గీత వచ్చేసింది
న్యూఢిల్లీ: ఏడేళ్ల వయసులో పొరపాటున భారత్ సరిహద్దు దాటి దశాబ్ద కాలంగా పాకిస్తాన్లో నివసిస్తున్న మూగ, చెవిటి యువతి గీత(23) ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ విమాశ్రయానికి చేరుకుంది. స్వదేశానికి చేరుకున్న గీతకు ఆనందోత్సాహాల నడుమ ఘనస్వాగతం లభించింది. బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్ట్ కు తరలివచ్చి ఆమెకు స్వాగతం పలికారు. గీత తల్లిదండ్రులు, బంధువులు విమానాశ్రయానికి తరలివచ్చారు. గీత రాక పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు.
కాసేపట్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలవనుంది. పాక్లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థలోని ఐదుగురు సభ్యులు కూడా భారత్కు వచ్చారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అవి సరిపోలితే గీతను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇస్లామాబాద్లోని భారత్ కార్యాలయం పంపిన ఫోటోలో నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను గీత గుర్తించడంతో ఆమెను స్వదేశానికి తీసుకువచ్చారు. కాగా, పాకిస్థాన్ నుంచి వచ్చిన గీతను రాజకీయ నేతలు స్వాగతించారు. గీత స్వదేశం చేరుకోవడం ఆనందకర పరిణామమని, ఆమెకు మంచి జరగాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.