు జట్లు మంగâ¶ళ వారం ప్రాక్టీస్ చేసాయి. సాయంత్రం ఢిల్లీ కాపిటల్స్ నెట్ ప్రాక్టీస్ చేయగా, రాత్రి సన్రైజర్స్ జట్టు ప్రాక్టీస్ చేసింది. దేశవాళీ సత్తా ఇరుజట్లకు విశాఖ పిచ్పై కొంత అవగాహన ఉంది. ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. అది వారికి కలిసివచ్చే అంశం కాగా...చాంపియన్గా నిలిచిన సత్తా సన్రైజర్స్ది. సన్రైజర్స్ నాలుగు సార్లు ప్లేఆఫ్కు అర్హత సాధించగా ఓసారి విజేతగా ప్రస్తుతం రన్నర్సప్గా బరిలోకి దిగుతుంది. ఆ జట్టు గతంలో వైజాగ్లో ఆడినదే. ఇక మూడుసార్లు ప్లేఆఫ్కు అర్హత సాధించిన ఢిల్లీ కాపిటల్స్ ఏడేళ్ల అనంతరం మరోసారి ప్లేఆఫ్కు అర్హత సాధించి పోరుకు సిద్ధమవుతోంది. ఇరుజట్లకు చెందిన విదేశీ స్టార్ ఆటగాళ్ళు జట్టుకు అందుబాటులో లేరు. çపసికూన అయిన ఆఫ్గాన్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్ళపై సన్రైజర్ ఆధారపడగా ఢిల్లీకి టాప్ఆర్దర్లో నలుగురు స్వదేశీ ఆటగాళ్లే ఉండటం కలిసివచ్చే ఆంశమే. సమాయానుకూలం.. కీలకం విశాఖలో ఎలిమినేషన్ మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లకు పిచ్ కండిషన్ కొత్తే అయినా సమయానుకూలంగా ఆడిన జట్టే క్వాలిఫయింగ్కు చేరుకోగలదు. ఇరుజట్లలోనూ స్టార్ విదేశీ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేరు. రబడ గాయం కారణంగా వెనుతిరగ్గా విరుచుకుపడే వార్నర్ ఇంటి ముఖం పట్టాడు. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు టాప్ ఆర్డర్లోని పృధ్వీషా, రిషబ్ పంత్, శిఖర్ ధావన్లలో ఏ ఇద్దరు పదహారు ఓవర్ల వరకు నిలిచినా భారీ స్కోర్ నమోదు కానుంది. శిఖర్–పృధ్వీ ఓపెనర్లుగా రాణిస్తుండగా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ తోడవుతున్నాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రబడ స్థానంలో ఇషాంత్ చెలరేగనున్నాడు. ట్రెంట్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ బంతితో చెలరేగనున్నారు. అజింక్యా, లివింగ్స్టోన్ స్లోవర్ డెలివరీలు వేయడానికి సిద్ధమౌతున్నారు. ఇక సన్రైజర్స్ చాంపియన్గా అనుభవంతో తలపడనుంది. అఫ్గాన్ కుర్రాడు నబీ బౌలింగ్ను వినియోగించుకోనుంది. విజయ్శంకర్, యూసఫ్ పఠాన్లో ఒకరిని ఓపెనింగ్కు పంపే అవకాశాన్ని కెప్టెన్ భువనేశ్వర్ పరిశీలిస్తున్నాడు. మనీష్పాండే, దీపక్లు బ్యాట్కు పనిచెప్పనుండగా షాకిబ్, సందీప్, సిద్ధార్థ, రషీద్ బంతితో మెరిపించనున్నారు. బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు తొలి బంతి నుంచే విశాఖ క్రీడాభిమానులకు ఎలిమినేషన్ నాకవుట్ మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తించనుంది. -
చెన్నై బ్యాట్స్మెన్పై ధోనీ ఫైర్..!
చెన్నై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు.. చెన్నై సూపర్కింగ్స్పై వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించింది. మంగళవారం చెప్పాక్ మైదానంలో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో చెన్నైను మట్టికరిపించి.. ఫైనల్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. బ్యాటింగ్కు కష్టసాధ్యమైన చెపాక్ మైదానంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సారథి ధోనీకి చెన్నై బ్యాట్స్మెన్ ఒకింత షాక్ ఇచ్చారు. కీలకమైన ఈ మ్యాచ్ బ్యాట్స్మెన్ భారీ పరుగులు చేయడంలో విఫలమవ్వడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (10), డుప్లెసిస్ (6) మరోసారి విఫలమవ్వగా.. సురేశ్ రైనా ఐదు పరుగులకే చేతులెత్తేశాడు. దీంతో భారీ పరుగులు రాబట్టాల్సిన పవర్ప్లేలో చెన్నై ఆచితూచి ఆడింది. చెప్పాక్ మైదానంలో పిచ్ పరిస్థితులు కూడా బ్యాట్స్మెన్కు అనుకూలించలేదు. 26 పరుగులు చేసి మురళి విజయ్ పెవిలియన్ బాట పట్టగా.. అంబటి రాయుడు (42), ధోనీ (37) తుదివరకు క్రీజ్లో నిలిచిన భారీ పరుగులు చేయలేకపోయారు. చెన్నై విసిరిన 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ సునాయసంగా ఛేదించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన చెన్నై కెప్టెన్ ధోనీ జట్టు చెత్త బ్యాటింగ్పై, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటంలో విఫలమవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. చావో-రేవో తేల్చుకోవాల్సిన రెండో క్వాలిఫైయర్లో గెలిచి ఫైనల్కు చేరాలంటే చెన్నై బ్యాటింగ్ మరింత మెరుగుపడాల్సిందేనని ధోనీ తేల్చి చెప్పారు. ‘ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే. కానీ పరిస్థితులు మాకు అనుకూలించలేదు. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో. హోమ్ పిచ్ పరిస్థితులను మేం త్వరగా పసిగట్టి ఉంటే బాగుండేది. ఇక్కడి పిచ్లో ఆరు, ఏడు గేమ్స్ ఆడాం. పిచ్ను బాగా అర్థం చేసుకొని.. హోం అడ్వాంటేజ్ తీసుకొని ఉండాల్సింది. పిచ్ ఎలా ప్రవర్తిస్తోంది? ట్యాకీగా ఉందా? బాల్ సరిగ్గా బ్యాటుపైకి వస్తుందా? అన్నది మేం తెలుసుకోవాల్సి ఉండేది. ఈ విషయాల్లో మేం వెనుకబడిపోయాం. బ్యాటింగ్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది’ అని ధోనీ అన్నారు. ‘మా జట్టులో బెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు. పలు మ్యాచ్ల్లో మేం బాగా బ్యాటింగ్ చేశాం. ఇప్పటివరకు వీరిమీద ఆధారపడుతూ వచ్చాం. వారికి అనుభవముంది. అయితే, పరిస్థితులు ఇంకా బాగా అర్థం చేసుకొని ఉండాల్సింది. నెక్ట్స్ గేమ్లో మేం బాగా ఆడుతామని భావిస్తున్నాం’ అని ధోనీ పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో కేవలం 131 పరుగులు చేయడంపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా తక్కువ స్కోరు అని పేర్కొన్నారు. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా మ్యాచ్ కోల్పోయేలా చేశాయన్నారు. అయితే, తమకు ఫైనల్కు వెళ్లేందుకు ఇంకో అవకాశముండటం ఆనందం కలిగిస్తోందని, ఆ మ్యాచ్లో రాణించి.. ఫైనల్కు వెళ్తామని చెప్పుకొచ్చారు. 🚁 finishers 🔥#MIvCSK #VIVOIPL pic.twitter.com/cHPZYORojP — IndianPremierLeague (@IPL) May 7, 2019 -
ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ వెళ్తున్నారా..?
ఉప్పల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను టార్గెట్గా చేసుకుని క్రీడాభిమానుల జేబులను కొల్లగొడుతున్న పిక్పాకెటర్లను సీసీఎస్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ పోలీస్స్టేషన్లో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, క్రైం అడిషనల్ డీసీపీ సలీమా, ఏసీపీ సందీప్లతో కలిసి వివరాలు వెల్లడించారు. గత నెల 29న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు క్రికెట్ స్టేడియం లోపల, బయట దాదాపుగా 300 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. వారిని ఘరానా పిక్ పాకెటర్స్గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. మహారాష్ట్రకు హత్వలీ రవి మల్లెపల్లిలోని మణిగిరి బస్తీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. చిన్నతనం నుంచే పిక్పాకెటింగ్కు అలవాటు పడిన అతడిపై పలు పోలీస్స్టేషన్ పరిధిలో 16 కేసులు ఉన్నాయి. పలుమార్లు జువైనల్ హోమ్కు వెళ్లి వచ్చాడు. స్కూటర్ మెకానిక్గా పని చేస్తున్న ఇదే ప్రాంతానికి చెందిన కాంబ్లే ఆకాష్పై వివిధ పోలీస్స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరు కాంబ్లే కిరణ్, హత్వలీ కిరణ్, కాంబ్లే లక్ష్మణ్తో కలిసి ముఠాగా ఏర్పడి పర్సులు, బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్నారు. చోరీ సొత్తును మల్లెపల్లికి చెందిన బొల్లెపల్లి హారతికి విక్రయించేవారు. వీరి నుంచి రూ.5.78,000 నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కాగా బొల్లెపల్లి హారతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య, జగన్నాధంరెడ్డి, ఇన్స్పెక్టర్లు శివశంకర్రావు, శ్రీదర్రెడ్డి, రవిబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఐపీఎల్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
-
ముంబై... చలో హైదరాబాద్
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో మళ్లీ తన స్థాయిని, సత్తాను ప్రదర్శించింది. మూడు సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు ఐదోసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. సీజన్లో రెండు లీగ్ మ్యాచ్లలో కూడా డిఫెండింగ్ చాంపియన్ చెన్నైపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన ప్రత్యర్థి కోట చెపాక్లో మళ్లీ అదే జోరు చూపించి మూడో విజయాన్ని నమోదు చేసింది. కీలకమైన తొలి క్వాలిఫయర్లో చక్కటి ప్రదర్శనతో ధోని బృందాన్ని కట్టడి చేసి మూడేళ్లలో రెండోసారి హైదరాబాద్ వేదికగా ఫైనల్ ఆడేందుకు సన్నద్ధమైంది. ముందుగా ముంబై స్పిన్నర్ల దెబ్బకు పరుగులు తీయడంలో తీవ్రంగా ఇబ్బంది పడిన చెన్నై... ఆ తర్వాత అదే స్పిన్తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమైంది. కీలకదశలో క్యాచ్లు వదిలేసి మూల్యం చెల్లించుకుంది. సాధారణ లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ సమయోచిత అర్ధ సెంచరీ ముంబైని గెలిపించింది. ఇక తుది పోరుకు చేరేందుకు చెన్నైకి రెండో క్వాలిఫయర్ రూపంలో శుక్రవారం మరో అవకాశం ముందుంది. చెన్నై: ఐపీఎల్–12 లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ అదే ఆటను ప్లే ఆఫ్స్లోనూ కొనసాగించింది. సమష్టి ఆటతో మరోసారి లీగ్లో ఫైనల్కు చేరింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు (37 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ధోని (29 బంతుల్లో 37 నాటౌట్; 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాహుల్ చహర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ (54 బంతుల్లో 71 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్కు వీరిద్దరు 63 బంతుల్లో జోడించిన 80 పరుగులే ముంబై విజయానికి బాటలు వేశాయి. కీలక భాగస్వామ్యం... పవర్ప్లే ముగిసేసరికే ముగ్గురు బ్యాట్స్మన్ ఔట్... మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ పరిస్థితి ఇది. అయితే రాయుడు, ధోని భాగస్వామ్యం జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. సీజన్లో కేవలం రెండో మ్యాచ్ ఆడిన మురళీ విజయ్ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) కూడా కొంత వరకు తన పాత్ర పోషించాడు. నెమ్మదైన పిచ్పై బ్యాటింగ్కు దిగిన చెన్నైని ప్రత్యర్థి స్పిన్నర్లు కట్టడి చేశారు. రాహుల్ చహర్ తన తొలి బంతికే డు ప్లెసిస్ (6)ను ఔట్ చేయగా, రైనా (5) మరో స్పిన్నర్ జయంత్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన వాట్సన్ (10)ను కృనాల్ వెనక్కి పంపించాడు. ఆరు ఓవర్ల తర్వాత స్కోరు 32/3 కాగా, జట్టును ఆదుకునేందుకు విజయ్, రాయుడు ప్రయత్నించారు. అయితే ఈ భాగస్వామ్యం కూడా ఎక్కువ సేపు సాగలేదు. వీరిద్దరు 38 బంతుల్లో 33 పరుగులు జోడించిన తర్వాత రాహుల్ చహర్ టర్నింగ్ బంతిని ఆడలేక విజయ్ స్టంపౌటయ్యాడు. అనంతరం రాయుడు, ధోని ఇన్నింగ్స్ బాధ్యతను భుజాన వేసుకున్నారు. జయంత్ వేసిన 14వ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ కొట్టగా... మలింగ ఓవర్లో ధోని వరుసగా కొట్టిన రెండు భారీ సిక్సర్లకు స్టేడియం హోరెత్తింది. అయితే బుమ్రా చివరి ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మరిన్ని మెరుపులకు అవకాశం లేకుండా పోయింది. ధోని, రాయుడు ఐదో వికెట్కు అభేద్యంగా 66 పరుగులు జత చేశారు. సూర్యకుమార్ అర్ధ సెంచరీ... ముంబైకి కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే రోహిత్ (4)ను ఔట్ చేసి దీపక్ చహర్ చెన్నైకి శుభారంభం అందించాడు. డి కాక్ (8)ను హర్భజన్ వెనక్కి పంపించాడు. ఈ దశలో సూర్యకుమార్, ఇషాన్ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రశాంతంగా ఆడుతూ పరుగులు సాధించారు. 37 బంతుల్లో సూర్యకుమార్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఇషాన్ను బౌల్డ్ చేసి తాహిర్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాతి బంతికే కృనాల్ పాండ్యా (0)ను కూడా తాహిర్ ఔట్ చేయగా... జడేజా వేసిన మరుసటి బంతికి స్లిప్లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్ను వాట్సన్ వదిలేయడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే సూర్యకుమార్, హార్దిక్ (13 నాటౌట్) కలిసి 9 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముంబై లక్ష్యం 132
చెన్నై: ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 132 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే ఆది నుంచి పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్(6), షేన్ వాట్సన్( 10)లు తీవ్రంగా నిరాశపరిచారు. సురేశ్ రైనా(5) కూడా విఫలం కావడంతో సీఎస్కే కష్టాల్లో పడింది. ఆ దశలో మురళీ విజయ్-అంబటి రాయుడుల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేసింది. వీరిద్దరూ 33 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మురళీ విజయ్(26) నాల్గో వికెట్గా నిష్క్రమించాడు. ఆపై అంబటి రాయుడు(42 నాటౌట్: 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్), ఎంఎస్ ధోని(37 నాటౌట్: 29 బంతుల్లో 3 సిక్సర్లు)లు ఫర్వాలేదనిపించడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు సాధించగా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యాలు తలో వికెట్ తీశారు. సీఎస్కేను కట్టడి చేసిన ముంబై బౌలర్లు తమకు అచ్చొచ్చిన మైదానంలో ముంబై ఇండియన్స్ మరోసారి ఆకట్టుకుంది. సీఎస్కేను ఆరంభం నుంచి కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. పిచ్ మందకొడిగా ఉండటాన్ని ఉపయోగించుకున్న ముంబై బౌలర్లు.. చెన్నైకు ఏ దశలోనూ బ్యాట్ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. దాంతో చెన్నై టాపార్డర్ అంతా పరుగులు చేయడానికి నానా ఇబ్బందుల్లో పడింది. ప్రధానంగా ముంబై స్పిన్నర్ రాహుల్ చాహర్ తన అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టకున్నాడు. 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు సాధించడంతో పాటు 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. -
ఫైనల్ బెర్త్ ఎవరిదో?
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-12వ సీజన్లో ఇక అసలు సిసలు సమరం ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్, చెన్నె సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లు ప్లేఆఫ్కు అర్హత సాధించగా, తొలి రెండు స్థానాల్లో నిలిచిన ముంబై, సీఎస్కేల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. నేడు(మంగళవారం) చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్కేతో జరుగునున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అభేద్యమైన రికార్డు ఉంది. ఎంతలా అంటే చివరి 20 మ్యాచ్ల్లో సీఎస్కే ఓడింది రెండు సార్లు మాత్రమే. అయితే ఈ రెండుసార్లు ఆ జట్టు ఓడింది ముంబై ఇండియన్స్చేతిలోనే. ఇప్పుడు మరోసారి తమ అడ్డాలో ముంబైతో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంచితే, 2008, 2010 సీజన్లో మాత్రమే సొంత వేదికలో ముంబైపై సీఎస్కే గెలవగలిగింది. తాజా సీజన్లో లీగ్లో ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచ్ల్లో ముంబై, చెన్నై తొమ్మిదేసి విజయాలతో ఉన్నాయి. లీగ్ దశలో రెండు సార్లు సీఎస్కేపై ముంబై ఇండియన్స్ గెలిచింది. బ్యాటింగ్లో ఏమాత్రం నిలకడ కనిపించకపోవడం చెన్నై జట్టును ఆందోళనపరుస్తోంది. డుప్లెసిస్, వాట్సన్, రైనాలు ఒక మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్లో విఫలమవుతున్నా రు. ముఖ్యంగా షేన్ వాట్సన్ ఫామ్ దయనీయంగా ఉంది. హైదరాబాద్పై చేసిన 96 పరుగులు మినహా అతడు జట్టుకు ఉపయోగపడింది శూన్యం. మిడిలార్డర్లో ధోనీ మినహా అంతా విఫలమే. అంబటి రాయుడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కానీ ముంబైలాంటి అద్భుత బౌలింగ్ లైన్పను ఎదుర్కొని భారీ స్కోరు సాధించాలంటే మాత్రం చెన్నై బ్యాట్స్మెన్ పూర్తి స్థాయిలో ఆడాల్సిందే. ఇక బౌలింగ్ విభాగం జట్టుకు అండగా ఉంది. స్పిన్నర్ తాహిర్ 21 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సీఎస్కే విజయాల్లో హర్భజన్, జడేజా, దీపక్ చాహర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. చెపాక్లోనూ తమకు మంచి రికార్డే ఉండడంతో ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమవుతోంది. ఓపెనర్లు రోహిత్, డికాక్ జట్టుకు మెరుపు ఆరంభాన్నిస్తుండగా సూర్యకుమార్, హార్దిక్ పాం డ్యా ఆ తర్వాత భారీ స్కోర్లకు కారణమవుతున్నా రు. వీరిని కట్టడి చేయడం చెన్నై బౌలర్లకు కష్టమే.. పొలార్డ్ ఒక్కసారి మాత్రమే తన స్థాయికి తగ్గట్టుగా ఆడాడు. బౌలింగ్లో పేసర్లు బుమ్రా, మలింగా, హార్దిక్లతో పాటు క్రునాల్, రాహుల్ చాహర్ స్పిన్నర్లుగా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఇక ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరొక అవకాశం ఉంటుంది. మరి ఏ జట్టు ముందుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుందో అనేది చూడాలి. తుదిజట్లు: సీఎస్కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, మురళీ విజయ్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహీర్ ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ -
ఆర్సీబీపై మాల్యా వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా స్పందించారు. ఆర్సీబీ జట్టు ఎప్పుడూ బలంగానే ఉంటుందని కానీ అది పేపర్పై మాత్రమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్సీబీ మాజీ సహయజమాని అయిన మాల్యా బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. 2008లో బెంగళూరు సిటీలో నిర్వహించిన వేలంలో విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఐపీఎల్ కమిటీ ముందుకొచ్చాడు. అయితే, ఆరంభ సీజన్లో ఆర్సీబీ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఆ జట్టు కేవలం రెండు సార్లు ఫైనల్కు చేరుకున్నప్పటికీ... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తాజా ఐపీఎల్ సీజన్లోనూ కోహ్లి సేన చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం తన ట్విట్టర్లో ‘మాపై చూపించిన ప్రేమ, మద్దతకు ధన్యవాదాలు. మొత్తం జట్టుతో పాటు అభిమానులు, గ్రౌండ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్కు ధన్యవాదాలు. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్గా వస్తాం’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ పోస్ట్పై విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించాడు. ‘ఆర్సీబీ ఎప్పుడూ గ్రేట్ లైనప్ని కలిగి ఉంది. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటంటే అది పేపర్పైనే’ అంటూ ఆర్సీబీ జట్టుకు చురకలు అంటించారు. -
కోహ్లితో వాగ్వాదం..డోర్ను ధ్వంసం చేసిన అంపైర్!
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లితో వాగ్వాదానికి దిగిన ఇంగ్లిష్ అంపైర్ నిగెల్ లాంగ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఒక నోబాల్ వ్యవహారంలో కోహ్లితో వాగ్వాదానికి దిగిన తర్వాత స్టేడియంలోని ఓ గది తలుపును నిగెల్ ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ ఉమేశ్యాదవ్ వేసిన ఓ బంతిని నిగెల్ నోబాల్గా ప్రకటించాడు. అయితే రీప్లేలో అది సరైన బంతిగా తేలడంతో కోహ్లికి, అంపైర్కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన నిగేల్ ఇన్నింగ్స్ విరామం సమయంలో అంపైర్ గది తలుపును పగలగొట్టాడు. ఈ ఘటనపై అంపైర్ విచారణ ఎదుర్కోవాల్సి ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఈ కారణంగా మే 12న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అంపైరింగ్ బాధ్యతల నుంచి అతడిని బీసీసీఐ తొలగించకపోవచ్చని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నిగెల్ లాంగ్.. మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్లో కూడా అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. -
ఆరెంజ్కి అగ్నిపరీక్ష
-
మరో ప్రియా ప్రకాశ్ వారియర్..!
ప్రియా ప్రకాశ్ వారియర్ గుర్తుందిగా.. ఒక్క కన్ను గీటుతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్గా మారిపోయింది. ప్రియా ప్రకాశ్లానే ప్రస్తుతం మరో అమ్మాయి కూడా ఓవర్నైట్లో స్టార్గా మారింది. ఆ వివరాలు.. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గత శనివారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ యువతి మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కెమెరాలు ఈ యువతిని స్క్రీన్పై చూపించడంతో ఆమె చేష్టలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆర్సీబీకి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తన తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరలవుతున్నాయి. చివరకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఈ యువతి గురించి ట్విటర్ సాక్షిగా రెస్పాండ్ అయ్యాడు. ఈ అమ్మాయిని మన ప్రతీ మ్యాచ్ కు ఇన్వైట్ చేయాల్సిందేనంటూ కామెంట్ చేశాడు. దాంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ అమ్మాయి గురించి ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. తన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ద్వారా ఆమె పేరు దీపిక ఘోష్గా గుర్తించారు. View this post on Instagram #RCB girl forever ❤️🏏 A post shared by deepika (@deeghose) on May 4, 2019 at 12:51pm PDT దాంతో ఒక్క రాత్రిలోనే ఈ యువతి ఇన్స్టాగ్రామ్ ఫాలవోర్ల సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. ఒక్క సారి తన ఫాలోవర్స్ పెరగడంతో ఈ యువతి కూడా తనను తాను ఆర్సీబీ గర్ల్గా ప్రకటించుకుంది. అంతేకాక తన పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్లను ఫాలో కావద్దని కోరింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇదే ఆఖరి మ్యాచ్. ఈ సీజన్ ప్రారంభం నుంచి పేలవ ప్రదర్శన చేసిన ఆర్సీబీ ఆఖరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించడంతో అభిమానులు సైతం తెగ ఆనందపడ్డారు. -
ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ల జోరు
గుంటూరు, సత్తెనపల్లి: చిన్నా, పెద్దా అందరూ క్రికెట్ అంటే అభిమానం చూపడం సాధారణ విషయమే.మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కు పోతుంటారు కొందరు. మూడు గంటల్లో అయిపోయే ఐపీఎల్ మ్యాచ్లకైతే ఆ క్రేజే వేరు. ఇదే అదునుగా ఆ జట్టు గెలుస్తుంది.. ఈ జట్టు గెలుస్తుందంటూ బెట్టింగ్లు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా పాఠశాల విద్యార్థులు సైతం బెట్టింగ్లలో మునిగి పోతున్నారు. ఇంట్లో డబ్బులు తీసుకు వచ్చి మ్యాచ్లపై తోటి స్నేహితులు, పెద్ద వారితో బెట్టింగ్లు కాస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఈ సంస్కృతి విద్యార్థులు, యువతలో పెద్ద వ్యసనంగా మారింది. గతంలో పేకాట జోరుగా సాగుతుండేది. రానురాను దానిపై యువతకు మోజు లేకుండా పోయింది. ఈ స్థానంలో ఐపీఎల్ బెట్టింగ్ పెద్ద వ్యసనంగా మారింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు సమాజంలో చోటు చేసుకంటాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలే కేంద్రాలు ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్లకు సత్తెనపల్లి కేంద్రంగా మారింది. పట్టణం తోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ముఖ్యంగా దుకాణాలే కేంద్రాలుగా మారి పోతున్నాయి. వాటి వద్దకు చేరే వ్యసనపరులు గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్లు కాస్తున్నారు. మ్యాచ్ ఫలితాలపైనే కాకుండా ఓవర్కు ఎన్ని పరుగులు వస్తాయని బంతి, బంతికి పందేలే వేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లు, బుకీలు ఎక్కడో ముంబై వంటి నగరాల్లో హోటళ్లలో కూర్చొని అన్నీ నడిపిస్తారు. కానీ ప్రస్తుతం చిన్నస్థాయి బుకీలు తయారయ్యారు. ఓడిపోతే డబ్బులు బెదిరించి మరీ తీసుకుంటున్నారు. గెలిస్తే మాత్రం చాలాచోట్ల డబ్బులు ఇవ్వడం లేదు. విద్యార్థులు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్యలు వస్తాయని భయపడి తమలో తాము మథనపడి వెళ్లిపోతున్నారు. భారీ స్థాయి బెట్టింగ్లు పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. చేతిలో డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ హోటళ్లు, స్నేహితుల గదుల్లో మకాం వేసి బెట్టింగ్లు కాస్తున్నారు. ఐపీఎల్ పందేల్లో సింహ భాగం పల్నాడులోని సత్తెనపల్లి వాసులదే. పోలీసుల నిఘా మరింత పటిష్టం కావాలని, ఈ బెట్టింగ్ల సంస్కృతిని సంపూర్ణంగా అరికట్టాలని పురప్రజలు కోరుతున్నారు. -
అమీతుమీకి ఢిల్లీ , హైదరాబాద్..
విశాఖ స్పోర్ట్స్: అమీతుమీకి ఢిల్లీ కాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు సిద్ధమవుతున్నాయి. విశాఖ వేదికగా బుధవారం జరగనున్న ఎలిమినేషన్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇరుజట్లు సోమవారం ప్రత్యేక విమానాల్లో విశాఖ చేరుకున్నాయి. ఏకంగా 18 పాయింట్లు సాధించినా ఢిల్లీ కాపిటల్స్ జట్టు తృతీయ స్థానానికే పరిమితమై ఎలిమినేషన్ రౌండ్ ఆడాల్సి రాగా.. కేవలం 12 పాయింట్లతో సన్రైజర్స్ జట్టు ప్లేఆఫ్స్లో నాకవుట్ మ్యాచ్కు అదృష్టం కలిసి వచ్చింది. ఢిల్లీ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు సార్లు హాట్రిక్ విజయాలు సాధించగా.. సన్రైజర్స్ ఒక హాట్రిక్ విజయాన్ని, మరో హాట్రిక్ పరాజయంతో లీగ్ ముగించింది. నిరుటి రన్నర్సప్ సన్రైజర్స్ హైదరాబాద్ పడిలేస్తూ నాలుగో స్థానంలో నిలిచేందుకు పోటీపడ్డ మరో జట్టు ఓటమితో అర్హత సాధించగలిగింది. ఇదంతా లీగ్లో భాగం కాగా.. అచ్చివచ్చిన మైదానంగా పేరుపడ్డ వైఎస్ఆర్ స్టేడియంలో ఎలిమినేషన్ మ్యాచ్లో ఎవరిది విజయమో తేలిపోనుంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయర్కు ఆడనుంది. ఆ మ్యాచ్కు విశాఖే ఆతిథ్యమివ్వనుంది. లీగ్లో సమ ఉజ్జీలే.. 12వ సీజన్లో లీగ్లో ఇరుజట్లు సముజ్జీగానే నిలిచాయి. తొలి రౌండ్లో సన్రైజర్స్ గెలవగా.. రెండో రౌండ్లో ఢిల్లీ విజయం సాధించి ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ఎవరి హోమ్ గ్రౌండ్లో వారే పరాజితులయ్యారు. తొలి రౌండ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ ఎనిమిది వికెట్లకు 129 పరుగులు చేయగా సన్రైజర్స్ ఐదే వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్నందుకుంది. ఢిల్లీ ఫిరోజ్షా కోట్లా మైదానంలోనే హోమ్ టీమ్ ఓడింది. ఇక రెండో రౌండ్లో ఢిల్లీ 39 పరుగులతో విజయం సాధించింది. ఢిల్లీ ఏడు వికెట్లకు 171 పరుగులు చేయగా.. ప్రతిగా సన్రైజర్స్ 116 పరుగులకే ఆలౌటైంది. సన్రైజర్స్ హైదరాబాద్లోని హోమ్ గ్రౌండ్లోనే ఈ పరాజయాన్ని చవిచూసింది. విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఎవరిది ఆధిక్యమో తేలడంతో పాటు గెలిచిన జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్కు అర్హత సాధించనుంది. వార్నర్ మెరుపులు.. కాసినో స్వింగ్ మిస్ అత్యధిక పరుగులు చేసిన సన్రైజర్స్ జట్టు సభ్యుడు డేవిడ్ వార్నర్, అత్యధిక వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్ కాసిసో రబడా ప్రపంప కప్ సన్నాహాల్లో భాగంగా తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. దీంతో వారి మెరుపులు విశాఖ వాసులు మిసయ్యారు. సన్రైజర్స్ తరఫున ఇన్నింగ్స్లోనే సెంచరీ దాటేసిన బేరిస్టో మాత్రమే విశాఖ క్రీడాభిమానులను అలరించనున్నాడు. ప్లేఆఫ్కు ఢిల్లీ, సన్రైజర్స్ ఇలా.. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ జట్లు పద్దేనిమిదేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్రేట్తో ముంబయి ఇండియన్స్ తొలి స్థానం, చెన్నై రెండో స్థానంలోనూ నిలిచాయి. ఢిల్లీ జట్టు మూడో స్థానానికి పడిపోయి సన్రైజర్స్తో ఎలిమినేషన్ ఆడేందుకు విశాఖ వచ్చింది. సన్రైజర్స్, నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ జట్లు పన్నెండేసి పాయింట్లతో నిలిచినా కాస్త మెరుగైన రన్రేట్తో సన్రైజర్స్ ప్లేఆఫ్కు అర్హత సాధించగలిగింది. ఇక నాకవుట్ మ్యాచ్లు విశాఖలో ఎలాంటి ఉత్కంఠ రేపుతాయో చూడాల్సి ఉంది. -
బంతి బంతికి బెట్టింగ్
టేక్మాల్(మెదక్): ఐపీఎల్.. బెట్టింగ్కు పర్యాయపదంగా మారింది. టోర్నీ పై యువతలో ఉన్న వివపరీతమైన క్రేజ్ను బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుకుంటున్నారు. ప్రతీ మ్యాచ్లో టాస్ను మొదలుకొని బంతి బంతికి పందేలు కాస్తున్నారు. వ్యవహారమంతా ఆన్లైన్లలో, సెల్ఫోన్ల ద్వారా సాగుస్తున్నారు. మ్యాచ్ మొదలవ్వడానికి రెండు మూడు గంటల ముందే వాట్సప్, మెసేజ్, ఫోన్ కాల్స్, ఇంటర్నెట్లలో యువత బెట్టింగ్ను హోరెత్తిస్తుంది. ప్రస్తుతం ఐపిఎల్ నాకౌట్ దశకు చేరుకోవడంతో జూదం తారాస్థాయికి చేరింది. సాయంత్రం అయితే చాలు యువకులంతా గుమిగూడి ఫోన్లలో బీజిబీజిగా గడుపుతున్నారు. బెట్టింగ్ సాగుతుందిలా.. బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు ఆ రోజు నిర్వహించే ఐపిఎల్ మ్యాచ్కు సంబంధించిన సమాచారాన్ని యువతకు ముందుగానే చేరవేస్తారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్దేశిత ప్రాంతానికి చేరకున్న యువత ముందుగా పోటీలో ఉన్న జట్ల బలబలాలను బేరీజు వేసుకొని బెట్టింగ్కు దిగుతున్నారు. టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగా? బౌలింగా? పవర్ ప్లే ఆరు ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? 20ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? అనే అంశాలపై బెట్టింగ్ సాగిస్తున్నారు. వీటితో పాట ఆయా జట్లలోని ప్రధాన బ్యాట్స్మెన్ల వ్యక్తిగత స్కోరు ఎంత చేస్తారనే దానిపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. చోరీలకు పాల్పడుతున్న యువత.. బెట్టింగ్ పేరుతో పెద్ద సంఖ్యలో యువకులు సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు పాకెట్ మనీకోసం ఇచ్చిన సొమ్మును బెట్టింగ్లో పోగొట్టుకుంటున్నారు. తిరిగి డబ్బుల కోసం సొంత ఇళ్లతో పాటూ వేరే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. బెట్టింగ్లో డబ్బులు పొగొట్టుకుంటున్న యువత ఏమి తోచని పరిస్థితిలో అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహరంపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ ఆగడాలను అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. బెట్టింగ్ వ్యసనానికి దూరంగా ఉండాలి ఐపిఎల్ బెట్టింగ్ వ్యసనానికి యువకులు, విద్యార్థులు దూరంగా ఉండాలి. డబ్బులను వృథా చేసుకోకూడదు. ఇంట్లో అవసరాలకు ఇచ్చిన డబ్బులను బెట్టింగ్లలో పెట్టరాదు. బెట్టింగ్లు పెట్టి అప్పుల పాలుకావొద్దు. ఇటువంటి బెట్టింగ్లు చట్టరీత్యా నేరం. బెట్టింగ్లు పెట్టినట్లు మాకు తెలిసినా, సమాచారం అందినా, అనుమానితులైన వారిని విచారిస్తాం. బెట్టింగ్ రాయుళ్లపై కేసులు పెడతాం.–విజయరావ్, ఎస్ఐ, టేక్మాల్. -
నైట్రైడర్స్లో విభేదాలు నిజమే: కటిచ్
ముంబై: ఆరంభంలో విజయాలు సాధించి, తర్వాత వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడింది కోల్కతా నైట్ రైడర్స్. ఆఖరికి గెలిస్తే తదుపరి దశకు చేరే అవకాశమున్న చివరి లీగ్ మ్యాచ్లోనూ ముంబై చేతిలో దారుణంగా పరాజయం పాలైంది. తమ జట్టులో మంచి వాతావరణం లేదని, కెప్టెన్ దినేశ్ కార్తీక్ వ్యూహాలు సరిగా లేవంటూ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. మైదానంలోనూ ఈ విభేదాలు కనిపించాయి. వీటిని ఆ ఫ్రాంచైజీ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ కూడా నిర్ధారించాడు. ఆదివారం ముంబైతో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ... ‘మేం లీగ్ను గొప్పగా ప్రారంభించాం. కానీ, సొంతగడ్డపై బెంగళూరు, రాజస్తాన్ చేతిలో ఓడిపోవడం దెబ్బతీసింది. చివరి మ్యాచ్లో మలింగ, బుమ్రా, హార్దిక్ లాంటి బౌలర్లున్న ముంబైతో, మాకు మంచి రికార్డు లేని వాంఖడేలో ఆడాల్సి రావడం ప్రతికూలమైంది. పాయింట్ల పట్టికలో మేం నిలిచిన స్థానానికి (5వ) అర్హులమే. జట్టులో సమష్టితత్వం లోపించిందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. మేం దృష్టి సారించి, సరిదిద్దుకుని ముందుకుసాగాల్సిన అంశాలివి. ఒకరిద్దరి గురించి చెప్పడం సరికాదు కానీ, బ్యాటింగ్లో యువ శుబ్మన్ గిల్ మా భవిష్యత్ స్టార్’ అని పేర్కొన్నాడు. -
ముంబైనా... చెన్నైనా..!
అలవాటైన రీతిలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్తు కొట్టేసింది చెన్నై సూపర్ కింగ్స్! మొదట్లో డక్కామొక్కీలు తిన్నా క్రమంగా పుంజుకొని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో పాటు నాకౌట్ చేరింది ముంబై ఇండియన్స్! రెండింటి మధ్య నేడు తొలి ప్లే ఆఫ్. ఓడినా, ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉన్న నేపథ్యంలో... సొంతగడ్డ అనుకూలతతో చెన్నై చెలరేగుతుందా? ఆలస్యంగానైనా అదరగొడుతోన్న ముంబై ఇంకో మాటకు తావు లేకుండా తుది సమరానికి చేరుతుందా? సమష్టి ప్రదర్శన కనబర్చే ధోని బృందానిది పై చేయి అవుతుందో? హిట్టర్లతో కూడిన రోహిత్ సేనది పైచేయి అవుతుందో చూద్దాం...? చెన్నై: ఐపీఎల్–12 రెండో దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లకు తెరలేవనుంది. మంగళవారం జరిగే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇంటాబయట రెండుసార్లు ముంబైకి తలవంచిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై... సొంత గడ్డపై, అది కూడా ప్లే ఆఫ్ దశలో అంత తేలిగ్గా వదిలేసేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు ముంబై... రెండు సార్లు పైచేయి సాధించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగబోతోంది. కీలకమైన ఆటగాళ్లంతా అందుబాటులో ఉండి, అన్నిరంగాల్లోనూ పటిష్టంగా ఉన్నందున మ్యాచ్ హోరాహోరీగా సాగి అభిమానులను అలరించే అవకాశం ఉంది. అదే పెద్ద బలం... సమష్టిగా ఆడటంలో చెన్నైని మించిన జట్టు ఏదీ లేదు. పైగా వేలాది మంది వీరాభిమానుల ప్రోత్సాహం మధ్య సొంతగడ్డపై ధోని బృందాన్ని ఆపడం కష్టం. సూపర్ కింగ్స్ ఆత్మవిశ్వాసానికి వీరే ఇంధనం. ఈ అంచనాలకు తగ్గట్లే సీఎస్కే రాణిస్తూ ఉంటుంది. ప్రస్తుత సీజన్లో ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏడు మ్యాచ్లకు గాను ఆరింటిలో చెన్నైనే నెగ్గింది. ఓడిన ఒక్కటీ ముంబై చేతిలోనే కావడం గమనార్హం. అయితే, ఈ మ్యాచ్లో కీలకమైన ధోని, జడేజా, డుప్లెసిస్ లేకుండానే ఆ జట్టు ఆడింది. ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే వాట్సన్, డుప్లెసిస్, రైనా, ధోనిలతో కూడిన చెన్నై బ్యాటింగ్... మలింగ, బుమ్రా, పాండ్యా సోదరులతో బలంగా ఉన్న ముంబై బౌలింగ్ మధ్య పోరుగా పేర్కొనవచ్చు. ఫామ్లో లేకున్నా కీలక సమయంలో కేదార్ జాదవ్ దూరమవడం సీఎస్కేకు ఇబ్బందికరమే. అతడి స్థానంలో మురళీ విజయ్ లేదా ధ్రువ్ షోరెలలో ఒకరిని ఆడించవచ్చు. సమష్టి ప్రదర్శనకు తోడు బ్రేవో, జడేజా రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్లు ఉండటం చెన్నై బలం. ఓపెనర్లలో డుప్లెసిస్ రాణిస్తున్నా, వాట్సన్ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. గత 8 మ్యాచ్ల్లో అతడు రెండుసార్లే రెండంకెల స్కోర్లు చేయగలిగాడు. వన్డౌన్లో వస్తున్న సురేశ్ రైనా ఫామ్లో ఉన్నాడు. పరిస్థితిని బట్టి నాలుగో స్థానంలో రాయుడికి అవకాశం దక్కొచ్చు. చివర్లో స్కోరు పెంచేందుకు కెప్టెన్ ధోని, బ్రేవో ఉండనే ఉన్నారు. బౌలింగ్లో చెన్నై స్పిన్ త్రయం హర్భజన్–తాహిర్–జడేజాలను ఎదుర్కొనడం ప్రత్యర్థికి సవాలే. పొదుపుగా వేస్తూనే తాహిర్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. ఏకైక పేసర్ దీపక్ చహర్ అంచనాలను నిలబెట్టుకుంటున్నాడు. రెండో పేసర్గా ఆల్రౌండర్ బ్రేవోను వాడుకుంటూనే... ఇక్కడి వరకు వచ్చిందంటేనే జట్టు ఏ స్థాయిలో బలంగా ఉందో, ధోని వ్యూహాలు ఎలాంటివో తెలిసిపోతోంది. వీటిని ముంబై ఏమేరకు తట్టుకుంటుందో చూడాలి. ముంబై ఆత్మవిశ్వాసంతో సీజన్ను నిదానంగా ఆరంభించి కీలక సమయంలో జూలు విదిల్చడం ముంబై శైలి. ఈసారీ ఆ జట్టు ప్రయాణం అలాగే సాగింది. ఓ దశలో వరుస ఓటములతో ప్లే ఆఫ్స్కు చేరుతుందా? లేదా? అనే అనుమానం వచ్చినా చివరకు చూస్తే పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచింది. గత ఆరు మ్యాచ్ల్లో ముంబై రెండింట్లో మాత్రమే ఓడింది. వీటిలో ఒకదాంట్లో (కోల్కతాపై) గెలుపు కోసం తీవ్రంగా పోరాడింది. విజయం సాధించిన 4 మ్యాచ్ల్లో మూడు ఈ సీజన్లో ప్లే ఆఫ్ చేరిన ఢిల్లీ, చైన్నై, హైదరాబాద్పై కావడం విశేషం. టాపార్డర్లో ఓపెనర్లు డికాక్, కెప్టెన్ రోహిత్ జోరుమీదున్నారు. ఆదివారం నాటి మ్యాచ్లో రోహిత్ ఇన్నింగ్స్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. సూర్యకుమార్ యాదవ్ నిలకడగా పరుగులు చేస్తున్నాడు. విధ్వంసక ఎవిన్ లూయీస్ తన స్థాయి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అన్నింటికంటే హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ నైపుణ్యం ముంబైని గట్టెక్కిస్తోంది. బ్యాట్తో విఫలమైతే బంతితో ప్రభావం చూపుతున్నాడు. పొలార్డ్ సహా మిగతావారు అనుకున్నంత రాణించకపోయినా ఈ సీజన్లో జట్టును ఆదుకున్నది హార్దికే. స్పిన్నర్లు రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా పదేసి వికెట్లు తీసి తమ పాత్ర సమర్థంగా పోషిస్తున్నారు. పేస్ పరంగా చూస్తే బుమ్రా, మలింగలతో ముంబై భీకరంగా ఉంది. డెత్ ఓవర్లలో వీరిని కాచుకోవడం కష్టమే. వీరే కీలకం ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ: ఈ సీజన్లో 386 పరుగులు చేశాడు. ఒత్తిడిని తట్టుకుంటూ కీలక మ్యాచ్ల్లో రాణిస్తున్నాడు. డికాక్: ఐపీఎల్–12 అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో (492 పరుగులు) ఉన్నాడు. దూకుడుగా ఆడే డికాక్ మంచి ఆరంభాలనిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా: 380 పరుగులు, 14 వికెట్లతో ఆల్రౌండర్ హోదాకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. లక్ష్యం ఎంత భారీగా ఉన్నా వెరవకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్లోనూ ఆత్మ విశ్వాసంతో బంతులేస్తున్నాడు. బుమ్రా, మలింగ: ఈ సీజన్లో 17 వికెట్లతో బుమ్రా, 15 వికెట్లతో మలింగ ముంబైకి వెన్నుముకగా నిలిచారు. ఈ పేస్ ద్వయం చివరి ఓవర్లలో మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ధోని: 12 మ్యాచ్ల్లో మూడు అర్ధ శతకాల సాయంతో 368 పరుగులు చేశాడు. ఆఖర్లో భీకర హిట్టింగ్కు దిగే పాత ధోనిని చూసే అవకాశం... చాలా కాలం తర్వాత ఈ సీజన్లో ప్రేక్షకులకు దక్కింది. పరిమిత వనరులనే అవసరానికి తగినట్లుగా వాడుకుంటూ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. డుప్లెసిస్: ఓపెనర్గా వస్తూ మంచి స్కోర్లు చేస్తున్నాడు. ఆదివారం పంజాబ్పై ఆడిన ఇన్నింగ్స్ డుప్లెసిస్ ఫామ్ను చాటుతోంది. రైనా: జట్టు మొత్తంలో కీలక బ్యాట్స్మన్. వన్ డౌన్లో దిగుతూ స్కోరు చేసే బాధ్యతను భుజాలకెత్తుకుంటున్నాడు. బ్రేవో: బ్యాట్, బంతితో ఈ సీజన్లో స్థాయికి ఊహించిన మేర మెరుపులు కనబర్చలేదు. అయినా, విధ్వంసక బ్యాటింగ్, జిత్తులమారి బౌలింగ్ కారణంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తాహిర్: ప్రస్తుత లీగ్లో 21 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. రబడ (25)ను అందుకునే అవకాశం ఉంది. తాహిర్ స్పిన్ మాయకు ప్రత్యర్థుల దగ్గర జవాబే ఉండటం లేదు. -
‘మా కేకేఆర్ క్యాంప్లో సఖ్యత లేదు’
ముంబై: తాజా ఐపీఎల్ సీజన్లో తమ జట్టు ప్లేఆఫ్స్కు చేరకపోవడానికి విభేదాలు కూడా ఒక కారణమని కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) అసిస్టెంట్ కోచ్ సైమన్ కాటిచ్ స్సష్టం చేశాడు. కేకేఆర్ శిబిరంలో ఆటగాళ్ల మధ్య అంతగా సఖ్యత లేకపోవడమే వరుస ఓటములకు కారణమన్నాడు. నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన కాటిచ్..‘ వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓటమి చెందడం మా ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. మా జట్టులో విభేదాలు ఉన్న మాట వాస్తవమే. దీన్ని దాయాలన్నా దాగదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్కు సిద్ధమయ్యేటప్పుడు జట్టులో సమైక్యత అనేది చాలా ముఖ్యం. కేకేఆర్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా జట్టు విజయాలు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సీజన్లో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇది మంచిది కాదు’ అని కాటిచ్ పేర్కొన్నాడు. ఇటీవల కేకేఆర్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బహిరంగంగానే ఆ జట్టు నాయకత్వాన్ని ప్రశ్నించాడు. జట్టులో ఎవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తమ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తెలియడం లేదంటూ చురకలు అంటించాడు. దాంతో కేకేఆర్ క్యాంపులో విభేదాలు ఉన్న విషయం బయటపడింది. (ఇక్కడ చదవండి: దినేశ్ కార్తీక్ ఆగ్రహం.. జట్టు సభ్యులకు వార్నింగ్!) -
‘ఆ టైమ్లో నా కూతురు పడుకుంది’
ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సాధించిన 36వ అర్ధ సెంచరీని తన కూతురు సమైరాకు అంకితమిచ్చాడు. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో ఆదివారం ఇక్కడి వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ టీమ్ టాప్లో నిలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నా ఆట చూసేందుకు సమైరా ప్రతిసారి ఇక్కడకు వస్తుంది. అయితే ఇంతకుముందు పెద్దగా పరుగులు చేయలేకపోయాను. మొత్తానికి ఈరోజు కొన్ని పరుగులు చేశాను. నా ఆట చూడకుండానే సమైరా నిద్రపోయింద’ని అన్నాడు. కూతురిని ఒళ్లో కూర్చొబెట్టుకుని ఉన్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. ఇలాంటి మధురమైన క్షణాల కోసమే ఎదురు చూసినట్టు పేర్కొన్నాడు. చెన్నైలోని చిదంబరం మైదానంలో మంగళవారం జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో చైన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. -
ఊతప్పదే సన్రైజర్స్ అవార్డు..!
ముంబై: వాంఖేడి స్టేడియం వేదికగా ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఐపీఎల్ 12వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి ఈ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధిస్తే వేరే జట్లతో పోటీ లేకుండా ప్లేఆఫ్స్కు అర్హత సాధించేది.అయితే, కోల్కతా ఓటమితో మెరుగైన రన్ రేట్ని కలిగి ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. కేవలం 12 పాయింట్లతోనే సన్రైజర్స్ ప్లేఆఫ్కు అర్హత సాధించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇలా 12 పాయింట్లతో ఒక జట్టు ప్లేఆఫ్కు చేరడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి. ప్లేఆఫ్స్కు అర్హత సాధించే మ్యాచ్ కావడంతో కోల్కతా ఎలా ఆడుతుందా? అని ప్రతి ఒక్క కేకేఆర్ అభిమాని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. అయితే, కోల్కతా మాత్రం తన పేలవ ఆటతో ఆశ్చర్యపరిచింది. కనీస ప్రయత్నం కూడా చేయకుండా ఓడిపోయింది. ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్ ఆడిన కోల్కతా అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప కారణంగానే కోల్కతా నైట్రైడర్స్ ఓడిపోయిందంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సన్రైజర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాబిన్ ఊతప్పదే. అతను ఒంటిచేత్తో సన్రైజర్స్ను ప్లేఆఫ్కు చేర్చాడు’ అని ఒక అభిమాని సెటైర్ వేయగా, ‘వచ్చే సీజన్లో రాబిన్ ఊతప్పను కేకేఆర్ వదులు కోవడం ఖాయం. అదే సమయంలో ఆర్సీబీ అతన్ని తీసుకుంటుంది. వచ్చే సీజన్లో హోం జట్టుకు రాబిన్ ఆడతాడని ఆశిద్దాం’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘రాబీ చాలా నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. అతను ఎప్పుడైతే బ్యాటింగ్కు దిగాడో అప్పుడు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మారిపోయింది’ అని మరొక అభిమాని విమర్శించాడు. ‘ ఇక రాబిన్ ఊతప్పకు క్రికెట్కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని’ అభిమానులు మండిపడుతున్నారు. నిన్నటి మ్యాచ్లో రాబిన్ ఊతప్ప 47 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఫస్డ్ డౌన్ వచ్చిన ఆటగాడు స్టైక్ రోటేట్ చేయాలి. ఇది ఊతప్ప విషయంలో జరగలేదు. అసలు బంతిని బ్యాట్తో కనీసం టచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాంఖేడే స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా ఊతప్ప మాత్రం తన స్థాయికి తగ్గ ఆటను మాత్రం ఆడలేదనేది మ్యాచ్ చూసిన ఎవరికైనా అర్ధమవుతోంది. -
వరల్డ్కప్కు కేదార్ జాదవ్ దూరమైతే..?
న్యూఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేదార్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం జరిగిన మ్యాచ్లో బౌండరీని ఆపబోయి జాదవ్ గాయపడ్డాడు. దాంతో అతన్ని మైదానం నుంచి తరలించారు. అదే సమయంలో సీఎస్కే శిబిరం నుంచి కూడా జాదవ్ తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్తో జరుగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్కు జాదవ్ దూరమయ్యాడు. కాగా, వరల్డ్కప్కు ఎంపికైన జట్టులో ఉన్న కేదార్ జాదవ్ ఫిట్నెస్ అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ వేదిక వరల్డ్కప్ ఆరంభం కానుండగా, జాదవ్ ముందుగానే ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఇంగ్లిష్ గడ్డపై భారత జట్టు అడుగుపెట్టే సమయానికి జాదవ్ ఫిట్నెస్ను నిరూపించుకోలేకపోతే ఆ మెగాటోర్నీలో ఆడటం కష్టమే. టీమిండియా మేనేజ్మెంట్ కానీ, సెలక్టర్లు కానీ జాదవ్ గాయం అంత సీరియస్ కాదని పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్పప్పటికీ, లోపల మాత్రం అతని గాయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టు మే 22వ తేదీన ఇంగ్లండ్కు పయనం కానున్న తరుణంలో ముందుగానే అతనికి ప్రత్యామ్నాయంగా ఎవర్ని పంపాలనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జాదవ్ అందుబాటులోకి రాకపోతే స్టాంబ్ బైలో ఉన్న అంబటి రాయుడ్ని కానీ యువ సంచలనం రిషభ్ పంత్ను కానీ ఇంగ్లండ్కు పంపే అవకాశం ఉంది. గత ఏడాది ముంబై ఇండియన్స్తో జరిగిన ఆరంభపు మ్యాచ్లో కూడా జాదవ్ గాయపడి మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు ప్లేఆఫ్ ముందు జాదవ్ గాయ పడటం గమనార్హం. ఈ సీజన్లో జాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోయినప్పటికీ కీలక సమయంలో జట్టుకు ఆల్రౌండర్ దూరం కావడం సీఎస్కే ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. దీనిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘ కేదార్కి ప్రస్తుతం ఎక్స్-రే నిర్వహించాము. రేపు అతనికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. అతను కోలుకుంటాడని కోరుకుంటున్నా. అతన్ని ఇక జట్టులోకి తీసుకోము. ఎందుకంటే వరల్డ్ కప్ కోసం అతను ఫిట్గా ఉండటం ముఖ్యం. అది అంత పెద్ద గాయంలా కనిపించడం లేదు. కానీ మంచి జరగాలనే కోరుకుంటున్నాం’ అని తెలిపాడు. -
ప్రతీసారి రసెల్పై ఆధారపడితే ఎలా?
ముంబై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ కథ లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఓటమి పాలు కావడంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు మూసుకుపోయాయి. ప్రతి మ్యాచ్లో మాదిరిగానే ఈసారి కూడా ఆండ్రీ రసెల్.. కేకేఆర్ను ఆదుకుంటాడని భావించారంతా. ఈ ఐపీఎల్లో సిక్సర్ల వర్షంలో క్రికెట్ అభిమానులను తడిపేసిన రసెల్పై ఆ స్థాయి అంచనాలే నెలకొన్నాయి. కానీ తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో రసెల్ చేతులెత్తేశాడు. పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్ ఓటమిపై కోల్కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు. ‘రసెల్ బ్యాటింగ్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ ప్రతి మ్యాచ్ను అతడే గట్టెక్కిస్తాడనుకోవడం బాగోదు. అతడి మీద ఆధార పడటం కూడా పద్ధతి కాదు. ప్రతీసారి రసెల్పై ఆధారపడితే ఎలా. ఈ టోర్నమెంట్ మొత్తంలో రసెల్ ఆట అద్భుతం. ఈ సీజన్ మాకు అంత బెస్ట్ కాదనుకుంటా. ఐపీఎల్ ఒక వినోదాత్మకమైన టోర్నమెంట్. ప్రతిరోజు మేం మా సామర్థ్యం మేరకు పనిచేయడానికి ప్రయత్నిస్తాం. అందరి అంచనాలు అందుకోవాలంటే ముందుగా మేం కొన్నింట్లో మెరుగుపడాలి. వచ్చే ఏడాది మరింత బలంతో, ఆత్మవిశ్వాసంతో ఐపీఎల్లో అడుగుపెడతాం’ అని కార్తిక్ తెలిపాడు. -
హాట్ కేకుల్లా ఐపీఎల్ టిక్కెట్లు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ లీగ్ దశ పోటీలు ముగిశాయి. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు ఆతిథ్యమిచ్చిన వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఈసారి ఐపీఎల్ తుదిపోరుకు అర్హత సాధించే జట్టు ఎంపికకు వేదిక కానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్ల హోమ్ గ్రౌండ్లలోనే మ్యాచ్లు జరగాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా వైఎస్సార్ స్టేడియంను ఆపద్ధర్మంగా నాకౌట్, క్వాలిఫయింగ్ మ్యాచ్లకు విశాఖను వేదికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్ కూడా విశాఖలో జరగనున్నాయి. తొలిసారిగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లకు వేదికగా నిలిచిన వైఎస్సార్ స్టేడియంలో మ్యాచ్లు రాత్రి ఏడున్నరకే ప్రారంభం కానున్నాయి. ఎలిమినేషన్ మ్యాచ్ 8న, రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ 10న ఇక్కడ జరగనున్నాయి. ఫైనల్స్ జట్లను తేల్చేది ఇక్కడే 12వ సీజన్ ఐపీఎల్ టోర్నీ నాకౌట్ పోటీలు ఖరారయ్యాయి. తొలి క్వాలిఫయింగ్ రౌండ్ ఏడో తేదీన చెన్నైలో జరగనుంది. ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ విశాఖ వేదికగానే జరగనున్నాయి. ఫైనల్ పోరు హైదరాబాద్లో జరగనుంది. ఐపీఎల్లో ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడిన సంగతి తెలిసిందే. ప్రతి జట్టు పధ్నాలుగు మ్యాచ్లను లీగ్ దశలో ఆడింది. లీగ్ దశ శనివారంతో ముగిసింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్కు చేరి నాకౌట్ మ్యాచ్లు ఆడనున్నాయి. వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు చెన్నైలో జరిగే తొలి క్వాలిఫయింగ్ రౌండ్లో ఆడనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేషన్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ విశాఖలో జరగనుంది. లీగ్ చివర్లో సీఎస్కే, ఎంఐ జట్లు అంచనాలు తారుమారు చేశాయి. నిరుటి రన్నర్సప్ సన్రైజర్స్ హైదరాబాద్ పడిలేస్తూ నాలుగోస్థానంలో నిలిచేందుకు తంటాలు పడుతోంది. మరో జట్టు ఓటమి చెందితేనే ప్లేఆఫ్ ఆడే స్థాయిలో ఉంది. ఇక రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఓడిన జట్టుతో ఎలిమినేషన్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఆడనుంది. ఆ మ్యాచ్కూ విశాఖే ఆతిధ్యమివ్వనుంది. -
రజనీకాంత్ను కలవాలనుంది!
టీ.నగర్: నటుడు రజనీకాంత్ను కలవాలని ఉందని క్రికెటర్ బ్రావో వెల్లడించారు. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ జట్టు కోసం ఆటాడుతున్నారు. చాలాకాలంగా ఆయన చెన్నై జట్టులో ఆడుతున్నందున ఇక్కడి సంస్కృతి, ఆహార పదార్థాలు ఎంతగానో నచ్చుతున్నాయి. ఇలావుండగా నటుడు రజనీకాంత్ను కలవాలనుందని బ్రావో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు రజనీకాంత్ గురించి విన్నానని, అయితే ఆయన నటించిన చిత్రాలను చూడలేదన్నారు. త్వరలో చూస్తానని, రజనీకాంత్ను కలుసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ముంబయి చేతిలో కోల్కతా చిత్తు
-
పంజాబ్ ఆఖరి గెలుపు
మొహాలి: ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయిన తర్వాత పంజాబ్ ఆట గెలుపుతో ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (55 బంతుల్లో 96; 10 ఫోర్లు, 4 సిక్స్లు) శతకానికి 4 పరుగులతో దూరమయ్యాడు. స్యామ్ కరన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. మెరుపులు మెరిపించిన లోకేశ్ రాహుల్ (36 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్భజన్ సింగ్కు 3 వికెట్లు దక్కాయి. డు ప్లెసిస్ జోరు చెన్నై ఇన్నింగ్స్ను ఆరంభించిన ఓపెనర్లలో వాట్సన్ (7) విఫలమయ్యాడు. కానీ డు ప్లెసిస్ వేగం, నిలకడ కలగలిపిన ఇన్నింగ్స్ ఆడాడు. వీలు చిక్కితే బౌండరీ లేదంటే ఒకట్రెండు పరుగులతో జట్టును నడిపించాడు. ఇతనికి జతయిన రైనా దూకుడు కనబరచడంతో చెన్నై స్కోరు పరుగెత్తింది. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. వీళ్లిద్దరు ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆడారు. ఈ క్రమంలో డు ప్లెసిస్ 37 బంతుల్లో, రైనా 34 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 15వ ఓవర్ నుంచి ఈ జోడీ వేగం పెంచింది. మురుగన్ అశ్విన్ 15వ ఓవర్లో రైనా ఒక ఫోర్ కొడితే డుప్లెసిస్ 4, 6 బాదాడు. టై 16వ ఓవర్లో డుప్లెసిస్ 2 ఫోర్లు, సిక్స్తో 18 పరుగులు పిండుకున్నాడు. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద కరన్ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. రైనా (38 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్లు)ను ఔట్ చేయడంతో 120 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్లో సిక్స్తో సెంచరీకి చేరువైన డు ప్లెసిస్ను కరనే ఔట్ చేశాడు. ధోని (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. పంజాబ్ 57/0...రాహుల్ 52 పంజాబ్ లక్ష్యఛేదనను రాహుల్ సిక్స్తో, క్రిస్ గేల్ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫోర్తో ఆరంభించారు. ముఖ్యంగా రాహుల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. అతడు తొలి 8 బంతుల్లో చేసిన 18 పరుగులు సిక్స్ల రూపంలోనే వచ్చాయి. హర్భజన్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో ఐదు సార్లు బంతి బౌండరీ లైనును దాటింది. రాహుల్ వరుసగా 4, 4, 4, 6, 0, 6లతో ఏకంగా 24 పరుగులు సాధించాడు. అంతే 3.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరగా... 19 బంతుల్లోనే రాహుల్ అర్ధశతకం పూర్తయింది. ఇమ్రాన్ తాహిర్ ఏడో ఓవర్ను గేల్ ఆడుకున్నాడు. 4, 6, 6తో 17 పరుగులు చేశాడు. అడ్డుఅదుపులేని బౌండరీలతో జట్టు స్కోరు 9 ఓవర్లలోనే వందకు చేరింది. ఇక మిగిలింది 11 ఓవర్లలో 71 పరుగులే. అయితే 11వ ఓవర్ వేసిన హర్భజన్ వీళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 108 స్కోరు వద్ద 2 వికెట్లను కోల్పోయింది. భజ్జీ మరుసటి ఓవర్లో మయాంక్ అగర్వాల్ (7) ఆటను ముగించాడు. కానీ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపుల బాధ్యతను తీసుకోవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. 164 పరుగుల వద్ద అతను ఔటైనా... మిగతా లాంఛనాన్ని మన్దీప్ సింగ్ (11 నాటౌట్), స్యామ్ కరన్ (6 నాటౌట్) పూర్తి చేశారు. -
కోల్కతా ఇంటికి... హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు...
120 బంతుల ఇన్నింగ్స్లో సింగిల్ కూడా తీయని డాట్ బంతులు 60... మొత్తం ఇన్నింగ్స్లో మూడంటే మూడే ఫోర్లు... ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా దీనమైన బ్యాటింగ్ ఇది... సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగడంతో బ్యాటింగ్లో చేతులెత్తేసిన నైట్రైడర్స్ ముందే ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆశలకు ఊపిరి పోసింది. ప్రత్యర్థిని ఓడించి ముంబై చేసిన మేలుతో నాలుగో జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. 9 విజయాలు, 18 పాయింట్లతో టాప్–3 జట్లు సమానంగా ఉన్నా, తాజా విజయం తర్వాత రోహిత్ సేన రన్రేట్ కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో తర్వాతి మూడు టీమ్లు సమంగా నిలిచినా మెరుగైన రన్రేట్లో ‘ఆరెంజ్ ఆర్మీ’ ముందంజ వేసింది. ఐపీఎల్ చరిత్రలో 12 పాయింట్లు మాత్రమే సాధించిన టీమ్ సెమీస్/ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముంబై: గత ఏడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–2019లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. తమతో పోటీలో నిలిచిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఆదివారం ఇక్కడి వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలు కావడం రైజర్స్కు టాప్–4లో అవకాశం కల్పించింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్కతాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది. క్రిస్ లిన్ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రాబిన్ ఉతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) నెమ్మదైన ఇన్నింగ్స్ జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. మలింగ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు), సూర్య కుమార్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్కు అభేద్యంగా 60 బంతుల్లోనే 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. లిన్ మినహా... ఓపెనర్ లిన్ ఆరంభంలో చూపించిన దూకుడు మినహా నైట్రైడర్స్ ఇన్నింగ్స్ మొత్తం పేలవంగా సాగింది. ఫలితంగా పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 49 పరుగులకు చేరింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా ... వరుస ఓవర్లలో గిల్, లిన్లను ఔట్ చేసి కోల్కతాను దెబ్బ తీశాడు. అంతే... ఆ తర్వాతి నుంచి కోల్కతా కష్టాలు మొదలయ్యాయి. 7–12 మధ్య ఆరు ఓవర్లలో నైట్రైడర్స్ 16 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే పరిస్థితి అర్థమవుతుంది! మలింగ వేసిన 13వ ఓవర్లో కోల్కతాకు పెద్ద దెబ్బ పడింది. నాలుగో బంతికి దినేశ్ కార్తీక్ ఔట్ కాగా... సీజన్ ఆసాంతం జట్టు గెలుపు భారాన్ని మోసిన ఆండ్రీ రసెల్ (0) కీపర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరగడంతో జట్టు భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. సిక్సర్తో ఖాతా తెరిచిన డి కాక్ దూకుడు కొనసాగించి జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందించాడు. డి కాక్ ఔటయ్యాక... రోహిత్, సూర్యకుమార్ సునాయాసంగా పరుగులు సాధించి జట్టును గెలుపు దిశగా నడిపించారు. -
ముంబై ఇండియన్స్ టార్గెట్ 134
ముంబై: ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 134 పరుగుల సాధారణ టార్గెట్ను నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ పరుగులు సాధించడానికి అపసోపాలు పడింది. ముంబై బౌలర్లు పదునైన బంతులు వేయడంతో కేకేఆర్ ఓపెనర్లు క్రిస్ లిన్, శుభ్మన్ గిల్లు శ్రమించాల్సి వచ్చింది. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద ఉండగా గిల్(9) తొలి వికెట్గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి లిన్(41; 29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్ కావడంతో కేకేఆర్ 56 పరుగుల వద్ద రెండో వికెట్ను నష్టపోయింది. ఇక కేకేఆర్ ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్(3) నిరాశ పరచగా, రసెల్లు డకౌట్ కావడంతో ఆ జట్టు స్కోరు నత్తనడకన సాగింది. రాబిన్ ఊతప్ప(40;47 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా, నితీష్ రాణా(26; 13 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. దాంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో మలింగా మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్ పాండ్యాలు తలో రెండు వికెట్లు తీశారు. -
సీఎస్కేపై పంజాబ్ ఘన విజయం
-
ప్లేఆఫ్ బెర్తే లక్ష్యంగా కేకేఆర్
ముంబై: ఐపీఎల్లో భాగంగా వాంఖేడే స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా కేకేఆర్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకోగా, కోల్కతా ఇంకా ప్లేఆఫ్ రేసులోనే ఉంది. ఇది ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ కావడంతో పాటు కేకేఆర్ గెలిస్తే ప్లేఆఫ్కు చేరుతుంది. దాంతో ప్లేఆఫ్ బెర్తే లక్ష్యంగా కేకేఆర్ బరిలోకి దిగుతోంది. ఒకవేళ కేకేఆర్ ఓడితే మాత్రం నెట్రన్ రేట్ ఆధారంగా సన్రైజర్స్ ప్లేఆఫ్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఓటమి పాలైంది. గెలిస్తే ఎంచక్కా ప్లే ఆఫ్ చేరే మ్యాచ్లో బాధ్యతారహితంగా ఆడి ఓడింది. కెప్టెన్ విలియమ్సన్ మినహా బ్యాటింగ్లో చేతులెత్తేశారు. నేడు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఓడితేనే హైదరాబాద్ రన్రేట్ ప్రకారం ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్కతా గెలిస్తే మాత్రం హైదరాబాద్ ఇంటిముఖం పడుతుంది. కోల్కతా చివరి బెర్త్ దక్కించుకుంటుంది. -
సీఎస్కేపై పంజాబ్ ఘన విజయం
మొహాలీ: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్ను కింగ్స్ ఘనంగా ముగించి అభిమానులకు కానుకగా ఇచ్చింది. సీఎస్కే నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కింగ్స్ పంజాబ్ విజయంలో కేఎల్ రాహుల్(71; 36 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా, క్రిస్ గేల్(28; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి తొలి వికెట్కు 108 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో కింగ్స్ పంజాబ్ సునాయాసంగా గెలుపొందింది. ఓ దశలో రాహుల్, గేల్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరినా, నికోలస్ పూరన్(36; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అంతకముందు టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. చెన్నై ఆదిలోనే షేన్ వాట్సన్(7) వికెట్ను కోల్పోయింది. ఆ దశలో డుప్లెసిస్కు జత కలిసిన సురేశ్ రైనా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి 120 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రైనా రెండో వికెట్గా ఔటయ్యాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించిన రైనా అనవసరపు షాట్ను ఆడి వికెట్ను సమర్పించుకున్నాడు. మరొకవైపు డుప్లెసిస్ ఆది నుంచి కింగ్స్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్.. సామ్ కరాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇది డుప్లెసిస్కు ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈసారి ధోని(10 నాటౌట్) భారీ షాట్లకు రాకపోవడంతో సీఎస్కే కింగ్స్ పంజాబ్ బౌలర్లలో కరాన్ మూడు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. -
చివరి లీగ్ ఆడబోతున్న కొల్కత ముంబై
-
డుప్లెసిస్ మెరుపులు
మొహాలీ: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై ఆదిలోనే షేన్ వాట్సన్(7) వికెట్ను కోల్పోయింది. ఆ దశలో డుప్లెసిస్కు జత కలిసిన సురేశ్ రైనా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి 120 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రైనా రెండో వికెట్గా ఔటయ్యాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించిన రైనా అనవసరపు షాట్ను ఆడి వికెట్ను సమర్పించుకున్నాడు. మరొకవైపు డుప్లెసిస్ ఆది నుంచి కింగ్స్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్.. సామ్ కరాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇది డుప్లెసిస్కు ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈసారి ధోని(10 నాటౌట్) భారీ షాట్లు ఆడకపోవడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో కరాన్ మూడు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. -
‘టాప్’పైనే సీఎస్కే గురి
మొహలీ: ఐపీఎల్-12వ సీజన్లో భాగంగా లీగ్ దశ నేటితో ముగియనుంది. లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్ పంజాబ్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవి చంద్రన్ అశ్విన్.. చెన్నైను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇప్పటికే సీఎస్కే ప్లేఆఫ్కు చేరడంతో ఆ జట్టుకు ఇది అంత ముఖ్యమైన మ్యాచ్ కాదు. కానీ పాయింట్ల పట్టికలో టాప్తో ముగించాలని భావిస్తున్న చెన్నై మరో విజయంపై కన్నేసింది. ప్రస్తుత మ్యాచ్లో చెన్నై గెలిస్తే టాప్లే ప్లేస్లోనే ఉంటుంది. మరొకవైపు కింగ్స్ పంజాబ్ దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా, సొంత మైదానంలో జరిగే మ్యాచ్ కావడంతో విజయంతో వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సీఎస్కే 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్కేను ఆపతరమా..? వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతున్న సీఎస్కేను చివరి స్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ నిలువరించడం కష్టమే. సీఎస్కే జట్టులో కెప్టెన్ ధోని కీలక ఇన్నింగ్స్లు ఆడుతుండగా, డు ప్లెసిస్, సురేశ్ రైనా, వాట్సన్లు బ్యాటింగ్ విభాగంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక బౌలింగ్లో పేసర్ దీపక్ చాహర్తో పాటు స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్లు రాణిస్తున్నారు. మరొకవైపు కింగ్స్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ మెరుపులు ఈ ఐపీఎల్లో పెద్దగా లేవనే చెప్పాలి. గేల్ క్రీజ్లో కుదురుకునే లోపే ప్రత్యర్థి బౌలర్లకు చిక్కడం పంజాబ్ వరుస ఓటములకు ఒక కారణం. కేఎల్ రాహుల్, మన్దీప్ సింగ్, మయాంక్ అగర్వాల్లు తప్ప మిగతా వారంతా తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఫుల్ స్వింగ్లో ఉన్న సీఎస్కేను కింగ్స్ పంజాబ్ ఎంతవరకూ నిలువరిస్తుందో చూడాలి. సీఎస్కే మ్యాచ్ ఎంఎస్ ధోని(కెప్టెన్), డుప్లెసిస్, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ కింగ్స్ పంజాబ్ రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, సామ్ కరన్, హరప్రీత్ బ్రార్, ఆండ్రూ టై, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ -
కోహ్లి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఆలోచించాడు..!
డెత్ ఓవర్లలో తన బౌలింగ్ అధ్వానంగా ఉంటుందని ఉమేష్ యాదవ్ మరోసారి నిరూపించాడు. సన్రైజర్స్తో శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో చివరి ఓవర్లో 28 పరుగులు సమర్పించుకొని ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టాడు. తన స్పెల్లో మూడు ఓవర్లలో 18 పరుగులే ఇచ్చుకున్న ఉమేష్ చివరి ఓవర్ను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఆ ఓవర్లో సన్రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 23 పరుగులు సాధించి ఆర్సీబీకి 176 టార్గెట్ నిర్దేశించాడు. అయితే, పరుగుల వేట ప్రారంభించిన బెంగుళూరు ఆదిలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయినా హెట్మైర్ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్స్లు), గురుకీరత్ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. ఇక చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయల్సి ఉండగా... నబీ వేసిన ఆఖరి ఓవర్లో ఉమేశ్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) వరుసగా 2 ఫోర్లు బాది బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు ఆర్సీబీ విజయంతో ఐపీఎల్కు ముగింపు పలికింది. కాగా, తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సిన సన్రైజర్స్కు ఉమేష్ భారీ పరుగులు ఇచ్చుకోవడంపై ఆర్సీబీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. నాలుగు ఓవర్లలో 46 పరుగులు ఇచ్చుకున్న అపర పేస్ మహనీయుడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆర్సీబీ తరపున ఆడుతూ ప్రత్యర్థి జట్లకు సాయం చేస్తుంటాడని తిట్టిపోస్తున్నారు. ‘విరాట్ కోహ్లి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఆలోచిస్తున్నాడు. ఉమేష్ చివరి ఓవర్లలో పనికిరాడు అని తెలియదా. అతని కోటా పవర్ప్లే ముగిసే వరకే కంప్లీట్ చేయాలి’ అని సూచిస్తున్నారు. ‘ఖచ్చితంగా చెప్తున్నాను. ఉమేష్ కన్నా నేనే బెటర్గా బౌలింగ్ చేయగలను’ అని మరొక అభిమాని చురకలంటించారు. ఉమేష్ దిండా అకాడెమీలో చేరాడా అని కొందరు ఎద్దేవా చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ పంజాబ్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఉమేశ్యాదవ్ నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులకు 3 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు యాజమాన్యం ఉమేశ్ ఫొటోని ట్విటర్లో పోస్టు చేస్తూ.. దిండా అకాడమీ? అదేంటి? అంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఆర్సీబీ మాజీ బౌలర్ అశోక్దిండా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్సీబీని ఉద్దేశిస్తూ తనూ ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. అందులో తన గణంకాలను చూపిస్తూ.. ‘ద్వేషించేవారి వల్ల నా గణంకాలు నిజమేనని తెలుస్తుంది. ఇలాంటివి ఆపి జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలు నిజాలు కావు. కాబట్టి మీ నోటికి నన్ను దూరంగా ఉంచండి’ అని పేర్కొన్నాడు. Dinda Academy! This is it. Lord Umesh Yadav in his best. #RCBvSRH @RCBTweets pic.twitter.com/xjbZg35YsN — Srishty Rode Fc ™ 💜 (@itsSuroj) May 4, 2019 @Gary_Kirsten Along with structural changes, a lot of common sense n trend analysis needs to be done. Does Virat Kohli pre determine even before d game starts that the last over would be bowled by Umesh Yadav? History suggests that Umesh's quota should be over within d powerplay. — SRB (@iamsrbekal) May 4, 2019 Umesh taken to the cleaners by Kane Williamson in the 20th over 6 4 6 4 2nb 1 4 28 runs from the last over. Is it the game changing over?#RCBvSRH #IPL2019 — Cricbuzz (@cricbuzz) May 4, 2019 -
ఆఖరి మ్యాచ్లో హైదరాబాద్ ఓటమి
-
రాజస్తాన్ ఔట్
ఐపీఎల్–12లో రాజస్తాన్ రాయల్స్ ప్రస్థానం ముగిసింది. కనుచూపు మేరలో ఏదో మూలన ప్లే ఆఫ్ అవకాశాలు కనిపిస్తున్నా పెద్దగా పోరాటం లేకుండానే ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కు లొంగిపోయింది. తొలుత బ్యాటింగ్లో తేలిపోయిన రాయల్స్కు అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం సాధ్యం కాలేదు. న్యూఢిల్లీ: గెలిస్తే... అదృష్టం కూడా కలిసొస్తే, ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ఉన్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాయల్స్ పరాజయం పాలైంది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మిత్ స్వదేశానికి వెళ్లిపోవడంతో ఈ ఆఖరి మ్యాచ్లో రాజస్తాన్ జట్టుకు రహానే కెప్టెన్గా వ్యవహరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాయల్స్... పేసర్ ఇషాంత్ శర్మ (3/38), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది. టీనేజ్ బ్యాట్స్మన్ రియాన్ పరాగ్ (49 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే వీరికి ఎదురు నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్ (2/27) తనవంతుగా రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో తొలుత తడబడినా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్ పంత్ (38 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడైన అజేయ అర్ధ సెంచరీతో ఢిల్లీ 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది. ఇషాంత్ జోరు, మిశ్రా మాయ ఓపెనర్లు కెప్టెన్ అజింక్య రహానే (2), లివింగ్స్టోన్ (14)లను ఆరంభంలోనే ఔట్ చేసి రాజస్తాన్ను ఇషాంత్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పృథ్వీ షా డైరెక్ట్ హిట్కు ఫామ్లో ఉన్న సంజు సామ్సన్ (5) రనౌట్గా వెనుదిరిగాడు. యువ లోమ్రర్ (8)నూ ఇషాంతే పెవిలియన్ చేర్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 30/4. తర్వాత మిశ్రా మాయ మొదలైంది. అతడు ఆల్రౌండర్లు శ్రేయస్ గోపాల్ (12), స్టువర్ట్ బిన్నీ (0), కృష్ణప్ప గౌతమ్ (6)ల పనిపట్టాడు. 14వ ఓవర్కు 65/7తో నిలిచిన రాయల్స్ కనీసం వందైనా చేస్తుందా? అనిపించింది. అయితే, ఇష్ సోధి (6) అండగా పరాగ్ పరిణతి చూపాడు. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు కొడుతూనే వికెట్ను కాపాడుకుంటూ పరుగులు చేశాడు. ఇషాంత్ వేసిన 18వ ఓవర్లో రెండు వరుస ఫోర్లు బాదాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. 47 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్గా పరాగ్ (17 ఏళ్ల 175 రోజులు) రికార్డు సృష్టించాడు. సంజు సామ్సన్ (2013లో 18 ఏళ్ల 169 రోజులు) పేరిట ఉన్న రికార్డును పరాగ్ సవరించాడు. ఢిల్లీ... దెబ్బలు తిన్నా ఢిల్లీకి ధావన్ (16), పృథ్వీ షా (8)లను వరుస బంతుల్లో ఔట్ చేసి సోధి (3/26) కంగారు పెట్టించాడు. రెండు సిక్స్లు కొట్టి లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 15) కూడా ఎక్కువసేపు నిలవలేదు. పరిస్థితిని గ్రహించిన పంత్ ఈ దశలో అనవసర షాట్లకు పోయి వికెట్ పారేసుకోకుండా ఓపిక, పట్టుదల చూపాడు. పంత్, ఇంగ్రామ్ (12) క్రీజులో ఉన్నా... ఏడో ఓవర్ నాలుగో బంతి నుంచి 15వ ఓవర్ ఐదో బంతి వరకు ఢిల్లీ ఇన్నింగ్స్లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం. ఒకటీ, రెండు పరుగులు చేస్తూ పోయినా లక్ష్యం పెద్దదేమీ కాకపోవడంతో ఇబ్బంది లేకపోయింది. 36 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన దశలో అరోన్ ఓవర్లో పంత్ సిక్స్, ఫోర్ బాది పరిస్థితిని తేలిక చేశాడు. గోపాల్ వేసిన తర్వాతి ఓవర్లో రూథర్ఫర్డ్ (11), పంత్ చెరో సిక్స్ కొట్టి స్కోరు సమం చేశారు. సోధి బౌలింగ్లో లాంగాన్లోకి సిక్స్ కొట్టిన పంత్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్ను ముగించాడు. -
కోల్కతా నైట్రైడర్స్కు అనుకూలం
ఐపీఎల్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు అనుకూలాంశం ఉంది. ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవడానికి కేవలం విజయం సాధిస్తే సరిపోతుందా? లేక ఎన్ని ఓవర్లలో లక్ష్య ఛేదన చేయాలి, ఎన్ని పరుగుల తేడాతో గెలవాలి అన్న విషయంపై కోల్కతా జట్టుకు స్పష్టత వస్తుంది. పంజాబ్పై కోల్కతా నైట్రైడర్స్ అద్భుతంగా నెగ్గింది. ముఖ్యంగా శుబ్మన్ గిల్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ గెలుపుతో కోల్కతా జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగి ఉంటుంది. గతవారం ఈడెన్ గార్డెన్స్లో ముంబై ఇండియన్స్పై 200 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించిన కోల్కతా మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ముంబై జట్టును గట్టెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే సన్రైజర్స్తో మ్యాచ్లో సూపర్ ఓవర్లో హార్దిక్ తన జట్టును గెలిపించాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో గెలిచి లీగ్ దశను టాప్ ర్యాంక్తో ముగించాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ను విజయంతో ముగించాలని పంజాబ్ ఆశిస్తోంది. పంజాబ్కు ప్లే ఆఫ్ అవకాశాలు లేకపోవడంతో క్రిస్ గేల్, లోకేశ్ రాహుల్ విధ్వంసకర ఆటతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి. ఈ ఇద్దరితోపాటు ధోని ఆటను కూడా ఆస్వాదించాలని పంజాబ్ ప్రేక్షకులు మైదానానికి వస్తారనడంలో సందేహం లేదు. -
సన్ ‘బెర్త్’ కోల్కతా చేతిలో
సన్రైజర్స్ హైదరాబాద్ తన చేతిలో ఉన్న ఆఖరి విజయావకాశాన్ని వదులుకుంది. గెలిస్తే ఎంచక్కా ప్లే ఆఫ్ చేరే మ్యాచ్లో బాధ్యతారహితంగా ఆడి ఓడింది. కెప్టెన్ విలియమ్సన్ మినహా బ్యాటింగ్లో చేతులెత్తేశారు. బౌలింగ్లో ఒకరిద్దరు కష్టపడినా... 13వ ఓవర్లో హెట్మైర్ ఇచ్చిన రెండు క్యాచ్లను మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్ వదిలేయడం హైదరాబాద్ ఓటమికి బాటలు వేసింది. నేడు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఓడితేనే హైదరాబాద్ మెరుగైన రన్రేట్తో ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ముంబైపై కోల్కతా గెలిస్తే మాత్రం హైదరాబాద్ ఇంటిముఖం పడుతుంది. కోల్కతా చివరి బెర్త్ దక్కించుకుంటుంది. బెంగళూరు: కోహ్లి సేనే మురిసింది. తమ సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ను ముంచేసింది. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విలియమ్సన్ (43 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత పరుగుల వేట ప్రారంభించిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. హెట్మైర్ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్స్లు), గురుకీరత్ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. నాలుగో వికెట్కు 144 పరు గులు జోడించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. హెట్మైర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఆరంభం వేగంగా.... బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రైజర్స్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గప్టిల్, సాహా తొలి ఓవర్లో 2 పరుగులే చేశారు. కానీ రెండో ఓవర్లో 19 పరుగులొచ్చాయి. గప్టిల్ 4, 6 బాదగా, సాహా బౌండరీ కొట్టాడు. ఉమేశ్ బౌలింగ్లో గప్టిల్ మరో సిక్స్ కొట్టగా, చహల్ బౌలింగ్కు దిగిన నాలుగో ఓవర్లో సాహా వరుసగా 3 బౌండరీలు బాదేశాడు. దీంతో సన్ స్కోరు 4 ఓవర్లలోనే 44 పరుగులకు చేరింది. ఈ జోరుకు సైనీ బ్రేక్ వేశాడు. సాహా (11 బంతుల్లో 20; 4 ఫోర్లు)ను ఔట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ తన తొలి ఓవర్లో గప్టిల్ (23 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే(9)లను ఔట్ చేయడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. కెప్టెన్ విలియమ్సన్, విజయ్ శంకర్ జట్టును నడిపించేందుకు శ్రమించారు. వీర విలియమ్సన్... స్కోరు పెంచేందుకు 14వ ఓవర్ నుంచి జోరు పెంచారు. సుందర్ వేసిన 14వ ఓవర్లో విజయ్ శంకర్ వరుసగా 2 సిక్సర్లు బాదాడు. కానీ ఆ మరుసటి బంతికి ఔటయ్యాడు. 15వ ఓవర్లో విలియమ్సన్ రెండు సిక్సర్లు బాదడంతో ఈ రెండు ఓవర్లలో 29 పరుగులొచ్చాయి. అనంతరం చహల్... యూసుఫ్ పఠాన్ (3)ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్ లో 100 వికెట్లను పూర్తి చేసుకున్న 14వ బౌలర్గా నిలిచాడు. 17వ ఓవర్ సైనీ వేయగా విలియమ్సన్, నబీ చెరో బౌండరీ బాదారు. కానీ ఆఖరి బంతికి నబీ (4) లాంగాన్లో గురుకీరత్ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్లో పరుగుల్ని కట్టడి చేసిన ఖేజ్రోలియా... రషీద్ ఖాన్ (1)ను పెవిలియన్ చేర్చాడు. ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. 19వ ఓవర్లోనూ సైనీ 5 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో విలియమ్సన్ కసిదీరా కొట్టాడు. దీంతో ఉమేశ్ బౌలింగ్లో వరుసగా 6,4,6,4,2 (నోబాల్),1,4లతో 28 పరుగులు వచ్చాయి. కష్టాలతో మొదలైంది... బెంగళూరుకు ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. తొలి ఓవర్లోనే భువీ బౌలింగ్లో పార్థివ్ (0) డకౌటయ్యాడు. రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ బాదిన కోహ్లి (7 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) జోరు రెండో ఓవర్లోనే ముగిసింది. అతన్ని ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. డివిలియర్స్ (1) మూడో ఓవర్లో వెనుదిరిగాడు. బెంగళూరు 20 పరుగులకే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. అప్పటికి ఇంకా 156 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో 7 వికెట్లున్నాయి. ఈ దశలో హెట్మైర్, గురుకీరత్ ప్రత్యర్థి బౌలర్ల పాలిట ఫైర్మెన్ అయ్యారు. వీళ్లిద్దరి షాట్లకు ప్రత్యర్థి బౌలర్లు నీరసించారు, ఫీల్డర్లు అలసిపోయారు. చేతికొచ్చిన క్యాచ్ల్ని జారవిడిచారు. ఇక 24 బంతుల్లో 30 పరుగులే కావాలి. ఈ దశలో హెట్మైర్, గురుకీరత్, సుందర్ (0) ఔటవ్వడంతో ఉత్కంఠ పెరిగింది. 6 బంతుల్లో 6 పరుగులు చేయల్సి ఉండగా... నబీ వేసిన ఆఖరి ఓవర్లో ఉమేశ్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) వరుసగా 2 ఫోర్లు బాది బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు. -
ఆర్సీబీ లక్ష్యం 176
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 46 పరుగుల వద్ద సాహా(20) వికెట్ను నష్టపోయింది. ఆపై కాసేపటికి గప్టిల్(30), మనీష్ పాండే(9) వికెట్లను కోల్పోవడంతో 61 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది సన్రైజర్స్. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్- విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ 45 పరుగులు జోడించిన తర్వాత విజయ్ శంకర్(27) పెవిలియన్ చేరాడు. అటు తర్వాత స్వల్ప వ్యవధిలో యూసఫ్ పఠాన్(3), నబీ(4), రషీద్ ఖాన్(1)లు పెవిలియన్ చేరారు. కానీ విలియమ్సన్(70 నాటౌట్; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. విలియమ్సన్ కడవరకూ క్రీజ్లో ఉండటంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు సాధించగా, నవదీప్ షైనీ రెండు వికెట్లు తీశాడు. చహల్, ఖేజ్రోవాలియాలకు తలో వికెట్ దక్కింది. -
ఘనంగా ప్లే ఆఫ్కు దిల్లీ క్యాపిటల్స్
-
సన్రైజర్స్ గెలిస్తేనే ముందుకు..!
బెంగళూరు: గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో సూపర్ ఓవర్లో పరాజయం చవిచూసిన సన్రైజర్స్ హైదరాబాద్ తిరిగి పుంజుకునేందుకు సమాయత్తమైంది. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆతిథ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గెలవాల్సి ఉంది. ప్రస్తుతం రన్రేట్ పరంగా హైదరాబాద్ మెరుగ్గా ఉండటంతో గెలిస్తే ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం ఇంకా కుదురుకున్నట్లుగా లేదు. వార్నర్ స్థానంలో బరిలో దిగిన గప్టిల్ ఆ లోటును పూరించలేకపోయాడు. వృద్ధిమాన్ సాహా, కెప్టెన్ కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్ కీలక సమయాల్లో కూడా రాణించలేకపోతున్నారు. మనీశ్ పాండే ఫామ్ ఒక్కటే ప్రస్తుతం రైజర్స్ శిబిరంలో ఆశలు నింపుతోంది. పాండేకు తోడుగా నబీ, రషీద్ ఖాన్ బ్యాటింగ్లో అండగా నిలుస్తున్నారు. బౌలింగ్ విభాగం అంచనాలకు తగినట్లుగా రాణించినప్పటికీ బ్యాట్స్మెన్ పరుగులు చేయలేకపోవడంతో రైజర్స్ రేసులో వెనుకబడుతోంది. ఈ మ్యాచ్లోనూ పేసర్లు భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్... స్పిన్నర్లు రషీద్ ఖాన్, నబీ ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు 13 మ్యాచ్లాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్ల్లో ఓడిపోయి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. రాజస్తాన్తో జరిగిన చివరి మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. హైదరాబాద్తో నేడు జరిగే మ్యాచ్ బెంగళూరుకు చివరిది కావడంతో గెలుపుతో సీజన్ను ముగించాలని కోహ్లి సేన భావిస్తోంది. సొంత మైదానంలో ప్రేక్షకులకు గెలుపును బహుమతిగా ఇవ్వాలని కోహ్లి, డివిలియర్స్ పట్టుదలగా ఉన్నారు. తుదిజట్లు: ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థీవ్ పటేల్, ఏబీ డివిలియర్స్, హెట్మెయిర్, గురుకీరత్ సింగ్, గ్రాండ్ హోమ్, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్వంత్ ఖేజ్రోలియా, చహల్ సన్రైజర్స్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), వృద్దిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, యుసుఫ్ పఠాన్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, బాసిల్ థంపి -
రాజస్తాన్ రాయల్స్ కథ ముగిసె..
ఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ కథ ముగిసింది. ఏదో మూలన మిగిలి ఉన్న ప్లేఆఫ్ ఆశలను రాజస్తాన్ రాయల్స్ సజీవంగా ఉంచుకోలేకపోయింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలై రేసు నుంచి నిష్క్రమించింది. రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 23 బంతులు ఉండగానే ఛేదించడంతో రాజస్తాన్ కథ ముగిసింది. ఇది ఢిల్లీకి తొమ్మిదో విజయం కాగా, రాజస్తాన్కు ఎనిమిదో ఓటమి. ఢిల్లీ విజయంలో రిషభ్ పంత్(53 నాటౌట్; 38 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక భూమిక పోషించాడు. స్వల్ప పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడింది. పృథ్వీ షా(8), శిఖర్ ధావన్(16)లు తొందరగానే పెవిలియన్ చేరారు. వీరిద్దర్నీ ఇష్ సోథీ వరుస బంతుల్లో ఔట్ చేయడంతో ఢిల్లీ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో శ్రేయస్ అయ్యర్-రిషభ్ పంత్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరు 33 పరుగులు జత చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్(15) భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. కాసేపటికి ఇన్గ్రామ్(12) కూడా ఔట్ కావడంతో మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లి బాధ్యతను రిషభ్ తీసుకున్నాడు. ఒకవైపు క్రీజ్లో నిలకడగా ఆడుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాట్ ఝుళిపించాడు. రిషభ్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 16.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రహనే, లివింగ్ స్టోన్లు ఆదిలోనే పెవిలియన్ చేరారు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి రహానే ఔట్ కాగా, ఇషాంత్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో లివింగ్ స్టోన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది రాజస్తాన్. ఆపై వెంటనే సంజూ శాంసన్ రనౌట్ కావడంతో పాటు, లామ్రోర్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ దశలో రియన్ పరాగ్ బాధ్యాయుతంగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి బంతి వరకూ క్రీజ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్(50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత శర్మ, అమిత్ మిశ్రాలు తలో మూడు వికెట్లు సాధించగా, ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 116
ఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 116 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. రాజస్తాన్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలం కావడంతో ఆ జట్టు స్పల్స స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ ఆటగాళ్లలో రియాన్ పరాగ్(50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు. రహానే(2), లివింగ్ స్టోన్(14), సంజూ శాంసన్(5), లామ్రోర్(8), శ్రేయస్ గోపాల్(12), స్టువర్ట్ బిన్నీ(0), కృష్ణప్ప గౌతమ్(6), ఇష్ సోథీ(6)లు వరుసగా క్యూకట్టడంతో రాజస్తాన్ తేరుకోలేకపోయింది. ఢిల్లీ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో రాజస్తాన్ మూడంకెల స్కోరును దాటడానికి ఆపసోపాలు పడింది. ఇషాంత శర్మ, అమిత్ మిశ్రాలు తలో మూడు వికెట్లు సాధించగా, ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. 30 పరుగులకే నాలుగు వికెట్లు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రహనే, లివింగ్ స్టోన్లు ఆదిలోనే పెవిలియన్ చేరారు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి రహానే ఔట్ కాగా, ఇషాంత్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో లివింగ్ స్టోన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది రాజస్తాన్. ఆపై వెంటనే సంజూ శాంసన్ రనౌట్ కావడంతో పాటు, లామ్రోర్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ దశలో రియన్ పరాగ్ బాధ్యాయుతంగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి బంతి వరకూ క్రీజ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. -
సన్రైజర్స్, కేకేఆర్ మధ్యలో రాజస్తాన్
ఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా స్థానిక ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా బ్యాటింగ్కు మొగ్గుచూపాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ ఓటమి పాలైంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లలతో ప్లేఆఫ్కు చేరుకోగా, రాజస్తాన్ రాయల్స్ నాకౌట్ అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయనే చెప్పాలి. కొన్ని అద్భుతాలు జరిగితే రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్కు చేరే అవకాశం ఉంది. సన్రైజర్స్, కేకేఆర్ మధ్యలో రాజస్తాన్ ప్లే ఆఫ్ ముంగిట పాయింట్ల పరంగా (13 మ్యాచ్ల్లో 12) ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ సమంగా ఉన్నాయి. అయితే, రన్రేట్లో హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉంది. శనివారం బెంగళూరుపై గెలిస్తే సన్రైజర్స్ 14 పాయింట్లతో ఉంటుంది. దీంతో ఆదివారం ముంబైతో మ్యాచ్లో కోల్కతా రన్రేట్ లెక్కలను చూసుకుంటూ నెగ్గాల్సి వస్తుంది. బహుశా పరుగుల్లో భారీ తేడాతోనో, లక్ష్యాన్ని చాలా ముందుగానో ఛేదించాల్సి రావొచ్చు. హైదరాబాద్ ఓడితే మాత్రం... కోల్కతాకు ఫ్లే ఆఫ్ బెర్త్ దక్కాలంటే ముంబైపై గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ... హైదరాబాద్, కోల్కతా తమ మ్యాచ్ల్లో ఓడిపోయి, ఢిల్లీపై రాజస్తాన్ నెగ్గితే ఆ జట్టు 13 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ను సంపాదిస్తుంది. రాజస్తాన్ అజింక్యా రహనే(కెప్టెన్), సంజూ శాంసన్, లివింగ్ స్టోన్, రియాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, లామ్రోర్, కృష్ణప్ప గౌతమ్, శ్రేయస్ గోపాల్, ఇష్ సోథీ, వరుణ్ అరోన్, ఓషోన్ థామస్ ఢిల్లీ శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, కొలిన్ ఇన్గ్రామ్, రూథర్ఫర్డ్, కీమో పాల్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్