నిత్యానంద.. 28 భాషల్లో 200 పుస్తకాలు!
వివాదాస్పద స్వామి నిత్యానంద పుస్తకాలు ఢిల్లీలోని వరల్డ్ బుక్ ఫెయిర్లో దర్శనమిస్తున్నాయి. ఆధ్యాత్మికపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ఆయన 28 భాషల్లో రాసిన 200 పుస్తకాలు ఇందులో పుస్తక ప్రియులకు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఆడియో, వీడియో సీడీలు కూడా ఉన్నాయి. అలాగే భారత జాతిపిత మహాత్మగాంధీని హత్య చేసిన నాధురాం గాడ్సే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తక ప్రదర్శనలోని పలు స్టాళ్లలో అతి తక్కువ ధరకే వీటిని విక్రయిస్తున్నారు. భగవద్గీత, ఖురాన్ వంటి పవిత్ర గ్రంధాలను కేవలం 10 రూపాయలకే అందిస్తున్నారు.
చాలామంది అహింస, వెజిటేరియనిజం వంటి అంశాలపట్ల అవగాహన తెలియజేసే పత్రాలను ఉచితంగా పంచిపెడుతున్నారు. ఇక నిత్యానంద రాసిన పుస్తకాలు ప్రధానంగా ఆంగ్లం, హిందీ, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, చైనా భాషల్లో అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఆర్యసమాజ్కు చెందిన పుస్తకాలు, భౌద్ధమతానికి చెందినవి, విశ్వ జైన సంఘటన సంస్థవి, ముస్లిం మతానికి చెందిన పుస్తకాలు కూడా ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ బుక్ ఫెయిర్లో దాదాపు 30 దేశాలకు చెందిన ఆధ్మాత్మిక సంస్థలు తమ పుస్తకాలను ప్రదర్శిస్తుండగా ఇది ఫిబ్రవరి 22న ముగియనుంది.