ఫేస్బుక్ మరో సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఎఫ్ బీఎక్స్ సర్వీసులను ఉపసంహరించు కున్నట్టు ఈ మెయిల్ ద్వారా తెలిపింది. డెస్క్ టాప్ ప్రకటనలకు గుడ్ బై చెప్పినట్టు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మాట్ ఇదెమా తెలిపారు. వ్యాపారమంతా అరచేతిలోనే అన్నట్టుగా మారడంతో ఫేస్ బుక్ డెస్క్ టాప్ ప్రకటనలను రద్దుచేసింది. తమ సేవలను మొబైల్ ద్వారా అందించే వ్యూహంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. 2012లో లాంచ్ చేసిన ఎఫ్ బీఎక్స్ ద్వారా డెస్క్టాప్ ప్రకటనలను కొనుగోలుకు విక్రయదారులకు అనుమతిస్తుంది. ప్రభావవంతమైన మార్కెటింగ్ ప్రచారాల్లో మొబైల్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని కంపెనీ తెలిపింది. డైనమిక్ ప్రకటనలు కస్టమ్ ఆడియన్స్ కోసం మొబైల్ ప్రకటనల వైపు మళ్లనున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా పెరుగుతున్న మొబైల్ ఆదరణ నేపథ్యంలో విక్రయదారుల ప్రకటనలకు సమర్థవంతంగా ఫార్మాట్లను అందించడంలో నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలనే వ్యూహంలో భాగమే ఈ చర్య అని స్పష్టం చేసింది. కాగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే క్రమంలో తన ఆడియన్స్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం ద్వారా వీడియో సెల్లింగ్ పద్ధతిని ఫేస్ బుక్ ఇప్పటికే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.