గోరంట్ల ‘గృహ’తంత్రం
పేదల ఇళ్లపై ప్రజాప్రతినిధి కన్ను
తన వాళ్లకు కట్టబెట్టేందుకు కుటిలయత్నం
లబ్ధిదారుల ఎంపిక ముగిసినా తిరిగి సర్వే
జాబితాల్లో పేర్లు తారుమారు
ఏకంగా 700 మంది అనర్హులని తొలుత ప్రచారం
సీఎం బాబు సమక్షంలో 75 మందే అనర్హులని అధికారుల ప్రకటన
తాజాగా492 మందిని దూరం చేయడానికి రాజకీయ క్రీడ
శాపనార్థాలు పెడుతున్న లబ్థిదారులు
రాజకీయం కన్నెర్ర చేస్తే అధికారం వెనకడుగు వేయాల్సిందేననడానికి రాజమహేంద్రవరం ఆవరోడ్డులోని గృహాల వ్యవహారమే ఉదాహరణ. తొలుత 700 మందితో సిద్థమైన జాబితాలో కేవలం 75 మందేనని అనర్హులని తేల్చిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో ఆ సంఖ్యను ఏకంగా 492కు పెంచేసి తమ లెక్కలను తామే చెరిపేపుకుంటున్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల ‘గృహ’ తంత్రానికి సై అంటున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం : పలుమార్లు సర్వేలు చేసి పేదలకు కేటాయించిన ఇళ్లను అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారికి కట్టబెట్టాలని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుటిలయత్నాలకు పాల్పడుతున్న వైనం బయటపడింది. రాజమహేంద్రవరంలోని ఆవరోడ్డులో ఉన్న దేవాదాయ స్థలంలో 2,256 గృహాలకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2009లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేశారు. 2014లో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారుల సమక్షంలో లాటరీ తీశారు. ఇళ్లు వచ్చిన లబ్ధిదారుల అర్హతపై గృహ నిర్మాణ శాఖ అధికారులు నాలుగుసార్లు సర్వే చేసి వారి నుంచి కొంత నగదు కట్టించుకున్నారు. గత నెల గోదావరి అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ గృహాలను లబ్థిదారులకు లాంఛనంగా పంపిణీ చేశారు. ఆ సమయంలో గృహా నిర్మాణ శాఖాధికారులు చేసిన సర్వేలో 2,256 మందిలో 75 మందిని అనర్హులుగా తేల్చారు. ఈ 75 మందికి మినహా మిగతా వారికి గృహాల నంబర్తో స్లిప్పులు కేటాయించారు. అనర్హుల స్థానంలో తిరిగి అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని అప్పుడు గృహ నిర్మాణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
తమ వాళ్ల కోసం కుయుక్తులు
2014లో లబ్థిదారుల ఎంపిక కోసం తీస్తున్న లాటరీని కూడా గోరంట్ల అడ్డుకున్నారు. ఆ సమయంలో లబ్థిదారులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించారు. ఇప్పుడు తాజాగా ఆ ఇళ్లపై కన్నేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని జాబితాలో పేర్లు తారుమారు చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారు. సుమారు 700 మంది లబ్థిదారులను అనర్హులుగా ఎమ్మెల్యే ప్రచారం చేయించారు. 75 మంది అనర్హులని సీఎం పర్యటన సమయంలో తేల్చిన అధికారులు ఇప్పుడు 492 మంది లబ్ధిదారులపై తిరిగి సర్వే చేయాలని జాబితా కూడా సిద్ధం చేయాడాన్ని బట్టి వారిపై ఎమ్మెల్యే ఒత్తిడి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అనర్హుల పేరుతో వీరిని తొలగించి తమ వారికి ఇళ్లు కట్టబెట్టాలని గోరంట్ల కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
నాలుగుసార్లు సర్వే చేసినా..
లబ్ధిదారులు తమ వాటాను అప్పులు చేసి పూర్తిగా చెల్లించారు. ఏడేళ్లుగా ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగు సార్లు సర్వే చేసి ఇళ్లు కేటాయిస్తూ స్లిప్పులు కూడా పంపిణీ చేసి ఇప్పుడు తరిగి సర్వే చేస్తామనడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అధికారుల సహాయంతో తమకు ఇళ్లు రాకుండా చేయాలని చూస్తున్నాడని వాపోతున్నారు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇళ్లు కేటాయించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్న గోర ంట్లకు తమ పిల్లల ఉసురు తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. లబ్ధిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు సబ్కలెక్టర్ విజయ్కృష్ణన్ దృషికి తీసుకెళ్లి వారికి న్యాయం చేయాలని కోరారు.
–––––––––––––––––––
స్లిప్పులు ఇచ్చి ఇళ్లు అప్పగించడంలేదు
అప్పులు చేసి డీడీలు, వాయిదాలు కట్టాం. ఇళ్లు కేటాయించినట్లు గత నెల్లో సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు స్లిప్పులు కూడా ఇచ్చారు. కానీ ఇళ్లు అప్పజెప్పడంలేదు. తప్పుడు సర్వేలు చేస్తున్నారు. తమను అనర్హులుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. మా ఉసురు తగలకపోదు.
– మాధవి. లబ్ధిదారు.
–––––––––––––––––––––
లబ్థిదారులు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే గోరంట్లదే బాధ్యత
పలుమార్లు సర్వే చేసి లబ్థిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు కేటాయించి ఇప్పడు మళ్లీ సర్వే చేయడం తగదు. ఒక్కొక్కరు అప్పులు చేసి రూ. 60 వేలు కట్టారు. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పడు ఇళ్లు రాలేదని వారు ఏౖ§ð నా అఘాయిత్యం చేసుకుంటే దానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్.
––––––––––––––––––––
ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వే చేస్తున్నాం
లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ నెల 26 నుంచి సర్వే చేపట్టాం. నాలుగేళ్ల క్రితం లబ్థిదారులకు స్లిప్పులు ఇచ్చారు. గతంలో లబ్థిదారుల అర్హతపై సర్వే చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరిగి సర్వే చేపడుతున్నాం. వారం రోజుల్లో పూర్తి చేస్తాం.
– శ్రీనివాస్. ఈఈ, గృహనిర్మాణశాఖ