మేల్ ఎస్కార్ట్స్ సరఫరాలోనూ నందిని హ్యాండ్
రోజుకో చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్: రోడ్ నెం.72లోని బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్ నిర్వాహకురాలు యలమంచిలి నందిని చౌదరిపై రోజుకొకటి చొప్పున చీటింగ్ కేసు నమోదవుతోంది. ఆభరణాల వ్యాపారం పేరుతో ఓ వ్యాపారిని నిండాముంచి అరెస్టై జైళ్లో ఊచలు లెక్కిస్తున్న నందిని చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోనే కాకుండా పంజగుట్ట, నాంపల్లి, సీసీఎస్ ఠాణాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. తన స్పా అండ్ సెలూన్కు వచ్చే కస్టమర్లను మభ్యపెట్టి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే ఆభరణాలతో పాటు అప్పు పేరుతో డబ్బు తీసుకొని ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే నాంపల్లి పోలీస్స్టేషన్లో ఒకటి, సీసీఎస్ ఠాణాలో రెండు కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది.
నందిని చౌదరి తమను రూ.20 లక్షలకు మోసం చేసిందని నాలుగు రోజుల క్రితం చందనా బ్రదర్స్ నిర్వాహకులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జూబ్లీహిల్స్ స్టేషన్లో తాజాగా మరోకేసు నమోదైంది. రూ. 20 లక్షల మేర తమను మోసం చేసిందంటూ ఇద్దరు వ్యాపారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. కాగా, ఇటీవల ఆమెను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించగా చాలా విషయాలు చెప్పకుండా దాటవేసినట్లు తేలింది. నందిని చౌదరిని మరోమారు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని ఓ వైపు నాంపల్లి పోలీసులు, మరో వైపు సీసీఎస్ పోలీసులు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా హైఫై మహిళలను లక్ష్యంగా చేసుకొని కొందరు యువకులను వారికి మేల్ ఎస్కార్ట్స్గా పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడినట్టు సమాచారం. సుమారు పాతిక మంది మహిళలకు మేల్ ఎస్కార్ట్స్ను సరఫరా చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. మరోసారి కస్టడీకి తీసుకుంటే చాలా విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు.