వైఎస్ మరణంతో ఆగిన ప్రాజెక్టు
గరుగుబిల్లి: దివంగతనేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేశారనీ, ఆయన మరణంతో ఆ పనులు నిలిచిపోయాయని మాజీ మంత్రి కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని తోటపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు నిర్వాహణను ఆయన ఉత్తరాంధ్ర జలసాధన సమితి సభ్యులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత నేత నాడే రూ.50కోట్లు మంజూరుచేయడంతో పాటు పనుల పర్యవేక్షణకు విశాఖలో చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటుచేశారని చెప్పారు. తరువాత వచ్చిన పాలకులు ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించారన్నారు. టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దీనిని పూర్తిచేస్తామని పేర్కొన్నా... నేడు పట్టించుకోలేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులను పరిశీలించి, రైతులనుండి సంతకాల సేకరణ చేపట్టిన అనంతరం విశాఖపట్నంలో రైతులు, మేధావులతో సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.