సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలి
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.శ్రీపతిరావు అన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కోతిరాంపూర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపతిరావు మాట్లాడుతూ గతేడాది 44 రోజులపాటు సమ్మె చేసిన ఫలితంగా ప్రభుత్వం ఒప్పుకున్న డిమాండ్లను జీవోలో పెట్టలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 63లో పార్ట్టైం కార్మికులకు రూ.1623నుంచి రూ. 4వేల వరకు, ఫుల్టైం/కంటింజెంట్ కార్మికులకు రూ.2300 నుంచిరూ.5 వేల వరకు పెంచుతూ జీవో విడుదల చేశారని అన్నారు. వేతన చెల్లింపు పరిమితిని మైనర్ పంచాయతీలకు 30 శాతం నుంచి 50 శాతం పెంచారని, దీన్ని మేజర్ పంచాయతీలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జీవో 63ను సవరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ముత్యంరావు, యూనియన్ కార్యదర్శి బండారి శేఖర్, నాయకులు పులి మల్లేశం, రాజలింగ్, శేఖర్, మల్లేశం, ప్రమోద్, కుమార్, రామానుజం, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.