దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండు ఇదే!
ముంబై: గెలాక్సీ నోట్ 7తో తీవ్ర సతమతమైన శాంసంగ్ ఎట్టిపరిస్థితుల్లో తన ప్రతిష్టను వదులుకోలేదు. భారత్ లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండులో ఈ దక్షిణ కొరియా కన్జ్యూమర్ దిగ్గజం శాంసంగే అగ్రస్థానంలో నిలిచింది. శాంసంగ్ తర్వాత స్థానంలో సోనీ, ఎల్జీలు చోటు దక్కించుకున్నాయి. దేశీయ కంపెనీల్లో టాటా గ్రూప్ ఒక్క కంపెనీనే టాప్-5లో నిలిచింది. టాప్ స్థానంలోకి ఎగబాకడానికి శాంసంగ్ ఏకంగా 17 స్థానాలను పెంచుకున్నట్టు వెల్లడైంది. అయితే తన మొబైల్ డివిజన్ మాత్రం 154 స్థానాలను కిందకు దిగజార్చుకుంది.
బ్రాండ్ ట్రస్ట్ రిపోర్టు 2017 ఈ ర్యాంకింగ్స్ ను బుధవారం విడుదల చేసింది. సోనీ, ఎల్జీలు రెండూ తమ 2016 ర్యాంకింగ్ లను అలానే ఉంచుకున్నాయి. అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీదారి ఈ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది కంటే 12 స్థానాలను ఇది పెంచుకుంది. టాటా గ్రూప్, ఆటో దిగ్గజం హోండా ఐదు, నాలుగో స్థానాల్లో నిలువగా.. దేశీయ అతిపెద్ద ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ నాలుగు స్థానాలు ఎగబాకి ఏడు స్థానంలో ఉంది. డెల్ 8వ స్థానంలో, లెనోవా 9వ స్థానంలో నిలిచాయి. బజాజ్ మాత్రం గతేడాది కంటే పడిపోయి 10వ స్థానంలో నిలిచింది. మొత్తం 16 నగరాల్లో టీఆర్ఏ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ద్వారా ఈ ర్యాంకింగ్స్ రిపోర్టును విడుదల చేశారు.