భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ ను సైనా కంగుతినిపించి స్వర్ణం పతకం చేజిక్కించుకుంది. అంతకుముందు ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ ను ఓడించిన సైనా.. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆమె చేతిలో ఓడిపోయింది. తాజాగా మరోసారి కరోలినాపై పైచేయి సాధించిన సైనా.. ముఖాముఖి కార్డులో 4-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
బ్యాడ్మింటన్ ప్రస్థానం ఇలా..
సైనా నెహ్వాల్ మార్చి 17, 1990న హర్యానాలోని హిస్సార్ లో జన్మించింది. తల్లి దండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాధించినవారే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఈ క్రీడాకారిణి బ్యాడ్మింటన్ లో తనదైన ముద్రతో ముందుకు దూసుకుపోతుంది. సైనా తన చిన్నతనంలో బ్యాడ్మింటన్ శిక్షణ కోసం ఉదయం నాలుగు గంటలకే లేచి, తండ్రి స్కూటర్ మీద వెళ్లేదట. అయితే, అలా వెళ్లే క్రమంలో వెనుక సీటుపై తండ్రిని గట్టిగా పట్టుకుని నిద్రపోయేదట.
2006లో ఫిలిప్పిన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ను గెలిచి స్టార్ ఓపెన్ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించటంతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంట్ లో 86వ సీడ్గా ప్రవేశించిన ఆమె పలు టాప్సీడ్లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం బీడబ్యూఎఫ్ ప్రపంచ చాంపియన్లో రన్నరప్గా నిల్చింది.
2007 లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు
సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్లో సెమీస్ వరకూ సైనా వెళ్ల గల్గింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్లో స్వర్ణపతకం సాధించింది. ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో కూడా టైటిల్ సాధించింది.
2009 లో ఇండోనేషియా ఓపెన్లో టైటిల్ సాధించి, ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.
2010 లో ఆల్ ఇంగ్లండ్ సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్షిప్లో కాంస్య పతకం పొందడమే కాకుండా.. ఇండియా ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్ టైటిళ్లును సైనా కైవశం చేసుకుంది.
అయితే 2011 ఆరంభంలో స్విస్ ఓపెన్ గెలిచిన సైనాకు ఆ తరువాత ప్రతికూల ఫలితాలే వచ్చాయి. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ లో సైనా రెండో రౌండ్ ను కూడా అధిగమించలేకపోయింది. అదే సంవత్సరం ఆల్ ఇంగ్లండ్ సూపర్ సిరీస్ లో సైనా ఆదిలోనే ఓటమి చెందింది. వరల్డ్ చాంపియన్ షిప్ లో కూడా సైనా ఓటమి చెందడంతో తన మూడో ర్యాంక్ ను కోల్పోయింది. అయితే వరల్డ్ చాంపియన్ షిప్ లో రెండు సార్లు క్వార్టర్స్ వరకూ వెళ్లిన ఘనతను సైనా సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలోనే డెన్మార్ ఓపెన్, ఫ్రెంచ్ సూపర్ సిరీస్,హాంగాక్ సూపర్ సిరీస్ లలో సైనాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
2012వ సంవత్సరంలో సైనా జైత్రయాత్ర కొనసాగింది. ఆరంభంలో జరిగిన స్విస్ ఓపెన్ ను కాపాడుకోవడంలో సైనా సఫలమయ్యింది. ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ ను, సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. డెన్మార్క్ సూపర్ సిరీస్ ను తొలిసారి కైవశం చేసుకుంది.
2014 లో మూడు టైటిళ్లను సైనా గెలుచుకుంది. ఇండియా ఓపెన్, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లను సైనా దక్కించుకుంది.
2015 లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్ సైనాను వరించింది. తరువాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ ఫైనల్ కు చేరి తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సైనా.. చివరి అడ్డంకిని దాటలేకపోయింది.