పోరాడి ఓడిన శ్రీజ
స్లొవేకియా జూనియర్ ఓపెన్ టీటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ స్లోవేకియాలో జరిగిన జూనియర్ ఓపెన్ టీటీ టోర్నమెంట్లో పోరాడి ఓడింది. సెనెక్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ఏపీ అమ్మాయి సింగిల్స్ విభాగం ప్రిక్వార్టర్స్లో, డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో ఓడింది.
ఆదివారం జరిగిన జూనియర్ బాలికల సింగిల్స్లో శ్రీజ 3-4 (8-11, 8-11, 11-6, 8-11, 11-9, 11-9, 5-11)తో లొరెంజోటి మరియా (ఉరుగ్వే) చేతిలో పరాజయం చవిచూసింది. ఏడు గేమ్ల పాటు జరిగిన ఈ పోరులో శ్రీజ తుదికంటా పోరాడింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో ఆమె 4-0 (11-6, 13-11, 11-7, 11-7)తో మిస్చెక్ కరోలిన్ (ఆస్ట్రియా)పై అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో లీ యూ పెంగ్ (చైనీస్ తైపీ)-లొరెంజోటి మరియా (ఉరుగ్వే) జోడి 4-11, 11-5, 11-5, 11-8తో శ్రీజ-రితి శంకర్ జోడిపై గెలిచింది.