ఆసుస్ ఫోన్పాడ్ 7 @ రూ.12,999
న్యూఢిల్లీ: ఆసుస్ కంపెనీ డ్యుయల్ సిమ్ ట్యాబ్లెట్, ఫోన్పాడ్ 7ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ట్యాబ్ ధర రూ.12,999 అని ఆసుస్ రీజనల్ హెడ్ (దక్షిణాసియా, భారత్) పీటర్ చాంగ్ తెలిపారు. హెచ్డీ డిస్ప్లే ఉన్న ఈ ట్యాబ్లో 3జీ కాలింగ్, ఆటమ్ జడ్2520 1.2 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64 జీబీ ఎక్స్పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. జూన్ తర్వాత ఈ ట్యాబ్ను ఆండ్రాయిడ్ కిట్క్యాట్కు అప్గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
10 శాతం మార్కెట్ వాటా లక్ష్యం
ప్రస్తుతం వందగా ఉన్న తమ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ను రెట్టింపు చేయనున్నామని చాంగ్ వివరించారు. భారత ట్యాబ్లెట్ల మార్కెట్లో ప్రస్తుతం 3-5 శాతంగా ఉన్న తమ వాటాను ఈ ఏడాది చివరికల్లా 10 శాతానికి పెంచుకోవడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం కొత్త కొత్త ఉత్పత్తులను అందించనున్నామని, రిటైల్ నెట్వర్క్ను విస్తరించనున్నామని వివరించారు. ఈ కంపెనీ గూగుల్కు నెక్సస్ 7 ట్యాబ్లెట్లను అందిస్తోంది. ఫోన్పాడ్ బ్రాండ్ కింద సొంత ట్యాబ్లను, ట్రాన్స్ఫార్మర్ బుక్ రేంజ్ కింద హైబ్రిడ్ ట్యాబ్లను విక్రయిస్తోంది. ఈ రెండు కేటగిరీల కింద ఈ ఏడాది 3-5 ఉత్పత్తులనందించనున్నామని చాంగ్ వివరించారు. అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం 2012లో భారత్లో 26.6 లక్షల ట్యాబ్లెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 56 శాతం వృద్ధితో 41.4 క్షలకు పెరిగింది.