breaking news
Tyagaraja keerthanas
-
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’!
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’ అన్న త్యాగరాజ కీర్తన సంగీత కచేరీలలో ఎక్కువగా కనిపించదు. పాత రోజులలో నాగయ్య, భాను మతి వంటివారు సినిమాలలో ఈ పాట పాడటం వల్ల, ఆ పాటకూ, మాటకూ బాగా ప్రాచుర్యం ఉండేది.ఎవరికయినా అకస్మాత్తుగా కోపం బుస్సుమని పొంగివస్తే, చను వున్న సన్నిహితులు, ‘నాయనా! కోపం తగ్గించు. శాంతము లేక సౌఖ్యము లేదు!’ అని త్యాగరాజు గారి పల్లవిని సామెతగా, సుభాషితంగా వాడటం శిష్ట సమాజంలో ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తుంది.‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష!’ అన్న విషయం అందరికీ అనుభవవైక వేద్యమే. కోపాన్ని దూరంగా ఉంచేవాడికి, సుఖ సంతోషాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి, దార, సుతులు, ధన, ధాన్యములుండిన, / సారెకు జప, తప సంపదలుండిన, / ఆగమ, శాస్త్రములన్నియు చదివిన,.../ భాగవతు లనుచు బాగుగ పేరైన, / శాంతము లేక సౌఖ్యము లేదు! అన్న అయ్య వారి మాట వరహాల మూటే. అయితే, ఇక్కడ ‘శాంతం’ అంటే, క్రోధ రాహిత్యమనీ, కోపం లేకుండా వ్యవహరించటమనీ మాత్రమే అర్థం చెప్తే, అదీ మంచి మాటే! కానీ అది కొంచెం పరిమితమైన అర్థం. వాస్తవానికి, చివరి దాకా చూస్తే, త్యాగయ్య గారంటున్నది, ‘... త్యాగ రాజ నుత! సాధురక్షిత! తనకు ‘ఉప/శాంతము’ లేక సౌఖ్యము లేదు!’ అని. ఉపశాంతం అంటే ఉపశమనం, శమింపజేయటం, నియంత్రించటం! కామ క్రోధ లోభాది ఆరు అంతశ్శత్రువులనూ అదుపులో ఉంచటం. క్షణికోద్రేకం కట్టలు తెగకుండా చూడటం. ఇంద్రియ కాంక్షల విజృంభణను నిగ్రహించటం. ఒత్తిళ్ళ వల్ల ఓర్పు కోల్పోకుండా,సంయమనంతో స్పందించటం. అటు లౌకిక విషయాలలో గానీ, ఇటు ఆధ్యాత్మిక సాధనలలో గానీ పురోగతి కోరేవాడికి, ఇది అత్యావశ్యకమైన గుణం అనడంలో సందేహానికి ఆస్కారం లేదు!– మారుతి శాస్త్రి -
శ్రవణపేయంగా త్యాగరాజ కీర్తనలు
తెనాలి: శ్రీసీతారామ గానసభ 70వ వార్షిక సంగీత ఉత్సవాలు 10వ రోజయిన బుధవారం రాత్రితో ముగిశాయి. ఇక్కడి మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఉత్సవాల్లో చివరిరోజు రాత్రి త్యాగరాజ వైభవం, ప్రఖ్యాత త్యాగరాజ కీర్తనలు, వ్యాఖ్యాన సహితంగా నిర్వహించటం విశేషం. సంగీత త్రిమూర్తులైన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ భూమికములుగా ఆయా విద్వాంసుల ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆధారంగా కార్యక్రమం జరిపారు. ప్రధాన భూమికగా త్యాగరాజస్వామి జీవితంలో ఆయన రచించిన విశేష సంగీత కృతులను విజయవాడకు చెందిన చావలి రామకృష్ణ ఆలపించారు. ముఖ్య కీర్తనలకు బ్రహ్మర్షి ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకుంది. చావలి శ్రీనివాస్ వయొలిన్పై కృష్ణమోహన్ మృదంగంపై సహకరించారు. గానసభ అధ్యక్షుడు ఆచార్య పిరాట్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.