అంతూలే మృతి
మహారాష్ట్ర తొలి ముస్లిం సీఎంగా రికార్డు
సాక్షి, ముంబై: కాంగ్రెస్ కురువృద్ధుడు, మహారాష్ట్రకు తొలి ముస్లిం ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలే(85) ఇకలేరు. సుదీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారమిక్కడి బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అపస్మారకంలో ఉన్న అంతూలే ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మృతిచెందారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన రాయగఢ్ జిల్లా అంబేత్ గ్రామంలో బుధవారం నిర్వహించనున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అంతూలే 1980-82 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆనాడు మహారాష్ట్రలో చోటుచేసుకున్న సిమెంట్ స్కామ్పై పార్లమెంటు చాలారోజులు స్తంభించడంతో ఇందిర బలవంతంపై సీఎం పదవికి రాజీనామా చేశారు. తను నెలకొల్పిన ఇందిరాగాంధీ ప్రతిభా ప్రతిష్టాన్ ట్రస్టుకు బిల్డర్ల నుంచి విరాళాలు తీసుకుని వారికి ఆనాడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సిమెంట్ కోటాను పెంచారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతూలే 1962లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1980 జూన్ 9న సీఎం అయ్యారు.నాలుగుసార్లు లోక్సభ ఎంపీగా, రెండు పర్యాయాలు రాజస్యసభ ఎంపీగా ఉన్న ఆయన 1995-96లో, యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ సంతాపం: అంతూలే మృతిపై కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు.