అశ్రునయనాల మధ్య అరుణ అంత్యక్రియలు
ముంబై : 42 ఏళ్ల పాటు జీవచ్ఛవంలా బతికి, నిన్న కన్నుమూసిన అరుణా షాన్ బాగ్ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలోని నర్సులు, డాక్టర్లు, బంధువుల అశ్రునయనాల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. అరుణ మరణ వార్త విన్న బంధువులంతా ఆసుపత్రికి తరలి వచ్చి తుది నివాళులర్పించారు.
ఇన్నాళ్లు తాము కంటికి రెప్పలా కాపాడుకున్న అరుణ ఇక లేదనే వాస్తవాన్ని ఆస్పత్రి నర్సులు, ఇతర సిబ్బంది జీర్జించుకోలేకపోయారు. కొవ్వొత్తులు వెలిగించి , ఆమె ఆత్మశాంతికై ప్రార్థనలు చేశారు. ఆసుపత్రి డీన్ సహా అరుణా బంధువులు, నర్సులు భారీ ర్యాలీగా బోయివాడ శ్మశాన వాటికకు చేరుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ప్రేమించిన డాక్టరు సందీప్ను పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన అరుణ, ఓ దుర్మార్గుడి దురాగతంతో అచేతనంగా మారిపోయింది. పోతూ పోతూ.. ఈ సమాజంపై ఎన్నో ప్రశ్నల్సి సంధించింది. ఆడపిల్లల జీవితాలపై, మెదళ్లపై మరెన్నో సవాళ్లను మిగిల్చి..ఇక సెలవంటూ.. ఈ లోకాన్ని వీడింది.
కాగా 26 ఏళ్ల వయసులో అరుణా షాన్ బాగ్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న ఆమెపై ఆస్పత్రి వార్డ్బాయ్ సోహన్ లాల్ వాల్మీకి అతి దారుణంగా అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచాడు. తలకుతీవ్రం గాయంకావడంతో అరుణా షాన్ బాగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సోమవారం (మే 18) చనిపోయేవరకు కోమాలోనే ఉంది.