ఆశాదీపం'శాంతిఖని'
గనిలోకి కంటిన్యూయస్ మైనర్ యంత్రం
మెగా లాంగ్వాల్ ప్రాజెక్టు వైపు అడుగులు
చురుగ్గా కొనసాగుతున్న ఏర్పాట్లు
బెల్లంపల్లి : మసకబారుతున్న బెల్లంపల్లి ప్రాంతానికి శాంతిఖని భూగర్భ గని ఆశాదీపం కాబోతోంది. బెల్లంపల్లి రీజియన్లో శాంతిఖని గని సింగరేణికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతోంది. భూగర్భంలో అపారంగా నిక్షిప్తమై ఉన్న బొగ్గు నిక్షేపాల వెలికితీత కోసం గనిలో కంటిన్యూయస్ మైనర్(సీఎం) యంత్రాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల రెండో వారంలో గనిలో ప్రవేశపెట్టాలనే తలంపులో సింగరేణి అధికారులు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కంటిన్యూయస్ మైనర్ యంత్రం ప్రవేశపెట్టిన తర్వాత దశల వారీగా ఈ గనిని మెగా లాంగ్వాల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దనున్నారు.
భూగర్భంలో ముమ్మర ఏర్పాట్లు
కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని గనిలో దింపేందుకు కొంతకాలం నుంచి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది కాలం నుంచి పనులు కొనసాగుతున్నాయి. ముందస్తుగా భూగర్భంలో వెంటిలేషన్ సమస్యను అధిగమించారు. 3 లక్షల హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఫ్యాన్ను ఏర్పాటు చేశారు. సర్ఫేస్ నుంచి భూగర్భంలో నాలుగు కిలోమీటర్ల వరకు రూట్ క్లియర్ చేసి, జంక్షన్లను వెడల్పు చేసి రక్షణ చర్యలను పటిష్టం చేశారు. ఆయా పనులన్నీ నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయా పనులు తుది దశకు చేరుకున్నాయి. శాంతిఖని గనికి అనుబంధంగా రూ.22 కోట్లతో షాప్ట్ వైండింగ్ను కూడా ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది(2018) నుంచి షాప్ట్ వైండింగ్ నుంచి కార్మికులు గనిలో దిగి బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జీవిత కాలం 30 ఏళ్లు
బెల్లంపల్లిలో అతి ప్రాచీనమైన భూగర్భ గని శాంతిఖని. 1954 సంవత్సరంలో ఈ గనిలో బొగ్గు నిక్షేపాల తవ్వకాలు ఆరంభమయ్యాయి. 62 ఏళ్ల నుంచి నిరాటంకంగా గనిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. భూగర్భ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏడాది కాలం నుంచి గనిలో బొగ్గు ఉత్పత్తి అంతంత మాత్రంగా జరుగుతోంది. ఏడాదికి గరిష్టంగా రూ.100 కోట్ల నష్టాల్లో ఈ గని నడుస్తోంది. ఆ నష్టాలను అధిగమించి.. లాభాలు ఆర్జించేందుకు శాంతిఖని గనిని మెగా లాంగ్వాల్ ప్రాజెక్టుగా మార్చడానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రప్రథమంగా కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ గని జీవిత కాలం మరో 30 ఏళ్లుగా నిర్ధారించారు.
రూ.90 కోట్లతో..
కంటిన్యూయస్ మైనర్ యంత్రం కొనుగోలు కోసం రూ.90 కోట్లు వెచ్చించారు. జాయిగ్లోబర్(యూకే) సంస్థ నుంచి యంత్ర సామగ్రి కొనుగోలు చేశారు. ఫీడర్ బ్రేకర్, కంటిన్యూయస్ మైనర్, పవర్ సెంటర్, ఫ్రెటల్కార్, ఎల్హెచ్డీ తదితర ప్రధానమైన యంత్రాలు మూడు నెలల క్రితం గనికి చేరుకున్నాయి. ఆయా యంత్రాల పనితీరు, వినియోగం, సాంకేతిక సమస్యలు ఇత్యాధి అంశాలపై జాయిగ్లోబర్ సంస్థకు చెందిన ఇంజినీర్ల బృందం రెండు నెలలపాటు గని అధికారులు, కార్మికులకు శిక్షణ ఇచ్చింది. ఆ ఇంజినీర్ల బృందం పర్యవేక్షణలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని గనిలో దింపే చర్యలను సింగరేణి అధికారులు వేగవంతం చేశారు. శనివారం ప్రత్యేక పూజలు చేసి అధికారులు ఎల్హెచ్డీ యంత్రాన్ని గనిలో ప్రవేశ పెట్టారు. మిగతా యంత్రాలను కూడా దశలవారీగా గనిలో దింపడానికి యత్నాలు చేస్తున్నారు.
43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు
శాంతిఖని గనిలో ఇంకా 43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నుంచి 13 మిలియన్ టన్నుల బొగ్గును కంటిన్యూయస్ మైనర్యంత్రం ద్వారా వెలికితీయాలని సంకల్పించారు. ఆ యంత్రం ద్వారా గరిష్టంగా 20 ఏళ్ల వరకు బొగ్గు వెలికితీయాలని కార్యాచరణ రూపొందించారు. లాంగ్వాల్ ప్రాజెక్టు ద్వారా మరో 10 ఏళ్లు 30 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీయడానికి అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. కంటిన్యూయస్ మైనర్ యంత్రంతో రోజుకు 8 వేల నుంచి గరిష్టంగా 10 వేల టన్నుల చొప్పున బొగ్గు వెలికితీయనున్నారు. మందమర్రి ఏరియా వ్యాప్తంగా ఒక రోజు ఉత్పత్తి అయ్యే బొగ్గును కంటిన్యూయస్ మైనర్ యంత్రం ద్వారా ఒక శాంతి ఖని గని నుంచే వెలికి తీస్తారంటే ఆ యంత్ర పనితీరు ఏ తీరుగా ఉంటుందో ఊహించుకోవచ్చు.ఏదేమైనా కంటిన్యూయస్ మైనర్ యంత్రం రాకతో శాంతిఖని గని దశ మారబోతోందనడంలో సందేహం లేదు.