పోలవరం ప్రాజెక్టు పశ్చిమగోదావరికేనా?
బహుళార్ధసాధక ప్రాజెక్టుగా ముందునుంచి చెబుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లాకు తాను ప్రకటించిన వరాల జాబితాలో చేర్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది నాలుగైదు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని మొదట అందరూ అన్నారు. ఐదు సంవత్సరాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధిస్తామని, మొత్తం ఉన్న జిల్లాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ.. వాటిలో ప్రకటించిన వరాలను జిల్లాల వారీగా ఒక్కసారి చూస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లానే చూసుకుంటే, ఆ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రకటించిన వరాల్లో పదో నెంబరులో పోలవరం ప్రాజెక్టును ప్రకటించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, నరసాపురంలో ఓడరేవు, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం, సిరామిక్ పరిశ్రమ, ఆయిల్ పామ్ పరిశ్రమ, పర్యాటక కేంద్రంగా కొల్లేరు సరస్సు, జలమార్గాల అభివృద్ధి, చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత, పోలవరం ప్రాజెక్టు, కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు, మెట్టప్రాంతాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్, ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, ఉద్యానవన పరిశోధనా కేంద్రం.. ఇవన్నీ పశ్చిమగోదావరి జాబితాలో వేసేశారు.
కానీ వాస్తవానికి ఇప్పటికే ఈ జిల్లాలోని మెట్టప్రాంతంలో ఆయిల్ పామ్ పరిశ్రమ విస్తరించింది. పెదవేగి కేంద్రంగా ఇది ఇప్పటికే ఉంది. కొల్లేరు ఈరోజు కాదు.. ఎప్పటినుంచో పర్యాటక కేంద్రం. కానీ ఇప్పుడు అక్కడకు వెళ్లడమే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడది పర్యాటక కేంద్రం కావడం అసాధ్యం. తాడేపల్లిగూడెంలో బ్రిటిష్ కాలంలోనే ఎయిర్స్ట్రిప్ ఉంది. అయితే దాని భూములు చాలావరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఇప్పుడు దాని విస్తరణ, అక్కడ పూర్తిస్థాయి విమానాశ్రయం ఏర్పాటు ఎంతవరకు సాధ్యమో చంద్రబాబుకే తెలియాలి.