పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి
ప్రతి నెలా రక్తమార్పిడి తప్పనిసరి
బోన్ మ్యారో మార్చాలంటున్న వైద్యులు
చికిత్సకు రూ.36లక్షలు
ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న తల్లిదండ్రులు
ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ఉపాధ్యాయుడు
అనంతపురంలోని రంగస్వామి నగర్ 4వ రోడ్డులో నివాసముంటున్న ఆంజనేయులు, శాంతకుమారి దంపతుల కుమారుడు రితేష్(4). మూడు నెలలు పసికందుగా ఉన్నప్పుడే రితేష్ ఆరోగ్య పరిస్థితిలో మార్పులు చోటు చేసుకున్నాయి. తల్లిపాలు తాగడం మానేశాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించార. జబ్బు తగ్గుతుందన్న వైద్యులు భరోసానివ్వడంతో వారిలో ఆందోళన తగ్గింది. డాక్టర్లు చికిత్స మొదలుపెట్టారు. రోజులు... నెలలు గడుస్తున్నా పిల్లవాడిలో మార్పు రాలేదు. రూ. వందలు.. వేలు.. లక్షల్లో ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు. శిశువు నీరసించిపోసాగాడు. రక్తమార్పిడి చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన రెట్టింపు అయింది. వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వివిధ రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత థలసీమియాతో రితేష్ బాధపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వ్యాధి పూర్తిగా నయం కావడానికి బోన్మారో మార్పు ఒక్కటే మార్గమని, ఇందుకు వివిధ దశల్లో రూ.36,75,000 ఖర్చు అవుతుందని వైద్యులు వివరించారు. అప్పటి వరకూ ప్రతి నెలా రక్తమార్పిడి చేయించాల్సి వస్తుందని సూచించారు.
అప్పు చేసి చికిత్సలు : అచేతనావస్థలో ఉన్న శిశువు పెరుగుతూ ప్రస్తుతం నాలుగేళ్ల ప్రాయానికి చేరుకున్నాడు. అయితే అందరి పిల్లల్లా కాకుండా నీరసించి పోయి ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఆ బాలుడి ఆరోగ్యం కుదుట పడాలని ఆ తల్లిదండ్రులు పడుతున్న తపన అంతాఇంత కాదు. గార్లదిన్నె మండలంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడి (పీజీటీ)గా పనిచేస్తున్న ఆంజనేయులు.. సంపాదన కుటుంబ పోషణతో పాటు బాలుడికి అత్యవసర చికిత్సల కోసం తక్కువ పడుతోంది. అర్థిక స్థోమత ఏమాత్రమూ సరిపోవడం లేదు. ప్రతి నెలా రక్తమార్పిడి, ఇతర చికిత్సల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. దాతలు ఎవరైనా స్పందించి తమకు పుత్ర భిక్ష పెట్టాలని ఆంజనేయులు దంపతులు వేడుకుంటున్నారు.
సాయమందిచాలనుకుంటే..
ఖాతాదారుడి పేరు: వి. ఆంజనేయులు
ఖాతా నంబర్ : 33105388863
బ్యాంక్, ఎస్బీఐ అనంతపురం జార్జిపేట శాఖ
ఐఎఫ్సీఎస్ కోడ్ః ఎస్బీఐ ఎన్ 0010659
సంప్రదించాల్సిన ఫోన్ : 99852 42441