land puja
-
అమరావతిలో తెలుగు శిలాఫలకాలు ప్రతిష్టించాలి
విజయవాడ (గాంధీనగర్): తెలుగులో రూపొందించిన భూమిపూజ, రాజధాని, తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన శిలాఫలకాలను ఉగాదిలోగా రాజధాని అమరావతిలో ప్రతిష్టించాలని, లేకపోతే గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతామని మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు భాష, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడతామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు వాగ్దానాలు చేసినట్లు గుర్తుచేశారు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి అమలు కాలేదని ముఖ్యమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న తెలుగు విశ్వవిద్యాలయం పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ను తెలుగులో ప్రవేశపెడితే మన ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునేలా ఆంగ్లభాషలో ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. చెన్నైలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ ఆధీనంలోని బిల్డింగ్ నిర్వహణకు రూ.10 లక్షల బకాయిలు చెల్లించే విషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారుల్లో కదలిక రాలేదన్నారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించేలా చర్యలు చేపడతామని చెప్పిన చంద్రబాబు నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం, పాఠ్య ప్రణాళిక రూపొందించకపోవడం బాధాకరమని యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. -
134 కాదు.. 136
సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణంలో భాగంగా వచ్చే నెల ఆరునభూమి పూజ నిర్వహించే స్థలం విషయమై తుళ్లూరులో ప్రధానంగా చర్చ జరుగుతోంది. భూమి పూజకు మొదట తుళ్లూరు మండలం మందడం, తాళ్లాయపాలెం గ్రామాల మధ్య జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు కుటుంబీకులకు చెందిన సర్వే నంబరు 134లో పొలాన్ని భూమిపూజకోసం ఎంపిక చేశారు. ఆ పొలంలో ఇటీవల ఆ కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఇందులో భూమిపూజ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియల విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి తెలియజేసింది. దీంతో వాస్తు, హిందూ సంప్రదాయాలపై ఆధారపడి భూమి పూజ చేయదలచిన ప్రభుత్వానికి ఆటంకం కలిగింది. చేసేదేమీలేక సర్వే నంబరు 134 నుంచి భూమిపూజ కార్యక్రమాన్ని 136 నంబరులో ఉన్న పొలానికి మార్చారు. అందులో ఈశాన్య దిక్కులో భూమిపూజ చేయాలని నిర్ణయించారు. దీనిపైనా స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ భూమి పూజ చేయాలా? వద్దా? లేక మరో ప్రదేశంలో చేయాలా?అన్న సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది. -
‘మందడం’లో భూమిపూజకు నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణానికి తుళ్లూరు మండలం మందడం గ్రామ శివార్లలో ప్రభుత్వం వచ్చే నెల 6వ తేదీన భూమిపూజ చేయనుంది. దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడకపోయినా అక్కడి స్థలంలోనే భూమిపూజ చేయాలని మంత్రులు, సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటివరకు తర్జనభర్జనలు పడినా చివరికి మందడం ప్రదేశాన్ని ఎంపిక చేశారు. మందడం, తాళ్లాయిపాలెం మధ్య ఉన్న 25 ఎకరాల స్థలంలో ఎలాంటి పంటలు లేక ఖాళీగా ఉంది. ఇదంతా తుళ్లూరు జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, ఆయన బంధువులకు చెందిన భూమి. అక్కడే భూమి పూజ చేయాలని మంత్రులు మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతోపాటు మరో రెండు ప్రదేశాలు చూసినా అవి కరకట్ట లోపల ఉండటంతో సీఆర్డీఏ అధికారులు వాటివైపు మొగ్గు చూపలేదు. భూమిపూజ చేసే ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా మాస్టర్ప్లాన్ ఉండేలా చూడాలని సీఆర్డీఏ అధికారులు సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ 25 ఎకరాలకు ఆనుకుని ఉన్న 50 ఎకరాలను స్వాధీనం చేసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.