LinkedIn India
-
కొత్త ఉద్యోగానికి సై
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం అన్వేషించనున్నారు. ఈ అన్వేషణ ఇంతకుముందెన్నడూ లేనంత కఠినంగా ఉండనున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ లింక్డెన్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. అర్హతలు ఉన్న నిపుణులను గుర్తించడం సవాలుగా 69 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం హెచ్ఆర్ నిపుణులు రోజులో 3–5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. 49 శాతం మంది గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్ని అర్హత ప్రమాణాలు సరితూగే దరఖాస్తుదారులు సగం కంటే తక్కువే ఉంటున్నట్టు 55 శాతం హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉద్యోగ మార్కెట్ కఠినంగా మారుతోంది. ఉద్యోగాన్వేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉండాలని ఇది సంకేతమిస్తోంది. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా సవాళ్లతో కూడిన ఉద్యోగ మార్కెట్లోనూ కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, కెరీర్లో మంచి వృద్ధిని చూడొచ్చు’’అని లింక్డెన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ ఎక్స్పర్ట్ నిరజిత బెనర్జీ అన్నారు. గతేడాది నవంబర్ 27 నుంచి, డిసెంబర్ 16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 22,010 మంది నిపుణులు పాల్గొన్నారు. భారత్తోపాటు, స్పెయిన్, ఐర్లాండ్, బ్రెజిల్, యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్, స్వీడన్, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అధ్యయనం కొనసాగింది. ఈ ఉద్యోగాల్లో వృద్ధి ఎక్కువ.. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రోబోటిక్స్ టెక్నీషియన్, క్లోజింగ్ మేనేజర్ ఈ ఏడాది భారత్లో ఎక్కువ వృద్ధి చెందే ఉద్యోగాలుగా లింక్డెన్ తెలిపింది. భారత్లో ప్రతి ఐదుగురు వృత్తి నిపుణుల్లో ముగ్గురు కొత్త రంగంలో, కొత్త విభాగంలో ఉద్యోగానికి సంసిద్ధంగా ఉండగా.. కొత్త అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా నైపుణ్యాలను నేర్చుకోనున్నట్టు 39 శాతం మంది చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విలువను కృత్రిమ మేథ (ఏఐ) పెంచనున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మహిళలు మరిన్ని ఉద్యోగ పాత్రల్లోకి అడుగుపెట్టున్నట్టు పేర్కొంది. నవంబర్లో పెరిగిన ఉపాధి ఈపీఎఫ్ఓ సభ్యత్వంలో 4.88 శాతం పెరుగుదల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం నవంబర్లో 4.88 శాతం (2023 నవంబర్తో పోల్చి) పెరిగింది. ఉపాధి పెరుగుదలను సూచిస్తూ సమీక్షా నెల్లో ఈపీఎఫ్ఓలో 14.63 లక్షల నికర సభ్యత్వం నమోదయినట్లు తాజా పేరోల్ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 2024 అక్టోబర్తో పోల్చితే నికర సభ్యత్వం నెలవారీగా 9.07 శాతం పెరగడం గమనార్హం. నవంబర్లో నికర మహిళా సభ్యుల చేరిక 3.13 లక్షలు. అక్టోబర్తో పోల్చితే ఇది 12.16 శాతం అధికం. వార్షిక పెరుగుదల 11.75 శాతం. నెలలో 20.86 శాతం నికర సభ్యుల చేరికతో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాత ఐదు శాతానికిపైగా సభ్యత్వ నమోదులతో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లు నిలిచాయి. -
ఉద్యోగుల అనూహ్య నిర్ణయం... కంఫర్ట్ లేకపోతే రాజీనామాలకైన సిద్దం..!
న్యూఢిల్లీ: దేశీయంగా గణనీయ సంఖ్యలో ఉద్యోగినులు.. సరళతర పని విధానాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, దీని వల్ల జీతాల్లో కోతలు పడుతుండటం, పక్షపాత ధోరణులు ఎదుర్కొనాల్సి వస్తుండటం, ప్రమోషన్లు లభించకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగాలకు రాజీనామా చేసే వారితో పాటు, చేయాలనుకుంటున్న (ఫ్లెక్సిడస్) వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కార్యాలయాల్లో ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 2,266 మంది పాల్గొన్నారు. దీని ప్రకారం .. సరళతర (ఫ్లెక్సిబుల్) పని విధానాలు, కెరియర్ మధ్యలో విరామాల విషయంలో కంపెనీల సెంటిమెంటు అంత సానుకూలంగా ఉండటం లేదు. దీంతో తమకు మరింత అనువైన విధానాలు కావాలని అడిగేందుకు గానీ కెరియర్లో కొంత కాలం విరామం తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగ విధుల్లో చేరేందుకు గానీ అంతగా ముందుకు రావడం లేదు. సరళతర పని విధానాల సమస్యల వల్ల ప్రతి పది మంది ఉద్యోగినుల్లో ఏడుగురు రాజీనామాల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో భారత్లో ఫ్లెక్సిడస్ పరిస్థితులు నెలకొన్నాయని లింక్డ్ఇన్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ తెలిపారు. ప్రతిభావంతులైన ఉద్యోగినులను వదులుకోకూడదనుకుంటే కంపెనీలు .. ఫ్లెక్సిబుల్ విధానాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. కరోనా వైరస్పరమైన ప్రభావాల నేపథ్యంలో తమకు సరళతర ఉద్యోగ విధానాలే అనువైనవిగా ఉంటాయని ప్రతి పది మందిలో ఎనిమిది మంది (83 శాతం మంది) వర్కింగ్ ఉమెన్ గుర్తించారు. అలాంటి వెసులుబాటు లేని ఉద్యోగాలను తిరస్కరిస్తున్న వారి సంఖ్య 72 శాతంగా ఉంది. అనువైన విధానాలను ఆఫర్ చేయకపోవడం వల్ల ఇప్పటికే 70 శాతం మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు..లేదా చేసే యోచనలో ఉన్నారు. ఫ్లెక్సిబుల్ పని విధానాల వల్ల తమకు అటు ఉద్యోగం, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు వీలుంటుందని, కెరియర్లో పురోగతి సాధించేందుకు తోడ్పాటు ఉంటుందని ప్రతి అయిదుగురు మహిళల్లో దాదాపు ఇద్దరు అభిప్రాయపడ్డారు. తమ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగేందుకు మరింతగా అవకాశం ఉంటుందని ముగ్గురిలో ఒక్కరు పేర్కొన్నారు. అయితే, కంపెనీలో పక్షపాత ధోరణి తీవ్రంగా ఉంటుండటంతో .. సరళతర పని విధానాలు ఎంచుకునే ఉద్యోగినులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సర్వే ప్రకారం .. 10 మంది వర్కింగ్ ఉమెన్లో 9 మంది జీతాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫ్లెక్సిబుల్ విధానం కోసం అయిదుగురు అడిగితే ఇద్దరి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తమ అభ్యర్ధనలను ఆమోదింప చేసుకోవడంలో ప్రతి నలుగురిలో ఒక్కరు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చింది. దీనితో తమను పక్కన పెట్టేస్తారని, ప్రమోషన్లలో పట్టించుకోరని, ఓవర్టైమ్ పనిచేయాల్సి వస్తుందని, జీతాలు తగ్గించుకోవాల్సి వస్తుందని, పైస్థాయి అధికారులు తక్కువ చేసి చూస్తారనే భయాలతో మహిళా ఉద్యోగులు... సరళతర పని విధానాలను అడిగేందుకు జంకుతున్నారు. -
అవకాశాల వేటలో నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలోని చాలా మంది నిపుణులు వారు చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తిగా ఉన్నా, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నారు. ఈ విషయం లింక్డ్ఇన్ నిర్వహించిన ‘టాలెంట్ ట్రెండ్స్ ఇండియా’ నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. దాదాపు 55 శాతం మంది నిపుణులు మంచి అవకాశాల కోసం ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు. దాదాపు 95 శాతం మంది నిపుణులు ఇంటర్య్వులకు హాజరైన తర్వాత... కంపెనీలు వారి ఫీడ్బ్యాక్ను తీసుకోవాలని ఆశిస్తున్నారు. కాగా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ అనుభవం ఆ వ్యక్తిని ఉద్యోగంలోకి చేర్చుకోవడమా? లేదా? అనే అంశాన్ని ప్రభావితం చేస్తుందని లింక్డ్ఇన్ ఇండియా ైడె రెక్టర్ ఇర్ఫాన్ అబ్దుల్లా తెలిపారు. పరిహారం, వేతనం, వృత్తిపరమైన అభివృద్ధి వంటి అంశాలే చివరకు ఉద్యోగ ఎంపికలో ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.