పారిస్ దాడి ఘటనలో అనుమానితుల ఫొటోలు విడుదల
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని 'చార్లీ హెబ్డో' అనే వ్యంగ్య పత్రికా కార్యాలయంపై బుధవారం ముష్కరులు జరిపిన దాడికి సంబంధించి ఫ్రాన్స్ పోలీసులు ఇద్దరు అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. ఉగ్రవాదుల దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఫ్రాన్స్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అనుమానిస్తున్నారు. ఫ్రాన్స్ దేశస్తులైన సోదరులు చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీలతోపాటు హమీద్ అనే 18 ఏళ్ల విద్యార్థిని అనుమానిస్తున్నారు. వారిలో చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీ ఫొటోలను విడుదల చేశారు. పెట్రోల్ బంకు మేనేజర్ వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. 2008లో ఉగ్రవాదులకు సహకరించిన కేసులో చెరిఫ్ కౌచీ 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు.