ఆదిత్యుని దర్శించుకున్న ఐజీ
శ్రీకాకుళం సిటీ : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని శుక్రవారం కోస్తా రీజనల్ ఐజీ కుమార్ విశ్వజిత్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను వివరించి ప్రసాదం, స్వామి చిత్రపటం అందించారు. అనంతరం ఐజీ వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయాన్ని, ఎచ్చెర్ల పోలీస్క్వార్టర్స్ను, పైడి భీమవరంలో ఔట్పోస్టు పోలీస్స్టేషన్లను పరిశీలించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్లో నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు. ఆదిత్యుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో పాలీస్ శాఖను పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవుల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో మాఓల ప్రభావం లేదని అన్నారు. అయినా ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్లు చేపడుతున్నామన్నారు. కొద్ది రోజుల క్రితం స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించగా, అందులో ముగ్గురు మావోలను అదుపులోనికి తీసుకున్నామని, వారిలో ఇద్దరికి గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్సను అందించామని వివరించారు. అనంతరం శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో ఐజీ మొక్కలను నాటారు. ఆయన వెంట ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డీఎస్పీలు కె. భార్గవరావునాయుడు, పి.శ్రీనివాసరావు, టి మోహనరావు, సీఐలు నవీన్కుమార్, ఆర్ అప్పలనాయుడు, ఎస్ఐలు చిన్నంనాయుడు, రామకృష్ణలు పాల్గొన్నారు.