హోలీ వేడుకల్లో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. హోలీ పేరుతో కొందరు దుండగులు తమపై వీర్యం నింపిన బెలూన్లను విసిరివేస్తూ వేధిస్తున్నారని లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థినులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ద్రవపదార్థం నిండిన బెలూన్ను తనపై కొందరు విసిరివేశారని, అది తన దుస్తులపై పడిందని ఓ విద్యార్థిని తన ఫ్రెండ్తో చెప్పగా, అయితే అవి రంగు నీళ్లు కాదని, వీర్యమని గుర్తించిన వారు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు పలువురు విద్యార్థినులకు ఎదురయ్యాయని కాలేజ్ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ విచారణలో వెల్లడైంది.
తమపై కొందరు ఇలాంటి బెలూన్లు విసిరారని ముగ్గురు విద్యార్థినులు చెప్పారని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై కళాశాల విద్యార్థి సంఘం, కళాశాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపు ఘటనలపై తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు పోలీసు అధికారులు ఓ మొబైల్ నెంబర్ను అందుబాటులో ఉంచారు. మరోవైపు విద్యార్థినులపై వేధింపులు నివారించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (విమెన్)ను కలిసి ఫిర్యాదు చేశామని లేడీ శ్రీరాం కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారు.