gurajala srinivasa rao
-
బెదిరింపులకు విరుగుడు వ్యూహం
యూఎస్ఏ ఆధిపత్య వైఖరిని తిప్పి కొడుతున్న కెనడా విధానాలు భారత్ వంటి దేశాలకు మార్గదర్శకం. యూఎస్ఏ సుంకాల యుద్ధం, బెదిరింపులకు అనేక దేశాలు మోకరిల్లాయి. కానీ పొరుగు దేశం, చిరకాల మిత్రదేశమైన కెనడా తన దైన శైలిలో దీటుగా ప్రతిస్పందించింది. కెనడాను ట్రంప్ తన శైలిలో యూఎస్ఏ 51వ రాష్ట్రంగా వెక్కిరించాడు. కెనడా ప్రధాని కార్నీ దీనికి హుందాగా, వ్యూహా త్మకంగా బదులిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లకు గవర్నర్గా పనిచేసిన కార్నీ తన ఆర్థిక–బ్యాంకింగ్ రంగ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.పరస్పర గమ్యంయూఎస్ఏ–కెనడా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. కెనడా తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటోమొబైల్ రంగానిదే. ఇవి 95 శాతం యూఎస్కు ఎగుమతి అవుతాయి. ఒక ఫోర్డ్ కారు తయారవటానికి విడి భాగాలు కనీసం ఎనిమిదిసార్లు యూఎస్– కెనడా సరిహద్దులను దాటుతాయి. యూఎస్ ముడి చమురు దిగు మతిలో కెనడా వాటా 60 శాతం. కెనడాలోని ఆల్బర్టాలో ఉత్పత్త యిన ముడిచమురు ఎన్బ్రిడ్జ్ పైపు లైన్ల ద్వారా మిన్నెసోటా– విస్కాన్సిన్ రాష్ట్రాల గుండా ఇల్లినాయిస్, ఓహియో రిఫైనరీలను చేరుతుంది. కెనడాలో ఉత్పత్తయిన బరువైన ముడి చమురును శుద్ధి చేయటానికి ప్రత్యేకంగా యూఎస్లో రిఫైనరీలను ఏర్పాటు చేశారు. కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలో ఉత్పత్తయిన జల విద్యుచ్ఛక్తి యూఎస్ లోని న్యూయార్క్, న్యూఇంగ్లాండ్ రాష్ట్రాలలోని సుమారు మిలియన్ గృహాలు వాడుకుంటున్నాయి. యూఎస్లో ఉత్పత్తవుతున్న విద్యు చ్ఛక్తిలో అణు విద్యుత్ వాటా 20 శాతం. దీనికి కావాల్సిన యురే నియం అణు ఇంధనాన్ని కెనడా ఎగుమతి చేస్తుంది. యూఎస్లోని డెయిరీఫామ్లు పాల ప్రాసెసింగ్కు కెనడాలోని క్యుబెక్పై ఆధారపడతాయి. ఎరువుల తయారీకి కీలకమైన పొటా షియం ప్రపంచ ఉత్పత్తిలో కెనడా వాటా 30 శాతం. యూఎస్లోని అయోవా, కన్సాస్, నెబ్రాస్కా వ్యవసాయ క్షేత్రాలు ఎరువులకు కెనడాపై ఆధారపడతాయి. కెనడాలో వినియోగించే పండ్లు, కూర గాయలు 80 శాతం యూఎస్ నుండి దిగుమతి అవుతున్నాయి. బోయింగ్ 737 విమానాల రెక్కలు కెనడాలో తయారవుతాయి. కెనడాలో ఉత్పత్తయిన ఉక్కులో 90 శాతం యూఎస్కు ఎగుమతి అవుతున్నది. కెనడా బ్యాంకుల శాఖలు యూఎస్లో విస్తారంగా పని చేస్తున్నాయి. స్థూలంగా కెనడా ఎగుమతులలో యూఎస్ వాటా 75 శాతం. అదే సమయంలో 34 అమెరికా రాష్ట్రాల ఎగుమతులకు కెనడా ప్రధాన గమ్యం.తమ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను పట్టించు కోకుండా 2025 ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించాడు. చమురు, విద్యుచ్ఛక్తిపై పది శాతం విధించాడు. దీని ప్రభావం కెనడా స్టీల్, అల్యూమినియం, కలప, ఆటో మొబైల్ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. దాంతో ‘స్నేహితులే కానీ ఆధారపడటం కాదు’ వ్యూహాన్ని కార్నీ అమలుపరచాడు. ఎగుమతి రంగంలో 75 శాతం కేవలం ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. అందుకే వ్యూహాత్మక వైవిధ్యత విధానాన్ని కెనడా ఎంచుకొన్నది.తమ్ముడు తమ్ముడే...కెనడాలోని వివిధ రాష్ట్రాలు యూఎస్ వాణిజ్యంపై ప్రతిదాడి మొదలుపెట్టాయి. ఒంటారియో రాష్ట్రం యూఎస్లోని మిచిగన్కు ఎగుమతి అవుతున్న విద్యుచ్ఛక్తిపై 25 శాతం సర్చార్జి విధించింది. క్యుబెక్ రాష్ట్రం యూఎస్ సంస్థల వాణిజ్య బిడ్లపై 25 శాతం పన్ను విధించింది. బ్రిటిష్ కొలంబియాలో టెస్లా కార్ల దిగుమతి రిబేట్లను ఉపసంహరించుకున్నది. కెనడాలో అమ్ముడుపోయే అన్ని ప్రముఖ యూఎస్ లిక్కర్ బ్రాండ్లను సూపర్ మార్కెట్లలో నిషేధించారు. న్యూఫౌండ్లాండ్ రాష్ట్రం స్టార్ లింక్ కాంట్రాక్టును రద్దు చేసింది. సమాంతరంగా కెనడా తన వాణిజ్యాన్ని యూఎస్ కేంద్రకం నుండి మరల్చి ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, జపాన్, కొరియా, యూకే, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నది.కెనడా – యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), యురే నియం, జలవిద్యుచ్ఛక్తిలను ఐరోపా దేశాలకు కెనడా ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, శుద్ధిపై చైనాకు గుత్తాధిపత్యం ఉన్నది. ఈ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఉన్న అతి కొద్ది దేశా లలో కెనడా ఒకటి. కెనడాలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ముడి ఖనిజ నిల్వలు అపారం. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల ఉత్పత్తిలో కీలకమైన బ్యాటరీల తయారీ వీటి మీద ఆధారపడి ఉన్నది. కెనడాలో ఈ ఖనిజాల త్రవ్వకం, శుద్ధిలో పెట్టుబడులకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. నాటో రక్ష ఛత్రంపై నీలి నీడల నేపథ్యంలో ఐరోపా తనదైన రక్షణ, భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నది. సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్) పథకంలో కెనడాను భాగస్వామిగా చేయటానికి ఒప్పందం జరిగింది. 150 బిలియన్ యూరోల కాంట్రాక్టులను కెనడా డిఫెన్స్ కంపెనీలకు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తమైంది.కెనడా–చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఉన్న నూరు శాతం సుంకాలను ఎత్తివేశారు. కెనడా నుంచి పశువుల మాంసం, క్రొవ్వు దిగుమతికి చైనా అంగీకరించింది. కెనడాలో బ్యాటరీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి జపాన్తో ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా భాగస్వామ్యంతో క్యుబెక్ రాష్ట్రంలో లిథియం ఆక్సైడ్ బ్యాటరీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. హ్యుండాయి, కియా ఎలక్ట్రిక్ కార్లకు ఈ బ్యాటరీలను వాడతారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాతో యురే నియం, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలపై ఉమ్మడి పథకాలను రచిస్తున్నారు.దిక్కుతోచని ట్రంప్ఇటీవలి బీజింగ్ పర్యటనలో చైనా 200 బోయింగ్ విమానాల ఖరీదుకు సుముఖత చూపడాన్ని ట్రంప్ తన వ్యక్తిగత విజయంగా చూపించాడు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ ఏ220 తరగతికి చెందిన 150 పౌర విమానాల తయారీకి కెనడాతో 21 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇది కెనడా పారిశ్రామిక రంగానికి పెద్ద విజయం. కెనడా వ్యూహాత్మక ప్రతిఘటనకు ట్రంప్కు దిక్కుతోచడం లేదు. అమెరికన్ సంస్థల గణాంకాల ఆధారంగా కార్నీ అమెరికన్ ప్రతిపాదనలను తూర్పారబట్టాడు. ఈ నేపథ్యంలో కార్నీని అబద్ధాల కోరుగా ట్రంప్ నోరుపారేసుకున్నాడు. డెట్రాయిట్ నదిపై డెట్రా యిట్(యూఎస్)–విండ్సర్ (కెనడా)లను కలుపుతూ కెనడా నిర్మించిన గార్డీహావే వంతెన ప్రారంభం కాకుండా చూస్తానని హూంకరించడం ట్రంప్ నిస్సహాయతను సూచిస్తున్నది. కార్నీ అవలంబిస్తున్న ఈ ప్రతిస్పందన జియోపొలిటికల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసిందనటంలో సందేహం లేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
నవ భారత యుద్ధ తంత్రం
భారతదేశ భద్రత, విదేశాంగ విధానా లలో ‘ఆపరేషన్ సిందూర్’ కీలక మలుపును సూచిస్తుంది. 1965, 1971 యుద్ధాలలో ఓడిపోయి, ప్రత్యక్షయుద్ధంలో భారత్ను ఎదుర్కోవటం అసాధ్యమని గ్రహించిన పాకిస్తాన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని తన విధానంగా మలుచుకున్నది. జియా ఉల్హక్ ‘బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్’ (వెయ్యి గాట్లతో భారత్ను గాయపరచటం) అనే సిద్ధాంతాన్ని అమలు పరిచాడు. అణ్వస్త్రాలను సమకూర్చుకున్నాక పాకిస్తాన్ ‘కత్తి–డాలు’ వ్యూహంలో భాగంగా ఒకవైపు ఉగ్రవాద మూకలను పెంచి పోషించి భారత్లో ఉగ్రవాద చర్యల ద్వారా అస్థిరతను కలుగజేస్తూ అణ్వస్త్ర ఛత్రం కింద రక్షణ తీసుకొన్నది. పాక్పై సైనిక చర్య/యుద్ధం ప్రారంభించాలంటే పాక్ అణ్వాయుధ దాడికి ఒడిగడుతుందా అన్న సందేహం, భారత్ను క్రమంగా ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు విరుగుడు చర్యలు తీసు కునేలా చేసింది. భారత్ బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరా లను లక్ష్యంగా చేసుకొని ఎల్ఓసీ దాటి ఉరి, బాలాకోట్లలో ఆప రేషన్లను సమర్థవంతంగా పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో పహల్ గామ్ దాడితో పాక్ నేరుగా భారత్కు సవాలు విసిరింది. పర్యవసా నంగా 2025 మే 7 తెల్లవారుఝామున 1 గంటకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. ఈ 88 గంటల దాడి ద్వారా పాకి స్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికీ ‘భారత్ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదనే’ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చి నట్లయింది. డీఆర్డీఓ, ఇస్రోలతో సమన్వయం!ఆపరేషన్ సిందూర్ మొదటి రోజున భారత వాయుసేన, సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు; పాకిస్తాన్లో నాలుగు; మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడి చేసింది. మురిడికేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యా లయాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులకు ప్రతిగా కశ్మీర్ నుండి కచ్ వరకు పాక్ భారీ స్థాయిలో దాడులు చేసింది. మే 9న ఢిల్లీ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఫత్తా క్షిపణితో దాడి చేయటం ద్వారా దుస్సాహసానికి ఒడిగట్టింది. దాంతో పాక్ న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత్ వ్యూహకర్తలు నిశ్చయించారు. మే 10న పాక్లోని 12 సైనిక స్థావరాలలో 20కి పైగా లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేయటంతో పాక్ దిక్కు తోచని పరిస్థితుల్లో సంధిని కోరటంతో ఆపరేషన్ సిందూర్ ముగిసింది. రావల్పిండిలో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, సిం«ద్ ప్రావిన్స్లోని భోలారి వైమానిక స్థావరం, ఎఫ్–16 యుద్ధ విమానాలుండే జాకోబాబాద్ వైమానిక స్థావరం, రహీమ్ యార్ ఖాన్ సైనిక స్థావరాలతో సహా పాక్లోని అన్ని ప్రధాన సైనిక స్థావరాలపై భారత్ కచ్చితత్వంతో దాడి చేసింది. రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ల నుండి దిగుమతి చేసుకున్న సైనిక సామగ్రి, సైనిక పరిజ్ఞానాన్ని దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించటంలో డీఆర్డీఓ, ఇస్రో, భారత త్రివిధ దళాలు విజయవంతమయ్యాయి. భారత సైన్యం, వాయు సేన, నౌకా బలాలు పూర్తి స్థాయిలో సమీకృతం అయి ఆపరేషన్ సిందూర్ను సమర్థవంతంగా నడిపించాయి.ఆపరేషన్ సిందూర్లో తెరవెనుక కథ నడిపిన ఇస్రో పాత్రను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈ 88 గంటల దాడిలో మన సైనిక, గూఢచార ఉపగ్రహాలు కీలకమైన పాత్ర వహించాయి. కార్టోశాట్ ఛాయా చిత్రాల ద్వారా దాడుల కచ్చితత్వం నిర్ధారణ అయింది. వీటికి తోడు పాక్లో ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఉంచిన వీడియోలు దాడులకు మానవ నేత్రాన్నందించాయి. రిశాట్ ఉప గ్రహాలు శత్రువుల కదలికలపై రాత్రీ పగలు సమాచారాన్ని అందించాయి. జీశాట్ 7, 7ఏ ఉపగ్రహాలు... సైన్యం, వాయుసేన, నౌకా సేనల మధ్య సమాచారం, సమన్వయానికి సహకరించాయి. నావిక ఉపగ్రహ వ్యవస్థ, క్షిపణులను నేరుగా లక్ష్యాల వైపు మరల్చింది. సిందూర్ 2.0కు సిద్ధమా?పాక్, ఉగ్రవాద పంథాని వీడుతుందనుకోవటం భ్రమ. పాక్కు చైనా ఇంతవరకు క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమా నాలను సరఫరా చేసింది. ఆపరేషన్ సిందూర్లో చైనా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా అందించింది. కానీ పూర్తి స్థాయిలో చైనా–పాక్ రక్షణ సైనిక వ్యవస్థలు ఒక్కటిగా పనిచేయలేదు. భవిష్యత్తులో చైనా–పాక్లను సమష్టిగా ఒకేసారి ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. పాక్ పెద్ద మొత్తంలో టర్కీ నుండి డ్రోన్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. టర్కీ కొద్ది రోజుల క్రితం ఆధునిక ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని ఆవిష్కరించింది. పాక్–టర్కీల మధ్య సైనిక వ్యవహారాలపై నిఘా ఉంచాలి. ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు, యూఎస్ఏ, ఇజ్రాయెల్లు డ్రోన్లు, క్షిపణుల కొరతను ఎదుర్కొంటు న్నాయి. ఇరాన్ ముందుచూపుతో పెద్ద మొత్తంలో డ్రోన్లు, క్షిప ణులను భూగర్భ బంకర్లలో నిలువ చేసుకొని అమెరికాను సవాలు చేయగలుగుతున్నది. చైనా–పాక్లతో యుద్ధం 88 గంటలు కాదు 88 రోజులుండవచ్చు. దీనికి సరిపడా డ్రోన్లు, క్షిపణుల తయారీ వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భాగంగా నిజానిజాలు తెలియజేయటానికి సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇల్లు కాలుతుంటే మంటలు ఆర్పటం కోసం బావి తవ్వటం లాగా సమాచారాన్ని అందించ టానికి అప్పటికప్పుడు ఎవరినో నియమించకూడదు. మన నిజం, శత్రువు అబద్ధాని కంటే ముందు ప్రపంచానికి తెలియాలి. వ్యూహంలో భాగమే ‘రింగ్’ అలర్ట్దీర్ఘకాల యుద్ధంలో జాతి మానసిక స్థితి కీలక పాత్రను పోషి స్తుంది. 1971 తరువాత ఇంతవరకు భారతదేశం గట్టి యుద్ధం చేయలేదు. 140 కోట్ల మంది భారతీయులలో సుమారు 88 శాతం మంది 1971 యుద్ధం తర్వాత జన్మించినవారే. వీరికి యుద్ధ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, యుద్ధం సందర్భంగా ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన గానీ, అంచనా గానీ లేవు. అందుకే గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యుద్ధ సమయంలో పౌర రక్షణకు సామాన్య పౌరులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి. క్షిపణి, డ్రోన్, వైమానిక దాడుల సైరన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇటీవల భారత ప్రభుత్వం పరీక్షించిన ‘సెల్ఫోన్ రింగ్ అలర్ట్’ ఈ వ్యూహంలో భాగమే. స్థానికంగా రక్షిత ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. శత్రువుల కదలి కల సమాచారాన్ని ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అందజేయ గలగాలి. ఉక్రెయిన్లో పౌరులకు డ్రోన్లను ఆపరేట్ చేయటంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధంలో సంభవించే నష్టానికి, కష్టాలకు ఓర్చు కొనే స్థైర్యాన్ని కూడా ప్రజలలో పెంపొందించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'రణక్షేత్రం' ఇండో పసిఫిక్కు మారేనా?
ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిపై ఉన్న ప్రస్తుత తరుణంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిశ్శబ్దంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరుక్కుపోకుండా ఉండాలని యూఎస్ అధ్యక్షుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఇదే అదనుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇండో– పసిఫిక్లో పావులు కదుపుతున్నాడు. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కేఎమ్టీ) నాయకురాలు చెంగ్–లీ–వున్కు చైనా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏప్రిల్ 10న జిన్పింగ్ కేఎమ్టీ నాయకురాలితో సమావేశమవటం చైనా కొత్త ఎత్తుగడను సూచిస్తున్నది. తైవాన్ విలీనమే చైనా లక్ష్యంతైవాన్ అధికార పార్టీ డీపీపీతో చైనా 2016 నుండి అధికారికంగా తెగదెంపులు చేసుకున్నది. ఆగస్టు 2022లో యూఎస్ఏ పార్ల మెంట్ స్పీకర్ నాన్సీ పొలేసి అధికారికంగా తైవాన్ను పర్యటించటంతో ఇండో–పసిఫిక్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ‘వ్యూహా త్మక సందిగ్ధత’ సిద్ధాంతం నుండి దూరంగా జరిగి ఈ పర్యటన ద్వారా యూఎస్ఏ తైవాన్కు బహిరంగంగా మద్దతిచ్చినట్లయింది. వెంటనే చైనా పెద్ద మొత్తంలో సైనిక విన్యాసాల రూపంలో బలప్రద ర్శనకు దిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికయిన జపాన్ ప్రధాని సానయి తకాయిచి తైవాన్పై చైనా దాడి చేస్తే దానిని జపాన్ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తామని ప్రకటించటం ద్వారా పసిఫిక్ యుద్ధంలో జపాన్ చూస్తూ ఊరుకోదని బహిరంగంగా హెచ్చరించింది. రానున్న దశాబ్దాలలో ప్రపంచ రాజకీయ చదరంగానికి ఇండో పసిఫిక్నే అడ్డా!రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో 1945లో తైవాన్ దీవులను జపాన్ నుండి చైనా హస్తగతం చేసుకున్నది. 1949లో చైనాలో అంతర్యుద్ధం సందర్భంగా చైనాలోని ఒక వర్గం తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్ఓసీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) ప్రభుత్వం ఏర్పడింది. 1950 నుండి 1970 వరకు పీఆర్సీ– ఆర్ఓసీల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 1971లో పీఆర్సీని చైనా ప్రభుత్వంగా గుర్తించింది. 1979లో యూఎస్ఏ కూడా గుర్తించింది. తైవాన్ను ప్రపంచ సమాజం ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనప్పటికీ, అది యూఎస్ఏ మద్దతుతో ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా రూపొంది స్వయంపాలిత దీవిగా ఎదిగింది. ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమకు రాజధానిగా రూపుదిద్దుకున్నది. ప్రపంచ సెమీ కండక్టర్ ఉత్పత్తులలో తైవాన్ వాటా 60 శాతం. అధునాతన ఏఐ రంగంలో వాడే అత్యాధునిక చిప్స్ తయారీలో తైవాన్ వాటా 90 శాతానికి పైగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ, ఉదార విధానాలకు ప్రతీకగా ఉన్న తైవాన్ను విలీనం చేసుకోవాలనేదే చైనా విధానం. నేరుగా అమెరికాకు సవాలు!1997లో హాంకాంగ్ దీవి చైనాలో విలీనం అయాక, ఒకే దేశం – రెండు వ్యవస్థలు విధానాన్ని తైవాన్కు కూడా వర్తింపజేయాలని చైనా ప్రతిపాదిస్తున్నది. 2014లో హాంకాంగ్లో చైనా నియంతృత్వ, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా గొడుగుల ఉద్యమం (అంబ్రెల్లా మూవ్మెంట్) జరిగింది. అప్పుడు తైవాన్లో అధికారంలో ఉన్న కేఎమ్టీ పార్టీ, చైనాతో ఉదార వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా పొద్దు తిరుగుడు ఉద్యమం (సన్ఫ్లవర్ మూవ్మెంట్) జరిగింది. హాంకాంగ్ విలీనం తర్వాత క్రమంగా అక్కడ పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులను చైనా అణచి వేసింది. ‘నిన్న హాంకాంగ్ – రేపు తైవాన్’ నినాదం కింద తైవాన్కూ హాంకాంగ్ గతి పడుతుందని తైవాన్ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉత్తర పసిఫిక్ మహా సముద్రం చైనా, రష్యాలను – యూఎస్ఏను విభజిస్తుంది. ఈ ప్రధాన శక్తులు భౌగోళికంగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రానికి ఇరువైపులా మోహరించి ఉన్నాయి. భారతదేశం వరకు విస్తరించిన ఇండో పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ఏ, చైనా, రష్యా, జపాన్, భారత్ల మధ్య జియో పొలిటి కల్ యుద్ధం ప్రారంభమయింది. ఈ శతాబ్దంలో ప్రపంచ ఆధిప త్యాన్ని ఇండో పసిఫిక్ శాసిస్తుందని జియో పొలిటికల్ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న చైనా సాయుధ శక్తి, తిరిగి పుంజుకున్న రష్యా ఆర్థిక వ్యవస్థ, జిన్పింగ్ నాయకత్వంలో ప్రపంచాన్ని శాసించాలనే చైనా ఆశలు– వేగంగా బలోపేతమవు తున్న భారత్, యూఎస్ఏకు సవాలు విసురుతున్నాయి.1945 నుండి గత 75 సంవత్సరాలుగా యూఎస్ఏ ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్నది. యూఎస్ఏను నేరుగా ఎదుర్కొనే శక్తి చైనా– రష్యాలకు మాత్రమే ఉన్నది. ఈ ఘర్షణ తైవాన్తో ప్రారంభమ వటానికి అవకాశాలు హెచ్చు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ‘ఈ తరంలోనే తైవాన్ విలీనం’ అని ప్రకటించటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. జిన్పింగ్ మూడవ పదవీ కాలం 2028లో ముగియ నున్నది. బహుశా 2027 లోపు తైవాన్ను చైనా ఆక్రమించవచ్చని వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. తైవాన్పై చైనా దాడి చేస్తే, దాన్ని నేరుగా యూఎస్ఏకు సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. భారత నౌకాశక్తి కీలకంసైనిక వ్యూహ పరిభాషలో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ద్వీప సమూహాలను యూఎస్ఏ తన ‘రక్షణ శ్రేణులు’గా పరిగణిస్తుంది. మొదటి రక్షణ శ్రేణి – కుర్లీ దీవులు, ర్యుకూ దీవులు, తైవాన్ దీవులు. జపాన్ దీవులు, బానిన్స్, గువామ్, పలావు దీవులు– రెండవ రక్షణ శ్రేణి. అల్యూషియన్ దీవులు, హవాయి దీవులు, సమోవా దీవులను మూడవ రక్షణ గోడగా పరిగణిస్తారు. ఈ మూడు శ్రేణులు దాటితే అమెరికా ప్రధాన భూభాగాన్ని చైనా చేరుకోవచ్చు. అందుకే ఈ దీవు లపై చైనా పెత్తనాన్ని అమెరికా సహించదు. దానివల్ల జలసంధులు, జలరవాణా మార్గాల రక్షణ కీలకం కాబోతున్నది.మొదటి రక్షణ శ్రేణిలోని మియాకో, తైవాన్, లూజాన్, సుండా జలసంధులను రక్షించటానికి ఒకినావో (జపాన్), ఫిలిప్ఫైన్స్లలో యూఎస్ఏ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. గువామ్లోని అమెరికా సైనిక స్థావరం రెండవ వలయానికి రక్షణ కల్పిస్తున్నది. హవాయిలో సైనిక స్థావరం మూడో వలయానికి కేంద్రకం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా–రష్యాలను నియంత్రించడానికి అమెరికా ఇతర సైనిక శక్తులతో చేతులు కలిపింది. ఆస్ట్రేలియా, భారత్, యూఎస్ఏ, జపాన్ సభ్యులుగా 2004లో క్వాడ్ ఏర్పడింది. క్వాడ్ను ఆసియా నాటోగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే సభ్యులుగా ఆకస్ కూటమి పనిచేస్తున్నది.ఉత్తర పసిఫిక్ ప్రాంతాన్ని ఆసియా–ఐరోపాలతో అనుసంధానం చేసే కీలక ప్రాంతంలో భారతదేశం ఉన్నది. ఈ ప్రాంతంలోని అండమాన్ నికోబార్ దీవులు, మలేషియా, సింగపూర్లను నాలుగవ రక్షణ శ్రేణిగా యూఎస్ఏ పరిగణిస్తుంది. ఇండో పసిఫిక్కు ముఖద్వారంలో భారతదేశం కొలువై ఉన్నది. చైనా ప్రపంచాన్ని భయపెట్టాలన్నా, ప్రపంచం చైనాను అదుపు చేయాలన్నా మలక్కా, తైవాన్ జలసంధులు కీలకం. మలక్కా, తైవాన్ జలసంధుల వద్ద సమీప భవిష్యత్తులో హార్మూజ్ ముఖచిత్రం ఆవిష్కృతం కావొచ్చు. తైవాన్ జలసంధిని చైనా అదుపులోకి తీసుకొంటే, ప్రతిగా మలక్కా జలసంధిని మూసివేయటానికి యూఎస్ఏ–జపాన్ ప్రయత్ని స్తాయి. ఇక్కడ భారత్ పాత్ర కీలకమవుతుంది. భారత్ తోడ్పాటు లేకుండా ఏ నౌకాశక్తి మలక్కాపై పెత్తనం చలాయించలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
తన ఆటలో తానే పావయిందా?
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ముగింపు సూచనలు లేవు సరికదా మరింత తీవ్రతరమవటమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఇరాన్ తరఫున యెమెన్లోని హవుతీలు కూడా రంగంలో దిగటంతో పర్షియన్ గల్ఫ్తో బాటుగా ఎర్ర సముద్రంపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎర్ర సముద్రం, బాబెల్ మెండెబ్ జలసంధి గుండా సుమారు 12 శాతం ప్రపంచ చమురు, గ్యాస్ రవాణా జరుగు తున్నది. అంటే, ఇరాన్ ఈ యుద్ధాన్ని మరొక అంచెకు తీసుకొని వెళ్లటానికి నిశ్చయించినట్లు లెక్క.అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం, సంక్షోభం తలెత్తినా, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ యూఎస్ఏ పాత్ర ప్రస్ఫుటం. ప్రచ్ఛన్న యుద్ధ (1945–1991) కాలంలో యూఎస్ విదేశాంగ విధానం సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని అడ్డుకోవటం లక్ష్యంగా రూపొందించబడి నది. సోవియట్ విచ్ఛిన్నం (1991) తరువాత యూఎస్ఏ నాయక త్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికన్ ప్రయోజనాలకు విఘాతం నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడు లను నిస్సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకొన్నది.యుద్ధంతో శాంతా?ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ఏ ఇక యుద్ధాలు చేయటం లేదా ప్రోత్సహించడం ఉండదని ప్రకటించాడు. బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యూఎస్ఏను యుద్ధాల ఊబిలోనికి లాగి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించాడు. అదే సమయంలో సుంకాల యుద్ధానికి (టారిఫ్ వార్) తెరతీశాడు. క్రమంగా ట్రంప్ ప్రభుత్వం ‘యుద్ధాలకు ముగింపు’ విధానం నుండి మళ్లీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగదీసు కోవటం మొదలుపెట్టి, ఉక్రెయిన్కు సాయుధ సహకారాన్ని మరింత విస్తరించి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తున్నది. ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం, వెనిజులాలో సైనిక చర్యతో యూఎస్ తన పంథా మార్చుకోలేదని అర్థమయింది. గ్రీన్ల్యాండ్ను యూఎస్ఏకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. ఇరాన్తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో కలహానికి శ్రీకారం చుట్టాడు.ఇటీవల 2025లో యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025) యూఎస్ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలం, సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యూఎస్ ప్రతిపా దిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి (వార్ ఫర్ పీస్) అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్ వివిధ దేశాలను సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తి ద్వారా లోబర్చుకొనే విధానాన్ని అమలుపరుస్తున్నాడు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరించాడు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనకడుగు వేశాడు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, ఈయూ, భారత్లతో ట్రంప్ వెనకడుగు వేశాడు.డీప్ స్టేట్ మద్దతు లేదా?యూఎస్ఏ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఆ దేశంలోని డీప్ స్టేట్ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రిపబ్లికన్ల చేతిలో ఉన్నా, డెమోక్రాట్ల చేతిలో ఉన్నా డీప్ స్టేట్ చెప్పుచేతల్లో ఉండాల్సిందే. సీఐఏ, పెంటగన్, ఎన్ఐఏ, మీడియా లాబీ, ఆయుధ కంపెనీల లాబీలు, టెక్ కంపెనీ లాబీలు, బడా మదుపరుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్ స్టేట్ ప్రభుత్వ విధానాలు తన లక్ష్యాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూస్తుంది.డీప్ స్టేట్ కనుసన్నల్లో ఉండే యూఎస్ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్ లక్ష్యాలతో పాటుగా అమెరికన్ లాబీల ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదారవాద ముసుగులను కప్పి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుం టారు. తాత్కాలికంగా యూఎస్ ఆధిపత్యానికి నష్టం కలిగినా సరే, యూఎస్ డీప్ స్టేట్ లాబీల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది.యూఎస్ అధ్యక్షులెవరయినా యూఎస్ డీప్ స్టేట్ ప్రయోజనా లకు విరుద్ధంగా వెళ్లలేరు. గత ఎన్నికలలో బైడెన్పై ట్రంప్ ఓటమికి డీప్ స్టేట్ సహకరించిందని అనుమానం. అందుకే ట్రంప్ డీప్ స్టేట్ని పక్కకి నెట్టి హెగ్సెత్, కుష్నర్, లిండ్సే, విట్కాఫ్ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నారు. డీప్ స్టేట్ భాగస్వామ్యం లేకపోవ టంతో ఇరాన్ వ్యూహంలో డొల్లతనం కన్పడుతున్నది.ఎంతవరకు పోరాడగలవు?ఇరాన్పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యాలలో వైరుధ్యం కన్పడుతున్నది. ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్ను ముక్కలుగా చేయటం, సుదూర భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ సవాలు చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమయిన జెరూసలెం వంటి ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్కు ఉనికి, అస్తిత్వాల సమస్య ఉన్నది. సామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్లు, ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాల్. అందుకే ఈ రెండు దేశాలది ‘నిండా మునిగిన వాడికి చలేమిటి?’ పరిస్థితి. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలూ వెనుకాడవు.ఇరాన్ నుండి తమను రక్షించుకోవటానికి అమెరికా ఛత్ర ఛాయలోకి దూరిన సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు, ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్ నాశనాన్నే కోరుకుంటాయి. భవిష్యత్తులో మరెప్పుడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్ను ధ్వంసం చేయాలని ఈ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఇవి యుద్ధం ఆగాలని కోరుకోకపోవచ్చును. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాది అస్తిత్వ సమస్య. అందుకే ఎంత నష్ట పోయినా, నాలుగేళ్లయినా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.కానీ యూఎస్ఏ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించినది కాదు, మనుగడకు సంబంధించినది కాదు. యుద్ధ లక్ష్యాలలో గందరగోళం స్పష్టంగా ఉన్నది. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సుముఖంగా లేడు. కానీ అర్ధంతరంగా కాడి పడవేస్తే అది యూఎస్ ప్రతిష్ఠకు మాయని మచ్చ. ఇప్పటికే యూఎస్ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్పై ఒత్తిడి పెంచారు. యూఎస్ఏ జీడీపీ సుమారుగా 31.89 ట్రిలియన్ డాలర్లు. కానీ అప్పుల భారం 38.5 ట్రిలియన్ డాలర్లు. బాండ్ మార్కెట్ ద్వారా యూఎస్ చైనా, జపాన్, ఈయూ దేశాల నుండి పెద్ద మొత్తాలలో పెట్టుబడులను సేకరిస్తున్నది. ఈ పెట్టుబడులను వినియోగించే ఖరీదైన యుద్ధాలను నిర్వహిస్తున్నది. యూఎస్ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్ గ్యాస్ మార్కెట్లను సంక్షోభంలోనికి నెట్టివేస్తే, దీర్ఘకాలంలో యూఎస్ బాండ్ మార్కెట్ తద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యూఎస్ డీప్ స్టేట్ లాబీలు ట్రంప్ను ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
విశ్లేషణలో సమతూకం.. మెరుగైన స్కోరింగ్కు మార్గం!
గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ. Writing is an beautiful అట్ట.. రాయటమనేది ఓ అందమైన కళ.. ఓ అంశానికి సంబంధించి మదిలోని భావాలకు అక్షరరూపం ఇచ్చి ఎగ్జామినర్ను మెప్పించడమనే ఉన్నత కళ.. విద్యార్థులకు విజయాలను దగ్గరచేస్తుంది. సివిల్స్ మెయిన్స్లో కీలకమైన పేపర్ ఎస్సే.. 250 మార్కులకు ఉండే ఈ పేపర్లో అధిక మార్కులు సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు అన్ని కోణాల్లోనూ విశ్లేషణాత్మకంగా రాయగలిగే నేర్పును సొంతం చేసుకోవాలి.. ఈ నేపథ్యంలో ‘జనరల్ ఎస్సే’ పేపర్కు సంబంధించి ప్రిపరేషన్ ప్రణాళిక.. సివిల్స్ మెయిన్స్లో మెరిట్ స్కోరింగ్కు పరిగణనలోకి తీసుకునే ఏడు పేపర్లలో ఎస్సే పేపర్ కీలకమైనది. ఓ ప్రణాళిక ప్రకారం పరీక్షకు సిద్ధమైతే ఈ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు అవకాశముంటుంది. ఇచ్చిన అంశాన్ని నిశితంగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణాత్మకంగా రాస్తే ప్రభావవంతమైన ఎస్సే అనిపించుకుంటుంది. ఇలాంటి ఎస్సే రాసేందుకు అభ్యర్థులు తగిన ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. విభాగాల ఎంపిక: సివిల్స్ మెయిన్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ఎస్సే ప్రిపరేషన్లో భాగంగా సామాజిక (Social); పర్యావరణం (Environment); ఆర్థిక (Economic); జాతీయ/అంతర్జాతీయ (National/International) ఇలా నాలుగైదు విభాగాలను గుర్తించాలి. కనీసం రెండు అంశాల్లో పట్టు: గుర్తించిన నాలుగైదు విభాగాలకు సంబంధించి ఐదు వరకు అంశాలను నోట్ చేసుకోవాలి. అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కనీసం రెండు అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకునేటప్పుడు అభ్యర్థులు తమ అభిరుచి, అకడమిక్ నేపథ్యం, మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్టు తదితరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎంపిక చేసుకున్న రెండు అంశాల నుంచి ఒక్కో దాన్నుంచి ఏడెనిమిది ఉప అంశాలను, మొత్తంమీద 15- 20 ఉప అంశాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి దానికీ సంబంధించిన సమస్యలు, సవాళ్లు, కారణాలు, ప్రభుత్వ చర్యలు, సమస్య పరిష్కారానికి అనుసరించే వ్యూహాలను చదవాలి. వీటికి అభ్యర్థులు.. ప్రభావవంతమైన, సానుకూల దృక్పథంతో కూడిన సొంత అభిప్రాయాలను జోడిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి. విపత్తులు అనే అంశం నుంచి వరదలు అనే ఉప అంశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఉప అంశాన్ని సమకాలీన సంఘటనలకు అనుసంధానిస్తూ విశ్లేషణాత్మకంగా చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇలా చదివితే పరీక్షలో ‘ఉత్తరాఖండ్’ వరదలకు సంబంధించి ఏ కోణంలో ప్రశ్న అడిగినా తేలిగ్గా ఎస్సే రాయడానికి అవకాశముంటుంది. ఇలా వివిధ ఉప అంశాలను గుర్తించి సమకాలీనంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టు నిపుణుల సలహాతో: గతంలో మాదిరి ఇప్పుడు నేరుగా ప్రశ్నలు రావడం లేదు కాబట్టి ఆయా ఉప అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకు అభ్యర్థులు సబ్జెక్టు నిపుణులను సంప్రదించాలి. వివిధ ప్రశ్నలకు సంబంధించి ఎస్సేలు రాసి వాటిని నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి. చేసిన పొరపాట్లను తెలుసుకొని వ్యాసాన్ని మరింత మెరుగ్గా రాయడానికి ప్రయత్నించాలి. ప్రిపరేషన్కు దినపత్రికలు, వెబ్సైట్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఆ రెండు ఆప్షనల్స్కు బోనస్: మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ఇతర ఆప్షనల్ సబ్జెక్టు తీసుకున్న వారితో పోలిస్తే జాగ్రఫీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ను ఆప్షనల్గా ఎంపిక చేసుకున్న వారికి ఎస్సే పేపర్ బోనస్ అని చెప్పొచ్చు. వీరు ఆప్షనల్ ప్రిపరేషన్లో భాగంగా చదివే వివిధ అంశాలు ఎస్సేను ప్రభావవంతంగా రాయడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సంస్కృతి, నాగరికత: ఇచ్చిన ప్రశ్నల్లో ఒకటి సంస్కృతి, నాగరికత, కళలు, ఫిలాసఫీ తదితర అంశాల నుంచి వస్తుంది. చాలా వరకు ఇది సమకాలీనంగా చర్చలో ఉన్న విషయానికి సంబంధించినదై ఉంటుంది. ఈ ఎస్సే రాయగల సామర్థ్యం కొంత మందికే ఉంటుంది. సృజనాత్మకంగా విశ్లేషించే నైపుణ్యం, భాష మీద పట్టున్న వారు మాత్రమే ఇలాంటి ఎస్సేను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి సామర్థ్యం లేకుండా ఎస్సేను రాయడానికి సిద్ధపడితే కోరికోరి చేతులు కాల్చుకోవడమే అవుతుంది. జాతీయ, అంతర్జాతీయ విభాగానికి సంబంధించి పొలిటికల్, భద్రతలకు సంబంధించి ప్రశ్న కచ్చితంగా వచ్చేందుకు అవకాశముంది. Ex: వివిధ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆ దేశ పోకడలకు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు రష్యా.. అమెరికా చర్యల్ని గట్టిగా ప్రతిఘటిస్తోంది. తాజాగా సిరియాలో రసాయన ఆయుధాల సంక్షోభం నేపథ్యంలో అమెరికా అవలంబిస్తున్న వైఖరిని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తన విదేశాంగ విధానాన్ని (Foreign policy) ఏ విధంగా మార్చుకోవడం అభిలషణీయమో వివరించండి? అనే ప్రశ్న రావొచ్చు. ప్రశ్న ఎంపిక ఎలా? అభ్యర్థులు ఎంపిక చేసుకునే ప్రశ్న అధిక మార్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అభ్యర్థులు సరైన సమాచారాన్ని చొప్పించేందుకు, వివిధ ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశమున్న ప్రశ్ననే ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నను ఎంపిక చేసుకోవడం వల్ల గరిష్ట మార్కులు సంపాదించేందుకు వీలవుతుంది. సమయ పాలన ప్రధానం: జనరల్ ఎస్సే విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిన మరో విషయం సమయ పాలన. ఈ క్రమంలో ప్రశ్నను ఎంపిక చేసుకున్న తర్వాత కొంత సమయాన్ని వ్యాసంలో పొందుపరచాల్సిన అంశాల వరుస క్రమంతో స్ట్రక్చర్ను రూపొందించుకునేందుకు కేటాయించాలి. ప్రశ్నలో ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే ఆ సమస్యకు మూలాలు ఏమిటి?; పూర్వ, ప్రస్తుత స్థితి; సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు-వ్యూహాలు; అవి ఎంత వరకు సఫలీకృతమయ్యాయి? వంటి అంశాలతో ప్రణాళిక రూపొందించుకోవాలి. దీని ఆధారంగా ఎస్సే రాయాలి. ప్రారంభం ఆకట్టుకోవాలి: చాలా మంది అభ్యర్థులకు పరీక్షలో అడిగిన ఓ అంశంపై బాగా అవగాహన ఉన్నప్పటికీ ఎస్సేను ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అభ్యర్థులు ఎస్సేను ప్రారంభించేందుకు సమకాలీన శైలి (Contemporary Style)ని అనుసరించాలి. దీంట్లో భాగంగా ప్రశ్నకు సంబంధించిన ఎస్సేను సమకాలీన నేపథ్యంతో ప్రారంభించాలి. ఉదాహరణకు ప్రశ్న ప్రభుత్వ పథకాల అమల్లో సమస్యలకు సంబంధించినది అయితే ఇటీవల బీహార్లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం- చిన్నారుల మరణాల ఘటనతో ప్రారంభించాలి. ఎస్సే ప్రారంభంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఎగ్జామినర్ను ఆకట్టుకోగలరు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని అడుగు వేయాలి. మొదటి పేజీ పేరాల్లో సరళమైన పదాలు, సూటిగా, స్పష్టమైన వివరణలు ఉండేలా చూడాలి. ఇతరులతో పోల్చితే భిన్నంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచన రేకెత్తించేవిగా ఉంటే ఎక్కువ మార్కులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రాత తీరు.. ఉండాలిలా! అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి. ఇతర పేపర్లతో పోల్చితే ఎస్సే పేపర్లో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది. మీకు ఎంత సమయం అందుబాటులో ఉంటుందో మిగిలిన వారికీ అంతే ఉంటుందన్న విషయం గుర్తించి, నిర్దేశ సమయం, ముందుగా సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్ల ఆధారంగా ఎస్సే రాయాలి. పొంతనలేని కొటేషన్స్, సామెతలు లేకుండా చూడాలి. సందర్భాన్ని బట్టి అవసరమైనంతలో మంచి కొటేషన్స్, సామెతలు ఉపయోగించవచ్చు. ఎస్సేను పేరాగ్రాఫ్లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. బాక్స్లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు సముచితంగా ఉపయోగించాలి. వ్యాసంలో అతిముఖ్యమైన సమాచారాన్ని అండర్లైన్ చేయాలి. ఇలాంటివి పేజీలో రెండు లేదా మూడు అంశాలకు పరిమితం చేయాలి. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మతం, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు. ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించేలా ఉండకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. ఎస్సేకు ముగింపు రాసే ముందు అప్పటివరకు రాసిన భాగాన్ని మరోసారి చదవాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. ఈ కింది ఉదాహరణ ద్వారా ఎస్సే పేపర్లో సమకాలీనతకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. Ex: In the context of Gandhiji's views on the matter, explore, on an evolutionary scale, the terms "Swadhinata', "Swaraj', and "Dharmarajya'. Critically comment on their contemporary relevance to Indian democracy. (2012 సివిల్స్ మెయిన్స్) ఎస్సే పేపర్లో వచ్చే అవకాశమున్న కొన్ని అంశాలు: ఉత్తరాఖండ్ వరద బీభత్సం. డాలర్తో పోల్చితే రూపాయి విలువలో అధిక క్షీణత. నిర్భయపై సామూహిక అత్యాచారం కేసు- దోషులకు మరణ శిక్ష విధింపు. ఆహార భద్రత చట్టం అమలు-సాధ్యాసాధ్యాలు. దేశ ఆర్థికాభివృద్ధిపై అవినీతి కుంభకోణాల ప్రభావం.


