‘దీపం’ పంపిణీకి 6న మేళా
అనంతపురం అర్బన్ : ‘అనంత’ని పొగరహిత జిల్లా మార్చేందుకు కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు దీపం పథకం కింద కనెక్షన్ల పంపిణీకి ఈ నెల 6వ తేదీన జిల్లాలోని అన్ని పంచాయతీల్లో మేళా నిర్వహించాలని ఇన్చార్జ్ జేసీ సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ అధికారులను, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. నగరంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. దీపం కనెక్షన్ల పంపిణీపై గురువారం ఆయన తన చాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో డీఎస్ఓ టి.శివరాంప్రసాద్ సమావేశమైన సూచనలిచ్చారు. అనంతరం వివరాలను విలేకరులకు ఇన్చార్జ్ జేసీ వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెలలో ఏడు మేళాలు నిర్వహిస్తామన్నారు. మొదటి మేళా ఈ నెల 6వ తేదీన 1003 పంచాయతీల్లో, అటు తరువాత వారానికి రెండు చెప్పున మూడువారాల్లో ఆరు మేళాలు నిర్వహిస్తారమన్నారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్లు, సామాగ్రితో పాటు మేళా హాజరవుతాయన్నారు. అక్కడికక్కడే అర్హులకు కనెక్షన్ మంజూరు చేస్తారని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు అధికంగా పొందిన పంచాయతీని పొగరహిత పంచాయతీగా ప్రకటిస్తూ అవార్డు ప్రదానం చేస్తామన్నారు. సమావేశంలో పౌరసరఫరాల మేనేజర్ డి.శివశంకర్రెడ్డి, ఏఎస్ఓలు ప్రేమ్కుమార్, సౌభాగ్యలక్ష్మి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మురళీ, హరికృష్ణ పాల్గొన్నారు.