వైఎస్సార్ నిథమ్కు పదో స్థానం
- తెలంగాణలో ద్వితీయ స్థానం
- ప్రకటించిన జీహెచ్ఆర్డీసీ సంస్థ
హైదరాబాద్: డాక్టర్ వైఎస్సార్ నిథమ్ అరుదైన గుర్తింపును పొందింది. ఢిల్లీలోని గ్లోబల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ టూరిజమ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి 2017 అవార్డులను ప్రకటించింది. అందులో గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ దేశవ్యాప్తంగా పదో స్థానం పొందగా.. తెలంగాణలో రెండవ స్థానం పొందడం విశేషం. 2004 పర్యా టక, ఆతిథ్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని నిథమ్ను గచ్చిబౌలి టెలికామ్నగర్లో విశాలమైన 30 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు.
దీన్ని 2005 మార్చి 16న నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక పర్యాటక, ఆతిథ్య రంగాలకు చెందిన కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి, శిక్షణా కార్యక్రమాలనూ నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుతం పలు డిప్ల్లమో కోర్సులతో బీబీఏ, ఎంబీఏ, బీఎస్సీ కోర్సులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాటి స్తున్న విద్యా ప్రమాణాలు, అధ్యాపక బృందం, ప్లేస్మెంట్స్, అడ్మిషన్ల, క్యాంపస్లో చేపట్టే కార్యక్రమాలను ఆధారంగా చేసుకుని నిర్వహించిన సర్వే ప్రకారం ర్యాంకులను జీహెచ్ఆర్డీసీ సంస్థ ప్రకటిస్తుంది.
టాప్ త్రీలో ఒకటిగా చేయడమే లక్ష్యం: డాక్టర్ చిన్నంరెడ్డి
వచ్చే ఏడాదిలో దేశంలోనే టాప్ త్రీలో నిథమ్ సంస్థ ఎంపిక కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డైరెక్టర్ ఎస్ చిన్నంరెడ్డి తెలిపారు. అధ్యాపక బృందం, అధికారులు, విద్యార్థుల పని తీరులో గణనీయంగా వచ్చిన మార్పుల ఫలితమే ఈ ర్యాంకు సాధించేందుకు దోహదం చేసిందన్నారు. ఏడాదిలోనే ఆధునిక టెక్నాలజీతో లైబ్రరీని తీర్చిదిద్దామని, ఇంగ్లీష్ భాషను తమ మాతృభాష ఆధారంగా నేర్చుకోవ డానికి 30 కంప్యూటర్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. క్యాం పస్ను క్లీన్ అండ్ గ్రీన్లో నంబర్ వన్గా రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం 80 శాతం ప్లేస్మెంట్స్ సాధించామని, మరో వారంలో మిగిలిన 20 శాతం ప్లేస్మెంట్స్ సాధించడం జరుగుతుందన్నారు.