కేన్సర్ పరీక్షను తప్పనిసరి చేయాలి
ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్రాత్రేయుడు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రోజూ దాదాపు 200 మంది మహిళల మృతికి కారణమవుతున్న గర్భాశయ ముఖద్వార కేన్సర్ నియంత్రణకు ముందస్తు పరీక్షలను తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ వైద్య నిపుణుడు, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ ట్రస్టీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు స్పష్టం చేశారు. పాతికేళ్లు పైబడ్డ ప్రతి మహిళ ఏ కారణంతో ఆసుపత్రిలో చేరినా గర్భాశయ ముఖద్వార కేన్సర్ గుర్తింపు పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా అమెరికాలో కేన్సర్ మరణాల రేటును గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు.
గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఈ రకమైన కేన్సర్ నివారణకు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఇప్పటికే చర్యలు తీసుకుందని తెలిపారు. ‘ప్రివెన్షన్ ఇంటర్నేషనల్’ అనే సంస్థతో కలిసి తొలిదశలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.