ఎస్ఎంఎస్లతో వ్యవసాయ సమాచారం
కోలారు : రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా వ్యవసాయ, వాతావరణ, కీటనాశకాల నివారణ తదితర విషయాలను పంపించే వినూత్న విధానాన్ని కోలారు వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో బాగలకోట హార్టికల్చర్ విశ్వవిద్యాలయం చాన్సలర్ డాక్టర్ డీఎల్ మహేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా రైతులు మొబైల్ సేవలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ దిగుబడులు సాధించాలన్నారు.
రైతులు 9480696395 నంబర్కు మొసేజ్ పంపితే అవసరమైన సమాచారాన్ని కన్నడ భాషలోనే పంపుతారన్నారు. వాతావరణ పరిస్థితులు, సస్యరక్షణ, పురుగు మందుల పిచికారి విధానం, పాడి, పట్టు తదితర అంశాలపై సలహాలు, సూచనల కోసం రైతులు తమ మొబైల్ నంబర్లను వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో తొలిసారిగా వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసింది కోలారులోనేనన్నారు. దక్షిణ వలయ ప్లానింగ్ డెరైక్టర్ శ్రీనాథ్ దీక్షిత్, డాక్టర్ ఏబీ పాటిల్ పాల్గొన్నారు.