'కసబ్ను చంపినందుకు కక్ష తీర్చుకుంటా'
పాట్నా: రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులకు కసబ్ను ఉద్దేశిస్తూ బీహార్ పోలీసు కానిస్టేబుల్ బెదిరింపు ఎస్సెమ్మెస్లు చేశాడు. అజ్మల్ కసబ్, యాకుబ్ మెమన్ ఉరితీయడం పట్ల తాను కక్ష తీర్చుకుంటానని, వరుస బాంబు పేలుళ్లకు పాల్పడతానని రాజస్థాన్ డీజీపీ ఇతర ఉన్నత పోలీసు అధికారులకు ఎస్సెమ్మెస్ పంపించాడు. దీంతో అతడిని పోలీసులు ట్రేజ్ చేసి వెంటనే అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బీహార్ పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు.
అరెస్టు చేసిన వ్యక్తిని సిగోరి అనే గ్రామానికి చెందిన షా ఉజేయిర్గా గుర్తించామని అతడిని విచారిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం విధుల్లోనే ఉన్న ఉజెయిర్ మానసికంగా కూడా బాగానే ఉన్నాడని, ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఎస్సెమ్మెస్లు పంపించడం అతడికి పరిపాటిగా మారిందని ప్రాథమిక విచారణలో వెల్లడయినట్లు వివరించారు. అయితే, ఇవన్నీ అతడు కావాలని చేస్తున్నాడా లేక మరేదైనా కోణముందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అతడు ఈ ఎస్సెమ్మెస్లు పంపించాడు.