జూనియర్ హీరోయిన్లంటే అంత అలుసా?
కొంతమంది హీరోలు, హీరోయిన్లు మేముసైతం కార్యక్రమాన్ని పట్టించుకోలేదంటూ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఎవరినీ ఆయన నేరుగా పేరుపెట్టి ప్రస్తావించకపోయినా.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్న కొంతమంది చిన్న నటీమణులు భరద్వాజ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏవైనా ప్రైవేటు ఫంక్షన్లకు ఆహ్వానం రాకపోయినా.. పాసులు అడిగి మరీ హాజరవుతారని, ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం మొహం చాటేస్తున్నారని ఆయన అన్నారు.
ఆయన వ్యాఖ్యలకు హీరోయిన్ల నుంచి అంతే రియాక్షన్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చిన అర్చన ...తమ్మారెడ్డి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జూనియర్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. సీనియర్లు కూడా స్టేజ్ ప్రదర్శన ఇవ్వలేదని, అలాంటిది తమమీదే ఎందుకని నోరు పారేసుకుంటున్నారని వాపోయింది. తెలుగు, నాన్ తెలుగు అమ్మాయిలనే మాటలతో తాము విసిగిపోయామని, తామంతా తెలుగు సినీ పరిశ్రమలో భాగమేనని చెప్పింది. ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అక్కడే ఉన్నానని తెరలిపింది.
మేము సైతం కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొన్నానని రీతూ వర్మ తెలిపింది. సీఎం సహాయ నిధికి చెక్కు ఇచ్చినట్లు తెలిపారు. ఈ వివాదంలోకి తన పేరును ఎందుకు లాగారో అర్థం కావటం లేదని ఆమె వాపోయింది. ఈ కార్యక్రమం కోసం తన ఫ్యామిలీ ఫంక్షన్ కూడా మిస్ అయ్యాయని తెలిపింది.
తాను నటి శ్రియతో పాటు గోపాల గోపాల సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖలో ఉన్నానని మరోనటి మధుశాలిని చెప్పారు. తాను హైదరాబాద్ వచ్చినప్పుడు మంచు విష్ణు నుంచి ఫోన్ వచ్చిందని. తన కబడ్డీ జట్టులో ఆడాలని కోరినట్లు చెప్పింది. మ్యాచ్ జరిగే వేదిక దగ్గరకు వెళ్లానని, ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనేందుకు వేరే స్టేడియం వరకు వెళ్లానని చెప్పింది. తర్వాత తనను ముఖ్యవేదిక వద్దకు అంత్యాక్షరిలో పాల్గొవాలని ఆహ్వానించారని...వాళ్లు చెప్పినవన్నీ తాను చేశానని మధుశాలిని చెప్పింది.
తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా 'మేము సైతం' రిహార్సల్ కు హాజరయ్యానని పూనం కౌర్ తెలిపింది. క్రికెట్, కబడ్డీతో పాటు ప్రధాన కార్యక్రమాలకు జట్లు ప్రకటించిన మూడు రోజులు అక్కడే ఉన్నానంది. హూద్ హుద్ బాధితులకు లక్ష విరాళం ఇచ్చినట్లు చెప్పింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తున్నామని, చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపింది. ఇంతకు ముందు జమ్మూకశ్మీర్ బాధితుల సహాయర్థక నిధుల సేకరణలోనూ తన భాగస్వామ్యం ఉందని చెప్పింది.
'ఈ రోజుల్లో' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన రేష్మా... ఓ తెలుగు సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడులో ఉన్నానని, అసలు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తనను ఎవరూ కోరలేదని తెలిపింది. పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కూడా ఎవరూ అడగలేదని తెలిపింది. నిర్వాహకులు అడిగి ఉంటే.. తాను చిత్ర నిర్మాతను రిక్వెస్ట్ చేసి ఈవెంట్ లో పాల్గొనేందుకు ప్రయత్నించేదాన్నని తెలిపింది.