నేను చట్టానికి అతీతుడిని కాను: ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ: తాను చట్టానికి అతీతుడిని కానని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంలో సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బొగ్గు గనుల కేటాయింపులో దాచవలసింది ఏమీలేదన్నారు.
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వైఖరిపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై ఆయన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రక్షణ కల్పిస్తామని ప్రధాని చెప్పారు.
బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధానిని కూడా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గనుల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ కూడా ప్రధాని మన్మోహన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే, తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేననని ఆయన అన్నారు. శాఖను నిర్వహించిన మన్మోహన్నూ దోషిగా పరిగణించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో తాను చట్టానికి అతీతుడేమీకానని, సిబిఐ విచారణకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.