కిడ్నీ రాకెట్ను బట్టబయలు చేసిన టీకొట్టు..!
సాక్షి, డెహ్రాడూన్: చిన్న టీకొట్టు దగ్గర సంభాషణ ఓపెద్ద కిడ్నీ రాకెట్ పట్టుకోవడానికి కారణం అయ్యింది. పక్కా సమాచారం ఉన్న కేసుల్లోనే చేతులెత్తేస్తున్న పోలీసులు ఉన్న ఈరోజుల్లో ఒక చిన్న టీకొట్టు దగ్గర జరిగిన సంభాషణ కారణంగా పెద్ద కుంభకోణాన్ని వెలికి తీశారు డెహ్రాడూన్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే హరిద్వార్లోని రాణీపూర్ పోలీసు స్టేషన్లో పంకజ్ శర్మ నెలరోజుల క్రితం విధుల్లో చేరాడు. ఒక రోజు సాధారణ దుస్తుల్లో సమీపంలోని చిన్న టీకొట్టు దగ్గర టీతాగడానికి వెళ్లాడు. ఆసమయంలో నగరంలోని గంగోత్రి ఛారిటబుల్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరుతుందని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్నాడు.
వెంటనే సమాచారాన్ని పోలీసు స్టేషన్లోని ఉన్నతాధికారులకు చేరవేశారు. అంతేకాకుండా జిల్లాస్థాయి అధికారులకు కూడా గంగోత్రి హాస్సిటల్లో కిడ్నీతో పాటు జరుగుతున్న అవయవ రాకెట్ను గురించి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం హాస్సిటల్ పరిసరాల్లో నెలరోజులు పాటు రెక్కీ నిర్వహించారు. నిందితులను పట్టుకోవడానికి హాస్పిటల్లో రహస్యంగా ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు.
అనంతరం సీక్రెట్ కెమెరాల ద్వారా ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారి కీలక సమాచారం సేకరించారు. ఇందులో కీలక సూత్రధారి అమిత్కుమార్, డాక్టర్లకు కిడ్నీలను సరఫరా చేస్తున్న జావేద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును ఛేధించడంలో కీలకపాత్ర పోషించిన పంకజ్ శర్మకు వచ్చే ఏడాది గణతంత్రదినోత్సవం రోజున రివార్డు వచ్చేవిధంగా రాష్ట్ర పోలీసు హెడ్క్వార్టర్స్కు సిఫారసు చేశారు.