పింఛన్ పాట్లు
► సర్వర్ ఎఫెక్ట్..
► పింఛన్ కోసం పండుటాకుల పాట్లు
► ఒకటిన్నర కిలోమీటరు కాలినడక
పుట్లూరు :
ఒకటో తారీఖు వచ్చిందంటే వద్ధులు, వికలాంగులు, వితంతువుకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుంది. అందరూ సంతోషంగా వెళ్లి పింఛన్ తీసుకుంటారు అని అనుకుంటాం. కానీ పుట్లూరు మండలం గరుగచింతలపల్లి పింఛన్దారులు ఆ రోజు వచ్చిందంటే వణికిపోవాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం ఆ గ్రామంలో పింఛన్ బట్వాడా చేయడానికి సర్వర్ పని చేయదు.
దీంతో పింఛన్ను తీసుకోవాలంటే గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ గ్రామంలో 240 మంది పింఛన్దారులు ఉండగా అందులో 180 మంది ముసలి ముతకలే ఉన్నారు. వీరిలో 60 మంది పురుషులు, 120 మంది స్త్రీలు ఉన్నారు. ఊతకర్ర పట్టుకుని రోడ్డుపై గుంపులు గుంపులుగా వెళుతున్న పండుటాకుల ఇబ్బందులను సోమవారం ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. తమకు గ్రామంలోనే పింఛన్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.