కొడుకు పుట్టలేదని గొంతుకోశారు
మహబూబ్నగర్: ఇద్దరు ఆడపిల్లల తల్లి ఆమె. కొడుకు పుట్టలేదని రెండేళ్లుగా అత్తింటివారు వేధింపులకు గురి చేస్తున్నారు. కాపురం రోడ్డున పడరాదని ఇన్నాళ్లు మౌనంగా భరించింది. చివరకు ప్రాణం మీదకు తెచ్చుకుంది. భర్త, అత్తమామలు కలిసి ఆమెను చంపబోయారు. కత్తి, బ్లేడుతో ఆమె గొంతు కోశారు. అదృష్టవశాత్తు చావు నుంచి తప్పించుకున్న ఆమె ఆదివారం కొడంగల్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ (28)ను పదేళ్ల క్రితం ఇందనూర్ గ్రామానికి చెందిన రవీందర్కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లు వారి కాపురం సజావుగా సాగింది.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మగసంతానంపై ఆశలు పెట్టుకున్న అత్తింటివారికి ఆడపిల్లలు పుట్టడం సహించలేదు. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుడితే ఏమి చేయాలని వారు ఆలోచించారు. ఎలాగైన ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించారు. భర్త రవీందర్, అత్తమామాలు ఎల్లమ్మ, మొగులయ్య, మరిది నరేష్ మరో ఇద్దరు కుటుంబసభ్యులు కలిసి పథకం ప్రకారం ఈనెల 10వ తేది శుక్రవారం రాత్రి బ్లేడు, చాకుతో ఆమెపై దాడి చేశారు. గొంతు కోశారు. వారి దాడి నుంచి తప్పించుకున్న లక్ష్మీ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.దీంతో కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రోజు కొడంగల్ వచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారు.