పనులు త్వరగా పూర్తి చేయాలి
పెద్దఅడిశర్లపల్లి : ప్రభుత్వం ఇంటింటికీ నల్లాలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పీఏపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా పనులు జరిగే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయితే రానున్న రోజుల్లో అన్ని గ్రామాలకు తాగు నీటి జలాలు అందుతాయని పేర్కొన్నారు.
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పులిచింతల, టెయిల్పాండ్, ఉదయసముద్రం ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు తాగునీరు అందజేస్తామని తెలిపారు. అనంతరం సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పనులకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈఈలు సంపత్, పాపారావు, డీఈ గిరిధర్, తహసీల్దార్ ధర్మయ్య, మిషన్ భగీరథ మెగా కంపెనీ ప్రతినిధి బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పనులు నాణ్యతగా చేపట్టాలి..
ఎస్ లింగోటం(నాంపల్లి) : మిషన్ భగీరథ ద్వారా చేపట్టే వాటర్ ట్రీట్మెంట్ పనులను నాణ్యతగా చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మండలంలోని స్వాముల వారి లింగోటంలో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు సెప్టెంబర్ 2017 వరకు పూర్తి చేయాలన్నారు. నాంపల్లి, మర్రిగూడ మండల ప్రజలు ఫ్లోరోసిస్తో బాధపడుతున్నారని, వీరికి ప్లాంట్ అందుబాటులోకి వస్తే కొంత వరకు ఉపశమనం లభిస్తుందన్నారు. ప్లాంట్ 21 ఎకరాల్లో రూ.506 కోట్లతో నిర్మిస్తున్నట్లు, 70 ఎంఎల్డీ (మిలియన్ వాటర్ ఫర్ డే )నీటిని అందజేస్తుందని తెలిపారు. ఐదు నియోజకవర్గాల ప్రజలకు నీటిని అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ సంపత్రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ బాలాజీ, డీఈ రవి, ఏఈ ప్రవీన్రెడ్డి, తహసీల్దార్ ఎండీ. ఖలీల్అహ్మద్, ఎంపీడీఓ టి.హనుమంత్ప్రసాద్, ఏఎస్ఐ పి.దివంతరావు, ఎండీ. జావీద్మ్యాక్స్, పెద్దులు, వెంకట్రెడ్డి, రత్నం తదితరులు పాల్గొన్నారు.