
134 కాదు.. 136
సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణంలో భాగంగా వచ్చే నెల ఆరునభూమి పూజ నిర్వహించే స్థలం విషయమై తుళ్లూరులో ప్రధానంగా చర్చ జరుగుతోంది. భూమి పూజకు మొదట తుళ్లూరు మండలం మందడం, తాళ్లాయపాలెం గ్రామాల మధ్య జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు కుటుంబీకులకు చెందిన సర్వే నంబరు 134లో పొలాన్ని భూమిపూజకోసం ఎంపిక చేశారు. ఆ పొలంలో ఇటీవల ఆ కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆ తర్వాత ఇందులో భూమిపూజ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియల విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి తెలియజేసింది. దీంతో వాస్తు, హిందూ సంప్రదాయాలపై ఆధారపడి భూమి పూజ చేయదలచిన ప్రభుత్వానికి ఆటంకం కలిగింది. చేసేదేమీలేక సర్వే నంబరు 134 నుంచి భూమిపూజ కార్యక్రమాన్ని 136 నంబరులో ఉన్న పొలానికి మార్చారు. అందులో ఈశాన్య దిక్కులో భూమిపూజ చేయాలని నిర్ణయించారు. దీనిపైనా స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ భూమి పూజ చేయాలా? వద్దా? లేక మరో ప్రదేశంలో చేయాలా?అన్న సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది.