వేర్పాటువాది ఆంద్రబీ అరెస్టు
జమ్మూకాశ్మీర్: వేర్పాటువాద నేత ఆసియా ఆంద్రబీని కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ జెండాలను ఎగుర వేయడం, ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్తో కలసి ర్యాలీలో పాల్గొనడం, ఇటీవల పాకిస్థాన్లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్లో ఫోన్ ద్వారా మాట్లాడటంవంటి ఆరోపణలపై ఆంద్రబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు ఆంద్రబీ వివాదాస్పద చర్యలకు దిగింది. కశ్మీర్లోని ఓ గ్రామంలో పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించి ఆ దేశ జెండాను ఎగురవేసింది.
పైగా ఆ సాయంత్రమే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న అంద్రబీ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆంద్రబీపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఆమెను అరెస్టు చేశారు. దక్తరన్ ఈ మిల్లట్ (డాటర్స్ ఆఫ్ ది ఫెయిత్) చీఫ్గా కూడా అసియా ఆంద్రబి పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమెను శ్రీనగర్ లోని రామ్ బాగ్ జైలుకు తరలించారు. కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఈ వారం మొదట్లో కాల్పులు చోటుచేసుకొని ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. పలుసార్లు ఇప్పటికే ఆమెను హౌస్ అరెస్టు కూడా చేశారు.