ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్
అమ్మన్: తమ దేశ పైలట్ను సజీవంగా దహనం చేసిన ఐఎస్ ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం ఉదయం ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. వీరిలో ఇరాక్కు చెందిన మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు సాజిద అల్ రిషావి(44), అల్ఖైదా సభ్యుడు జియాద్ అల్ కర్బోలి ఉన్నారు. రాజధాని అమ్మన్కు దక్షిణంగా ఉన్న స్వాకా జైలులో ఇస్లామిక్ న్యాయ అధికారి ఆధ్వర్యంలో ఉరిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.
2005లో అమ్మన్లో చోటుచేసుకున్న ఘోర దాడుల్లో భాగస్వామ్యం ఉండటంతో రిషావికి, ఉగ్రవాద ఆరోపణలతో పాటు ఇరాక్లో ఓ జోర్డాన్ జాతీయుడిని చంపినందుకు 2007లో కర్బోలికి మరణ శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పైలట్ను సజీవ దహనం చేయడాన్ని అమెరికా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. ఈ చర్య ఐఎస్ఐఎస్ క్రూరత్వానికి నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు.