PC manufacturing
-
భారత్లో క్రోమ్బుక్ల తయారీ షురూ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్, పీసీల తయారీ సంస్థ హెచ్పీ కలిసి భారత్లో క్రోమ్బుక్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భారత్లో తొలిసారిగా తయారుచేస్తున్న క్రోమ్బుక్స్తో దేశీ విద్యార్థులకు చౌకగా, సురక్షితమైన విధంగా కంప్యూటింగ్ అందుబాటులోకి రాగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేశారు. చెన్నైకి దగ్గర్లోని ఫ్లెక్స్ ఫెసిలిటీలో హెచ్పీ వీటిని తయారు చేస్తోంది. కొత్త క్రోమ్బుక్స్ ఆన్లైన్లో రూ. 15,990 నుంచి లభిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020 నుంచి హెచ్పీ భారత్లో తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. ఎలీట్బుక్స్, ప్రోబుక్స్, జీ8 సిరీస్ నోట్బుక్స్ వంటి వివిధ ల్యాప్టాప్లు, ఆల్–ఇన్–వన్ పీసీలు, డెస్క్టాప్లు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేస్తోంది. భారత్లో ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి కూడా దరఖాస్తు చేసుకుంది. -
పీసీల తయారీకి విప్రో గుడ్బై
న్యూఢిల్లీ: హెచ్సీఎల్ బాటలోనే తాజాగా మరో ఐటీ దిగ్గజం విప్రో కూడా పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), సర్వర్ల తయారీ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇకపై ఐటీ సొల్యూషన్స్, సర్వీసుల వ్యాపారాలపై మరింతగా దృష్టి పెట్టనుంది. పీసీల తయారీ విభాగంలో ఉద్యోగులను వేరే విభాగాలకు బదలాయిస్తామని కంపెనీ జీఎం ఎస్ రా/వేంద్ర ప్రకాశ్ తెలిపారు. ఉద్యోగుల సంఖ్య ఎంత ఉన్నదీ ఆయన వెల్లడించకపోయినప్పటికీ.. సుమారు 2,000 కన్నా తక్కువే ఉండొచ్చని సమాచారం. మార్కెట్లు, వినియోగదారుల ధోరణులు మారిపోతున్నాయని ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ సర్వీసులు, సొల్యూషన్స్ విభాగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై విప్రో మరింతగా దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే, భారీ స్థాయి సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ డీల్స్ వస్తే హార్డ్వేర్ సేవలు అందించడం కొనసాగిస్తామని ప్రకాశ్ వివరించారు. ఇప్పటిదాకా విక్రయించిన పీసీలకు వారంటీ, యాన్యువల్ మెయింటెనెన్స్ సేవలు విప్రో యథాప్రకారం అందిస్తుందని పేర్కొన్నారు. 1985లో పీసీల తయారీని ప్రారంభించిన విప్రోకి ప్రస్తుతం పుదుచ్చేరిలోను, ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లోను ప్లాంట్లు ఉన్నాయి. మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు పీసీల తయారీని క్రమక్రమంగా నిలిపివేయనున్నట్లు హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ ఇటీవల ప్రకటించింది.