దేశ ప్రతిష్టను మంటకలిపింది
ఏపీ సర్కారుపై కేంద్రానికి జపాన్ సంస్థ మకీ ఫిర్యాదు
అమరావతి బ్యూరో పెట్టుబడుల పోటెత్తుతాయంటూ ఒకవైపు ‘భాగస్వామ్య సదస్సు’లో ప్రభుత్వం ఊదరగొడుతోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ది అగ్రస్థానం అంటూ ప్రకటనలు ఒకవైపు గుప్పిస్తుంటే.. ఇంకోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత లేశ మాత్రం కూడా లేదంటూ ‘డిజైన్’ కాంట్రాక్టు దక్కించుకున్న జపాన్ సంస్థ ‘మకీ అండ్ అసోసియేట్స్’ సంచలన ఆరోపణలు చేసింది. భారతీయ వాస్తు శిల్పి శాస్త్ర నిపుణుల (ఇండియన్ ఆర్కిటెక్చురల్ ప్రొఫెషన్) ప్రతిష్టను ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని మండిపడింది. అంతర్జాతీయ టెండర్లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేశారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరుతో భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరంటూ ‘మకీ అండ్ అసోసియేట్స్’ ప్రిన్సిపల్ ఆర్కిటెక్టర్ ఫుమిహికో మకీ 2016 డిసెంబర్ 21న భారత ఆర్కిటెక్చర్ సమాఖ్య ఉపాధ్యక్షుడు విజయ్ గర్గ్కు లేఖ రాశారు.
భారతదేశంలో ఆర్కిటెక్చర్ వృత్తి నైతికత కాపాడటానికి అమరావతి వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అమరావతి వ్యవహారంలో పారదర్శకత లేశమాత్రం కూడా కనిపించలేదని, అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. తాము విదేశీయులం కాబట్టి.. సమాచార హక్కు కింద సమాచారాన్ని తీసుకోలేమని, ఆర్కిటెక్చర్ సమాఖ్య ప్రతినిధులు శ్రద్ధ తీసుకొని ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తే.. స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందని సూచించారు. రాష్ట్రంలో విదేశీ, స్వదేశీ పెట్టుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకాన్ని ఫుమిహికో మకీ తన లేఖలో ఇలా వివరించారు...
మకీని ఎంపిక చేసిన అంతర్జాతీయ జ్యూరీ
రాజధానిలో వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం (అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్, డైరెక్టరేట్లు)ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్ల కోసం అంతర్జాతీయ పోటీ ద్వారా మాస్టర్ ఆర్కిటెక్ట్ను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు ప్రొఫెసర్ క్రిస్టపర్ బెన్నింగర్ అధ్యక్షతన కేటీ రవీంద్రన్, ఎర్విన్ విరే, సుహా ఓజ్కాన్, పద్మభూషణ్ రాజీవ్ సేథీ, కేశవ్ వర్మ సభ్యులుగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాస్టర్ ఆర్కిటెక్ట్ పోటీలో పాల్గొనాలని కోరుతూ జపాన్కు చెందిన మకీ అసోసియేట్స్కు ప్రభుత్వం డిసెంబర్ 12, 2015న లేఖ రాసింది. కానీ అంతకు ముందే భారతీయ వాస్తు నిపుణులు, రోజర్స్, స్టిర్క్, హార్బర్ పార్టనర్స్(ఇంగ్లండ్) ప్రభుత్వ భవన సముదాయం డిజైన్లపై కసరత్తు బాధ్యతను అప్పగించింది. అంతర్జాతీయ పోటీలో సంస్థలు అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన జ్యూరీ మకీ అసోసియేట్స్ను మాస్టర్ ఆర్కిటెక్ట్గా ఎంపిక చేస్తున్నట్లు మార్చి 25, 2016న ప్రకటించింది. మాస్టర్ ఆర్కిటెక్ట్గా మకీ అసోసియేట్స్ను ఎంపిక చేసినట్లు సీఆర్డీఏ అప్పటి కమిషనర్ శ్రీకాంత్ ఆ సంస్థ చీఫ్ ఫుమిహికో మకీకి ఏప్రిల్ 7, 2016న లేఖ రాశారు. ఇదే అంశంపై కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవాలని సీఆర్డీఏకు మకీ అసోసియేట్స్ ప్రతిపాదనలు పంపింది.
కారణం చెప్పకుండా మకీపై వేటు
మాస్టర్ ఆర్కిటెక్ట్ ఒప్పందంపై సీఆర్డీఏ అధికారులు స్పందించకపోవడంతో మే 15న మకీ బృందం విజయవాడకు వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. డిజైన్లలో మార్పులు చేర్పులు చేయాలన్న సీఎం సూచనలకు అంగీకరించింది. కానీ ప్రభుత్వం మే నెలలో మరో ఏడుగురు ఆర్కిటెక్టర్లకు ప్రభుత్వ కార్యాలయాల సముదా యం డిజైన్లు సమర్పించే పని అప్పగించింది. అందులో ముగ్గుర్ని ఎంపిక చేస్తామని, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని డిజైన్ చేయడంలో వారు మకీకి సహాయం చేస్తారని తర్వాత చెప్పారు. ‘దానికి కూడా అంగీకరించాం. భారతదేశానికి వచ్చి.. ఆర్కిటెక్టులను ఎంపిక చేయడానికి సీఆర్డీఏ నియమించిన ప్రొఫెసర్ రవి ఆనంద్ను కలిసి చర్చించాం. ఆయన పూర్తి సమాచారం చెప్పలేదు. రవి ఆనంద్ రూపొందించిన అర్హత ప్రమాణా ప్రకారం.. డిజైన్ ప్రతిపాదనలు సమర్పించిన ఏడు సంస్థల్లో ‘హఫీజ్ కాంట్రాక్టర్’ ఆఖరు స్థానంలో నిలిచినట్లు ఇతర మార్గాల ద్వారా తెలిసింది. ఆఖరు స్థానంలో నిలిచిన ‘హఫీజ్ కాంట్రాక్టర్’నే డిజైన్ల రూపకల్పనకు ఎంపిక చేశారు. ‘రాజకీయ కారణాల’తో హఫీజ్ కాంట్రాక్టర్ను ఎంపిక చేసినట్లు రవి ఆనంద్ మాకు చెప్పారు. డిజైన్లపై చర్చించేందుకు జూలై 8, 2016న ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ జపాన్కు వెళ్లి టోక్యోలోని మకీ కార్యాలయంలో ఆరు గంటలపాటు గడిపినా డిజైన్లపై చర్చించలేదు.
ఆ తర్వాత ఫీజుల తగ్గింపునకు వీలుగా సంప్రదింపులకు అంగీకరిస్తామని తెలిపాం. హఫీజ్ కాంట్రాక్టర్తో కలిసి పనిచేయాలన్న నిబంధనకూ అంగీకరించాం. మా సాంకేతిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మేము పూర్తి చేసిన ప్రాజెక్టులను సందర్శించాలని సూచించాం. కానీ వారు ఆ పని చేయలేదు. హఫీజ్ కాంట్రాక్టర్, ఫోస్టర్ అండ్ పార్టనర్(లండన్) పూర్తి చేసిన ప్రాజెక్టును అధికారుల బృందం సమర్శించింది. డిజైన్లలో మకీ మార్పులు చేర్పులు చేస్తుండగానే ఆ సంస్థను మాస్టర్ ఆర్కిటెక్ట్గా తొలగిస్తున్నట్లు అక్టోబర్ 24, 2016న ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. మాస్టర్ ఆర్కిటెక్ట్గా మమ్మల్ని తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కనీసం సమాచారం ఇవ్వలేద’ని మకీ చీఫ్ ఫుమిహికో మకీ పేర్కొన్నారు.
ఫోస్టర్ పార్ట్నర్స్ ఎంపికపై వివాదం
మకీపై వేటు వేసిన రోజే అక్టోబర్ 24, 2016న ప్రభుత్వ భవన సముదాయం డిజైన్కు మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు మరోసారి ప్రతిపాదనలను ఏపీ సర్కార్ ఆహ్వానించింది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జ్యూరీని పక్కన పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా లండన్కు చెందిన ఫోస్టర్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్ (ముంబై)లను మాస్టర్ ఆర్కిటెక్ట్గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపికకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యూరీని విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫోస్టర్ పార్ట్నర్, హఫీజ్ కాంట్రాక్టర్లు రూపొందించిన డిజైన్లను ఇప్పటివరకూ అటు సీఆర్డీఏగానీ.. ఇటు ప్రభుత్వంగానీ బహిర్గతం చేయకపోవడం గమనార్హం. ఇదే అంశాన్ని మకీ చీఫ్ పుమిహికో మకీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాజకీయ నేతల వ్యక్తిగత ప్రయోజనాలు రాజధానితో ముడిపడినట్లు చెప్పారనే అంశాన్ని మాస్టర్ ఆర్కిటెక్ట్ పోటీలో తమతో సంప్రదింపులు జరిపిన అధికారులు చెప్పారని ప్రధానంగా ప్రస్తావించారు. జ్యూరీ ఎంపిక చేసిన తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వేటు వేసి.. నిబంధనలకు విరుద్ధంగా ఫోస్టర్ పార్టనర్స్–హఫీజ్ కాంట్రాక్టర్ను ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు ఇచ్చిన డిజైన్లను ప్రభుత్వం బహిర్గతం చేయలేదని.. సమాచార హక్కు ద్వారా వాటి వివరాలు కోరడానికి తాము భారతీయ పౌరులు కాలేకపోవడం వల్ల నిస్సహాయులుగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రతిష్టకు విఘాతం
వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మాస్టర్ ఆర్కిటెక్ట్గా ఎవరిని ఎంపిక చేసినా తమకు నష్టం లేదని.. కానీ ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరు వల్ల భారతదేశ ప్రతిష్టకు విఘాతం కలిగిందని మకీ చీఫ్ ఫుమిహికో మకీ పేర్కొన్నారు. ఇలాగైతే భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ నిపుణులు ఎవరూ సాహసించలేరని స్పష్టీకరించారు. ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణం సాకారం కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ఆయన కేంద్రానికి రాసిన లేఖ బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. ఇదే విధంగా ప్రధాని కార్యాలయానికి కూడా మకీ లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై పీఎంఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారిందని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు విజయ్గర్గ్కు మకీ అండ్ అసోసియేట్స్ రాసిన లేఖ ..
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు ఫుమిహికో మకీ రాసిన లేఖ